Saturday, 6 May 2023

రావిచెట్టు (ఆశ్వత్థవృక్షం)

 

రావిచెట్టు (ఆశ్వత్థవృక్షం)


 రావిచెట్టు మర్రిచెట్టు ఒకేజాతిజిచెందినవి. భారత్, నేపాల్, చైనా దేశాల్లో అధికంగా పెరుగుతుంది. ఇది పొడిప్రాంతాలైనా తడిప్రాంతాలైనా పెరుగుతుంది. 30  మీటర్ల వరకు పెరిగే పెద్దచెట్టు. ఆకుకొస మొనదేలిన తోకవలె వుంటుంది. ఈచెట్టును పిప్పల, ఆదిత్యా అనికూడా పిలుస్తారు.

 వినాయకస్వామిని "ఓం వినాయకాయ నమః ఆశ్వత్థ పత్రం పూజయామి" అని అర్చిస్తారు. భగవద్గీతలో కృష్ణపర్మాత్మ వృక్షాలలో నేను అశ్వత్థవృక్షాన్ని అని చెప్పారు. అందుకే రావిచెట్టు హిందువులకు పూజనీయమైంది. అశ్వత్థం దేవతలనివాసస్థానమని అధర్వణవేదం చెబుతున్నది. అంబరీషముని శాపంకారణంగా విష్ణువు రావిచెట్టుగా పుట్టాడని పద్మపురాణంలో వుంది. యజ్ఞయాగాదులలో అగ్నిపుట్టించడానికి జమ్మిమొద్దుపై రావి కొమ్మతో అటుఇటు  వేగంగా త్రిప్పడం చేస్తారు. రావిచెట్టును పూజించినవారికి పూర్వజన్మ కర్మలు తొలగిపోతాయి. రావిఆకులపై ప్రమిదలుంచి నువ్వులనూనె దీపాలు వెలిగిస్తే అనుకున్నపనులు దిగ్విజయంగా నెరవేరుతాయి. శనిగ్రహ సర్ప రాహుకేతు దోషాలే కాకుండా ఇతరగ్రహ దోషాలుకూడా తొలగిపోతాయి. ఈవిధమైన దీపారాధనలో ఆదివారం పుట్టినవారు 12 రావిఆకులపైన, సోమవారం బుధవారం పుట్టినవారు మూడురావిఆకులపైన మంగళవారం పుట్టినవారు రెండురావిఆకులపైన, గురువారం పుట్టినవారు ఐదురావిఆకులపైన, శుక్రవారం పుట్టినవారు ఆరురావిఆకులపైన, శనివారం పుట్టినవారు తొమ్మిది రావిఆకులపైన దీపాలు పెట్టాలని పూజారులు చెబుతున్నారు. ఆకుల చివరితోకలు పూజించేవారివైపు వుండాలంటారు. దీపాలకు నూనెబదులు నెయ్యివాడటం శ్రేష్టం. అందువల్ల ఆర్థిక ఇబ్బందులు శీఘ్రగతిన తొలగిపోతాయి. సంతానప్రాప్తికి 40 రోజులు రావిచెట్టుకు ప్రదక్షిణచేయాలన్నది ఆర్యోక్తి. రావిప్రదక్షిన చేయాలనుకొనేవారు ఉదయాన్నే నదీస్నానంచేసి కుంకుమబొట్టు పెట్టుకోవాలి. ప్రదక్షణ సమయంలో "మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపాయ అగ్రతో శివరూపాయ వృక్షరాజాయతే నమోనమః" అన్నశ్లోకాన్ని పఠిస్తూ ప్రతిప్రదక్షకొకసారి చెట్టును తగలకుండా  నమస్కరించాలి.

  బ్రహ్మాండపురాణంలో మరిన్ని విశేషాలున్నాయి. అశ్వత్థవృక్ష దక్షిణ, పశ్చిమ, ఉత్తరదిక్కు శాఖలలో త్రిమూతులు, తూర్పుదిక్కు శాఖలలో ఇంద్రదిదేవతలూ, సప్తసముద్రాలు, సమస్తపుణ్యనదులూ, వేర్లలో మహర్షులు, గోబ్రాహ్మణులు , నాలుగువేదాలు ఉన్నాయి. వృక్షాన్నాశ్రయించి ఆష్టవసువులు ఉంటారు. ఓంకారంలోని "" కారం మూలంలోనూ, ""కారం మానులోను, "" కారం పళ్ళలోను  ఉంటుందని బ్రహ్మండపురాణం చెబుతున్నది.    

