Wednesday, 22 March 2023

సాంబ్రాణి,Benzoin

 


సాంబ్రాణి



సాంబ్రాణిచెట్టునుండి వచ్చే జిగురు (బంక) నుండి సాంబ్రాణి తయారౌతుంది. దీన్ని నిప్పులపై వేస్తే తెల్లటి సువాసనగలపొగ వస్తుంది. దైవం ముందు సాంబ్రాణి పొగవేయడం హిందువుల ఆచారం. ముస్లింలు, క్రైస్తవులు కూడా దీన్ని పవిత్రంగా భావిస్తారు. ముస్లింఫకీర్లు నిప్పులపళ్ళెరాన్ని పట్టుకొని తిరుగుతూ యీపొగను వేసి నెమలీకలకట్టతో పొగ మనవైపుకు త్రిప్పి, దీవిస్తారు. క్రీస్తుజననం సమయంలో తూర్పుదేశపు జ్ఞానులు ఆయనను సమీపించి ఇచ్చిన కానుకలలో సాంబ్రాణికూడా వుంది. రోమన్‍క్యాథలిక్  తెగవారు ప్రార్థనాలయాల్లో (చర్చీల్లో) సాంబ్రాణిని వాడటం యిప్పటికి జరుగుచున్నది. దర్గాలలోకుడా ముస్లింలు సాంబ్రాణిపొగవేయడం చేస్తున్నారు. దైవకైంకర్యంగా సాంబ్రాణిపొగలు వేయడం దాదాపు అన్ని మతాలవారు ఇష్టంగా చేస్తున్నారు. సొమాలియా, అరేబియా, ఓమన్, ఇండోనేషీయా, జోర్డాన్, ఆఫ్రికా, భారత్ లలో యీసాంబ్రాని చెట్లనుపెంచి, విరివిగా వ్యాపారంకూడా చేస్తున్నారు. దేవునిపూజకేగాకుండా చనిపోయిన వారికికూడా సాంబ్రాణిధూపం వేస్తారు. వ్యక్తిచనిపోయినతర్వాత 12 రోలుజులవరకు ఇంట్లోసాంబ్రాణి ధూపం వేస్తారు. దివసాలలో, తద్దినాలలో, ముఖ్యంగా మహాలయ అమావాస్యనాడు, సాంబ్రాణిధూపంవేసి పరమపదించిన తమపూర్వీకులను తలచుకుంటారు. సాంబ్రాణిపొగలు తమపితృదేవుళ్ళను చేరి, వారిదీవనలు మనకందేట్లు చేస్తుంని విశ్వసిస్తారు. దీనియందు నమ్మకమున్నా లేకపోయినా సాంబ్రాణిపొగలు ఇల్లంతా అలముకొని, సువాసనను వెదజల్లడమేగాకుండా, సూక్ష్మక్రిములను, దోమలను, కీటకాలను పారద్రోలుతాయి. దుష్టశక్తులను అడ్డుకొని నకారాత్మక శక్తులను పారదోలి సకారాత్మక శక్తులను ఇంట్లోకి ఆహ్వానిస్తాయన్నది పురోహితుల ఆభిప్రాయం. జ్యోతిషశాస్త్రజ్ఞులు సాంబ్రాణిధూపం యేరోజు వేస్తే యేఫలితం సమకూరుతుందో యిలా వివరించారు. ఆదివారం సాంబ్రాణి గుగ్గిలం కలిపినిప్పులపై పొగవేయడంద్వార సిరిసంపదలు, కీర్తి, దైవానుగ్రహం కలుగుతుంది. అదే సోమవారమైతే ఆరోగ్యం, ప్రశాంతత, దేవీకటాక్షం కలుగుతాయి. మంగళవారమైతే శత్రుభయం, అసూయ, ఈర్షా తొలగిపోయి, కంటిసమస్యలు, అప్పులబాధ వైదొలగుతాయి. బుధవారమైతే నమ్మకద్రోహులు, కుట్రదారులనుండి వచ్చే ఆపదలను పరిహరించి, వరుసగా శుభాలు కలుగుతాయి. పెద్దల ఆశీస్సులు ఫలిస్తాయి. గురువారమైతే సర్వకార్యములలో విజయం లభిస్తుంది. శుక్రవారమైతే లక్ష్మీప్రసన్నతతో నిర్విఘ్నంగా అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. అదే శనివారమైతే ఈతిబాధలు తొలగిపోతాయి. శనీశ్వరుని అనుగ్రహం లభించి, సోమరితనం, అలసత్వం వదలిపోయి, తేజస్వంతులై వెలుగొందుతారు.

 ప్రస్తుతం సాంబ్రణికడ్డీలు, దిమ్మెలు విరివిగా లభిస్తున్నాయి. పూర్వం  ఆవుపేడతో చేసుకొన్న పిడకకు నిప్పంటించి దానిపై సాంబ్రాణి, గుగ్గిలం, శుద్ధచందనం కలిపివుంచుకొన్న పొడిని వేసిపొగను ఇల్లంతా వ్యాపింపజేసుకొనేవారు. కానీ యిప్పుడు కొన్నిరసాయనాలు కలిపిచేసిన సాంబ్రాణిదిమ్మెలు, బత్తీలు వస్తున్నాయి. వీటిపొగ మంచిదికాదని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.  కనుక బాగాపరిశీలించి కొనాలి. శుద్ధ సాంబ్రాణిపొగ పీల్చడంవల్ల శ్వాససంబంధిత వ్యాధులు నయమౌతాయి. తలస్నానానంతరం శిరోజాలకు సాంబ్రాణి పొగవేసుకుంటే త్వరగా తల ఆరిపోవడమేగాకుండా, వెంట్రుకల కుదుళ్ళు బలపడతాయి. చంటిబిడ్డలకు యిలాచేస్తే రోగాలు దరిచేరవు. మంచినిద్రపడుతుంది. పిల్లలు చలాకీగావుంటారు. జుత్తు ఒత్తుగావున్న స్త్రీలకు తలస్నానానంతరం సాంబ్రాణిపొగపట్టడం సర్వదా స్రేయస్కరం.

 సాంబ్రాణి వైద్యపరంగానూ చాల ఉపయోగకారి. శరీరంలోని నీరసాన్ని పోగొట్టి నరాలను ఉత్తేజపరుస్తుంది. అనేక మానసికరుగ్మతలకు సాంబ్రాణిధూపం మంచిఔషదం. కీళ్ళనొప్పులకు అజీర్తికి చర్మవ్యాధులకు ఉబ్బసం అల్సర్ వ్యాధుల మందుల్లో సాంబ్రాణిని వాడుతారు. సాంబ్రణిపొగలు నాడీమండల వ్యవస్థను ప్రేరేపించి క్రమబద్దీకరిస్తాయి. సాంబ్రాణినుండి నూనెనుకూడా తీస్తారు. ఈనూనె సబ్బులు, బాడీలోషన్‍లు, పర్ఫ్యూమ్‍సు టూత్‍పేస్టులలో మరియు నొప్పినివారణ ఆయిట్‍మెంట్లలో వాడుతున్నారు.

  గుగ్గిలం, మైసాక్షి కూడా సాంబ్రణితో కలిపిగానీ వేరుగగానీ పొగవెయ్యడానికి ఉపయోగిస్తారు. ఇవికూడా వాటి చెట్లజిగురు నుండే తయారుచేస్తారు. మైసాక్షి (మహిషాక్షి) గుగ్గిలంలో మేలైన రకం.  ఇవికూడా ధూపానికేగాక ఆయుర్వేదమందుల్లో విరివిగా వాడుతారు. గుగ్గిలంతో తయారుచేసే యోగరాజగుగ్గులు అనే మాత్రలు ఆయుర్వేదంలో చాలా పసిద్ధిపొందాయి. ఇవి కీళ్ళనొప్పులను. వాతపునొప్పులను నయంచేస్తాయి. సాంబ్రాణిధూపం అనుదినం దైవంముందు వేద్దాం, ఇల్లంతా పొగలు వ్యాపింపజేద్దాం ఆనందంగా హుషారుగా వుందాం.         

