Friday, 31 May 2024

వింజామరం

 

వింజామరం



వింజామరం లేక చామరం, చామరమృగం (జడలబర్రె) తోకవెంట్రుకలతో తయారుచేయబడిన వీవన (విసనకర్ర) ఈ వెంట్రుకలు చాలా మృదువైమవి. వింజామరాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. వింజామరతో భగవద్భక్తులు, భగవంతునిసేవగా వీస్తారు. భగవంతునికేమిటి ఉక్కబెట్టడమేమిటి అందుకు వింజమరతో వీయడమేమిటి అనుకోవచ్చు. కానీ ఆసేవచేస్తూ మనిషి హృదయంలో ఒకపవిత్రభావన కలిగివుంటాడు. మిగిలిన ప్రాపంచిక విషాయలను ఆవింజామరసేవ చేస్తున్నంతకాలం మరచివుంటాడు. అది మనిషికి ప్రశాంతతనిచ్చే నిజమైన మేలు. గొప్ప ప్రయోజనము. ఈవింజామరసేవ ముఖ్యంగా జగద్గురువైన శ్రీకృష్ణపరమాత్మ పూజలో చేస్తూవుంటారు. రాధ, గోపికలు యీసేవ ద్వాపర యుగంలో కృష్ణపరమాత్మకుచేసి ఆయన అనుగ్రహానికి పాత్రులయ్యారని నమ్ముతారు. సిక్కుమతస్తులుగూడా వారిగ్రంథసాహెబ్ (పవిత్ర గ్రంథం) కు యీవింజామరసేవ భక్తితో చేస్తారు. ముఖ్యంగా హిందువులు ఓజత వింజామరలను ఇంట్లో వుంచుకొనివారి ఇలవేల్పుకు యీ విజామరసేవ సేసుకుంటారు.  ఇంట్లో వింజామరముంటే నకారత్మకశక్తులు నశించి శుభకర సకారాత్మక శక్తులు ప్రవేశిస్తాయివింజామర వీచడంద్వార వచ్చిన గాలితో ఇల్లునిండిఇల్లు, పరిసరప్రాంతలు పవిత్రతను సంతరించుకుంటాయని హిందువుల విశ్వాసం. తద్వార ఇంట్లోనివారు క్షేమంగా వుంటారని బలంగా నమ్ముతారు. చామరాలు తెల్లనివిగోదుమరంగువినల్లనివికూడా లభిస్తాయి. తెల్లనివి భగవంతుని సేవకు ఉపయోగిస్తారు. అవిశ్రేష్టం. వింజామరపిడిని సామాన్యంగా వెండితో చేస్తారు. సంపన్నులు బంగారంతో చేయించుకుంటారు. ధరతగ్గడంకోసం ఇత్తడి స్టీల్‍తోనూ చేస్తారు. వింజమరలను సింహాలజూలుతోకుడా చేస్తారని వినికిడి. ఉండొచ్చుగానీ సింహలసంఖ్య బహుతక్కువ కనుక సింహపుజూలు వింజామరలు  అరుదు. అసలు జడలబర్రెవింజామరలే దొరకడం కష్టమై సింథటిక్‍విజామరలను చేసి మోసగిస్తున్నారని వింటున్నాము. కనుక కొంత ధరయెక్కువైనా అసలైన వింజామరలు తెలిసినవారి సహయంతో కొనడం మంచిది. వింజామరలను అవసరమైనప్పుడుకుంకుడుకాయసబ్బుషాంపూల నుపయోగించి మంచినీటితో శుభ్రంచేసుకొని చెక్కదువ్వెన లేక బ్రష్‍తో చిక్కుదీసి దైవకైంకర్యాదిశుభకార్యాలలో ఉపయోగించుకోవచ్చును.

  లలితాసహస్రనామావళిలో "సచామర రమా వాణి / సవ్యదక్షిణ సేవితా" అనివుంది. అంటే లలితదేవిని లక్ష్మీసరస్వతులు కుడియెడమల నిలబడి వింజామరలతో విసరుతూ సేవించారనివున్నది. దీన్నిబట్టి వింజామర ప్రముఖ్యం తరతరాలుగా సాగుచున్నదని అర్థమౌతున్నది. అంతేగాక పంచభూతసేవ అన్నదొకటున్నది. అందులోని పంచభూతాలకు ప్రతీకలుగా, 1. చందనం. ఇది భూమికి ప్రతీక. 2. గంట. ఇది ఆకాశ ప్రతీక. 3. దీపారధన. ఇది అగ్నికి ప్రతీక.  4 . తీర్థప్రసాదాలు. ఇవి జలతత్వానికి ప్రతీక ఇక ఐదవది చామరసేవ. ఇది వాయుతత్వానికి ప్రతీక. పవిత్రపంచభూత సేవలో కూడా వింజామరముండటమొక విశేషం. ఇంకా చెప్పాలంటే పూర్వం రాజులు, ఘనతవహించిన స్వామీజీలకు , రాజులకు, రాజ్యానికిఅనేకవిధాలుగా సహాయపడే కొంతమంది ప్రముఖులకు రాజలంఛనాలు, రాజులు తామనుభవిస్తూ వీరికిగూడా అధికారికంగ సమకూర్చేవారు. ఆరాజలాంఛనాలు యేవంటే, మకుటం (కిరీటం), రాజదండం, బంగరుపిడిగల్గిన తెల్లనిగొడుగు, వీటితోపాటు చామరం కూడా వుండేది. అంటే చామరం గలిగియుండి, దానితో సేవింప జేసుకోవడం గొప్పదనానికి గురుతన్నమాట. మామూలుగా దేవాలయలలో యీ చామరసేవ పురుషులు చేస్తారు. వీరిని చమరగ్రాహి, చామరికః, చామరగ్రాహః అని పిలుస్తారు. రాజులు మొదలైనవారి గౌరవార్థం స్తీలు (పరిచారికలు) యీసేవచేస్తారు. వీరిని చమర గ్రాహిణులంటారు.   