  జాతకంలో శని రాహుకేతువుల దోషమున్నవారు చెట్టుచుట్టూ తొమ్మిది ప్రదక్షినలు చేయాలి. ముఖ్యంగా శనిదోషమున్నవారు శనివారం చెట్టును తాకి "ఓం కోణః పింగళోబభ్రుః కృష్ణో రౌద్రాంతకాయకో యమః శౌరీశ్శనై శ్చరో మదః పిప్పలదేవ సంస్థుతః" అని పఠిస్తూ తొమ్మిదిసార్లు ప్రదక్షిణచేయాలి. శనివారంతప్ప మిగిలినరోలలో రావిచెట్టును తాకరాదు. అట్లే చైత్ర, ఆషడ, పుష్యమాసాలలోను, గురు శుక్రమౌడ్యాలలోనూ, గ్రహణసమయాల్లోనూ, మైలపడిన సమయాల్లోనూ, రాత్రిభోజనానంతరమూ ప్రదక్షిణలు చేయరాదు. మొదలుపెట్టేటప్పుడు కృష్ణపక్షమై వుండకూడదు.

 

 ఉపనయన సమయాల్లో రావికొమ్మకుపూజ తప్పనిసరి. వివాహ సమయాల్లో వరుడు రాగిమండ భుజంపై ధరించి కాశీయాత్రకు బయలుదేరడమూ,అతన్ని వధువుపక్షంవారు బ్రతిమాలి పిలుచకవచ్చి వివాహంజరిపించడమూ ఒక ఆనవాయితీ. యజ్ఞంలో రావికట్టెలు సమిధలుగా వాడితీరాలి.

 

 గురువారం అమావాస్య కలిసివచ్చిన రోజున రావిక్రింద వేదవిప్రునికి భోజనంపెడితే కోటిమంది బ్రహ్మణులకు సమారాధన చేసినపుణ్యఫలం దక్కుతుంది. అంతేగాకుండా ఇటువంటి దినమే రావిచెట్టుక్రింద పుణ్యస్నానమాచరిస్తే, పాపాలన్నీ తొలగిపోతాయి. రావిచెట్టుక్రింద గాయత్రీ జపంచేస్తే నాలుగువేదాలూ చదివిన ఫలితం దక్కుతుంది. రావిచెట్టునునాటి పోషించిన వారియొక్క 42 తరాలవారికి స్వర్గం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

 

కుజదోషమున్నవారు, రావిమొదట్లో పచ్చిపాలుపోసి తడిసినమట్టితో నుదుటబొట్టు పెట్టుకుంటే దోషం తొలగిపోతుంది. రావిచెట్టును విష్ణుమూర్తిగానూ, వేపచెట్టును లక్ష్మీదేవిగానూ,తలంచి యీరెండుచెట్లూ కలసివున్నచోట వీటికి పెండ్లిజరిపిస్తే పెండ్లికాక ఆలస్యమౌతున్నవారికి దోషాలు తొలగిపోయి అతితొందరలో పెండ్లిజరుగుతుందన్న ప్రగాడవిశ్వాసం హిందువులకున్నది.  జైన బౌద్ధమతాలలోకూడా రావిచెట్టుకు గౌరవస్థానమున్నది. గౌతమబుద్ధునకు రావిచెట్టుక్రిందనే జ్ఞానోదయమైనది. అందుకే రావిచెట్టును బోధివృక్షమంటున్నారు. బుద్ధగయలో ఇప్పుడున్న బోధివృక్షం క్రీ.పూ 288 వ సంవత్సరం నాటిదని చరిత్రకారులు అంచనావేస్తున్నారు.
 రావిచెట్టును ఇంట్లో పెంచుకోకూడదన్న విషయం అవాస్తవం. కానీ రావివేర్లు చాలాదూరం లోతుగాప్రాకి ఇంటిగునాదులను పెగలించివేస్తాయనే భయంతో దీన్ని ఇంటిసమీపంలో పెంచుకోరు. పూర్వం కపిలబావులచెంత ఎద్దులకు మనుషులకు నీడకోస రావిచెట్ట్లను పెంచుకునేవారు. రావికొమ్మలనుండి తీసిననారతో గట్టితాళ్ళు రైతులు తయారుచేసుకొనేవారు.

