కణికుడు
మహాభారరములోని ఒక పాత్ర కణికుడు. తెలుగుభారతం ప్రకారం ఇతడు శకునికి ఆప్తుడైన మంత్రి. చాలాతెలివైనవాడు.రాజధర్మాలను కూలంకుశంగా నెరిగినవాడు. సంస్కృతభారతంలో యితడు ధృతరాష్ట్రునకు ముఖ్యసలహాదారులలో ఒకడు. ధృతరాష్ట్రునకు 90 శ్లోకాలలో రాజనీతిని తెలిపాడు. పాండవుల ఉన్నతికి క్రుంగి, తనకుమారులకు రాజ్యాధికారం దక్కదనే చింతతో యీ కణికుని పిలిపించుకొని రాజనీతిలోని రహస్యాలను తెలిసికొన్నాడు ధృతరాష్ట్రుడు. అధికారం యెలా హస్తగతం చేసుకోవాలి, తన అధీనంలోనికి వచ్చిన అధికారాన్ని యెలా నిలుపుకోవాలి, శత్రునిర్మూన కనుసరించాల్సిన వ్యూహాలెలావుండాలి, ప్రజలతో యెలా వ్యవహరించాలి, ప్రభుత్వవ్యవ స్థలనెలా రాజ రక్షణకుపయోగించులోవాలి అన్న అంశాలెన్నో యీ కణికుడు ధృతరాష్ట్రుని కెరింగించాడు. ధృతరాష్ట్రుడు ధర్మాత్ములైన తన తమ్మునికొడుకులను అడ్డుతొలగించుకొనుటకీ కణికనీతి నుపయోగించి భంగపడ్డాడు. ప్రజాశ్రేయస్సుకొఱకు, తనరక్షణకొఱకు గాక అయోగ్యులైనాసరే తనకొడుకులకే రాజ్యాధికారం దక్కాలని, తనకేమాత్రం హాని తలపెట్టని పాండవుల సంహారం కొఱకు యీ కణికనీతి నుపయోగించి, రాజలోక విపత్తుకు కారణమైనాడు. శత్రువులపై ఉపయోగించాల్సిన మంత్రాంగాన్ని, హితులపై ప్రయోగించి, వినాశానికి హేతువైనాడు. కణికనీతి పదునైన కత్తిలాంటిది. మంచీచెడులు ఆకత్తిని వాడుకునే తీరులో వుంటుందని అర్థమౌతున్నది.
సంస్కృతభారతంలో కణికుడు, తన రాజనీతిలో భాగంగా పంచతంత్రంలోవలె మాట్లాడే జంతువులతో ఒక కథను 24 శ్లోకాలలో చెప్పాడు. ఒకఅడవిలో బాగా బలసిన జింక ఒకటి, తిరుగుతూవుంది. అది బలంగా వుండటంవల్ల యితర కౄరజంతువులకు చిక్కేదికాదు. ఒకనక్క దాన్ని తినాలని ఆశపడి ఉపాయం పన్నింది. పులి, తోడేలు, ముంగిస, ఎలుకతో స్నేహంచేసి, మనం ఆజింకను తిందాం. అది బలిసి వేగంగా పరుగిడుతూంది. కనుక మనమెవ్వరం దాన్ని ఒంటిగా పట్టలేం. నేనొక ఉపాయంచెబుతాను, ఆప్రకారంచేస్తే, దాని రుచికరమైన మాంసం మనంతినొచ్చు అన్నది నక్క. సరే చెపమన్నాయి స్నేహితులు. జింక పచ్చిక కడుపునిండామేసి నిద్రపోతుంది. అప్పుడు ఎలుకపోయి దానికాళ్ళు కొరకాలి. ఆగాయాలకి అది వేగంగా పరుగిడలేదు. ఆసమయంలో పులి దాడిచేసి చంపేయాలి. అంతే, జింకమాంసం మనకాహారమైపోతుందన్నది. ఉపాయంనచ్చి, నక్కచెప్పినట్లు చేసి జింకను చంపేశాయి జంతువులు. నక్క, యితరజంతువులతో, మీరు దుమ్ముధూళి పట్టి అలసట తోవున్నారు. వెళ్ళి నదీస్నానంచేసి రండి. హాయిగా జింకనుతిందాం, అప్పటిదాకా నేను యిక్కడే కావలిగావుంటాను, వెళ్ళి రండి అన్నది. అలాగేనంటూ అవి స్నానానికి వెళ్ళిపోయాయి.