 

 

 

 

 

 

 

 

 

 

 

Tuesday, 21 March 2023

కర్పూరం,camphor

 

కర్పూరం



కర్పూరాన్ని  కపురం, కప్పురం అనికూడాఅంటారు. కర్పూరంచెట్లు చైనా, జపాన్, దేశాల్లోను, భారత్‍లోని నీలగిరికొండల్లోనూ, మైసూర్, మలబార్ ప్రాంతాలలోనూ ఎక్కువగా  పెంచుతున్నారు.  హారతికర్పూరం, పచ్చకర్పూరం అందరికితెలిసిన కర్పూరాలు.  కర్పూరంలో చాలారకాలున్నాయి. ఘనసారం, భీమసేనం, ఈశానం, ఉదయభాస్కరం, కమ్మకర్పూరం, ఘటికం, తురుదాహం, తుషారం, హిమరసం, హారతికర్పూరం, శుద్ధం, హిక్కరి, ప్రోతాశ్రయం, పోతాశం, సితాభ్రం, యీ కర్పూరరకాలు. కర్పూరంచెట్టు వేళ్ళు,కొమ్మలు, ఆకులు నీళ్ళలో మరిగించి డిస్టిలేషన్ పద్దతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరమంటారు. దీన్ని ముఖ్యంగా లడ్డూలాంటి తీపిపదార్తాల్లోను  ఔషదాల్లోనూ, కాటుకలు, అంజనాలు తయారుచేయడానికి వాడుతారు. బీమసేనికర్పూరం, చెట్టుకొమ్మలకు గాట్లుపెట్టి, వాటినుండి స్రవించే పాలతో తయరుచేస్తారు. కనుక దీన్ని అపక్వకర్పూరం అనికూడా అంటారు. ఇది ఔషదాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. హారతికర్పూరం టర్‍పెంటైన్ నుండి రసాయనిక ప్రక్రియద్వరా తయారుచేస్తారు. ఇది కృత్రిమకర్పూరం. దీన్ని ఔషదాలలో వాడరు. రసకర్పూరమని మరొకటున్నది. దీన్ని ఆముదంతో కలిపి చిన్నపిల్లలకు కడుపులోనికిస్తారు. శరీరంలోని దోషాలన్నిటిని ఇది  పోగొట్టి దేహరక్షణ గావిస్తుంది.

 కర్పూరం, పూజానంతరం దేవునివద్ద మంగళహరతిపాటపాడి   హారతినివ్వడానికేగాకుండా, వాస్తుదోష పరిహారణకూ, దిష్టిదోష నివారణకు సైతం కర్పూరముపయోగపడుతుంది. ఇంట్లో కర్పూరం వెలిగించడంవల్ల మానవసంబంధాలు మెరుగుపడతాయి. అపార్థాలు తొలగిపోయి మానసిక‍ఆంధోళనలు శాంతించి, నకారాత్మకశక్తులు నశిస్తాయి. పడకగదిమూలలలో వెండిలేక ఇత్తడి గిన్నెలో కర్పూరంవేసి వుంచితే భార్యాభర్తల మధ్య గొడవలుపోయి సమన్వయం కుదురుతుంది. ఇంటి ఆగ్నేయంలో కర్పూరం నెయ్యి కలిపి సాయంత్రాలు దీపాలు వెలిగిస్తే, గ్రహదోషాలు తొలగి, చేపట్టినపనులు సక్రమంగా జరుగుతాయి. అదృష్టం వరిస్తుంది. కర్పూరంపొడి లవంగాలపొడి కలిపి వెలిగించి ఇల్లంతా త్రిప్పితే, ఇంటికిపట్టిన చీడలు, పీడలు, పిశాచాలు వదలిపోతాయి. ముఖ్యంగా యిలా దీపావళిరోజునచేస్తే మరింతమంచిది. అనారోగ్యంనుంచి కోలుకొని ఆసుపత్రినుండివచ్చి గృహప్రవేశం చేసేటప్పుడు పళ్ళెరంలో ఎఱ్ఱనీళ్ళుపోసి అందులోనే కర్పూరం వెలిగించి దిష్టితీసి,  ఎఱ్ఱనీళ్ళు వాకిలి రెండుపంచలా పారబోయాలి. ఇలాచేసి ఇంట్లోకి వెళితే దృష్టి దోషాలుపోయి, ఆయురారోగ్యాలు సమకూరుతాయి తొందరగా మాములు స్థితికివచ్చేస్తారు. కర్పూరంపొడి లావెండర్‍ఆయిల్‍తో కలిపి గానీ లేక మంచినీళ్ళలోకలిపిగానీ ఇల్లుశుభ్రంచేస్తే క్రిములు నశించి, ఇల్లు సువాసనలతో శుభకరంగా వుంటుంది.  

    వైద్యపరంగా కర్పూరపు ప్రయోజనాలు చాలాఎక్కువ. కర్పూరం ఎక్కువమోతాదులోకాకుండా కొద్దిమాత్రమే సేవించాలి. లేకపోతే దానిఘాటువల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదంవుంది. కర్పూరం సేవిస్తే స్వల్పహృదయసమస్యలు, అలసట తగ్గిస్తుంది. కీళ్ళనొప్పులు, నరాల నొప్పులు, బలహీనత, వీపు నడుంనొప్పులకు నూనెలో కర్పూరం కలిపి మర్థన చేయడంద్వారా ఉపశమనం కలుగుతుంది. అందుకే చాలారకాల నొప్పినివారణ ఆయింట్‍మెంట్లలో దీన్ని వాడుతున్నారు. పుండ్లుమానడానికి, పిల్లల్లోవచ్చే గజ్జి తామర నయంచేయడానికి కూడా యీనూనెను ఉపయోగిస్తారు. కుష్ఠురోగుల పుండ్లను కూడా యీనూనె మాన్పుతుంది. కర్పూరం వాసనచూస్తే నాశికాసమస్యలు, ఊపిరితిత్తులసమస్యలు తొలగిపోతాయి. రెండుపలుకుల కర్పూరం నోటిలోవుంచుకుంటే, దప్పిక తగ్గుతుంది. నోటిదుర్వాసనా తగ్గుతుంది. సారాయిలో కర్పూరం కలిపి సంతృప్త ద్రావణంగా తయారుచేసుకొని చితికెడుచెక్కెరలో రెండు చుక్కలు యీ ద్రావణం వేసుకొని సేవిస్తే, నీళ్ళవిరేచనాలు తగ్గుతాయి. కలరావ్యాప్తి సమయంలోకూడా దీన్ని నివారణమందుగా వాడుకోవచ్చు. కర్పూరసువాసన కామకోరికలను అదుపులోవుంచుతుంది. అంతేగాక పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి, ఎండుద్రాక్ష సమభాగాలుగాతీసుకొని కలిపినూరి బఠాణీలంత మాత్రలు చేసుకొని రాత్రిపడుకోబోయే ముందు ఒకగ్లాసు పాలతో సేవిస్తే మగవారిలో లైంగికశక్తి పెరుగుతుంది. కర్పూరం రోజ్‍వాటర్‍తో కలిపి మర్మావయాలకు పట్టించి 15 నిముషాల తర్వాత కడిగేస్తే మర్మాయవాలదురదలు తగిపోతాయి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే సరిపోతుంది. ఉబ్బసం తీవ్రంగావుంటే బెల్లం కర్పూరం సమపాళ్ళలోకలిపి కొద్దికొద్దిగా సేవిస్తే తీవ్రాత తగ్గుతుంది. నీళ్ళలో కాస్తా కర్పూరంపొడి చల్లి ఆనీళ్ళతో స్నానంచేస్తే శరీరంపైనుండే బ్యాక్టీరియా నశించి, చర్మంశుభ్రంగా వుంటుంది. కర్పూరంపొడిని కొబ్బరినూనెలో నానబెట్టి తలకుపట్టిస్తే చుండ్రు పోతుంది. ఉతికిన బట్టలమధ్య కాస్తా కర్పూరం వేసి పెడితే రిమటలు దరిదాపుల్లోకి రావు. కర్పూరం రెండుభాగాలు, వాముపువ్వు ఒకభాగం, మెంథాల్ (పెప్పరమెంటుపువ్వు) ఒకభాగం సీసాలోవేసేస్తే  అదే ద్రవమై పోతుంది. దీన్ని అమృతధార అంటారు. రెండుచుక్కలు అమృతధార చిటికెడుచెక్కెరలో వేసుకొని కడుపులోకి సేవిస్తే, ఆహారం సులభంగా జీర్ణమౌతుంది. దగ్గుతగ్గుతుంది. నీళ్ళవిరేచనాలు తగ్గిపోతాయి. తలనొప్పులకు, వాపులకు బెణికిననొప్పులకు, పైపూతగా బాగా పనిచేస్తుంది. ముక్కుపైన వీపుపైన మాటిమాటికి పట్టిస్తూవుంటే, జలుబు రొంప రొమ్ముపడిశం తొందరగా తగ్గుతుంది. కడుపుపైన రుద్దుతే, ఉబ్బరం తగిపోతుంది. దెబ్బతగిలినవెంటనే గాయంపైన దూదిపై నాలుగుచుక్కలు అమృతధార వేసి పెడితే రక్తంకారడం వెంటనే తగ్గిపోయి, తొందరగా పక్కుగట్టి మానిపోతుంది. చిటికెడుబీయ్యంలో కాస్త కర్పూరమేసి చేతిగుడ్డలో  ఒకకొసన మూటగాకట్టి జలుబు పడిశంలో ఇన్‍హేలర్‍గా వాడుకొనవచ్చు. ఇలా చాలా ఉపయోగాలున్నాయి కర్పూరంతో-       

 

Tuesday, 14 March 2023

పటిక,Allum

 పటిక


పటిక స్ఫటికాకారంలో వుండే పారదర్శకమైన ఉప్పువంటి ఖనిజం. దీన్ని పటికారం అనికూడ అంటారు. నీళ్ళలో పటికపొడి చల్లడంవలన, పటిక నీటిలోని మురికిని గ్రహించి, నీటిఅడుగుకు చేరిపోతుంది. మంచితేటనీరు పైనవుంటుంది. కనుక త్రాగునీరు సరఫరాసమయంలో  ప్రభుత్వము ట్యాంకుల్లో పటికను వాడతారు. ఏటిగట్టుపల్లెల్లో చెలిమెలలోకూడా దీన్నివాడుకుంటారు. పటికకుబదులు, చిల్లగింజలు అరగదీసి ఆగంధం నీటిచెలిమెల్లో వాడుకుంటారు.