 

ఆయుర్వేదంలోకూడా అశ్వత్థవృక్షం ఎక్కువగానే  ఉపయోగపడుతున్నది. రావిపుల్లలు ఎండబెట్టి, వాటిని నేతిలోతడిపి కాల్చి భస్మంచేసి, ఆభస్మాన్ని తేనెతో తగుమాత్రం సేవిస్తే శ్వాసకోశవ్యాధులు నయమౌతాయి. రావిచెట్టుగాలి ఆమ్లజనితం కావడంవల్ల స్త్రీలగర్భకోశ సమస్యలను నివారిస్తుంది. రక్తపోటును అదుపులో వుంచుతుంది. మంచి ఉత్సాహాన్నిస్తుంది. హోమియోపతీలో  Ficus Religiosa అనేపేరుతో మందు దొరుకుతున్నది. ఇది రక్తస్రావాలను నిలుపుతుంది.  స్త్రీల అధికఋతుస్రావాల రుగ్మతను నయంచేస్తుంది. శ్వాసకోశ వ్యాధులలో   కూడా యీ మందువాడి  నయంచేస్తున్నారు.                                               

Thursday, 4 May 2023

శమీవృక్షం (జమ్మిచెట్టు)

  శమీవృక్షం (జమ్మిచెట్టు)


హిందువులు పూజించే వృక్షాలలో జమ్మి ముఖ్యమైనది. ఋగ్వేదకాలమునుండి శమీప్రస్తావనవుంది. పాండవులు యీ వృక్షంమీదనే తమ ఆయుధాలను దాచియుంచి అజ్ఞాతవాసానికి వెళ్ళారు. అజ్ఞాతవాసానంతరం తిరిగి తమ ఆయుధాలను జమ్మినుండి గ్రహించేసమయంలో జమ్మిరూపంలోనున్న అపరాదేవిని పూజించి, ఆసీస్సులుపొంది కౌరవుపై విజయం సాధించారు. శ్రీరాముడు పదితలల రావణుని భీకరరూపంచూసి భీతిల్లి నిద్రించియున్న శక్తిని పూజించగా శమీరూప అపరాజితాదేవి మేల్కొని రాముని దీవించిందని దేవీపురాణంలోవుంది. ఆదీవెనలతోనే రాముడు రావణసహారం చేశాడన్నది పురాణగాధ. లంకనుండి అయోధ్యకు బయలుదేరేముందుకూడా రాముడు శమీపూజచేశాడు. శ్రీరాముడు, పాండవులు శమీపూజ చేసినరోజు విజయదశమి. అమ్మవారు మూడుమూర్తుల శక్తులతో భీకరయుద్ధం తొమ్మిదిదినాలుచేసి మహిషాసురుని సంహరించినదికూడా యీవిజయదశమి నాడే. దుర్గామాత తనకుమారులైన గణపతిని, కుమారస్వామిని చూడటానికివెళ్ళి వారిసేవలుపొంది తిగివచ్చిన దినంకూడా యీ విజయదశమిననే. అందుకే నవరాత్రులతర్వాతి విజయదశమిరోజున అందరూ శమీవృక్షరూపంలోనున్న అపరాజితాదేవిని యీ శ్లోకాలతో పూజిస్తారు.

శ్లో: శమీ శమయతే పాపం, శమీ శత్రువినాశినీ
    అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ!!


శ్లో: కరిష్యమాణ యాత్రాయా యథాకాలమ్‌ సుఖం మయా
    తత్ర నిర్విఘ్న క‌ర్త్రీవం భవ శ్రీరామ పూజితా!

అనగా శమీవృక్షం పాపాలను శమింపజేస్తుంది. శత్రునాశం గావిస్తుంది. అర్జునిని గాండీవన్ని ఓసంవత్సరం ధరించింది. శ్రీరామునికి ప్రియాన్ని కలిగించింది. రామునిచే పూజింపబడింది .     ఎడారియాత్రికులకు జైత్రయాత్రకు ( యుద్ధానికి) వెళ్ళేవారికి  సౌఖ్యావిజయాలనిస్తున్నది. సమస్తకార్యాలనూ నిరాటంకంగానూ విజయవంతంగానూ కొనసాగింపజేస్తున్నది అని అర్థం.

