సాంబ్రాణి
సాంబ్రాణిచెట్టునుండి
వచ్చే జిగురు (బంక) నుండి సాంబ్రాణి తయారౌతుంది. దీన్ని నిప్పులపై వేస్తే తెల్లటి
సువాసనగలపొగ వస్తుంది. దైవం ముందు సాంబ్రాణి పొగవేయడం హిందువుల ఆచారం. ముస్లింలు, క్రైస్తవులు కూడా దీన్ని పవిత్రంగా భావిస్తారు. ముస్లింఫకీర్లు
నిప్పులపళ్ళెరాన్ని పట్టుకొని తిరుగుతూ యీపొగను వేసి నెమలీకలకట్టతో పొగ మనవైపుకు
త్రిప్పి, దీవిస్తారు. క్రీస్తుజననం సమయంలో తూర్పుదేశపు
జ్ఞానులు ఆయనను సమీపించి ఇచ్చిన కానుకలలో సాంబ్రాణికూడా వుంది. రోమన్క్యాథలిక్ తెగవారు ప్రార్థనాలయాల్లో (చర్చీల్లో)
సాంబ్రాణిని వాడటం యిప్పటికి జరుగుచున్నది. దర్గాలలోకుడా ముస్లింలు
సాంబ్రాణిపొగవేయడం చేస్తున్నారు. దైవకైంకర్యంగా సాంబ్రాణిపొగలు వేయడం దాదాపు అన్ని
మతాలవారు ఇష్టంగా చేస్తున్నారు. సొమాలియా, అరేబియా, ఓమన్, ఇండోనేషీయా, జోర్డాన్,
ఆఫ్రికా, భారత్ లలో యీసాంబ్రాని చెట్లనుపెంచి,
విరివిగా వ్యాపారంకూడా చేస్తున్నారు. దేవునిపూజకేగాకుండా చనిపోయిన వారికికూడా
సాంబ్రాణిధూపం వేస్తారు. వ్యక్తిచనిపోయినతర్వాత 12 రోలుజులవరకు ఇంట్లోసాంబ్రాణి
ధూపం వేస్తారు. దివసాలలో, తద్దినాలలో, ముఖ్యంగా
మహాలయ అమావాస్యనాడు, సాంబ్రాణిధూపంవేసి పరమపదించిన
తమపూర్వీకులను తలచుకుంటారు. సాంబ్రాణిపొగలు తమపితృదేవుళ్ళను చేరి, వారిదీవనలు మనకందేట్లు చేస్తుంని విశ్వసిస్తారు. దీనియందు నమ్మకమున్నా
లేకపోయినా సాంబ్రాణిపొగలు ఇల్లంతా అలముకొని, సువాసనను
వెదజల్లడమేగాకుండా, సూక్ష్మక్రిములను, దోమలను,
కీటకాలను పారద్రోలుతాయి. దుష్టశక్తులను అడ్డుకొని నకారాత్మక
శక్తులను పారదోలి సకారాత్మక శక్తులను ఇంట్లోకి ఆహ్వానిస్తాయన్నది పురోహితుల
ఆభిప్రాయం. జ్యోతిషశాస్త్రజ్ఞులు సాంబ్రాణిధూపం యేరోజు వేస్తే యేఫలితం సమకూరుతుందో
యిలా వివరించారు. ఆదివారం సాంబ్రాణి గుగ్గిలం కలిపినిప్పులపై పొగవేయడంద్వార
సిరిసంపదలు, కీర్తి, దైవానుగ్రహం
కలుగుతుంది. అదే సోమవారమైతే ఆరోగ్యం, ప్రశాంతత, దేవీకటాక్షం కలుగుతాయి. మంగళవారమైతే శత్రుభయం, అసూయ,
ఈర్షా తొలగిపోయి, కంటిసమస్యలు, అప్పులబాధ వైదొలగుతాయి. బుధవారమైతే నమ్మకద్రోహులు, కుట్రదారులనుండి
వచ్చే ఆపదలను పరిహరించి, వరుసగా శుభాలు కలుగుతాయి. పెద్దల ఆశీస్సులు ఫలిస్తాయి.