 


    వింజామరలు జడలబర్రె రోమాలతో తయారౌతాయన్నాముగదా! ఆ జడలబర్రెనుగూర్చికూడా కొంతతెలుసుకుందాం. దీన్ని ఆంగ్లంలో యాక్ (Yak) అంటారు. ఇవి దక్షిణాసియా, హిమాలయాప్రాంతాలు, టిబెట్ నుండి మంగోలియా వరకువున్న ప్రాంతాలలో పెంపుడు జంతువులుగా పెరుగుతున్నాయి. కొండప్రాంతాలలో కూడా ఇవి స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. వీటిని పాలిచ్చుజంతువులుగా పెంచుకుంటారు. వెంట్రుకలతో వింజామరలు, వస్త్రాలు, ముతకరగ్గులు చేస్తారు. వీటిని బరువులుమోసేందుకు కూడా ఉపయోగిస్తారు. రైతుల ధాన్యన్ని పండ్లు కాయలు, వ్యాపారుల వివిధ వస్తువులను మోస్తూ మంచుకొండల యెత్తులను సులభంగా దాటిదూరప్రాంతాలకు ప్రయాణిస్తాయి. ఇవి కేవలం గడ్డిమాత్రమే మేస్తాయి. రైతుల ధాన్యాలు, పండ్లు ఫలాలు తినవు గనుక రైతులకు నష్టం కలిగించవు. కొన్నిజాతులవారు వీటిని మంసంకోసం కూడా పెంచుకుంటారు. టిబెటియన్‍లకు ఇది ఒకమంచి పాడియావు వంటిది. దీనివెన్నతో చిన్నచిన్న బొమ్మలుచేసి ఉత్సవాలలో పూజిస్తారు. ఈవెన్నతో దీపాలువెలిగించుకొని దైవారధన చేస్తారు. టిబెట్లో దీనివెన్నతో బటర్‍టీ చేసుకొని ఇష్టంగా సేవిస్తారు. జున్నుతో ఛుర్ఫీ అనే పదార్తం చేసుకొని మక్కువతోతింటారు. జడలబర్రెచర్మంతో గుఱ్ఱాల తలపై అలంకరించే తలాటాలు చేస్తారు. వీటి చర్మపుదుస్తులు చలికిబాగ తట్టుకుంటాయి. వెంట్రుకలతో నేసే ముతకవస్త్రాలు చలికితట్టుకోవడానికి డేరాలపైకప్పుగా వాడుకుంటారు. జడలబర్రెవెంట్రుకలు తీసివేసిన కొద్దికాలానికే మళ్ళీ యెపుగా పెరుగుతాయి. మంచుకొండల్లో చెట్లుపెరగవు గనుక జడలబర్రెపేడ పిడకలను అక్కడివారు వంటచెరకుగా వాడుకుంటారు. టిబెట్‍ కారకోరం ప్రాంతంలోను, మధ్యాసియా, పాకిస్తాన్‍లలో యాక్‍స్కీయిగ్, యాక్‍పోలో వంటిక్రీడల్లో జడలబర్రెలను వాడుకొని పోటీలు నడుపుతారు. ఆడజడలబర్రెను నాగ్‍అని మగజడలబర్రెను యాగ్‍అని టిబెట్‍లో పిలుస్తారు. ఇవి చాలావరకు మౌనంగావుండే సాధుజంతువులు. అటవీచమరమృగాల సంఖ్య తగ్గిపోతుండడంతో వాటి పరిరక్షణకోసం టిబెట్‍లో ఒకప్రాజక్టును కూడచేపట్టారు.  ఇదీ వింజామరల వృత్తాంతం.      

 

 

Monday, 3 July 2023

రాగిపాత్రలోనీరు

 

రాగిపాత్రలోనీరు


రాగిపాత్రలోని నీరుత్రాగడం, పూజగదిలో రాగిచెంబులో నీరు వుంచడం మంచిదంటారు. బజారులో కూడా రకరకాలైన రాగిపాత్రలు లభ్యమౌతున్నాయి.  ఇంతకూ తామ్రకలశజలం యొక్క ఉపయోగాలేమిటో తెలుసికుందాం. వాస్తుప్రకారం గృహనిర్మాణం, ఎంత ముఖ్యమో, పూజగదిలో రాగికలశంలో నీరువుంచడం కూడా అంతే ముఖ్యమని వాస్తుశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. దేవునిఎదుట రాగికలశంలో పరిశుద్ధజలం వుంచడంవలన సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయనీ, అన్నిపనుల్లో సానుకూలత సమకూరుతుందనీ, ప్రతికూల శక్తులు తొలగిపోతాయని విబుధులు చెబుతున్నారు. భక్తితోచేసిన పూజయొక్కశక్తి యీ కలశంలోని నీటిలో నిక్షిప్తంకాబడి వుంటుంది. ఆనీటిని తీర్థంగా స్వీకరిస్తే భగవదనుగ్రహం లభిస్తుందని హిందువుల ప్రగాడవిశ్వాసం.

 

 దేవతలకు జలం ఇష్టమ్మైన ఆవాసస్థలం. కనుక రాగిపాత్రలోని నీటిలో దేవతలుంటారు. అందుకే పూజగదిని శుభ్రంచేయడానికి, విగ్రహాలను శుద్ధిచేయడానికి కూడా రాగిపాత్రలోని నీటిని వాడటం శ్రేయస్కరం. ప్రతిరోజు రాగిపాత్రలోని నీటిని మార్చుకోవాలి. ముందురోజు నీటిని తులసికోటలో పోయడం మంచిది.

 

రాగిపాత్రకు సంబంధించిన పురాణగాథ ఒకటున్నది. గుడాకేశుడనే రాక్షసుడు సత్వగుణసంపన్నుడు. అతడు హరినిగూర్చి 16 వేల సంవత్సరాలు తపస్సుచేసి, ప్రతిజన్మలోను తాను హరిభక్తుడుగనే వుండాలనీ, తుదకు హరిసుదర్శనచక్రముచేతనే మరణం సంప్రాప్తం కావాలనీ, అలా మరణించిన తర్వాత తనశరీరం రాగిలోహమైపోవాలనీ  వరాలుపొందాడు. వైశాఖశుద్ధద్వాదశి మట్టమధ్యాహ్నపువేళ హరి అతనికి కైవల్యమియ్యదలచి చక్రముతో శిరస్సును ఖండించాడు. వెంటనే అతనిమాంసం రాగిలోహంగా మరిపోయింది. ఎముకలు వెండిగా మరిపోయాయి. మలినాలు కంచుగా మారాయి. గుడాకేశుని మాంసం రాగిలోహమైనతర్వత, ఆరాగితోనే చేసిన పాత్రలో  ప్రసాదముంచి హరికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అప్పటినుండి హరికి రాగిపాత్రలోపెట్టిన నైవేద్యం,రాగిపాత్రలోని తీర్థం  ఇష్టమైనాయి. నైవేద్యంలో ఎన్ని మెతుకులుంటే అన్నివేలసంవత్సరాలు హరికి నైవేద్యం పెట్టినభక్తుడు వైకుంఠంలో నివసిస్తాడని హరి సెలవిచ్చాడు.
 