 పటికరాయిని నల్లవెంట్రుకల తాడుతోగాని, ఎఱ్ఱలేక నల్లగుడ్డలో కట్టి దుకాణాలగుమ్మాలలోను కొన్నియిళ్ళ తలవాకిటికి, నూతనవాహనాలకు ముందువైపు యీ పటికను కట్టివుండటం గమనిస్తుంటాము. కారణం యీ పటికవున్న చోటికి నకారాత్మకశక్తులు ప్రవేసింపలేవని వాస్తుశాస్త్రజ్ఞులు చెబుతుంటారు, వాస్తుదోషంవుండి, దాన్ని సరిదిద్దలేని పరిస్థితుల్లో యీ పటిక కట్టుకుంటే, వున్న వాస్తుదోషం, దిష్టిదోషం కూడా తొలగిపోతుందని నమ్ముతారు. ప్రతిగదిలో ఉత్తరందిక్కున ఒక చిన్నగాజుగ్లాసులో పటికవేసిపెట్టినా, దేవునిగూట్లో ఒకచిన్న గాజుగిన్నెలో పటికపలుకులు వేసివుంచినా, ఇంటి ద్వారబంధానికి పటికరాయి ఎఱ్ఱగుడ్డలో మూటగట్టి ద్వారబంధానికి కట్టుకున్నా ఆఇల్లు సుఖసంతోషాలతో సమృద్ధితో కళకళలడుతూ వుంటుందని, అది లక్ష్మీనివాసమౌతుందని అనేకుల ప్రగాడ విశ్వాసం. పటికనీటితో అప్పుడప్పుడు ఇల్లుగాని, కార్యాలయంగాని, వ్యాపారస్థలంగాని శుభ్రంచేసినా శుభాలు వెల్లివిరుస్తాయంటారు. ఇందువల్ల క్రిమినివారణకూడా జరుగుతుంది. ఇలాగే దిష్టిదోషంపోవడానికి నిమ్మకాయలు మిరపకాయలు ఒకకడ్డీకిగాని, దారానికిగాని గ్రుచ్చి, దిష్టిదోషనివారణకు కట్టుకోవడం మనం అనేకచోట్ల చూస్తూవుంటాం. ఇదికొందరు మూఢనమ్మక మనుకోవచ్చుగానీ, నిమ్మకాయలు మిరపకాయలూ కలిపి కట్టడంద్వారా వాటికలయికతో రసాయనికచర్య జరిగి, అందుండి వెలువడే వాయువు ఆరోగ్య ప్రదాయినియని శాస్త్రజ్ఞులు చెప్పడం గమనార్హం. పటికపైనుండి వీచేగాలికూడా ఆరోగ్యప్రదాయినియే. అయినా పటిక మాటిమాటికి మార్చవలసిన అవసరంవుండదు. మిరప కాయలు నిమ్మకాయలు పచ్చివిగనుక ఎండిపోతాయి. అందువల్ల వారానికొకసారైనా మార్చుకోవలసివస్తుంది.

 పటిక ఆయుర్వేదం, హోమియోపతి వైద్యంలో ఉపయోగిస్తున్నారు. స్ఫటికాదిచూర్ణం పేర ఆయుర్వేదంలో ఒకమందు దొరుకుతుంది. అది పంటిచిగుళ్ళనుండి రక్తంరావటం, నాలుకపైపుండ్లకూ బాగా పనిచేస్తుంది. టాన్సిల్స్ వాపు నొప్పి తగ్గుతాయి. 15  గ్రాముల పటిక, 600 మిల్లీలీటర్ల నీటితోకలిపిన ద్రవంలో రెండు శుభ్రమైన గుడ్డలుతడిపి ఒకదానొతో యోనిని శుభ్రపరచి రెండవది యోనిలో   కొద్దిసేపుంచాలి.  ఇలా కొద్దిరోజులు చేస్తే తెల్లబట్ట, యోనివ్రణాలు, దురదలు తగ్గిపోతాయి. పటికనీటిని రెండుచుక్కలు కళ్ళలోవేస్తే, కలకలు నయమౌతాయి. నిప్పులపై పెంకుపెట్టి దానిపై పటికవేసి పేల్చాలి, చల్లారినతర్వాత చనుబాలు కలిపి చెవిలోవేస్తే చవిలోని గుల్లలు మాని, చీముకారడం తగ్గిపోతుంది. పటికకలిపిన నీటితో మొలలను కడగడంద్వారా మొలలపిలకలు ఎండిపోయి రాలిపోతాయి. 200గ్రాముల ముల్లంగిరసం 10 గ్రాముల పటికపొడికలిపి సన్ననిమంటపై ముద్దకట్టేవరకు వండి, రేగుపండంత మాత్రలు చేసుకొని ఆరనిచ్చి, రోజూఉదయం ఒకమాత్ర చొప్పున సేవిస్తే మొలలవ్యాధిలో నొప్పి, దురద, రక్తంకారడం తగ్గిపోతాయి. ఇదే మాత్ర మూత్రపిండాలలో నొప్పినికూడా నయంచేస్తుది. ఐదుగ్రాముల పటికపొడి 100 మిల్లీలీటర్ల పాలలోవేసి వడగట్టి రోజూ మూడుపూటలా త్రాగితే నోరు, ముక్కు, మలమూత్ర ద్వారాలనుండి రక్తంస్రవించడం, రక్తవిరేచనాలు, స్త్రీలలో బహిష్టు వ్యాధులు నయమౌతాయి. పటిక హారతికర్పూరం దానిమ్మపెచ్చులు నీటితోనూరి రాత్రి రొమ్ములకు పట్టించి బట్టకట్టుకొని ఉదయం కడిగేస్తూవుంటే, స్తనాలు దృడత్వం సంతరించుకుంటాయి. పటిక కోడిగ్రుడ్డుపచ్చసొన కలిపి పట్టిస్తే పడకపుండ్లు మానిపోతాయి. పొంగించిన పటికపొడికి పదిరెట్లు బెల్లంకలిపి రోజూ ఒకటిరెండుసార్లు సేవిస్తే మొండిదగ్గులు తగ్గిపోతాయి. 200 గ్రాముల కొబ్బరినూనె, 50 గ్రాముల తేనెమైనం కలిపి వేడిచేసి గోరువెచ్చగానున్నప్పుడు 30 గ్రాముల పటికపొడి కలిపి వుంచుకొని, తారాగుండంత ఉదయం సాయంత్రం సేవిస్తే ప్రేగుల్లోపూత, వ్రణాలు, నోటిపూత బాగౌతాయి. పటికపొడి బొగ్గుపొడికలిపి పళ్ళుతోముకుంటే పంటిజబ్బులురావు. నోరుబాగా శుభ్రమౌతుంది నోటిడుర్వాసన తగ్గిపోతుంది . పటికపొడి కొద్దిగా నీళ్ళలోకలిపి స్నానాంచేస్తే ఎక్కువగా చెమటలుపట్టడం తగ్గిపోతుంది. తలస్నానంచేస్తే పేలుపడవు. గాయాలు పటికనీటితో కడిగితే క్రిమిసంహారినిగా పనిచేసి రక్తస్రావం తగ్గి, తొందరగా గాయాలుమాని పోతాయి. మంగలిషాపుల్లో షేవింగ్ తర్వాత నీళ్ళతోతడిపి పటికబిళ్ళతో రుద్దుతారు. అందువల్ల చర్మవ్యాధులు వ్యాపించవు. ముఖంపై గుల్లలు నయమౌతాయి. వాపులు, తిమ్మెర్లు, మంటలువున్న శరీరభాగాలపై నీళ్ళుజల్లి పటికతో రుద్దితే, ఉపశమనంకలుగుతుంది. పటికనీటితో ముఖంకడుక్కొనే అలవాటుచేసుకుంటే, ముఖంపై ముడుతలు తొందరగాపడవు. అవాంచిత రోమాలు మొలవవు. మొటిమలురావు. వచ్చినతర్వాత పటికనీటితో ముఖంకడుక్కుంటూవుంటే, తొందరగా పోతాయి. మచ్చలుయేర్పడవు. కరోనావంటివైరస్ వ్యాధులు ప్రబలినపుడు శానిటైజర్లకు బదులు పటికనీటితోచేతులు కడుక్కోవచ్చు. ఇదిచౌక. రెండుపలుకులు జోబులో వేసుకుంటేకూడా మంచిదే. బియ్యంలో పురుగులు పడకుండా పటిక పలుకులు కలుపుకుంటే సరిపోతుంది. వండుకునేప్పుడు యీపలుకులు తీసేసుకోవచ్చు. ఒకటిఅర బియ్యంలోవున్నా కడిగేప్పుడు నీటిలో కరిగిపోతాయి. ఇన్ని ప్రయోజనాలున్నాయి మరి పటికతో