శమీపూజానంతరం పై శ్లోకాలను, చీటీపై వ్రాసి జమ్మిచెట్టుకు కడతారు. అందువల్ల అమ్మవారి అనుగ్రహంతోపాటు, శనిగ్రహదోషం కూడా తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. శమీపూజానంతరం పాలపిట్టనుచూడటం శుభకరమంటారు. ఆతర్వాత ఇళ్ళకువెళుతూ, జమ్మిఆకులను తీసుకవచ్చి పెద్దల చేతిలోపెట్టి బంగారం తీసుకోమంటారు. ఈబంగారం లక్ష్మీదేవికి ప్రతీక. కర్నాటరాజ్యంలో దీనికిసంబంధించి ఒకకథ ప్రచారంలోవుంది. గురుమహానా అనే గురువుగారి గురుకులంలో శమీవృత్  అనే పేదబాలుడు, వృక్షిత్ అనే  రాకుమారుడు విద్యనభ్యసించారు. గురువుకు గురుదక్షిణ సమర్పించి ఇళ్ళకు వెళ్ళవలసిన సమయమొచ్చింది. గురువు యిప్పుడుకాడు మీరువెళ్ళి స్థిరపడండి, తర్వాత్ నేనే వచ్చి మీనుండి దక్షిణ గ్రహిస్తానన్నాడు. అన్నట్లే గురువు తొలుత రాకుమారుడు వృక్షిత్ దగ్గరకు వెళ్ళాడు. వృక్షిత్ ఎవ్వరూ యివ్వలేనంత ధనరాసులు,విరివిగా బంగారునాణాలు సమర్పిచాడు. ఇతరవిద్యార్థులు యేమిస్తారో తెలుసుకోవాలని మారువేషంలో గురువును అనుసరించాడు. గురువు పేదవాడైన శమీవృత్  యింటికెళ్ళాడు. అతడి పరిస్థితిచూసి గురువు శిష్యా! నాకు నీ పెరటిలోని శమీమొక్కను (బన్నీమొక్కను ) దక్షిణగాయివ్వు అన్నాడు. వెంటనే దాన్ని తీసుకెళ్ళి నాఆశ్రంలో నాటూ అన్నాడు. మారువేషం తీసేసి రాకుమారుడు వృక్షత్ పకపకానవ్వి, శమీవృత్‌ను ఎగతాళిచేశాడు. గురువు ఏమీమాట్లాడకుండా శిశ్యులిద్దరినీ ఆశ్రమం తీసుకెళ్ళి ముందు శమీమొక్కను నాటమన్నాడు. మొక్కనాటినవెంటనే శమీమొక్క ఒకప్రక్క ఆకులురాలుస్తూ మరోప్రక్క చిగురించడం మొదలుపెట్టింది. రాలిన ఆకులన్నీ బంగారునాణాలుగా మారసాగాయి. అవన్నీ గుట్టలుగుట్టలుగా ప్రోగై రాకుమారుని గురుదక్షిణకన్నా ఎన్నోరెట్లు ఎక్కువయ్యాయి. రాకుమారుని దగ్గరకు తీసుకొని గురువు శమీవృత్ తో స్నేహంగా మెలగమన్నాడు. గురువుచెప్పినట్లే యిద్దరూ మంచిమిత్రులయ్యారు. అప్పటినుండి ఆప్రాంతంలో "బన్నీ బంగారు వాగోనా" అన్న నానుడి ప్రచారంలోని కొచ్చింది. దీనికి రెండర్థాలు చెబుతారు. రండి మనం శమీదళాలవలె బంగారంగా మారుదాం అని ఒక అర్థమైతే, రెండఅర్థం మనం శమీవృత్‌వృక్షిత్‌లాగా (శమీవృక్షంలాగా) బంగారుబంధమై ఉందాం,అని

దేవదానవులు అమృతంకోసం సముద్రమథనం చేసినపుడు, ఆవిర్భవించిన వృక్షాలలో శమీవృక్షంకూడా వుంది. వనవాస సమయంలో శ్రీరాముడు జమ్మివృక్షంక్రిందనే సేదదీరినాడట. అంతేకాదు  జమ్మికట్టెలతోనే కుటీరం నిర్మించుకున్నాడట. వినాయకపూజలోకూడా శమీపత్రాలు ముఖ్యమైనవి. యజ్ఞసమయంలో జమ్మిని స్త్రీకర్రగానూ, రావిని పురుషకర్రగానూ భావించి, జమ్మికర్రపైన రావికర్రను మర్థించి అగ్నిని రగిలిస్తారు. అందుకే జమ్మిని వైదికభాషలో "అరణి" అని పిలుస్తారు.                                 