                 ఇక ఆరోగ్యపరంగా చూస్తే రాగిపాత్రలోని నీటిని సరైనపద్ధతిలో త్రాగాలని పొషకహారనిపుణులు కిరణ్‌కుక్రేజాగారు యివిధంగా తెలియజేశారు. రోజంతా యిదేనీరు త్రాగకూడదు. పడగడుపున యీనీళ్ళలో తేనే నిమ్మరసం కలిపి త్రాగరాదు. అలాత్రాగితే నిమ్మరసంలోని ఆసిడ్ రాగితో రియాక్ట్ ఔతుంది. నీరువిషతుల్యమై  కడుపునొప్పి, పైత్యవాంతులు కలగవచ్చు. అంతేగాదు రాగిపాత్రను ప్రతిరోజూ రుద్ది కడుగకూడదు. అలాచేస్తే రాగివలన మనకుకలిగే ప్రయోజనాలు తగ్గిపోతాయి. 15 రోజులకొకసారి ఉప్పు నిమ్మరసంతో శుభ్రంచేసుకుంటే సరిపోతుంది. రక్తస్రావ సమస్యలున్నవారు యీ రాగిపాత్రలోనినీరు త్రాగకూడదు. అలా త్రాగితే రక్తస్రావాలు పెరగవచ్చు. అంతేగాకుండా రాగిపాత్రలో అన్నం కూరలు వండుకొనరాదు. పాలు కాచుకొనరాదు. ఊరగాయలువంటి పదార్థములు రాగిపాత్రలలో నిలువచేయరాదు. ఇందువల్ల అవి విషపూరితమౌతాయి. ఈమెలకువలు పాటించి రాగిపాత్రలోనినీరు ప్రతిదినం ఉదయంత్రాగితే చలా ప్రయోజనాలున్నాయి. చలికాలంలో యీనీరు త్రాగడం మంచిదికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు కానీ, ఆయుర్వేద నిపుణురాలైన దీక్షాభావ్‌సర్ మాత్రం మంచిదేనంటున్నారు. చలికాలం ఉదయాన్నే ఒకగ్లాసు రాగిచెంబులోని నీళ్లుత్రాగితే, శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. హుషారుగావుంటారు. శక్తిసమకూరి, తొందరగా అలసిపోరని తెలియజేశారు. రాగిపాత్రలోని నీటిని ప్రతిరోజూ ఉదయం త్రాగడంవల్ల అధికబరువు నుండి విముక్తులౌతారు. జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. గుండెకు బలాన్నిస్తుంది. కీళ్ళనొప్పులు వాపులు తగ్గుతాయి. రక్తహీనత యేర్పడదు. గాయాలు తొందరగా మానిపోతాయి. కాలేయం మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. శరీరంలో పెరుకపోయిన చెడుక్రొవ్వు తొలగిపోతుంది. రక్తపోటు గుండెదడ అదుపులో వుంటుంది. చర్మరక్షణ సమకూరుతుంది. శరిరంలోని వ్యర్థపదార్తాలు బయటికి వెళ్ళిపోతాయి. వాత పిత్త కఫ (త్రి) దోషాలు, అంటువ్యాధులు నయమౌతాయని, రోగనిరోధకశక్తి పెంపొందుతుందని, వృద్ధాప్యం తొందరగారాదని, క్యాన్సర్‌ వ్రణములను మానుపుతుందని, థైరాయిద్ సమస్యలను నివారిస్తుందని కడుపులోని పుండ్లను మానుపుతుందని మెదడుకు చురుకుదనాన్నిస్తుందని ఎముకలకు ధృడత్వం లభిస్తుందని చిన్నతనంలోనే వెంట్రుకలు తెల్లబడడాన్ని నివారిస్తుందని ఆయుర్వేదవైద్యులు చెబుతున్నారు.
 

 రాత్రికి రాగిపాత్రలో నీరుపోసి ఉదయాన్నే పడగడుపున ఒకగ్లాసు ఆనీరు త్రాగడం సర్వదా శ్రేయస్కరం, ఆరోగ్యకరమని వైద్యులు చెబుతున్నారు. రాగికడియం చేతికిధరించడం కూడా ఆనవాయితీగ వస్తున్నది. ఇందువల్ల శరీరములోని అధికవేడి తగ్గుతుందని, రక్తపోటు అదుపులో వుంటుందని, చెడుక్రొవ్వు శరీరంలో చేరదని నమ్మి రాగికడియాలు ధరిస్తున్నారు. 


 

                       

Monday, 8 May 2023

మేడిచెట్టు (అత్తిచెట్టు)


 

మేడిచెట్టు (అత్తిచెట్టు)



మేడిచెట్టు మర్రిచెట్టును బోలియుండు పెద్దవృక్షం. ఈచెట్టు లో మేడి, బ్రహ్మమేడి (కాకి మేడి) అని రెండురకాలున్నాయి.  బ్రహ్మమేడి పండ్లు తినరు. అత్తిపండ్లు తింటారు. మేడిపండుచూడ మేలిమైయుండును పొట్టవిచ్చిచూడ పురుగులుండుఅన్న వేమన పద్యమొకటున్నది. కనుక పురుగులు ఊదేసి తింటుంటారు. ఇప్పుడు  హైబ్రీడ్‌మేడిపండ్లు వస్తున్నాయి. వాటిలో పురుగులు వుండవు. పెద్దవిగానూ రుచిగానూ కూడా వుంటున్నాయి. ఎండిన మేడిపడ్లు కూడా తినడానికి బాగానే వుంటాయి, వీటిని మిఠాయిల్లోకూడా ఉపయోగిన్నారు. మేడిని అంజూరం, ఉదుంబర అనికూడా పిలుస్తారు.    

రాక్షసగురువైన శుక్రాచార్యులు మేడికధిపతి. మేడిచెట్టుమూలంలో దత్తాత్రేయుడు కొలువైవుంటాడు. కనుక మేడిక్రింద దీపారాధనచేసి ధ్యానంచేస్తే జ్ఞానము ప్రశాంత కలుగుతాయి. గురుబలం పెరుగుతుందని శాస్త్రం చెబుతున్నది. మేడివృక్షంచుట్టూ రోజుకు 11 చొప్పున 41 రోజులు పూజించి ప్రదక్షిణలు చేస్తే కోరికలుతీరి అదృష్టము ఆరోగ్యమూ యేకకాలంలో సిద్ధిస్తాయి. ప్రతిగురువారమూ, పున్నమిరోజుల్లోనూ మృగశిర, శ్రవణ, ఉత్తరాషాడ, జేష్ట నక్షత్రమున్నరోజులు  ప్రదక్షనలకు  అనుకూలమని పండితులు చెబుతున్నారు. ప్రదక్షణలుచేస్తున్న సమయంలో క్రిందతెలిపిన దత్తాత్రేయస్వామి శ్లోకాలను భక్తితో పఠించడం ఉత్తమోత్తమం. –

                     జటాధరం పాండురాంగం శూలహస్తం కృపానిధిమ్ ।

                    సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే.  