Friday, 10 March 2023

గుమ్మడికాయ,కూష్మాండం,Ash gourd

 

        

      

బూడిద గుమ్మడికాయ



గుమ్మడికాయ రెండురకాలు. ఒకటి పసుపు ఎఱుపుకలిసినరంగులోనుండి కూరల్లో ఎక్కువగా వాడుకుంటారు. రెండవది బూడిదగుమ్మడికాయ. ఇది తెల్లటికాయ. పైన బూడిదపూసినట్లుంటుంది. సంస్కృతంలో గుమ్మడి కాయను  కూష్మాండం అంటారు. పుచ్చజాతిలోని ప్రత్యేకమైన కాయయిది. ఐదారు కిలోలవరకు బరువుంటుంది. దీన్ని కూరగాయగా గానేగాక వైద్యంలోనూ, దిష్టి నివారిణిగానూ ఉపయోగిస్తారు. నరదృష్టి తగిలితే నాపరాయైనా పగిలిపోతుందన్న సామెత వుండనేవుంది. అట్టి దృష్టిదోషనివారిణి యీ గుమ్మడికాయ. సాధారణంగా గృహప్రవేశంనాడు, కూష్మాండపూజ తెలిసిన పూజారిచేత కూష్మండపూజ చేయించి గుమ్మంముందు ఉట్టిగట్టి వ్రేలాడదీస్తారు. కార్యాలయాలకు, వ్యాపారసంస్థలకు సహితం దిష్టిదోషం పోవడానికి గుమ్మడికాయ కట్టుకుంటారు. మనపైన, మనయింటిపైన దిష్టిదోషం వుంటే, ఆదోషాన్ని గుమ్మడికాయ తనవైపుకు లాక్కొని అది చెడిపోతుంది. లేదా సూతకదోషం, అంటే, ఇంట్లో ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు, ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు, మైలపడినప్పుడు, లేదా గ్రహణప్రభావం సోకినపుడు గుమ్మడికాయ చెడిపోవచ్చు. లేకుంటే గుమ్మడికాయ సంవత్సరకాలం చెడిపోకుండావుంటుంది. దీన్ని యితరకూరగాయల వలె  ప్రిజ్‍లో పెట్టనవసరంలేదు. సూతకం రోజుల్లో సూతకం పోయినతరువాత కాయ మార్చుకోవాలి. ఏకారణంతో కాయచెడిపోయినా వీలైనంత తొందరగా కాయమార్చుకోవాలి. ఒకరోజుముందే గుమ్మడికాయతెచ్చి ఇంట్లో వుంచుకొని, మరునాడు సూర్యోదయసమయంలో కాయకు పసుపుకుంకుమలు రాసి, ధూపంగానీ అగరువత్తులుగానీ వెలిగించి, పూజచేసి మళ్ళీ కాయను ఉట్టిలో వుంచుకోవాలి. చెడిపోయినకాయను నదిలో విడిచిపెట్టాలి. గుమ్మడికాయ కట్టుకోవడానికి  ఆది, గురువారాలు మంచివి. కారణం ఆరోజులకు భూతప్రేత పిశాచాలను తరిమివేసే గుణంవుంది. ఇంట్లో పూజచేసినప్పుడల్లా అగరువత్తులు గుమ్మడికాయ వద్దకూడా వెలిగించాలి. ఇలాచేస్తే నకారాత్మకశక్తులు ఇంట్లోకి రాలేవు. గుమ్మడికాయపైనుండివీచేగాలి ఇల్లంతా వ్యాపిస్తే, గుమ్మడిలోవుండే ప్రాణశక్తివల్ల ఇంట్లోనివారందరూ క్షేమంగా వుంటారు. గుమ్మడికాయ లోలోపలికి ముడుచుకపోయి, ఓసంవత్సరానికి మామూలుగా ఎండిపోతుంది. కనుక అది మంచిపరిణామమే. అందువల్ల ఏడాదికోసారి గుమ్మడికాయ మార్చుకోవడం మంచిది. గృహప్రవేశంరోజున కొందరు బలియిస్తుంటారు. అది అహింసా వాదులకు నచ్చదు. వారు గుమ్మడికాయకు రంధ్రంవేసి దానిద్వార ఎఱ్ఱటి కుంకుమ లోపలికి పోనిచ్చి, ఆగుమ్మడికాయను పగులగొడతారు. ఇది నూరు మేకపోతుల బలితో సమానమని శాస్త్రం చెబుతున్నది. బాడుగింట్లో వున్నవారు సైతం గుమ్మడి కాయ ఇంటిగుమ్మానికి కట్టుకోవచ్చును. ఎఱ్ఱగుమ్మడి చరకిదేవతా, బూడిదగుమ్మడికాయ విదారిదేవతానివాసం. ఈదేవతలు కష్టనష్టాలను పిశాచాలను తొలగించి మేలుచేకూరుస్తారు. కొందరు గుమ్మడికాయను కాలభైరవుడనికూడా దోషనివృత్తికోసం పూజిస్తారు. తెలిసినపండితులు సమయానికి దొరకని పక్షంలో "హే కూష్మాండదేవతా ఇయంగృహే శాకిన్యాదిదేవాః పరతంత్రాది సర్వదోషాన్ నివృత్తయ నివృత్తయ గృహే సర్వకార్యాదిన్ రక్ష రక్ష హోంఫట్ స్వాహా" అని మూడుసార్లు జపించి ఇంటివారే కట్టుకొనవచ్చును. దుర్గాష్టమినాడు (దశరాలో) శాకాహారులు దేవత ముందు జంతుబలికిమారుగా గుమ్మడికాయకుబెజ్జంవేసి అందులో ఎఱ్ఱటికుంకుమపోసి కూష్మాండం పగులగొట్టి దేవీఅనుగ్రహానికి పాత్రులౌతారు.

 

