Monday, 23 December 2024

పట్టీలు

 పట్టీలు (Anklets)



బాలికలు పట్టీలతో తిరుగాడుతుంటే లక్ష్మీదేవి ఇంట్లో నడయాడుతున్నట్లుంటుందని హిందువుల భావన. అందుకే పుట్టిన ఆరునెలలకే బిడ్డకు పట్టీలువేసి మురిసిపోతుంటారు. పడతుల పట్టీల చిరుగజ్జల సవ్వడికి పరవశించి కవులు కవితలు, పాటలు అల్లారు. పారాణిపాదాల అందం రజితమువ్వలపట్టీలు ద్విగుణీకృతంచేసి పెండ్లికొడుకులు తలలు వంచేట్లు చేస్తాయనడం అతిశయోక్తికాదు. జ్యోతిష్యం ప్రకారం వెండి చంద్రునికి ప్రతీక. శుక్రునితో సంబంధం కలిగివుంటుంది. వెండిపట్టీలు భూమినుండి శక్తినిగ్రహించి శరీరానికందిస్తాయి. వెండిపట్టీలు శ్రేయస్సుకు చిహ్నం. పట్టీలచిరుమువ్వల సవ్వడివలన గృహంలోనికి సకారాత్మక శక్తులు ప్రవేశించి శుభా లందిస్తాయి. పట్టీలు ముఖ్యంగా వెండితోనే చేయించుకుంటారు. శరీరం పైభాగాన బంగారునగలు, క్రిందిభాగాన వెండినగలు ధరిస్తారు. బంగారం పసుపురంగు, గనుక అది లక్ష్మికి ప్రతీక. కాళ్ళకు బంగారు ధరించటం లక్ష్మీదేవిని అవమానించినట్లౌతుందని పట్టిలు బంగారంతోగాక వెండితోనే చేయించుకుంటారు.

స్త్రీలకు వెండిపట్టీలు ఆరోగ్యపరంగా యెంతో మేలుచేస్తాయి. వెండి శరీరాన్ని చల్లబరుస్తుంది. ఉష్ణోగ్రతను సమస్థితిలో వుంచుతుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఎముకల దృఢత్వం పెంచుతుంది. సరైన ఆహారపు అలవాట్లు కొరవడటంవలన స్త్రీలలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటున్నది. ఈవెండిపట్టీలు అట్టి హార్మోన్ల సమతుల్యతకు దోహదపడతాయి. మానసిక ప్రశాంతతనిస్తాయి. ఋతుసమయంలొవచ్చే పొత్తికడుపునొప్పి, నడుంనొప్పి, చీకాకు, నీరసం యీవెండి పట్టీలవల్ల తగ్గిపోతాయి. గర్భాశయం ఆరోగ్యంగావుంటుంది. సంతానం కలగటానికి సహాయపడతాయి. ప్రసవనొప్పులను తగ్గిస్తాయి. పాదాల, మడమనొప్పులు వాపులు తగ్గుతాయి. రక్తప్రసరణ క్రమబద్దమౌతుంది. సూక్ష్మక్రిములు, వైరస్ వల్లకలిగే జలుబు, దగ్గువంటి రోగాలురావు. గాయాలు త్వరగా మానిపొతాయి.

అనారోగ్యలక్షణాలను గుర్తించడానికి వెండిపట్టీలు తోడ్పడతాయి. చెమటలు యెక్కువై, శరీరంలో గధకంపాళ్ళు పెరిగి ఆరోగ్యం దెబ్బతింటే, పట్టీలు నల్లబడతాయి. పట్టీలు చర్మానికి తగిలియున్నచోట చర్మం నీలిరంగులోనికి మరితే, సోడియంపాళ్ళు శరీరంలో యెక్కువైనవని గ్రహించి ఉప్పువాడకం తగ్గించుకొనవచ్చును. అంతేగకుండా స్త్రీలు యెక్కువసేపు నిలబడి పనులు చేస్తూవుంటారు. అటువంటివారికి వచ్చే కీళ్ళనొప్పులుకూడా యీవెండి పట్టీలవల్ల ఉపశమనం కలుగుతుంది.

పూర్వం స్త్రీపురుషులుకూడా కళ్ళకు వెండికడియాలు ధరించేవారు. అవి మొరటైపోయి స్త్రీలుమాత్రం పట్టీలు వేసుకొంటున్నారు. సిటీలలో అవీపోయి యిప్పుడు పట్టీలుగా అమరివుండే చెప్పులువచ్చేశాయి. వటిని ఫ్యాషన్‌గా ధరిస్తున్నారు. ఏమైనా వెండిపట్టీలు చాలామేలుచేస్తాయని తెలిస్తే తప్పక వేసుకుంటారని ఆశిద్దాం.

                           

No comments:

Post a Comment

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...