                      నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో|

                         సర్వ రోగ ప్రశమనం కురు శాంతిం ప్రయచమే||

 మేడిచెట్టు ఇంట్లో పెంచుకోవడం మంచిదే, కానీ ఇది మహావృక్షమై ఇంటిగోడలనూ, పునాదులనూ తనవేళ్ళతో పెగలించి నష్టపరచవచ్చు. అందుకే పెంచుకోవడంలేదు.

 మేడిచెట్టుకు నరసింహస్వామి వరముందని పౌరాణికులు తెలియజేస్తున్నారు. ప్రహ్లాదుని తండ్రియైన హిరణ్యకశిపుని నరసింహస్వామి తన వాడియైన గోర్లతో చీల్చిచంపాడు. అప్పుడు స్వామిచేతులకంటిన రక్తం కారణంగా విపరీతమైన జిలలు పుట్టాయి. లక్ష్మీదేవి అదిగమనించి మేడిఆకులు పండ్లరసం పట్టించి, జిలలను తగించింది. అప్పుడు మేడినిమెచ్చి నరసింహ స్వామి, మేడివృక్షమా! నీయందు నేను విరాజమానమైయుండి, నిన్ను భక్తితో పూజించినవారి విషబాధలు తొలగిస్తాను. కోరినకోరికలు నెరవేరుస్తాను. అంతేగాక నీనీడన చేసే యజ్ఞయాగాదులకు   అధికఫలం దక్కుతుందని వరమిచ్చాడు. మేడి చెట్టు సమిదలతో హోమంచేస్తే వివాహ సమస్యలు, వైవాహిక సంబం సమస్యలు ఉండవని శాస్త్రం

 చెబుతున్నది.  

 గురువారంగాని, ఆదివారంగాని మేడిచెట్టుకు నీళ్ళుపోసి, పసుపు కుంకుమలతో   పూజించి దత్తాత్రేయుని ప్రార్దించి, ఉత్తరదిక్కుకు ప్రాకిన వేరుకు పసుపుకుంకుమలు పట్టించి, నాకష్టాల నివృత్తికోసమే వేరు సేకరిస్తున్నానని చెట్టుకు విన్నవించి,  ఒక అంగుళంవేరు కత్తిరించి కళ్ళకద్దుకొని ఇంటికితెచ్చి దేవునిగూటిలోవుంచాలి. మరునాడు తిరిగీ చెట్టువద్దకువెళ్ళి పూజించి తిరిగివచ్చి, దేవునిగూటిలోనున్న మేడివేరును తాయెత్తులోవుంచి పూజచేసి మెడలో కట్టుకోవాలి. ఈతాయెత్తు మహిమాన్వితమై ధరించినవారి కష్టాలుతీరి శుభాలు సంప్రాప్తమౌతాయి.  .

 మేడిచెట్టు ఆయుర్వేదవైద్యంలోగూడా  ఉపయోగపడుతున్నది. మేడిపండ్లలో పీచుపదార్తముండి జీర్ణక్రియకు తోడ్పడుచున్నది. వీటిలో ఖనిజాలు, విటమినులు, క్యాల్సియం, ఇనుము ఉండటంవల్ల ఆరోగ్యపరిరక్షణ జరుగుచున్నది. కడుపులోమంట, ప్రేగులలోపూత అజీర్తిని నివారిస్తున్నవి. పొటాషియంకూడా ఈపండ్లలో వుండతంవల్ల గుండెకు బలం జేకూరుతున్నది. అధికబరువును తగ్గిస్తున్నది. భోజనానంతరం రెండుపండ్లు తింటే నోటిదుర్వాసన తగ్గిపోతుంది. ఎండుపండ్లు  తినడంవల్ల మలబద్ధకం తొలగిపోతుంది. బాగానిద్రపడుతుంది. అధికక్రొవ్వును తగ్గిస్తుంది. ఎలర్జి, దగ్గు, కఫం నివారణమౌతాయి. మేడిపండ్లను నీడలోఆరబెట్టి పొడిచేసి, పంచదారకలిపి సేవిస్తే రక్తహీనత, ముఖంపై మొటిమలు తొలగిపోతాయి. మేడి బెరడుకషాయంలో తేనెకలిపి రోజూ ఒక అరగ్లాసు ఉదయాన్నే త్రాగితే మధుమేహ (చెక్కెర)వ్యాధి అదుపులోనికి వస్తుంది. అరికాళ్ళమంటలు తగ్గుతాయి. తగ్గిన కంటిచూపు మెరుగౌతుంది. స్త్రీల కుసుమవ్యాధులు, గర్భస్రావాలు, నడుంనొప్పికి మంచిమందుగా పనిజేస్తుంది. హోమియోపతివైద్యంలో  Ficus  Recimosa  అన్నపేరుతో మందు దొరుకుతున్నది. ఇది స్త్రీల అనేక కుసుమవ్యాధులకు మంచిమందుగా పనిజేస్తున్నది.             

    

Saturday, 6 May 2023

రావిచెట్టు (ఆశ్వత్థవృక్షం)

 

రావిచెట్టు (ఆశ్వత్థవృక్షం)


 రావిచెట్టు మర్రిచెట్టు ఒకేజాతిజిచెందినవి. భారత్, నేపాల్, చైనా దేశాల్లో అధికంగా పెరుగుతుంది. ఇది పొడిప్రాంతాలైనా తడిప్రాంతాలైనా పెరుగుతుంది. 30  మీటర్ల వరకు పెరిగే పెద్దచెట్టు. ఆకుకొస మొనదేలిన తోకవలె వుంటుంది. ఈచెట్టును పిప్పల, ఆదిత్యా అనికూడా పిలుస్తారు.