జమ్మి బఠానీజాతిచెట్టు. అఫ్గనిస్తాన్, ఇరాన్, ఇండియా, ఒమన్, పాకిస్తాన్, సౌదీఅరేబియా యునైటెడ్అరబ్ఎమెరేట్స్ , యెమన్లలో  పశ్చిమ్ఆసియా అంతటా యీ జమ్మి వుంటుంది. బెహరెయిన్ దేశం  Tree of life గా దీన్ని గుర్తించింది . జమ్మి ఎలాంటి వాతావరణంలోనైనా పెరుగుతుంది. ఎడారిలోకూడా పెరగడంవల్ల ఎండతాపంనుండి రక్షణనిస్తుంది. దీనిఆకులు ఒకవైపు రాలుతున్నా మరోవైపు చిగురిస్తూనే వుంటాయి . వేళ్ళుచాలాదూరం ప్రాకి నీటిని గ్రహిస్తాయి. చెట్టుగాలి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.  అందుకే చెట్టుచుట్టూ ప్రదక్షణలు చేయమంటారు. చెట్టును ఇంటి ఆవరణలో నాటుకుంటే శుభకరమని వాస్తుశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇంటికిముందు తూరుపుదిక్కున శనివారమునాడు నాటుకోవడం మంచిది. ఇంటి ప్రధానద్వారం  కుడివైపు కుండీలోకూడ పెంచుకోవచ్చు అలాచేస్తే ఇంట్లోనికి సకారాత్మకశక్తులను రానిచ్చి నకారాత్మకశక్తులను యీమొక్క  అడ్డుకొంటుంది. శమీ ముళ్ళచెట్టుగనుక యింట్లో నాటుకోవడంలేదు. ముస్లింలు దీన్ని హజరత్ అల్ హయాత్ అని పిలుస్తారు. అరబ్ఎమిరేట్స్ దేశానికిది జాతీయవృక్షం. మన రాజస్తాన్, తెలంగాణా కుకూడా యిది రాష్ట్రవృక్షం.

ఆయుర్వేదరీత్యాకూడా  జమ్మి చాలా ఉపయుక్తమైన ఔషదమొక్క. జమ్మిఆకులపసరు పుండ్లకురాస్తే తొందరగా మానిపోతాయి. జమ్మిపూలను పంచదారతో కలిపిసేవిస్తే గర్భస్రావం జరగదు. జమ్మిబెరడు  దగ్గు ఉబ్బసాన్ని నయంచేస్తుంది. విరేచనాలను అరికడుతుంది. నరాలకు బలాన్నిస్తుంది. మొలలను తగ్గిస్తుంది. కండరాలలో యేర్పడిన గడ్డలను కరిగిస్తుంది. చెట్టునుండి స్రవించే జిగురు (బంక) లో చాలా పోషకాలున్నాయి. గర్భవతులకిది అమృతం  లాంటిది.  


Tuesday, 2 May 2023

జిల్లేడు (అర్క)

 

జిల్లేడు (అర్క)



జిల్లేడు ఒక పాలుగలమొక్క. పూలరంగునుబట్టి యీ చెట్టు మూడు రకాలు. తెల్లజిల్లేడు, ఎఱ్ఱజిల్లేడు, రాజుజిల్లేడు. సుమారు రెండుమూడు మీటర్లవరకు యీచెట్టు పెరుగుతుంది. దూదివంటినూగు చెట్టంతా కప్పబడి వుంటుంది. ఆకులు దళసరిగా వుంటాయి. పండియెండిన దీనికాయలనుండి తెల్లని మృదువైన దూదివుంటుంది. ఆశియాదేశాలన్నిటిలో జిల్లేడు లభిస్తుంది.

హిందూమతవ్యవస్థలో జిల్లేడుకు ప్రత్యేకస్థానమున్నది. వినాయకచవితి పర్వదినాన, గణపతివ్రతకల్పవిధానంలో జిల్లేడుఆకులతో గణపతిని ముఖ్యంగా పూజిస్తారు. రథసప్తమినాడు యీ ఆకులు తలపై ధరించి నదీస్నానంచేస్తే గొప్పపుణ్యమని నమ్ముతారు. తెల్లజిల్లేడుదూది వత్తులతో ఇప్పనూనెదీపాలు ఐదింటిని ఐదువారాలపాటు వెలిగిస్తే హనుమంతుని అనుగ్రహం కలుగుతుందని విశ్వసిస్తారు. అంతేగాక తెల్లజిల్లేడుపూలతో శివపూజ, ఆకులతో సూర్య(అర్క)పూజచేస్తే శుభప్రదమని భావిస్తారు. తెల్లజిల్లేడును ఇంట్లో పెంచుకుంటే గణపతి ఇంట్లో వున్నట్లేనని పండితులు చెబుతారు. అష్టైశ్వర్యాలు కలుగుతాయని, యీతిబాధలు తొలగిపోతాయని, వ్యాపారాభివృద్ధి జరుగుతుందని, విద్యార్థులు రాణిస్తారనీ,  సర్వకార్యాయూలు  జయప్రదంగా నెరవేరుతాయనినీ  పెద్దలుసూచించారు. పుష్యమీనక్షత్ర ఆదివారంగానీ, గురువారంగానీ "పుషార్కయోగం" ఆరోజున తెల్లజిల్లేడుచెట్టును నాటి పూజచేయడం శ్రేయస్కరంమని పండితులు సెలవిచ్చారు.  పూజకు ఎఱ్ఱమందారంపూలు, ఎఱ్ఱచందనం శేష్ఠం.  కొన్ని తెల్లజిల్లేడువేళ్ళు గణపతి ఆకారంలో వుంటాయి. ఇటువంటివి కాణిపాకం వినాయకాలయం చెంత అమ్ముతుండుటం గమనించవచ్చు. ఇవి పూజకు ఉత్తమమని పూజారులు సెలవిస్తున్నారు. జిల్లేడుచెట్లు విరివిగాగల  గ్రామాల్లో పంటలు బాగాపండుతాయని ప్రతీతి. ఈచెట్లు పాడుబడినయిళ్ళలో ఎక్కువగా మొలవడంవల్ల,  మీయింట్లో "జిల్లేళ్ళుబడ" అని శపిస్తుంటారు. అంతేగానీ జిల్లేడు అపశకునానికి కారణం కానేకాదు.