తొలుత నదినుండి పులివచ్చింది. పులినిచూసి నక్క యేడుస్తూ, మిత్రమా! ఆ ఎలుక యింతకుముందే వచ్చి నిన్ను అనరానిమాటలన్నది. ఆపులి నాసహాయంలేకుండా జింకను చంపలేకపోయింది. తినడానికిమాత్రం ఆత్రపడుతున్నది, అంటూ నిన్ను ఎగతాళిచేసింది, అన్నది. పులి, నిజమే నాకు బుద్ధివచ్చింది. నేను సొంతంగా వేటాడిన జంతువులనే తింటాను, అంటూ అక్కడనుండి వెళ్ళిపోయింది. తర్వాత ఎలుకవ చ్చింది. ఎలుకతో నక్క, ఎలుకబావా! యింతకుముందే, ముంగిసవచ్చి, జింకనుచూసి, యిది పులికరవడంవల్ల విషపూరితమైపోయింది, కనుక నేనుతినను. ఆకలిగావుంది ఎలుకను తినేస్తా నని నీకోసం వెతుకుతున్నట్లుంది అన్నది. ఎలుక భయపడి పరుగుపరుగున వెళ్ళి యెక్కడో కలుగులోనికివెళ్ళి దాక్కుంది. ఆతర్వాత వచ్చింది తోడేలు. తోడేలునుచూడగానే నక్క, అన్నా! నీమీద పులి యెందుకో చాలాకోపంగావుంది. వెళ్ళి నాభార్యను పిలుచుకొనివస్తా, యిద్దరం తోడేలు పనిపడతాం అంటూ వెళ్ళింది. జాగ్రత్త! అన్నది నక్క. అంతే, మాటముగియకముందే అక్కడనుండి పారిపోయింది తోడేలు. ఆఖరుగా ముంగిస వచ్చింది, నక్క ధైర్యంగా యెదురునిలిచి, ముంగిసా! రా! ఇప్పుడే పులి తోడేలు ఎలుకతో పోరాడి ఓడించా, నాదెబ్బకవి పారిపోయాయి. ఇక నీవంతు రా! అంటూ గద్ధించింది. అమ్మో! పులీ తోడేలే యీనక్కముందు ఆగలేకపోయాయంటే యిక నేనెంత అనుకుంటూ ముంగిసా పారిపోయింది. నక్క హాయిగా తానొక్కటే, జింకను సొతంజేసుకొంది.
ఇలాంటి కూటనీతితో యెంతటి వారినైనా అడ్డుతొలగించుకొని రాజరికం నిరాటంకంగా నిలుపుకొని, హయిగా అనిభవించవచ్చునని సోదాహరణంగా కణికుడు ధృతరాష్ట్రమహారాజుకు వివరించాడు.
తెలుగుభారతంలోని ఆదిపర్వం షష్ఠమాశ్వాసంలో యీ కణికనీతి ధృతరాష్త్రునికి గాక దుర్యోధనునికి చెప్పినట్లున్నది. రణవిద్యలలో ఆరితేరినారు పాండవులు. వారికా విద్యాప్రదర్శన శ్రమతో గూడినది కాదు. వారు నిరంతర ఉత్సాహం కనబరుస్తున్నారు. దానికితోడిపుడు ధర్మరాజు యువరాజయ్యాడు. మాతండ్రిగారతనిని యువరాజుగా చేయకతప్పలేదు. ఈపరిస్థితులలో నేనేమి చేయాలి. రాజనీతి యేమని చెబుతున్నది, నాకు వివరంగా చెప్పమన్నాడు దుర్యోధనుడు. ఈసందర్భంలో నన్నయ కణికనీతి అన్నమకుటంతో ఓ 19 పద్యాలు ఒక వచనంతో ముగించాడు. ఈనన్నయ కణికనీతిని వివరంగా తెలుసుకుందాం.