 వినాయకస్వామిని "ఓం వినాయకాయ నమః ఆశ్వత్థ పత్రం పూజయామి" అని అర్చిస్తారు. భగవద్గీతలో కృష్ణపర్మాత్మ వృక్షాలలో నేను అశ్వత్థవృక్షాన్ని అని చెప్పారు. అందుకే రావిచెట్టు హిందువులకు పూజనీయమైంది. అశ్వత్థం దేవతలనివాసస్థానమని అధర్వణవేదం చెబుతున్నది. అంబరీషముని శాపంకారణంగా విష్ణువు రావిచెట్టుగా పుట్టాడని పద్మపురాణంలో వుంది. యజ్ఞయాగాదులలో అగ్నిపుట్టించడానికి జమ్మిమొద్దుపై రావి కొమ్మతో అటుఇటు  వేగంగా త్రిప్పడం చేస్తారు. రావిచెట్టును పూజించినవారికి పూర్వజన్మ కర్మలు తొలగిపోతాయి. రావిఆకులపై ప్రమిదలుంచి నువ్వులనూనె దీపాలు వెలిగిస్తే అనుకున్నపనులు దిగ్విజయంగా నెరవేరుతాయి. శనిగ్రహ సర్ప రాహుకేతు దోషాలే కాకుండా ఇతరగ్రహ దోషాలుకూడా తొలగిపోతాయి. ఈవిధమైన దీపారాధనలో ఆదివారం పుట్టినవారు 12 రావిఆకులపైన, సోమవారం బుధవారం పుట్టినవారు మూడురావిఆకులపైన మంగళవారం పుట్టినవారు రెండురావిఆకులపైన, గురువారం పుట్టినవారు ఐదురావిఆకులపైన, శుక్రవారం పుట్టినవారు ఆరురావిఆకులపైన, శనివారం పుట్టినవారు తొమ్మిది రావిఆకులపైన దీపాలు పెట్టాలని పూజారులు చెబుతున్నారు. ఆకుల చివరితోకలు పూజించేవారివైపు వుండాలంటారు. దీపాలకు నూనెబదులు నెయ్యివాడటం శ్రేష్టం. అందువల్ల ఆర్థిక ఇబ్బందులు శీఘ్రగతిన తొలగిపోతాయి. సంతానప్రాప్తికి 40 రోజులు రావిచెట్టుకు ప్రదక్షిణచేయాలన్నది ఆర్యోక్తి. రావిప్రదక్షిన చేయాలనుకొనేవారు ఉదయాన్నే నదీస్నానంచేసి కుంకుమబొట్టు పెట్టుకోవాలి. ప్రదక్షణ సమయంలో "మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపాయ అగ్రతో శివరూపాయ వృక్షరాజాయతే నమోనమః" అన్నశ్లోకాన్ని పఠిస్తూ ప్రతిప్రదక్షకొకసారి చెట్టును తగలకుండా  నమస్కరించాలి.

  బ్రహ్మాండపురాణంలో మరిన్ని విశేషాలున్నాయి. అశ్వత్థవృక్ష దక్షిణ, పశ్చిమ, ఉత్తరదిక్కు శాఖలలో త్రిమూతులు, తూర్పుదిక్కు శాఖలలో ఇంద్రదిదేవతలూ, సప్తసముద్రాలు, సమస్తపుణ్యనదులూ, వేర్లలో మహర్షులు, గోబ్రాహ్మణులు , నాలుగువేదాలు ఉన్నాయి. వృక్షాన్నాశ్రయించి ఆష్టవసువులు ఉంటారు. ఓంకారంలోని "" కారం మూలంలోనూ, ""కారం మానులోను, "" కారం పళ్ళలోను  ఉంటుందని బ్రహ్మండపురాణం చెబుతున్నది.    

  జాతకంలో శని రాహుకేతువుల దోషమున్నవారు చెట్టుచుట్టూ తొమ్మిది ప్రదక్షినలు చేయాలి. ముఖ్యంగా శనిదోషమున్నవారు శనివారం చెట్టును తాకి "ఓం కోణః పింగళోబభ్రుః కృష్ణో రౌద్రాంతకాయకో యమః శౌరీశ్శనై శ్చరో మదః పిప్పలదేవ సంస్థుతః" అని పఠిస్తూ తొమ్మిదిసార్లు ప్రదక్షిణచేయాలి. శనివారంతప్ప మిగిలినరోలలో రావిచెట్టును తాకరాదు. అట్లే చైత్ర, ఆషడ, పుష్యమాసాలలోను, గురు శుక్రమౌడ్యాలలోనూ, గ్రహణసమయాల్లోనూ, మైలపడిన సమయాల్లోనూ, రాత్రిభోజనానంతరమూ ప్రదక్షిణలు చేయరాదు. మొదలుపెట్టేటప్పుడు కృష్ణపక్షమై వుండకూడదు.

 

 ఉపనయన సమయాల్లో రావికొమ్మకుపూజ తప్పనిసరి. వివాహ సమయాల్లో వరుడు రాగిమండ భుజంపై ధరించి కాశీయాత్రకు బయలుదేరడమూ,అతన్ని వధువుపక్షంవారు బ్రతిమాలి పిలుచకవచ్చి వివాహంజరిపించడమూ ఒక ఆనవాయితీ. యజ్ఞంలో రావికట్టెలు సమిధలుగా వాడితీరాలి.

 

 గురువారం అమావాస్య కలిసివచ్చిన రోజున రావిక్రింద వేదవిప్రునికి భోజనంపెడితే కోటిమంది బ్రహ్మణులకు సమారాధన చేసినపుణ్యఫలం దక్కుతుంది. అంతేగాకుండా ఇటువంటి దినమే రావిచెట్టుక్రింద పుణ్యస్నానమాచరిస్తే, పాపాలన్నీ తొలగిపోతాయి. రావిచెట్టుక్రింద గాయత్రీ జపంచేస్తే నాలుగువేదాలూ చదివిన ఫలితం దక్కుతుంది. రావిచెట్టునునాటి పోషించిన వారియొక్క 42 తరాలవారికి స్వర్గం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

 