వంటలో రెండురకాల గుమ్మడికాయల ఉపయోగమూ ఎక్కువే. గుమ్మడికాయ మేద్జోశక్తిపెంచుతుంది. ఔషదరూపంలో మాత్రం బూడిదగుమ్మడినే ఉపయోగిస్తారు. ఈగుమ్మడి పచ్చితురుమును పెరుగులోవేసుకొని సేవిస్తే శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. మొలలవ్యాధిని నివారిస్తుంది. గింజలతో పోస్త్రేటు సమస్యలు నయమవుతాయి. గ్రుడ్లువాడమనేవారికోసం, గుమ్మడితురుమువాడి పాన్‍కేకులు తయారుచేస్తున్నారు. గుమ్మడివడియాలు అందరికీ తెలిసినవే. ఆగ్రాపేడా అని పిలుచుకొనే మిఠాయిలో ఎక్కువగా బూడిదగుమ్మడితురుమునే వాడతారు. పండుగరోజుల్లో బూడిదగుమ్మడిహల్వా చేసుకొంటాము. సాంబారులో గుమ్మడిముక్కలు వేసుకుంటాము. పైచెక్కుతీసి ముక్కలుముక్కలుగాతరిగి మిక్సీలోవేసి బూడిద గుమ్మడిరసం తీసుకొని అందులో కొద్దిగా సైంధలవణం మరియు నిమ్మరసం కలిపి, ఆరసం త్రాగడంవల్ల శరీరవేడి తగ్గుతుంది. ఆంటీయిన్‍ఫ్లమేటరీగా పనిచేస్తుంది. మబద్దకం తొలగి పోతుంది. కడుపులోమంట, ఉబ్బరం, అధికదాహం, ఉదరకోశవ్యాధులెన్నో బాగౌతాయి. కడుపులో పురుగులు నశిస్తాయి. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడవు. కంటిచూపు పెరుగుతుంది. గుమ్మడికాయలో పీచుపదార్తం, పొటాషియం, ఇనుము వుండి రక్తపోటును తగ్గించి రక్తహీనతను పోగొట్టి రక్తంలో చెక్కరను నియంత్రిస్తుంది. సంతానసాఫల్యతకుకూడా తోడ్పడుతుంది. గింజలల్లో సూక్ష్మపోశకాలున్నాయి. వీటినివేయించి తినవచ్చును.  ఇవి హార్మోన్లను సమతుల్యంగా వుంచుతాయి. బూడిదగుమ్మడికాయలో 99% నీరేవుంటుంది. అందువల్ల కార్బోహైడ్రేట్లు క్రొవ్వులు అతితక్కువగావుంటాయి. డైటించేసి బరువుతగ్గాలనేవారికి గుమ్మడితోచేసిన ఆహారాలు, జూసులు చాలామంచివి. గుమ్మడితీగరసం రక్తపోటుకు, నిద్రలేమికి మంచిమందుగా పనిచేస్తుంది. చెడుక్రొవ్వును చేరనివ్వదు. విత్తనాలనూనె చర్మవ్యాధులను మాన్పుతుంది. కాయపైచెక్క, గింజలు కొబ్బరినూనెలో వేసికాచుకొని తలనూనెగా ఉపయోగించవచ్చును. ఈనూనె వెంట్రుకలు బాగాపెరగడానికి తోడ్పడుతుంది. సిద్ధవైద్యంలోనూ ఆయుర్వేదవైద్యంలోనూ బూడిదగుమ్మడితో ఔషదాలు తయారుచేస్తారు. ఆయుర్వేదంలో కూష్మాండలేహ్యం పేరుకెక్కినది. ఇదిమంచిపుష్టినిస్తుంది. క్షయ, రక్తహీనతలలో మంచిగుణకారి. కేరళవైద్యంలోకూడా కూష్మాండరసాయనం పేరుతో బలవర్ధకరఔషదం తయారుచేస్తున్నారు. గుమ్మడికాయలో విటమిన్ ఏ, బి6, సి, , మెగ్నీషియం, ఇనుము, భాస్వరం, ఫ్లోలేట్, నియాసిన్, థయామిన్. కెరొటిన్, ల్యూటేయిన్, జియాక్యాంథిన్ వంటి పోషకాలున్నందున ఆరోగ్యదాయినిగా గుర్తింపుపొందింది.                

      

Wednesday, 8 March 2023

కొబ్బరికాయ,Coconut

 

కొబ్బరికాయ



కొబ్బరికాయను టెంకాయ, శ్రీఫలం, నారికేళం అనికూడాఅంటాఋ. ఇదిహిందువులకు అతిముఖ్యమైన పూజావస్తువు. పాంజాతికి చెందిన వృక్షమిది. ఇసుకనేలలలో బాగాపెరుగుతుంది. వందసంవత్సరాలు బ్రతుకుతుంది. ఏడుసంవత్సరాల తర్వాత ఫలిస్తుంది. ముఫ్పై మీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది. వేదాలలో కొబ్బరికాయ ప్రస్తావనలేదుకానీ పురావస్తుశాఖ త్రవ్వకాల్లో, ఆయుర్వేద గ్రంథాల్లో, చైనా, అరేబియా, ఇటలీ, యాత్రికుల అనుభవాలు లిఖించిన గ్రంథాల్లో నారికేళప్రస్తావన కనబడుతుంది. అమరకోశం (క్రీ.శ 500 -800)లో నారికేళం కనబడుతుంది. మనిషి ఆవిర్భానికిముందే, రెండుకోట్ల సంవత్సరాలక్రితము  నుండే కొబ్బరివుందని పురవస్తుశాఖ శిధిలాల పరిశోధనలప్రకారం నిర్ధారించారు. ఒకటి, రెండు శతాబ్దాలనుండి కొబ్బరికాయ ధార్మికకార్యక్రమాలలో వాడటం మొదలైందట. మధ్యయుగంనాటి శిలాశాసనాలలో దేవాదాయఆస్తులుగా కొబ్బరితోటలున్నాయి. చరకసంహితలో ఔషదవృక్షంగ కొబ్బరినిపేర్కొనడం జరిగింది. ఆగ్నేషియా, ఇండోనేషియా, ఆష్త్రేలియా, పసిపిక్‍దీవులు, ఇండియాలో కొబ్బరిసాగు జరుగుచున్నది. ఇండియాలోని కేరళరాష్త్రం,  ఆంద్రప్రదేశ్‍లోని కోనసీమ కొబ్బరిపంటకు ప్రసిద్ధిచెందింది.

 డిల్లీకిచెందిన పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకరశర్మగారు కొబ్బరికాయను మానవశరీరంతో పోల్చారు. పీచు టెంక అహంకారం. లోపలికొబ్బరి మనస్సు. నీరు నిర్మలత్వం. మనిషితన అహంకారాన్ని తొలగించుకొని, తననుతాను నిర్మలంగా భగవంతునికి సమర్పించుకోవడమే, అనగా ఆత్మసమర్పణమే నారికేళసమర్పణమన్నారు. కొబ్బరికాయను మరికొందరు పండితులు మనిషితలతో పోల్చారు. పైపీచు వెంట్రుకలు, గుండ్రని‍ఆకారం ముఖం, లోపలినీరు రక్తం, తెల్లటికొబ్బరి మనస్సు అన్నారు. ఇంకొందరు పెద్దలు టెంకాయకున్న మూడుకళ్ళు స్ఠూల,సూక్ష్మ,కారణ శరీరాలకు ప్రతీకలన్నారు. కొందరైతే అవి శివుని త్రినేత్రాలన్నారు. కొబ్బరివృక్షం స్వర్గంనుండి భూమికి లక్ష్మీనారాయణులచే తేబడిందని చెబుతారు. ఇది భువిపైగల కల్పవృక్షమని హిందువులుభావిస్తారు. కొబ్బరికాయను దైవారాధనకేగాదు దోషనివారణకూ ఉపయోగిస్తారు.

 ఏవిధమైన పూజచేసినా, అది యజ్ఞారంభంకావచ్చు, పెళ్ళిళ్ళలోకావచ్చు, ఉత్సవాలలోకావచ్చు, క్రొత్తవాహనానికి పూజలోకావచ్చు, గృహనిర్మాణాలకుముందు శంకుస్థాపనలలోకావచ్చు, నూతనగృహ ప్రవేశాలలోకావచ్చు, అన్నిశుభకార్యాలలో, పండుగల్లో పూజానంతరం కొబ్బరికాయకొట్టాడం హిందువుల ముఖ్యాచారం. ఇది శాంతికారకమని వారినమ్మకం. టెంకాయకొట్టేటప్పుడు ముందుగా కాయను బాగాకడిగి జుట్టుపైకుండేటట్టు పట్టుకొని దేవునిప్రార్థించి, తర్వాత జుట్టువెనక్కు త్రిప్పుకొని, ఆగ్నేయదిశలో రాయినుంచుకొని, 8,9 అడుగుల ఎత్తుకు టెంకాయనెత్తి కొట్టాలని అర్చకస్వాములు చెబుతారు. టెంకాయపగిలి నీరుబయటికి వస్తున్నప్పుడు ఆనీటితో వెంటనే అభిషేకం చేయకుండా, నీటిని వేరొకపాత్రలోనికి పట్టుకొని, రెండిచిప్పలు విడదీసి, దేవునిముందుంచి, తర్వాత పాత్రలోని టెంకాయనీళ్ళతో అభిషేకంచేయవచ్చు, లేదా ఆనేటినే తీర్థంగా స్వీకరించవచ్చు. టెంకాయ ఎలాపగిలినా దోషంలేదు. కొట్టిన తర్వాత  జుట్టును తీసేయాలి. కొబ్బరికి కుంకుమ పసుపు పూయరాదు. కొబ్బరిని తీసి చిన్నచిన్నముక్కలుగాతరిగి అందులో అటుకులు చెక్కెర లేక కలకండపొడి కలిపి ప్రసాదంగా స్వీకరించడం శ్రేయస్కరం. కొబ్బరికాయకొట్టినతర్వాత అదిక్రుళ్ళినదని తెలిస్తే, చింతింతవలసిన పనిలేదు. అంతటితో దోషాలన్నీ పోయినవని భావించాలి. అలా అనుకోలేని పక్షంలో "సర్వంసర్వేశ్వరార్పితమ్" అనిగానీ లేక "శివాయనమః" అనిగానీ నూటాయెనిమిదిసార్లు జపిస్తే సరిపోతుంది. క్రొత్తదంపతులు కొట్టిన టెంకాయలో పువ్వువస్తే త్వరలో సంతానప్రాప్తి కలుగుతుంది. టెంకాయ నిలువుకు పగిలితే కూతురికిగానీ కుమారునికిగానీ సంతానం త్వారలో కలుగుతుందని సూచనగా తెలుసుకోవాలి. ఆలయంలో కొట్టిన టెంకాయ కుళ్ళితే, దాన్నిపారవైచి, కాళ్ళుచేతులు శుభ్రంగా కడుక్కొని మళ్ళీపూజచేసి టెంకాయకొట్టవచ్చును. అందువల్ల తొలిటెంకాయతో దోషంతొలగి, మలిటెంకాయతో శుభములు కలుగుతాయని పూజారులు చెబుతారు. క్రొత్తవాహనాలకు పూజచేసి కొట్టిన టెంకాయ క్రుళ్ళితే దృష్టిదోషం నివారణ జరిగిందని తలంచాలి. అవసరమనిపిస్తే మరోటెంకాయకొట్టుకోవచ్చు. లేకుంటేలేదు. పెళ్ళిపందిరిగుంజలకు కొబ్బరాకుమట్టలుకట్టి శోభను పెంచుకోవచ్చు. కొందరు శవయాత్రకేర్పరచిన పాడెపైకూడా కొబ్బరాకుమట్టనుంచి తీసుకెళతారు. శవాలకు, సమాధులకు సైతం టెంకాయకొట్టి నమస్కరించడం పరిపాటి. కలశంపైకూడా కొబ్బరికాయనుంచి అది గణపతిగా భావించి పూజిస్తాము. కొబ్బరికాయను స్త్రీలు కొట్టకూడదంటారు. కొడితే ఆస్త్రీసంతానానికి హానికలుగుతుందని భావిస్తారు. ఇది కేవలం అపోహకావచ్చు. కొన్నిదేవాలయాల్లో కొట్టిన టెంకాయ‍అర్థభాగాలు హోటళ్ళలో చట్నీకివెళితుంది. ఇంకాయెక్కువైతే నూనెతయారీకి వెళుతుంది. ఇదికూడా ఒకరకంగా సద్వినియోగమే అవుతుంది. ఎక్కువై పారవేయడం మంచిదికాదుగదా? కొందరుకోరుకొన్న కోరికలునెరవేరి, గుడిలో నూరుటెంకాయలు కొడతారు. అలాచేయడం కేవలం వారిమ్రొక్కుకావచ్చు. అంతేగానీ అదేంశాస్త్రం కాదు. కలలో కొబ్బరికాయ కనబడినా శుభదాయకమేనంటారు.