కణికనీతి
(ఆంధ్ర మహాభారతం -
ఆదిపర్వం - షష్ఠాశ్వాసము)
సీ : ‘ఆయుధవిద్యలయందు జితశ్రము
లనియును రణశూరు లనియు సంత
తోత్సాహు లనియు నత్యుద్ధతు లనియును
భయమందుచుండుదుఁ బాండవులకు;
దానిపై నిప్పుడు ధర్మజు యువరాజుఁ
జేసె రా; జే నేమి సేయువాఁడ?
నృపనీతి యెయ్యది? నిరతంబుగా మీర
నా కెఱిఁగింపుఁడు నయముతోడ’
నాప్తమంత్రి, నీతులందుఁ గరముఆ: ననిన వినియుఁ గణికుఁ డనువాఁడు, సౌబలు
కుశలుఁ డైనవాఁడు కురుకులవల్లభు
నిష్టమునకుఁ దగఁగ నిట్టు లనియె. 101
ఈపద్య తాత్పర్యం పైపేరాలో వివరంగా యివ్వబడింది.తరువోజ: ధరణీశుఁ డుద్యతదండుఁ డై యుచిత దండవిధానంబుఁ దప్పక ధర్మచరితులఁగా మహీజనుల రక్షించి సద్వృత్తుఁ డగునది; సర్వవర్ణములువరుసన తమతమ వర్ణధర్మముల వర్తిల్లుదురు గడవక దండభీతినరిమిత్రవర్జితుఁ డై సమబుద్ధి యగు మహీవల్లభు ననుశాసనమున. 102
రాజుచేతిలోని రాజదండం అత్యంతముఖ్యమైనది. దండనీతి విస్మరింప రానిది. తద్వారానే రాజు తన ప్రజలను ధర్మమార్గంలో నడిపింప గలుగు తాడు. అందుకు రాజుకూడా ధర్మాత్ముడై వుండాలి. దండించేటప్పుదు స్వపరభేదము లస్సలుండరాదు. అలావుంటే, రాజ్యంలోని అన్నివర్ణముల వారు అన్నిజాతులవారు రాజాజ్ఞలను ధిక్కరించక, తమతమ జాతి ధర్మాలను సక్రమంగా పాటిస్తూ ప్రభువునెడ భయభక్తులతో మెలగుతారు. రాజ్యం శాంతిసౌభాగ్యాలకు నెలవౌతుంది.
క: గుఱుకొని కార్యాకార్యములెఱుఁగక దుశ్చరితుఁ డై యహితుఁ డగు నేనిన్మఱవక గురు నైనను జనులెఱుఁగఁగ శాసించునది మహీశుఁడు బుద్ధిన్. 103
రాజు వివేకంతో మెలగాలి అందరికితెలిసేటట్లు మంచిచెడులను విచక్షణతో గ్రహించి చెడుమార్గంలో నడిచేవారిని వదలకుండా దండించితీరాలి.
క: ధీరమతియుతులతోడవిచారము సేయునది మును, విచారితపూర్వప్రారబ్ధమైన కార్యముపారముఁ బొందును విఘాతపదదూరం బై. 104
చేయదలచుకొన్న పనిని ముందుగా బుద్ధిమంతులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. అటువంటప్పుడాపని నిర్విఘ్నంగ నెరవేరుతుంది.
క: జనపాలుఁడు మృదుకర్మంబున నైనను గ్రూరకర్మమున నైనను నేర్పున నుద్ధరించునది తన్ననపాయతఁ బొంది చేయునది ధర్మంబుల్. 105
రాజు ధరమార్గపాలకుడుగా వుండాల్సిందే, గాని ముందు తనరక్షణకు ప్రాధాన్యమివ్వాలి. అది తప్పనిసరి. ఆకార్యనిర్వహణ మృదువగు పద్ధతిలోనా లేక కఠినమైన దండనద్వారానా అన్నది కాదు ముఖ్యం పద్ధతేదైనా, ప్రభువుకు తన రక్షణ ముఖ్యం. తన్నుమాలిన ధర్మం పనికిరాదు
క: అమలినమతి నాత్మచ్ఛిద్రము లన్యు లెఱుఁగకుండఁ దా నన్య చ్ఛిద్రము లిమ్ముగ నెఱుఁగుచు దే
నిర్మలమైన బుద్ధితో రాజు మెలగాలి. తనలోగల లోటుపాట్లను బయటికి కనబడనీయరాదు. కానీ యితరుల లోపాలను మాత్రం పసిగట్టగలగాలి. అలా చాకచక్యంగా మెలగుతూ మిత్రబలంతో దేశకాల పరిస్థితులకు అనుగుణంగ వ్యవహరించాలి.