కుజదోషమున్నవారు, రావిమొదట్లో పచ్చిపాలుపోసి తడిసినమట్టితో నుదుటబొట్టు పెట్టుకుంటే దోషం తొలగిపోతుంది. రావిచెట్టును విష్ణుమూర్తిగానూ, వేపచెట్టును లక్ష్మీదేవిగానూ,తలంచి యీరెండుచెట్లూ కలసివున్నచోట వీటికి పెండ్లిజరిపిస్తే పెండ్లికాక ఆలస్యమౌతున్నవారికి దోషాలు తొలగిపోయి అతితొందరలో పెండ్లిజరుగుతుందన్న ప్రగాడవిశ్వాసం హిందువులకున్నది.  జైన బౌద్ధమతాలలోకూడా రావిచెట్టుకు గౌరవస్థానమున్నది. గౌతమబుద్ధునకు రావిచెట్టుక్రిందనే జ్ఞానోదయమైనది. అందుకే రావిచెట్టును బోధివృక్షమంటున్నారు. బుద్ధగయలో ఇప్పుడున్న బోధివృక్షం క్రీ.పూ 288 వ సంవత్సరం నాటిదని చరిత్రకారులు అంచనావేస్తున్నారు.
 రావిచెట్టును ఇంట్లో పెంచుకోకూడదన్న విషయం అవాస్తవం. కానీ రావివేర్లు చాలాదూరం లోతుగాప్రాకి ఇంటిగునాదులను పెగలించివేస్తాయనే భయంతో దీన్ని ఇంటిసమీపంలో పెంచుకోరు. పూర్వం కపిలబావులచెంత ఎద్దులకు మనుషులకు నీడకోస రావిచెట్ట్లను పెంచుకునేవారు. రావికొమ్మలనుండి తీసిననారతో గట్టితాళ్ళు రైతులు తయారుచేసుకొనేవారు.

 

ఆయుర్వేదంలోకూడా అశ్వత్థవృక్షం ఎక్కువగానే  ఉపయోగపడుతున్నది. రావిపుల్లలు ఎండబెట్టి, వాటిని నేతిలోతడిపి కాల్చి భస్మంచేసి, ఆభస్మాన్ని తేనెతో తగుమాత్రం సేవిస్తే శ్వాసకోశవ్యాధులు నయమౌతాయి. రావిచెట్టుగాలి ఆమ్లజనితం కావడంవల్ల స్త్రీలగర్భకోశ సమస్యలను నివారిస్తుంది. రక్తపోటును అదుపులో వుంచుతుంది. మంచి ఉత్సాహాన్నిస్తుంది. హోమియోపతీలో  Ficus Religiosa అనేపేరుతో మందు దొరుకుతున్నది. ఇది రక్తస్రావాలను నిలుపుతుంది.  స్త్రీల అధికఋతుస్రావాల రుగ్మతను నయంచేస్తుంది. శ్వాసకోశ వ్యాధులలో   కూడా యీ మందువాడి  నయంచేస్తున్నారు.                                               

Thursday, 4 May 2023

శమీవృక్షం (జమ్మిచెట్టు)

  శమీవృక్షం (జమ్మిచెట్టు)


హిందువులు పూజించే వృక్షాలలో జమ్మి ముఖ్యమైనది. ఋగ్వేదకాలమునుండి శమీప్రస్తావనవుంది. పాండవులు యీ వృక్షంమీదనే తమ ఆయుధాలను దాచియుంచి అజ్ఞాతవాసానికి వెళ్ళారు. అజ్ఞాతవాసానంతరం తిరిగి తమ ఆయుధాలను జమ్మినుండి గ్రహించేసమయంలో జమ్మిరూపంలోనున్న అపరాదేవిని పూజించి, ఆసీస్సులుపొంది కౌరవుపై విజయం సాధించారు. శ్రీరాముడు పదితలల రావణుని భీకరరూపంచూసి భీతిల్లి నిద్రించియున్న శక్తిని పూజించగా శమీరూప అపరాజితాదేవి మేల్కొని రాముని దీవించిందని దేవీపురాణంలోవుంది. ఆదీవెనలతోనే రాముడు రావణసహారం చేశాడన్నది పురాణగాధ. లంకనుండి అయోధ్యకు బయలుదేరేముందుకూడా రాముడు శమీపూజచేశాడు. శ్రీరాముడు, పాండవులు శమీపూజ చేసినరోజు విజయదశమి. అమ్మవారు మూడుమూర్తుల శక్తులతో భీకరయుద్ధం తొమ్మిదిదినాలుచేసి మహిషాసురుని సంహరించినదికూడా యీవిజయదశమి నాడే. దుర్గామాత తనకుమారులైన గణపతిని, కుమారస్వామిని చూడటానికివెళ్ళి వారిసేవలుపొంది తిగివచ్చిన దినంకూడా యీ విజయదశమిననే. అందుకే నవరాత్రులతర్వాతి విజయదశమిరోజున అందరూ శమీవృక్షరూపంలోనున్న అపరాజితాదేవిని యీ శ్లోకాలతో పూజిస్తారు.

శ్లో: శమీ శమయతే పాపం, శమీ శత్రువినాశినీ
    అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ!!


శ్లో: కరిష్యమాణ యాత్రాయా యథాకాలమ్‌ సుఖం మయా
    తత్ర నిర్విఘ్న క‌ర్త్రీవం భవ శ్రీరామ పూజితా!

అనగా శమీవృక్షం పాపాలను శమింపజేస్తుంది. శత్రునాశం గావిస్తుంది. అర్జునిని గాండీవన్ని ఓసంవత్సరం ధరించింది. శ్రీరామునికి ప్రియాన్ని కలిగించింది. రామునిచే పూజింపబడింది .     ఎడారియాత్రికులకు జైత్రయాత్రకు ( యుద్ధానికి) వెళ్ళేవారికి  సౌఖ్యావిజయాలనిస్తున్నది. సమస్తకార్యాలనూ నిరాటంకంగానూ విజయవంతంగానూ కొనసాగింపజేస్తున్నది అని అర్థం.