 కొబ్బరికాయ దైవప్రసన్నత కొఱకేగాక దోషనివారణకు, దరిద్రనివారణకు కూడా ఉపయోగపడుతుందంటారు. శుక్రవారం ఎఱ్ఱనిదుస్తులు ధరించి లక్ష్మీపూజచేసి, టెంకాయకొట్టి, మరుదినం కొబ్బరిచిప్పలను ఎఱ్ఱటివస్త్రంలో చుట్టి బయటివారికి కనబడకుండా ఇంట్లో దాచివుంచితే, ఆర్థికకష్టాలు తొలగిపోతాయి. శనివారం దేవాలయంలో కొట్టిన కొబ్బరిచిప్పలను నదికిసమర్పిస్తే శనిదోషం పోతుంది. ఎండుకొబ్బరిరౌండ్‍ను రెండుగకోసి అందులో చెక్కెరనింపి ఇంట్లో దాచితే రాహు కేతుదోషాలు తొలగిపోతాయి. మంగళవారం కొబ్బరికాయ, నల్లనువ్వులు, ఉద్దిపప్పు, ఒకగోరు కలిపి నల్లగుడ్డలో చుట్టి నదిలో విడిచిపెడితే సర్పదోషనివారణమౌతుంది. లక్ష్మీనారయణులను పూజించి కొబ్బరికాయ తెల్లటితీపిపదార్తం పసుపుగుడ్డలో మూటగట్టి వ్యాపారస్థలంలో వుంచుకుంటే, నష్టాలురావు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. కొబ్బరికాయను తలనుండి పాదముల వరకు పదకొండుసార్లు దిగదుడిచి, దానిని నిర్జనప్రదేశంలో కాల్చివేస్తే, పిల్లలలో కంటిచూపుదోషాలు తొలగిపోతాయి. టెంకాయను ఇరవైఒక్కసార్లు తలనుండి పాదములవరకు దిగదుదిచి ఆలయఆవరణలో కాల్చివేస్తే, అనారోగ్యసమస్యలు తొలగిపోతాయి. ఇలా ఐదు మంగళ,శనివారాలు చేస్తే ఆర్థికసమస్యలుకూడా తొలగిపోతాయి. ఎఱ్ఱనివస్త్రంలో టెంకాయనుచుట్టి ఏడుసార్లు వ్యక్తి పైనుండిక్రిందకుత్రిప్పి హనుమంతుని పాదాలచెంతవుంచితే యితరుల చెడుదృష్టిదోషం తొలగిపోతుంది. ఇంట్లో కొబ్బరిచెట్టునాటితే ఉద్యోగవ్యాపారాల్లో విజయంలభిస్తుంది. గురుగ్రహం అనుకూలించి అనుకున్నపనులు నెరవేరుతాయి. చెట్టును ఇంటికి దక్షిణంలేదా పడమరదిశలో నాటడం మంచిది. చట్టపరమైన కేసులు అనుకూలించి దరిద్రంవదలిపోవాలంటే, కృష్ణ శుక్లపక్షాలు రెండింటిలో అష్టమినాడు కాలభైరవునికి కొబ్బరిదీపం వెలిగించాలి. దీనితో ఏలినాటిశని ప్రభావంకూడా తొలగిపోతుంది. ఐదు గురువారాలు వినాయకునిగుడిలో స్వామికెదురుగా టెంకాయకొట్టి, రెండుచిప్పలలో “X” ఆకారంలో ఒక్కొక్కచిప్పలో నాలుగు వత్తులువేసి వెలిగించాలి. కోరినకోరికలు నెరవేరుతాయి. కొబ్బరిదీపాలలో వత్తులు వెలగడానికి నెయ్యినిమాత్రమే వాడాలి. శివునిగుడి ద్వజస్తంభంవద్ద, అమావాస్యసాయంత్రం ఆవునేతితో కొబ్బరిదీపాలు వెలిగిస్తే విపరీతంగా బాధిస్తున్న కష్టాలు తొలగిపోతాయి. ఈవిషయంలో మనిషికి ఎన్ని సంవత్సరాల వయస్సుంటే అన్ని దీపాలువెలిగిస్తే మంచిది.

 కొబ్బరిచెట్లవలన కేవలం నమ్మకంతోనేవున్న ప్రయోజనాలేగాకుండా మనకళ్ళయెదుటే కనిపించే ప్రయోజనాలెన్నోవున్నాయి. కొబ్బరి‍ఆకుతో బుట్టలల్లుకుంటారు. కొబ్బరిపీచుతో దృడమైన తాళ్ళు తయారౌతాయి. చలువకోసం సోఫాలలో కొబ్బరిపీచును వాడుతారు. కేరళలో కొబ్బరినూనెను వంటల్లో వాడుకుంటారు. కొబ్బరినూనెను మేలైన సబ్బులతయారీలో వాడతారు. ఉప్పునీటిస్నానానికిసైతం యీసబ్బులు బాగాపనిచేస్తాయి. తలనూనెగా కొబ్బరినూనె వాడకం అందరికీతెలిసిందే. కొబ్బరితురుముపొడి కూరలలో రుచి చిక్కదనం రావడానికి వాడతారు. పచ్చికొబ్బరిచట్నీ తెలియనివారుండరు.

 కొబ్బరికి ఔషదగుణాలుకూడా ఎక్కువే. కొబ్బరిబోండానీళ్ళు నిస్సత్తువను పోగొడతాయి. ఈనీళ్ళలో గ్లూకోస్, పొటాషియం, సోడియం, వుంటాయి. ఎలక్టోలిటిన్ వుండటంవలన జలోదరంలాంటి జబ్బులలో మూత్రం సజావుగా జారీయై ఉపశమనంకలుగుతుంది. కలరా నీళ్ళవిరేచనలలో కొబ్బరినీరు ప్రాణప్రదాయినిగా పనిచేస్తాయి. శరీరంలో నీటిశాతాన్నిపెంచి రక్షిస్తాయి. పైత్యప్రకోపాన్ని తగ్గిస్తాయి. శరీరంలోని విషపదార్తాలను బయటకు నెట్టివేస్తాయి. ప్రేగులను శుభ్రపరచి విషరహితంగావిస్తాయి.                       