క: బలహీను లైనచో శత్రులఁ జెఱచుట నీతి, యధిక దోర్వీర్య సుహృద్బలు లైన వారిఁ జెఱుపఁగనలవియె యక్లేశ సాధ్యు లగుదురె మీఁదన్. 107
శత్రువులు భుజబల సంపన్నులు,గుండెధైర్యం గలవారైతే వారినియేమీ చేయలేము. వారు బలహీనులైతే చంపడం సులభం. అంటే శత్రువులు బహీనులుగా వుండగానే దెబ్బతీయాలి. వారిని తక్కువ అంచనా వేసి బలపడనీయ్యరాదు.
క: అలయక పరాత్మ కృత్యంబులఁ బతి యెఱుఁగునది దూతముఖమునఁ, బరభూముల వృత్తాంతము లెఱుఁగఁగఁ
శతువులకార్యకలాపాలు, తనపాలనపై ప్రజల అభిప్రాయాలు రాజు నిర్లక్ష్యముచేయక దూతలద్వారా యెప్పటికప్పుడు తెలుసుకుంటూ వుండాలి. శత్రువుల విషయాలు తెలుసుకోవడానికి కఠినులు నిర్మొగమాటస్తులైన గూడచారులను నియమించుకోవాలి.
క: నానావిహార శైలోద్యాన సభా తీర్థ దేవతాగృహ మృగయాస్థానముల కరుగునెడ మునుమానుగ శోధింపవలయు మానవపతికిన్. 109
జనులు గుమిగూడే విహారస్థలాలైన పర్వతాలు, ఉద్యానవనాలు, సభలు సమావేశాలు జరిగే చోట్లు, తీత్థస్థలాలు, గుడులు వేటాడే ప్రదేశాలు, రాజుచూడాలనుకుంటే, తాను బయలుదేరకముందే ఆస్థలాలు సురక్షితమో కాదో ముందే గూఢచారులద్వారా తెలుసుకొని జాగ్రత్తవహించాలి.
తే: వీరు నమ్మంగఁ దగుదురు వీరు నమ్మఁదగరు నాకు నా వలవదు; తత్త్వబుద్ధినెవ్వరిని విశ్వసింపక యెల్ల ప్రొద్దునాత్మరక్షాపరుం డగు నది విభుండు. 110
వీరిని నమ్మవచ్చు, వీరిని నమ్మరాదనే నిర్ణయానికి రాకుండా, అందరినీ నమ్మరానివారిగానే గమనిస్తూ, తన రక్షణ విషయంలో రాజు సదా జాగరూకుడై వుండాలి.
ఉ: ఇమ్ముగ నాత్మరక్ష విధియించువిధంబున మంత్రరక్ష యత్నమ్మునఁ జేయఁగావలయుఁ; దత్పరిరక్షణశక్తి నెల్ల కార్యమ్ములు సిద్ధిఁ బొందుఁ బరమార్థము; మంత్రవిభేద మైనఁ గార్యమ్ములు నిర్వహింపఁగ బృహస్పతికైనను నేరఁబోలునే. 111
తననుతాను రక్షించుకొనుటలో చూపే శ్రద్ధనే, తనఆలోచనా విధానాన్ని రహస్యంగా వుంచుకొనుటలోకూడా చూపాలి. రహస్యాలోచన బయటికిపొక్కకుండా జాగ్రత్తవహించేరాజు కృతకృత్యుడౌతాడు. లేకుంటే బృహస్పతివంటి మేఋధావియైనా కార్యసాఫల్యత పొందలేడు.