శమీపూజానంతరం పై శ్లోకాలను, చీటీపై వ్రాసి జమ్మిచెట్టుకు కడతారు. అందువల్ల అమ్మవారి అనుగ్రహంతోపాటు, శనిగ్రహదోషం కూడా తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. శమీపూజానంతరం పాలపిట్టనుచూడటం శుభకరమంటారు. ఆతర్వాత ఇళ్ళకువెళుతూ, జమ్మిఆకులను తీసుకవచ్చి పెద్దల చేతిలోపెట్టి బంగారం తీసుకోమంటారు. ఈబంగారం లక్ష్మీదేవికి ప్రతీక. కర్నాటరాజ్యంలో దీనికిసంబంధించి ఒకకథ ప్రచారంలోవుంది. గురుమహానా అనే గురువుగారి గురుకులంలో శమీవృత్  అనే పేదబాలుడు, వృక్షిత్ అనే  రాకుమారుడు విద్యనభ్యసించారు. గురువుకు గురుదక్షిణ సమర్పించి ఇళ్ళకు వెళ్ళవలసిన సమయమొచ్చింది. గురువు యిప్పుడుకాడు మీరువెళ్ళి స్థిరపడండి, తర్వాత్ నేనే వచ్చి మీనుండి దక్షిణ గ్రహిస్తానన్నాడు. అన్నట్లే గురువు తొలుత రాకుమారుడు వృక్షిత్ దగ్గరకు వెళ్ళాడు. వృక్షిత్ ఎవ్వరూ యివ్వలేనంత ధనరాసులు,విరివిగా బంగారునాణాలు సమర్పిచాడు. ఇతరవిద్యార్థులు యేమిస్తారో తెలుసుకోవాలని మారువేషంలో గురువును అనుసరించాడు. గురువు పేదవాడైన శమీవృత్  యింటికెళ్ళాడు. అతడి పరిస్థితిచూసి గురువు శిష్యా! నాకు నీ పెరటిలోని శమీమొక్కను (బన్నీమొక్కను ) దక్షిణగాయివ్వు అన్నాడు. వెంటనే దాన్ని తీసుకెళ్ళి నాఆశ్రంలో నాటూ అన్నాడు. మారువేషం తీసేసి రాకుమారుడు వృక్షత్ పకపకానవ్వి, శమీవృత్‌ను ఎగతాళిచేశాడు. గురువు ఏమీమాట్లాడకుండా శిశ్యులిద్దరినీ ఆశ్రమం తీసుకెళ్ళి ముందు శమీమొక్కను నాటమన్నాడు. మొక్కనాటినవెంటనే శమీమొక్క ఒకప్రక్క ఆకులురాలుస్తూ మరోప్రక్క చిగురించడం మొదలుపెట్టింది. రాలిన ఆకులన్నీ బంగారునాణాలుగా మారసాగాయి. అవన్నీ గుట్టలుగుట్టలుగా ప్రోగై రాకుమారుని గురుదక్షిణకన్నా ఎన్నోరెట్లు ఎక్కువయ్యాయి. రాకుమారుని దగ్గరకు తీసుకొని గురువు శమీవృత్ తో స్నేహంగా మెలగమన్నాడు. గురువుచెప్పినట్లే యిద్దరూ మంచిమిత్రులయ్యారు. అప్పటినుండి ఆప్రాంతంలో "బన్నీ బంగారు వాగోనా" అన్న నానుడి ప్రచారంలోని కొచ్చింది. దీనికి రెండర్థాలు చెబుతారు. రండి మనం శమీదళాలవలె బంగారంగా మారుదాం అని ఒక అర్థమైతే, రెండఅర్థం మనం శమీవృత్‌వృక్షిత్‌లాగా (శమీవృక్షంలాగా) బంగారుబంధమై ఉందాం,అని

దేవదానవులు అమృతంకోసం సముద్రమథనం చేసినపుడు, ఆవిర్భవించిన వృక్షాలలో శమీవృక్షంకూడా వుంది. వనవాస సమయంలో శ్రీరాముడు జమ్మివృక్షంక్రిందనే సేదదీరినాడట. అంతేకాదు  జమ్మికట్టెలతోనే కుటీరం నిర్మించుకున్నాడట. వినాయకపూజలోకూడా శమీపత్రాలు ముఖ్యమైనవి. యజ్ఞసమయంలో జమ్మిని స్త్రీకర్రగానూ, రావిని పురుషకర్రగానూ భావించి, జమ్మికర్రపైన రావికర్రను మర్థించి అగ్నిని రగిలిస్తారు. అందుకే జమ్మిని వైదికభాషలో "అరణి" అని పిలుస్తారు.                                 

జమ్మి బఠానీజాతిచెట్టు. అఫ్గనిస్తాన్, ఇరాన్, ఇండియా, ఒమన్, పాకిస్తాన్, సౌదీఅరేబియా యునైటెడ్అరబ్ఎమెరేట్స్ , యెమన్లలో  పశ్చిమ్ఆసియా అంతటా యీ జమ్మి వుంటుంది. బెహరెయిన్ దేశం  Tree of life గా దీన్ని గుర్తించింది . జమ్మి ఎలాంటి వాతావరణంలోనైనా పెరుగుతుంది. ఎడారిలోకూడా పెరగడంవల్ల ఎండతాపంనుండి రక్షణనిస్తుంది. దీనిఆకులు ఒకవైపు రాలుతున్నా మరోవైపు చిగురిస్తూనే వుంటాయి . వేళ్ళుచాలాదూరం ప్రాకి నీటిని గ్రహిస్తాయి. చెట్టుగాలి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.  అందుకే చెట్టుచుట్టూ ప్రదక్షణలు చేయమంటారు. చెట్టును ఇంటి ఆవరణలో నాటుకుంటే శుభకరమని వాస్తుశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇంటికిముందు తూరుపుదిక్కున శనివారమునాడు నాటుకోవడం మంచిది. ఇంటి ప్రధానద్వారం  కుడివైపు కుండీలోకూడ పెంచుకోవచ్చు అలాచేస్తే ఇంట్లోనికి సకారాత్మకశక్తులను రానిచ్చి నకారాత్మకశక్తులను యీమొక్క  అడ్డుకొంటుంది. శమీ ముళ్ళచెట్టుగనుక యింట్లో నాటుకోవడంలేదు. ముస్లింలు దీన్ని హజరత్ అల్ హయాత్ అని పిలుస్తారు. అరబ్ఎమిరేట్స్ దేశానికిది జాతీయవృక్షం. మన రాజస్తాన్, తెలంగాణా కుకూడా యిది రాష్ట్రవృక్షం.

ఆయుర్వేదరీత్యాకూడా  జమ్మి చాలా ఉపయుక్తమైన ఔషదమొక్క. జమ్మిఆకులపసరు పుండ్లకురాస్తే తొందరగా మానిపోతాయి. జమ్మిపూలను పంచదారతో కలిపిసేవిస్తే గర్భస్రావం జరగదు. జమ్మిబెరడు  దగ్గు ఉబ్బసాన్ని నయంచేస్తుంది. విరేచనాలను అరికడుతుంది. నరాలకు బలాన్నిస్తుంది. మొలలను తగ్గిస్తుంది. కండరాలలో యేర్పడిన గడ్డలను కరిగిస్తుంది. చెట్టునుండి స్రవించే జిగురు (బంక) లో చాలా పోషకాలున్నాయి. గర్భవతులకిది అమృతం  లాంటిది.  