గురువారమైతే సర్వకార్యములలో విజయం లభిస్తుంది. శుక్రవారమైతే లక్ష్మీప్రసన్నతతో
నిర్విఘ్నంగా అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. అదే శనివారమైతే ఈతిబాధలు
తొలగిపోతాయి. శనీశ్వరుని అనుగ్రహం లభించి, సోమరితనం, అలసత్వం వదలిపోయి, తేజస్వంతులై వెలుగొందుతారు.
ప్రస్తుతం సాంబ్రణికడ్డీలు, దిమ్మెలు విరివిగా లభిస్తున్నాయి. పూర్వం ఆవుపేడతో చేసుకొన్న పిడకకు నిప్పంటించి దానిపై సాంబ్రాణి, గుగ్గిలం, శుద్ధచందనం కలిపివుంచుకొన్న పొడిని వేసి, పొగను ఇల్లంతా వ్యాపింపజేసుకొనేవారు. కానీ యిప్పుడు కొన్నిరసాయనాలు కలిపిచేసిన సాంబ్రాణిదిమ్మెలు, బత్తీలు వస్తున్నాయి. వీటిపొగ మంచిదికాదని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. కనుక బాగాపరిశీలించి కొనాలి. శుద్ధ సాంబ్రాణిపొగ పీల్చడంవల్ల శ్వాససంబంధిత వ్యాధులు నయమౌతాయి. తలస్నానానంతరం శిరోజాలకు సాంబ్రాణి పొగవేసుకుంటే త్వరగా తల ఆరిపోవడమేగాకుండా, వెంట్రుకల కుదుళ్ళు బలపడతాయి. చంటిబిడ్డలకు యిలాచేస్తే రోగాలు దరిచేరవు. మంచినిద్రపడుతుంది. పిల్లలు చలాకీగావుంటారు. జుత్తు ఒత్తుగావున్న స్త్రీలకు తలస్నానానంతరం సాంబ్రాణిపొగపట్టడం సర్వదా స్రేయస్కరం.
సాంబ్రాణి వైద్యపరంగానూ చాల ఉపయోగకారి. శరీరంలోని నీరసాన్ని పోగొట్టి నరాలను ఉత్తేజపరుస్తుంది. అనేక మానసికరుగ్మతలకు సాంబ్రాణిధూపం మంచిఔషదం. కీళ్ళనొప్పులకు అజీర్తికి చర్మవ్యాధులకు ఉబ్బసం అల్సర్ వ్యాధుల మందుల్లో సాంబ్రాణిని వాడుతారు. సాంబ్రణిపొగలు నాడీమండల వ్యవస్థను ప్రేరేపించి క్రమబద్దీకరిస్తాయి. సాంబ్రాణినుండి నూనెనుకూడా తీస్తారు. ఈనూనె సబ్బులు, బాడీలోషన్లు, పర్ఫ్యూమ్సు టూత్పేస్టులలో మరియు నొప్పినివారణ ఆయిట్మెంట్లలో వాడుతున్నారు.
గుగ్గిలం, మైసాక్షి కూడా సాంబ్రణితో కలిపిగానీ వేరుగగానీ పొగవెయ్యడానికి ఉపయోగిస్తారు. ఇవికూడా వాటి చెట్లజిగురు నుండే తయారుచేస్తారు. మైసాక్షి (మహిషాక్షి) గుగ్గిలంలో మేలైన రకం. ఇవికూడా ధూపానికేగాక ఆయుర్వేదమందుల్లో విరివిగా వాడుతారు. గుగ్గిలంతో తయారుచేసే యోగరాజగుగ్గులు అనే మాత్రలు ఆయుర్వేదంలో చాలా పసిద్ధిపొందాయి. ఇవి కీళ్ళనొప్పులను. వాతపునొప్పులను నయంచేస్తాయి. సాంబ్రాణిధూపం అనుదినం దైవంముందు వేద్దాం, ఇల్లంతా పొగలు వ్యాపింపజేద్దాం ఆనందంగా హుషారుగా వుందాం.