జిల్లేడు ఆయుర్వేదమూలికలలో ముఖ్యమైనది. జిల్లేడుపాలను పసుపులోకలిపి ముఖానికిరాసుకుంటే, ముఖవర్ఛస్సు పెరుగుతుంది. లేతచిగుళ్ళు తాటిబెల్లంతో కలిపినూరి కుంకుడుగిజప్రమాణం నాలుగు రోజులు రెండుపూటలా సేవిస్తే స్త్రీల ముట్టుకుట్టునొప్పి తగ్గుతుంది. జిల్లేడుపాలు దూదితో తడిపి పాముకరిచినచోట లేక తేలుకుట్టినచోట పెడితే విషం తలకెక్కదు. విషం దికివస్తుంది. దీన్ని ప్రధమచికిత్సగా చేయవచ్చును. ఆకులరసం తేనెతోకలిపి త్రాగితే, జ్వరాలు తగ్గుతాయి . ఎండినతెల్లజిల్లేడుపొడి 15 గ్రాములు,100 గ్రాముల బెల్లం, 10 గ్రాముల వామ్ముకలిపినూరి 5 గ్రాములంత మాత్రలు చేసుకొని, 40 రోజులు ఆవుపాలు లేక మంచినీటితో రోజుకోమాత్ర చొప్పున వాడితే మొండిఉబ్బసమైనా బాగౌతుంది. కీళ్ళనొప్పులకు, ఆకులకు ఆముదం పట్టించి, వెచ్చజేసి కడితే తగ్గుతాయి. ఎండినఆకులపొడి పాలతోసేవిస్తే, కడుపులో పుండ్లు మానుతాయి. ఆకులరసం విరేచనమవ్వడానికి, మలబద్ధకం పోవడానికి వాడుకోవచ్చు. దీనిపాలు నువ్వులనూనెతో కలిపి నూనెమిగిలేట్లు కాచుకొని అర్కక్షీరతైలం తయారుచేసుకోవచ్చు. ఇది నరాలబలహీనతకూ, చర్మవ్యాధుల నివారణకూ మర్ధన చేస్తారు. ఆవనూనెపట్టించి వేడిచేసినఆకులు నొప్పి వాపు వున్నచోట వేసికడితే ఉపశమనం కలుగుతుంది. జిల్లేడువేరుకాల్చిన బొగ్గుతో పళ్ళుతోముకుంటే దంతసమస్యలు రావు. ఆకులకు నువ్వునూనెగానీ ఆముదంగానీ పట్టించి, కాస్తాఉప్పు వేసినూరి పలుచటిగుడ్డలోవుంచి, రెండు మూడు చుక్కలు చెవిలోపడేట్లు పిండితే చెవిపోటు తగ్గిపోతుంది. ఆకులు అరికాళ్ళకు అంటించి సాక్సువేసుకొని రోజంతా లేక రాత్రంతా వుంచుకుంటే రక్తంలో చెక్కెర తగ్గుతుంది. జిల్లేడుపాలు కంట్లోపడితే చూపుపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గనుక జాగ్రత్తగా వుండాలి. హోమియోవైద్యంలోకూడా జిల్లేడుతో Calotropis Gigantea అనేమందు తయారుచేస్తున్నారు. ఇది ఉబ్బసం, దగ్గు, కుష్ఠు, బొల్లి, కీళ్ళనొప్పులకు మందుగా వాడుతున్నారు.                                                                 

Saturday, 29 April 2023

బిల్వం (మారేడు),

బిల్వం(మారేడు)

 