Tuesday, 2 May 2023

జిల్లేడు (అర్క)

 

జిల్లేడు (అర్క)



జిల్లేడు ఒక పాలుగలమొక్క. పూలరంగునుబట్టి యీ చెట్టు మూడు రకాలు. తెల్లజిల్లేడు, ఎఱ్ఱజిల్లేడు, రాజుజిల్లేడు. సుమారు రెండుమూడు మీటర్లవరకు యీచెట్టు పెరుగుతుంది. దూదివంటినూగు చెట్టంతా కప్పబడి వుంటుంది. ఆకులు దళసరిగా వుంటాయి. పండియెండిన దీనికాయలనుండి తెల్లని మృదువైన దూదివుంటుంది. ఆశియాదేశాలన్నిటిలో జిల్లేడు లభిస్తుంది.

హిందూమతవ్యవస్థలో జిల్లేడుకు ప్రత్యేకస్థానమున్నది. వినాయకచవితి పర్వదినాన, గణపతివ్రతకల్పవిధానంలో జిల్లేడుఆకులతో గణపతిని ముఖ్యంగా పూజిస్తారు. రథసప్తమినాడు యీ ఆకులు తలపై ధరించి నదీస్నానంచేస్తే గొప్పపుణ్యమని నమ్ముతారు. తెల్లజిల్లేడుదూది వత్తులతో ఇప్పనూనెదీపాలు ఐదింటిని ఐదువారాలపాటు వెలిగిస్తే హనుమంతుని అనుగ్రహం కలుగుతుందని విశ్వసిస్తారు. అంతేగాక తెల్లజిల్లేడుపూలతో శివపూజ, ఆకులతో సూర్య(అర్క)పూజచేస్తే శుభప్రదమని భావిస్తారు. తెల్లజిల్లేడును ఇంట్లో పెంచుకుంటే గణపతి ఇంట్లో వున్నట్లేనని పండితులు చెబుతారు. అష్టైశ్వర్యాలు కలుగుతాయని, యీతిబాధలు తొలగిపోతాయని, వ్యాపారాభివృద్ధి జరుగుతుందని, విద్యార్థులు రాణిస్తారనీ,  సర్వకార్యాయూలు  జయప్రదంగా నెరవేరుతాయనినీ  పెద్దలుసూచించారు. పుష్యమీనక్షత్ర ఆదివారంగానీ, గురువారంగానీ "పుషార్కయోగం" ఆరోజున తెల్లజిల్లేడుచెట్టును నాటి పూజచేయడం శ్రేయస్కరంమని పండితులు సెలవిచ్చారు.  పూజకు ఎఱ్ఱమందారంపూలు, ఎఱ్ఱచందనం శేష్ఠం.  కొన్ని తెల్లజిల్లేడువేళ్ళు గణపతి ఆకారంలో వుంటాయి. ఇటువంటివి కాణిపాకం వినాయకాలయం చెంత అమ్ముతుండుటం గమనించవచ్చు. ఇవి పూజకు ఉత్తమమని పూజారులు సెలవిస్తున్నారు. జిల్లేడుచెట్లు విరివిగాగల  గ్రామాల్లో పంటలు బాగాపండుతాయని ప్రతీతి. ఈచెట్లు పాడుబడినయిళ్ళలో ఎక్కువగా మొలవడంవల్ల,  మీయింట్లో "జిల్లేళ్ళుబడ" అని శపిస్తుంటారు. అంతేగానీ జిల్లేడు అపశకునానికి కారణం కానేకాదు.

జిల్లేడు ఆయుర్వేదమూలికలలో ముఖ్యమైనది. జిల్లేడుపాలను పసుపులోకలిపి ముఖానికిరాసుకుంటే, ముఖవర్ఛస్సు పెరుగుతుంది. లేతచిగుళ్ళు తాటిబెల్లంతో కలిపినూరి కుంకుడుగిజప్రమాణం నాలుగు రోజులు రెండుపూటలా సేవిస్తే స్త్రీల ముట్టుకుట్టునొప్పి తగ్గుతుంది. జిల్లేడుపాలు దూదితో తడిపి పాముకరిచినచోట లేక తేలుకుట్టినచోట పెడితే విషం తలకెక్కదు. విషం దికివస్తుంది. దీన్ని ప్రధమచికిత్సగా చేయవచ్చును. ఆకులరసం తేనెతోకలిపి త్రాగితే, జ్వరాలు తగ్గుతాయి . ఎండినతెల్లజిల్లేడుపొడి 15 గ్రాములు,100 గ్రాముల బెల్లం, 10 గ్రాముల వామ్ముకలిపినూరి 5 గ్రాములంత మాత్రలు చేసుకొని, 40 రోజులు ఆవుపాలు లేక మంచినీటితో రోజుకోమాత్ర చొప్పున వాడితే మొండిఉబ్బసమైనా బాగౌతుంది. కీళ్ళనొప్పులకు, ఆకులకు ఆముదం పట్టించి, వెచ్చజేసి కడితే తగ్గుతాయి. ఎండినఆకులపొడి పాలతోసేవిస్తే, కడుపులో పుండ్లు మానుతాయి. ఆకులరసం విరేచనమవ్వడానికి, మలబద్ధకం పోవడానికి వాడుకోవచ్చు. దీనిపాలు నువ్వులనూనెతో కలిపి నూనెమిగిలేట్లు కాచుకొని అర్కక్షీరతైలం తయారుచేసుకోవచ్చు. ఇది నరాలబలహీనతకూ, చర్మవ్యాధుల నివారణకూ మర్ధన చేస్తారు. ఆవనూనెపట్టించి వేడిచేసినఆకులు నొప్పి వాపు వున్నచోట వేసికడితే ఉపశమనం కలుగుతుంది. జిల్లేడువేరుకాల్చిన బొగ్గుతో పళ్ళుతోముకుంటే దంతసమస్యలు రావు. ఆకులకు నువ్వునూనెగానీ ఆముదంగానీ పట్టించి, కాస్తాఉప్పు వేసినూరి పలుచటిగుడ్డలోవుంచి, రెండు మూడు చుక్కలు చెవిలోపడేట్లు పిండితే చెవిపోటు తగ్గిపోతుంది. ఆకులు అరికాళ్ళకు అంటించి సాక్సువేసుకొని రోజంతా లేక రాత్రంతా వుంచుకుంటే రక్తంలో చెక్కెర తగ్గుతుంది. జిల్లేడుపాలు కంట్లోపడితే చూపుపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గనుక జాగ్రత్తగా వుండాలి. హోమియోవైద్యంలోకూడా జిల్లేడుతో Calotropis Gigantea అనేమందు తయారుచేస్తున్నారు. ఇది ఉబ్బసం, దగ్గు, కుష్ఠు, బొల్లి, కీళ్ళనొప్పులకు మందుగా వాడుతున్నారు.                                                                 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...