ఉష్ణప్రాంతాల వారికి కొబ్బరినీరు అమృతంవంటిది.  సూర్యతాపం తగ్గించి చలువచేసి శరీరఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. కొబ్బరిని పేస్టుగాచేచి రాస్తే గాయాలు మానిపోతాయి. కొబ్బరినూనె రెండు మూడు చంచాలు రాత్రిపడుకొనేప్పుడు తాగితే మలబద్దకం నివారణమౌతుంది. థైరాయిడు మస్యలు రావు. పైత్యరసాన్ని నియంత్రిస్తుంది. ఆహారం బాగాజీర్ణమౌతుంది. పొడిదగ్గు రొమ్మునొప్పికూడా తగ్గిపోతుంది. కాయముదిరితే లోపల పువ్వువస్తుంది. ఆపువ్వుజూస్ గర్భాశయానికి బలాన్నిస్తుంది. బాలింతల రక్తస్రావాన్ని అరికడుతుంది. కొబ్బరిరుబ్బి పాలుతీసుకోవచ్చు. ఈపాలలో సంతృప్త,అసంతృప్త ఆమ్లాలుంటాయి. ఎ,బి,సి,ఇ విటమిన్లు, లసిక్‍ఆసిడు, ఫాల్మటిక్,స్టరిక్,లినోలెయిక్‍ఆసిడులుంటాయి.రెట్లోప్లెవిన్, ఇనుము, క్యాల్సియమ్, భాస్వరం,పిండిపదార్తాలు, క్రొవ్వులు, ప్రొటీన్‍లు కూడా సమృద్ధిగవుంటాయి. ఇవన్నీ ఆరోగ్యప్రదాయినులే. కొబ్బరిపాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి. మూత్రపిండ సమస్యలకు యివి మంచిఔషదంగా పనిచేస్తాయి. పచ్చికొబ్బరిదంచి వృషణాలకు పట్టించి గట్టిగాగోచిపెట్టుకొని రాత్రిపడుకొని తెల్లారి తీసేస్తూ, కొద్దిరోజులు చేస్తే వృషణాలవాపు బుడ్డ,వరిబీజము నయమౌతాయి. నూనెలో లారిక్‍ఆసిడు వుండటంవల్ల వంటలో  వాడుకొనేవారి గుండెకు మేలిచేస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. నూనెలో "ఇ" విటమిన్‍కూడ వుండటంవల్ల, చర్మానికి రుద్దుకుంటే చర్మంకోమలంగా మారుతుంది. రాత్రిపడుకొనేముందు అరికాళ్ళకు అరిచేతులకు నూనె రుద్దుకుంటే నిద్రబాగా పడుతుంది. కొబ్బరిపాలు చర్మానికి పట్టిస్తే, మృతకణాలు మురికి తొలిగిపోయి శరీరం కాంతివంతమౌతుంది. ఈపాలు తలకుపట్టించుకొని స్నానంచేస్తే, వెంట్రుకలు మెరుస్తాయి. వెంట్రుకలు చిట్లకుండా కాపాడుతాయి. నూనె సూర్యరశ్మికి సన్‍బ్లాకర్‍గా పనిచేసి సూర్యకిరణతీవ్రతనుండి కాపాడుతుంది. నూనెలోని ఫాలిక్యులిటిన్ తామరవ్యాధిని అరికడుతుంది. ఆంటిబయోటిక్, ఆంటిఫంగల్ మందుగా పనిచేస్తుంది. కొబ్బరిపాలుగానీ, నూనెగానీ రాత్రిపూట ముఖానికి పట్టిస్తూవస్తే మొటిమలు తగ్గిపోతాయి. మళ్ళీమళ్ళీ ఎక్కువసార్లు ఎక్కువగా కాచిచల్లార్చిన కొబ్బరినూనె వంటలకు వాడటం మంచిదికాదని వైద్యులసలహా. కొబ్బరికున్న సుగుణాలు ఇన్నీఅన్నీ కావని, నక్షత్రాలను లెక్కపెట్టగలిగితే కొబ్బరి ప్రయోజనాలూ లెక్కపట్టవచ్చని ఫిలిప్పియన్స్ నానుడి వుండనేవుంది. అంటే లెక్కలేనన్ని సుగుణాలగని కొబ్బరి అనవచ్చు.                                         

 

 

 

 

 

Thursday, 22 December 2022

ముగ్గులు (రంగవల్లులు)

 

ముగ్గులు (రంగవల్లులు)



ఇంటిముందు ముగ్గులుపెట్టడం హైందవసాంప్రదాయంలో ఒకభాగం. ముగ్గులు పెట్టడమంటే భూమినలంకరించడమే.కంటికింపుగా అలంకరించిన భూమినిచూడటం వలన పీడలు తొలగిపోతాయి.దీర్ఘాయువు కలుగుతుందని హైందవవిశ్వాసం. ఇంటిగడపముందు రెండూడ్డగీతలుగీసి ముగ్గువేస్తే ఇంటిలోనికి దుష్టశక్తులు రావు. ఇంట్లోవున్న లక్షీదేవి బయటకువెళ్ళిపోదు. ముగ్గుకు నలువైపులా అదేముగ్గుపిండితో జంటగీతలువేసి ఇక శుభకార్యాలు నిరాటంకంగా జరుపుకోవచ్చు. ఆముగ్గుగీతలు రక్షగానిలుస్తాయి. నక్షత్రాకారంలో వేసేముగ్గు భూతప్రేతపిశాచాలను దూరంగా తరిమేస్తుంది. ముగ్గులోనిగీతలు యంత్రాలుగా పనిచేస్తాయి. కనుక వాటిని కాళ్ళతో త్రొక్కరాదు. ముగ్గుత్రొక్కకుండా వెళ్ళడానికి అనువుగా దారివదలి వేసుకోవాలి. యజ్ఞగుండాలచుట్టు జంటగీతలుగీసి ముగ్గులువేసి శుభకరం గావిస్తారు. త్రొక్కే ప్రమాదమున్నచోట దేవతలరూపాలనూ స్వస్తిక్ శ్రీ గుర్తులను ముగ్గుగా వేసుకోరాదు. దేవాలయాల్లో లక్ష్మీదేవి మహావిష్ణువుముందు ముగ్గులువేసే స్త్రీ నిత్యసుమంగళిగా వర్థిల్లుతుందని దేవీభాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.ఇంటిముందు ఇంటివెనుక తులసికోటకు ముందు వేసే గీతలముగ్గులు నకారాత్మకశక్తునను నిరోధించి దైవీయశక్తులను ఆకర్షిస్తాయి. ఇంటిముందు ముగ్గులేని ఇల్లు అశుభానికిగుర్తు. ఆ ఇంటిలో శ్రాద్ధకర్మలు జరిగుతున్నాయని భావించి పూర్వం యాచకులుకూడా ఆ ఇంటిముందుకు వచ్చేవారు కాదట.  

సంక్రాంతిపండుగ ముగ్గులకు ప్రసిద్ధి. నెలరోజులముందునుంచే ఇంటి ఇల్లాలు కల్లాపిజల్లి ముంగిళ్ళలో రకరకాలరంగులముగ్గులు వేస్తారు. పూర్వం ముగ్గుపిండిగా బియ్యంపిండి వాడేవారు. ఆ బియ్యంపిండి చీమలకు పిచ్చుకలవంటి చిన్నచిన్నపక్షులకు ఆహారంగా ఉపయోగపడేది.  తర్వాతికాలంలో తెల్లటిముగ్గురాళ్ళపిండిని సుద్దముక్కలను చాక్‌పీసులను వాడుచున్నారు. ప్రస్తుతం చిత్రాతిచిత్రంగా ముగ్గులువేయడానికి అనేకరకాలైన రంగులు మార్కెట్‌లో అభ్యమౌతున్నాయి. చుక్కలముగ్గులు గీతలముగ్గులు,నెమళ్ళు,చిలుకలు, పద్మాలవంటి బొమ్మలనుసైతం అందంగా రంగులతో  తీర్చిదిద్దితున్నారు. సంక్రాంతిముగ్గుల పోటీలను సైతం నిర్వహించి స్త్రీలలోని సృజనాత్మకతను ప్రొత్సహిస్తున్నారు. పూర్వమునుండి ప్రత్యేకంగా రథంముగ్గును సంక్రాంతి ఆఖరురోజున వేసేవారు. ఆ రథం ఒకయింటినుండి మరోయింటిని కలుపుకుంటూ వీధిలోని అన్నియిండ్లకూ వ్యాపించేది. అవి యిప్పుడు రంగులమయమై అందంగా కన్నులకింపుగ వుంటున్నాయి. ముగ్గులకు ప్రత్యేకంగా పుస్తకాలే వచ్చేసాయి. వార్తాపత్రికల్లోనూ క్రొత్తక్రొత్త ముగ్గులు పోటీపడి ముద్రిస్తున్నారు. ముగ్గులపై వ్యంగచిత్రాలుకూడా హాస్యస్పోరకంగా పత్రికలలో దర్శమిస్తున్నాయి. సంవత్సరాదిన అదేపనిగా శుభాకాంక్షలు   తెలిపేముగ్గులువేసి ఇంటిముదుకువచ్చే వారిని  సంతోషపెడుతున్నారు. దీపావళికైతే రంగుముగ్గులలో దీపాలుంచి మరీ శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. ఈముగ్గులువేయడానికి మహిళలు తెల్లవారుజాముననేలేచి నడుమువంచి ముగ్గులువేస్తారు. తద్వారా  త్వరగానిద్రలేచే మంచియలవాటు అలవడుతుంది. అంతేగాక తేలికపాటి వ్యాయామంకూడా చేసినటౌతుంది. ఈవిధంగా ముగ్గులు ఆరోగ్యదాయినిలౌతున్నాయి.