 హిందూమతంలో శివపూజకు బిల్వపత్రం అత్యంతముఖ్యమైనది. సంస్కృతంలో దీనిని శ్రీఫలం, మాలూర, శైలూష, అనే నామాలుకూడా వున్నాయి. బిల్వవృక్షాన్ని శివస్వరూపంగా భావిస్తారు. మరికొందరు శివుడు బిల్వవృక్షంక్రింద నివాసముంటాడంటారు. సర్వసామాన్యమైన మారేడు ఆకులు ఒకేకాడకు మూడుంటాయి. కుడిఆకున విష్ణువు ఎడమఆకున బ్రహ్మ నడిమిఆకున శివుడు వుంటాడంటారు. మరికొందరు యీఆకులు శివుని త్రిశూలానికి ప్రతీకగా భావిస్తారు. ఇంకొందరు శివుని త్రినేత్రములకు ప్రతీక అంటారు. ఆకు ముందుబాగంలో అమృతము వెనుకభాగంలో యక్షులు వుంటారని కొందరు నమ్ముతారు. శివపురాణంలో ఒక కథవున్నది. శని ఒకనాడు కైలాసంవెల్లి శివునిదర్శించి స్తుతించాడు. శివుడు ప్రసన్నుడైనాడు. అయినా శనిని పరీక్షింపనెంచి శివుడు నన్ను పట్టగలవా? అన్నాడు. శని, స్వామీ మీరే అడిగితే కాదంటానా? రేపు ఉదయమునుండి సాయంత్రందాక పట్టివుంచుతానన్నాదు. శివుడు తప్పించుకోదలచి మారేడువృక్షంలో ఇమొడిపోయాడు. సాయంత్రం చెట్టునుండి బయటకువచ్చి, శనీ! నన్ను పట్టలేకపోయావుగదా? అన్నాడు. లేదుశివా! నేనుపట్టబట్టే ఆదిదేవులైన తమరు దినమంతా దాక్కోవలసి వచ్చింది అన్నాడు శని. శివుడు వాస్తవం గ్రహించి, శనియొక్క కర్తవ్యనిర్వహణను మెచ్చుకొని దినమంతా నాలోవుండి నన్నుపట్టివుంచితివి గనుక నేటినుండి నీవు శనీశ్వర నామంతో వెలుగొందుతావని వరమిచ్చిపంపాడు. ఆదినమునుండి బిల్వపత్రములతో నన్ను పూజించినవారికి శనిగ్రహదోషం పీడించదని హరుడు లోకములకు అభయమిచ్చినాడు. మరొకకథలో  హరుడు సతీవియోగముతో విరాగియై, బిల్వవృక్షముక్రింద తపముచేయుచుండెను. పార్వతీదేవి శివునిపై ప్రేమతో ప్రతిదినం శివపూజచేయుచుండెను. ఒకరోజు ఆమె శివపూజకు పూలు మరచి వచ్చెను. అప్పుడామె అందుబాటులోనున్న బిల్వపత్రములతో శివుడు మునిగిపోవునట్లుగా అర్చించెను. శివుడందుకు సంతోషించెను. శివుడు పార్వతిని వివాహమాడుటకు యిదికూడా ఒక కారణమాయెను.  

లక్ష్మీదేవి తపస్సు వలన బిల్వముద్భవమైనదని నమ్మువారున్నారు. అందుకే లక్ష్మిని బిల్వనిలయఅంటారు. బ్రహ్మవర్చస్సు పొందాలనుకున్నవారు, సూర్యుని అనుగ్రహంకొరకు చేసే కామ్యయాగంలో మారేడుకొయ్యను యూపస్తంభంగా నాటుతారు. అశ్వమేధయాగంలో కూడా ఆరు బిల్వయూపస్తంభాలు నాటడం పరిపాటి. బిల్వదళాలను సోమ మంగళవారాల్లోను, ఆరుద్రనక్షత్రంలోనూ, గ్రహణ సమయాల్లోనూ, సంధ్యాసమయాల్లోనూ, రాత్రులందూ, అశౌచదినాల్లోనూ, శివరాత్రి, సంక్రాంతి వంటి పర్వదినాల్లోనూ కోయకూడదు. కనుక ముందురోజే కోసివుంచుకొని పూజకుపయోగించాలి. కాస్తావాడిన దళలైనా పూజకు పనికివస్తాయి. మారేడుదళాలు గాలిని నీటిని పరిశుభ్రపరుస్తాయి. ఇంటి ఆవరణలో బిల్వవృక్షం ఈశాన్యంలోవుంటే ఆపదలు దరిచేరవు. ఐశ్వర్యం వృద్ధియగును. తూర్పునవుంటే సుఖప్రాప్తి. పడమరవుంటే పుత్రసంతానప్రాప్తి. దక్షినానవుంటే యమబాధలుండవు. బిల్వవృక్షమూలాన్ని గంధము పుష్పాలతో పూజిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. వృక్షంచుట్టూ దీపాలువెలిగించి నమస్కరిస్తే శివజ్ఞానం కలుగుతుంది. మారేడునీడన ఒకరికి అన్నంపెడితే, కోటిజనానికి అన్నదానం చేసిన ఫలితం లభిస్తుంది. శివభక్తునికి బిల్వవృక్షం క్రింద క్షీరాన్నం ఘృతసహితంగా సమర్పిస్తే, జన్మజన్మాంతరాలలో అన్నానికి కొదువుండదు. బిల్వాష్టకం పేరుతో ఎనిమిది శ్లోకాలున్నాయి. అవి శివునకు చాలా ఇష్టమని నమ్మి పూజలో భాగంగా పఠిస్తారు. అలా ఒక వృక్షంపేర అష్టకం వుండటం ఒక బిల్వానికే చెల్లింది. వినాయకపూజలో ఉపయోగించే, 21 పత్రాలలో మొదటిది మాచిపత్రి రెండవది బిల్వపత్రమే, తర్వాతవరుసగా దుర్వాయుగ్మందత్తూర( ఉమ్మెత్త)   పత్రము, బదరీపత్రం,  అపామార్గపత్రం, తులసిపత్రం, చూత(మామిడి)పత్రం, కరవీర(గన్నేరు)పత్రం, విష్ణుకాంతపత్రం, దాడిమపత్రం, దేవదారుపత్రం, మరువకపత్రి, సిందువారపత్రి, జాజిపత్రి, గండకీపత్రి, శమీపత్రి, ఆశ్వత్థపత్రం, అర్జునపత్రం, అర్కపత్రం, బృహతీపత్రం వుంటాయి.