క: పలుమఱు శపథంబులు నంజలియును నభివాదనమును సామప్రియభాషలు మిథ్యావినయంబులుఁ
గలయవి దుష్టస్వభావకాపురుషులకున్. 112
అవసరమున్నా లేకున్నా మాటిమాటికి శపథాలుచెయ్యడం, అధికంగా వంగివంగి దండాలుపెట్టడం, అతివినయం కనబరచి, యింపైన మోసపూరిత మాటలతో యెదుటివారిని బురిడీ కొట్టించడం, యివన్నీ దూర్తుని స్వభావాలు. వీరియెడ అప్రమత్తత అవసరం.
క: తన కిమ్మగు నంతకు దుర్జనుఁ డిష్టుఁడపోలె నుండి సర్పమపోలెందన కిమ్మగుడును గఱచునుఘనదారుణకర్మగరళ ఘనదంష్ట్రములన్. 113
దుర్మార్గుడు తనపని సానుకూలమయ్యేదాకా ప్రియమైనవాడుగా నటిస్తాడు. సమయం అనుకూలించగానే భయంకర విషసర్పమై కాటువేఋస్తాడు. కనుక తస్మాత్ జాగ్రత్త.
క: కడునలుకయుఁ గూర్మియు నేర్పడ నెఱిఁగించునది వాని ఫలకాలమునన్బిడుగును గాడ్పును జనులకుఁబడుటయు వీచుటయు నెఱుకపడియెడుభంగిన్. 114
అధికమైన కోపంగానీ ప్రేమగానీ తగినసమయంలోనే బహిర్గతం చేయాలి. అది పిడుగుపడటం, సుడిగాలిరేగటంవలె ఊహ కందనివిధంగా చటుక్కున రావాలి. అంటే రాజుమనస్సులోని అనుకూల ప్రతికూల భావాలు ముందుగా వ్యక్తముకారాదు.
క: తఱియగునంతకు రిపుఁ దనయఱకటఁ బెట్టికొనియుండునది; దఱియగుడుంజెఱచునది ఱాతిమీదనువఱలఁగ మృద్ఘటము నెత్తి వైచిన భంగిన్. 115
సమయం అనుకూలించేవరకు శత్రువునకు తెలియనిరీతిలో వారిని సమాదరించాలి. ఆతర్వాత అంతవరకు భుజానమోసిన కుండను రాతిపై విసరికొట్టినట్లు శత్రువును నాశనంచేయాలి.
క: తన కపకారము మునుఁ జేసిన జనుఁ డల్పుఁ డని నమ్మి చేకొని యుండంజన; దొకయించుక ముల్లయినను బాదతలమున నున్న నడవఁగ నగునే. 116
తనకపకారము చేసినవాడు అల్పుడు, వాడేమిచేయగలడని అనుకోకూడదు. ముల్లు చిన్నదైనా సరే కాలిలోదిగబడివుంటే, నడవలేము. అది అపకారే! శత్రువు అల్పుడని వదలక అంతం చేసితీరాలి.
క: బాలుఁ డని తలఁచి రిపుతోనేలిదమునఁ గలిసియునికి యిది కార్యమె? యుత్కీలానలకణ మించుకచాలదె కాల్పంగ నుగ్రశైలాటవులన్. 117
పిల్లకుంక వాడెంత, వాడేమిచేయగలడని యేమరరాదు. శత్రువును నాశనంచేసితీరాలి. అగ్నికణం చిన్నదేయైనా నిర్లక్ష్యంచేస్తే దావానలమై అడవిమొతన్ని దహించివేస్తుంది.
క: మొనసి యపకారిఁ గడ నిడికొనియుండెడు కుమతి దీర్ఘకుజశాఖాగ్రంబున నుండి నిద్రవోయెడుమనుజునకు సమాన మగుఁ బ్రమత్తత్వమునన్. 118తనకపకారము చేసినవాడిని నిర్భయంగా చెంతనుంచుకోవడం ప్రమాదం.చెట్టుకొమ్మచివర యెత్తైనచోట బుద్ధిహీనుడు శయనించినదానితో అది సమానం.