ముగ్గులువేయడం తెలుగురాష్ట్రాలకే పరిమితంకాలేదు. దేశవిదేశాలలో కూడా ఈసంస్కృతి వర్ధిలుతున్నది. ఈముగ్గులువేయటాన్ని కర్ణాటకలో "హేసే" యని "రౌంగోలి" యని పిలుస్తారు. మహారాష్ట్రాలో "రంగోలీ" అంటారు. తమిళనాడులో "పుల్లికోలం" అంటారు. మిథాలీప్రాంతంలో "అరిపన్" అంటారు. ఇంకా కేరళ, గోవా ప్రాంతాల్లోకూడా రంగవల్లులు తీర్చిదిద్దే ఆచారమున్నది. ఇతర ఆసియాదేశాలయిన శ్రీలంక, ఇండోనేషియా థాయిల్యాండ్, మలేషియాలలోకూడా ముగ్గులు దర్శనమిస్తాయి. మనభారతదేశంలో ఉత్తరాదిన ప్రకృతిలోని అందమైన జంతువులు, పక్షులు, చెట్లు రంగవల్లులలో కనిపిస్తాయి. అదే దక్షిణాదిన వృత్తాలు, చుక్కలు, సరళరేఖలు ఎక్కువగా ముగ్గులలో కనబడతాయి.

 ఇవీ మనముగ్గుల ముచ్చట్లు.

 


 


 

Tuesday, 20 December 2022

కలశం

 


కలశం

 


కలశం హిందువులకొక శుభచిహ్నం. ఆంధ్రప్రదేశ్ చిహ్నం కూడా కలశమే. రాగి వెండి లేక మట్టికుండను కలశంగావాడుతారు. కలశం ఒకపూజావస్తువు. అది దేవతల ఆవాసం.

 కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః |

మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః | |

కుక్షౌతు సాగరా స్సర్వే సప్త ద్వీపా వసుంధరా |

ఋగ్వేదో థ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః | |

 అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః |

ఆయాంతు దేవ పూజార్థం సకల దురిత క్షయ కారకాః | |

 అనగా కలశముఖంలో విష్ణువు కంఠభాగంలో శివుడు, మూలంలో బ్రహ్మ, మధ్యభాగంలో మాతృగణాలు ఆశీనమై యున్న్రు. కలశంలోని జలాల్లో సముద్రాలు.  సప్తద్వీపసహిత భూమి, చతుర్వేదాలు, వేదాంగాలతోసహా సమస్తదేవాతాగణాలు ఆసీనులై వున్నారు. సకలపాపాలనూ నిర్మూలించడానికి సిద్ధంగావున్నారని భావనచేసి పూజకుపక్రమిస్తారు. ఋగ్వేదంప్రకారం సమృద్ధి మరియు జీవితమూలాన్ని సూచిస్తుంది కలశం.

 కలశంలో శుద్ధజలంపోసి చుట్టూ మామిడాకులు లేక తమలపాకులూ పెట్టాలి. ఆకులతొడిమలు కలశంలోని నీటిని తాకుతూ వుండాలి. అందువల్ల ఆకులు వాడిపోవు. కలశజలాలలో అక్షింతలు పుష్పాలు నాణాలు వుంటే రత్నాలు బంగారు నగలూ వేయవచ్చు. తర్వాత పైన కొబ్బరికాయనుంచాలి.కొబ్బరికాయపై ఎఱ్ఱటి క్రొత్తరవికగుడ్డను పొట్లంవలెచుట్టి టోపీగా వుంచాలి. కలశానికి దారాలుకూడా కొందరు చుట్టుకుంటారు. కలశానికి గంధం పసుపుకుంకుమలు పూలమాల

 ధరింపజేసి  పీటపై బియ్యం పరచి బియ్యంపై కలశాన్ని స్థాపిస్తారు. కలశం లోహమునదైనా మట్టిదైనా అదిభూతత్త్వానికి సంకేతం. అందులోనినీరు జలతత్త్వానికి సంకేతం. నీటికీ కొబ్బరికాయకూ మధ్యనున్న ఖాళీస్థలం ఆకాశతత్త్వానికి సంకేతం. చదివే మంత్రం వాయుజనితం. అది వాయుతత్త్వానికి ప్రతీక. కలశంముందు వెలిగించే దీపం  అగ్నితత్త్వానికి ప్రతీక. అందువలన కలశపూజ పంచభూతములకూ ఒకేసారి చేసే పూజగా భావిస్తారు.

 మరోవిశేషమేమంటే కలశం చేతులలోధరించి వేదమంత్రాలు పఠిస్తూ స్వాములకూ పెద్దవారికి స్వాగతంపలుకుతారు. వేదికవరకు వారి ముందునడుస్తారు. అలాచేస్తే వారిని గొప్పగా గౌరవించినట్లౌతుంది.

 మానవజీవితం నీటిఘటమంటారు. అందుకే కలశాన్ని మానవజీవితంతో పోలుస్తారు. ఆకులు ప్రకృతికి ప్రతీక. కొబ్బరికాయ సమస్తవిశ్వానికి మరోరూపం. కలశానికి చుట్టినదారాలు ప్రేమతో ఏర్పడ్డ  సత్సంబంధాలు. అందుకే వ్రత, పర్వ, గృహప్రవేశాదిశుభసందర్భాలలో కలశపూజచేస్తారు. ముఖ్యంగా శ్రావణమాసం పున్నమికిముందువచ్చే శుక్రవారం లక్ష్మీపూజలో కలశపూజచేయడం ఆనవాయితీ. అట్లని వేరేరోజులలో చేయరాదనికాదు. గురు శుక్రవారాలలో జరుపుకోవచ్చు. శ్రావణమాసంలోచేసే కలశసహిత లక్ష్మీపూజ అధికఫలదాయకమని చెబుతారు. ఈదినాలలో లక్ష్మీదేవిని

 ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ:

ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ:

  అనే మంత్రాలతో పూజిస్తే లక్ష్మీకటాక్షం మిక్కుటంగాకలిగి శుభాలుచేకూరుతాయని నమ్ముతారు.

 శ్రీహరి క్షీరసముద్రంలో శేషశాయియై ఉంటాడు. ఆయననాభికమలమునుండి బ్రహ్మజనించి సృష్టిప్రారంభిస్తాడు. అప్పుడున్నది కేవలం జలంమ్మాత్రమే. ఆ జలంతో సమానం కలశజలమని విశ్వసిస్తారు. అంటే సృష్ట్యాదిననున్న మహత్తరప్రశాంతస్థితి కలశపూజవల్ల కలుగుతుందని పురోహితభావన. సురాసురుల సముద్రమథనంలో అంతిమంగా ధన్వంతరి అమృతకలశంతో ఉద్భవిస్తాడు. ఆ అమృతకలశమే మనం స్థాపించుకున్న యీకలశమని భావిస్తే "యద్భావం తద్భవతి" అన్న సూత్రానుసారం కలశజలం తీర్థంగాసేవించడంవల్ల మనకూ అమృతత్వం సిద్ధిస్తుంది. అనగా దీర్ఘాయువు సంప్రాప్తమౌతుంది.

 కలశపూజానంతరం వచ్చే శనివారంనాడు కలశజలాన్ని తీత్థంగాసేవించి మిగిలినజలాన్నీ యితర పూజావస్తువులైన పూలు పసుపుకుంకుమలు అక్షతలు పారేనదీజలాలలో నిమజ్జనంచేయాలి. కొబ్బరికాయను దానంగాయివ్వచ్చు. లేదా కొబ్బరిని ప్రసాదంగా స్వీకరించవచ్చు.   నదిలో నిమజ్జనమైనా చేయవచ్చు.

ఈదీ కలశ ప్రాశస్త్యం

 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...