చ: తడయక సామభేదముల దానములన్ దయతోడ నమ్మఁగానొడివియు సత్యమిచ్చియుఁ జనున్ జననాథ! కృతాపకారులంగడఁగి వధింపఁగాఁ గనుట కావ్యుమతం బిది; గాన యెట్టులుంగడుకొని శత్రులం జెఱుపఁగాంచుట కార్యము రాజనీతిమైన్. 119
సామదానభేదములను ఉపాయములచేతగాని లేదా దయచూపి నమ్మకంకలిగించి గానీ, తనతీరు సత్యమని నమ్మింపజేయాలి. తదనంతరం సమయంచూసి దెబ్బతీయాలి. చంపేయాలి. ఇది శుక్రాచార్యుల రాజనీతి. ప్రతిరాజు పాటించదగ్గది.
వ: ‘కావున సర్వప్రకారంబుల నపకారకారణు లయిన వారిం బరుల నయిన బాంధవుల నయిన నుపేక్షింపక యాత్మరక్షాపరుండ వయి దూరంబుసేసి దూషించునది’ యనినఁ గణికుమతంబు విని దుర్యోధనుండు చింతాపరుం డై యొక్కనాఁడు ధృతరాష్ట్రున కేకాంతంబున ని ట్లనియె."
అందుచేత రాజున కపకారముచేసినవారు శత్రువేకానక్కరలేదు, బంధువులలోకూడా అపకారులుండవచ్చును. వారినికూడ వదలిపెట్టకూడదు. యెవరినైనాసరే ఆత్మరక్షణకై వధించితీరాలి. అంటూ కణికుడు చెప్పిన రాజనీతిని శ్రద్ధగా విన్నాడుదుర్యోధనుడు . ఒకదినం చింతాక్రాంతుడైన దుర్యోధనుడు తండ్రిధృతరాష్ట్రుని యేకంతంగాకలుసుకొని తను శత్రువులుగా భావిస్తున్న పాండవులను తనదారికడ్డుతొలగించుకొను ఉపాయముల గురించి చర్చించాడు.
2013 వ సంవస్తరంలొ ఏక్తాకపూర్ బాలాజీ ఫిలిమ్స్ పతాకంక్రింద హిందీలో "కహానీ హమారా భారత్కీ" అనేపేరుతో మహాభారత్ ధారావాహికం నిర్మించారు. అది 75 ఎపిసోడ్స్ తరువాత ఆగిపోయింది. ఆకథలో కణికుడు అడవిలో ఒంటరిగా ఒకకుటీరంలో వుంటున్న బ్రహ్మణమేధావి. అతనివద్దకు రహస్యంగా శకునితోకలసి ధృతరాష్ట్రుడు వెళ్ళికలుస్తాడు. అతని కూటనీతిబోధతోనే ధర్మజుని యువరాజుగా ప్రకటించాడు ధృతరాష్ట్రుడు. అందువల్ల పాండవులు సంతోషంతో సబరారు చేసుకుంటూవుంటారు. పెద్దలెవరికీ కౌరవులపై అనుమానంరాదు. కనుక నిఘావుంచరనుకుంటాడు ధృతరాష్ట్రుడు. కుట్రలుపన్నడానికి బాగాసమయందొరికిందనుకొని ఒకకుట్రపన్నారు. పాడవులను కుంతితోసహా వారణావతం పంపి, అక్కడ లక్కయింటిలో దహించేసే వ్యూహంసిద్ధంచేసుకున్నారు, కానీ అలా జరుగలేదు. విదురమహాశయుని అప్రమత్తతతో పాడవులు గండంగడచి బ్రతికిపోయారు. అది తరువాతి కథ. నన్నయవలెగాక యిక్కడ కణికుని పూర్తి కూటనీతజ్ఞునిగా చూపించారు.
కనుక పరిశీలనగాచూస్తే కణికనీతి ఆనాటికేగాదు, ఈనాటికిగూడా రాజకీయధురంధరులచే, కణికునికథ తెలిసియో తెలియకనో, యేమైననేమి అమలౌతున్నట్లే గనపడుచున్నది.
No comments:
Post a Comment