బిల్వములలో ఆకుస్వరూపాన్నిబట్టి చాలారకాలే వున్నాయి. 1, 3, 4 6 ,7, ఇంకా అనేకదళాలుగలవిగా వుంటాయి.

6 నుండి 21 రేకుల బిల్వపత్రాలతో పూజిస్తే అన్నికార్యాలలో అఖండవిజయం లభిస్తుంది. అలాగే ఏకపత్రబిల్వం సర్వశ్రేష్టమనిభావిస్తారు. వ్యాపారాభివృద్ధికి గల్లాపెట్టెలో బిల్వపత్రముంచుకోవడం ఒక ఆనవాయితీ. అట్లేకొందరు జేబులోకూడా బిల్వపత్రం వేసుకొని బయటకు వెళతారు. ఇంట్లో బిల్వపత్రాలతో పూజచేస్తే వాస్తుదోషాలు తొలగిపోతాయి. త్రిదళం ఉమ్మెత్తపూలు కలిపిపూజచేస్తే చతుర్విధ(ధర్మ,అర్థ,కామ,మోక్ష)పురుషార్థాలు లభిస్తాయి. ఆధ్యాత్మవిధులు సామాన్యముగాదొరికే మారేడు మూడుదళాలు త్రిగుణాలకు(సత్వ,రజస్,తమో గుణాలకు)ప్రతీకగాను, పూజకుడు, పూజ్యము, పూజగానూ స్తోత్రము,స్తుత్యము,స్తుతిగానూ జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానముగానూ భావిస్తారు.అంతేగాక బిల్వోపనిషత్తు అనుపేరున  ఒక ఉపనిషత్తేవున్నది. జైనమత 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు, బిల్వవృక్షంక్రింద తపమాచరించి మోక్షం పొందుటచేత,  జైనమతస్తులుకూడా బిల్వాన్ని శుభప్రదంగా భావిస్తారు.

 మారేడు వెలగజాతివృక్షం. 8 నుండి 10 మీటర్లవరకు పెరుగు తుంది. ఆశియాదేశాలన్నింటిలో అన్నికాలాలలో యిది వృద్ధిచెందుతుంది. ఆకులు, పండ్లగుజ్జు సువాసన గలిగివుంటాయి. కాయ వెలగకాయవలెనే గట్టిగావుంటుంది. పువ్వులు చిన్నవిగా ఆకుపచ్చ తెలుపుకలసిన రంగులో వుంటాయి. ఆయుర్వేదవైద్యంలో యీచెట్టు సర్వాంగాలూ ఉపయోగపడతాయి. సగంమాగిన పండ్లరసం జిగటవిరేచనాలకు, నీళ్ళవిరేచనాలకు మందుగా ఉపయోగిస్తారు. ఆకురసం మధుమేహాన్ని హరిస్తుంది. మారేడువేళ్ళు ఔషదగుణంగల దశమూలాలాలలో (మారేడు,తుందిలం, గుమ్మడి, కలిగట్టు, నెల్లి, ముయ్యాకుపొన్న, కోలపొన్న,వాకుడు, పెద్దములక, పల్లేరు) ఒకటిగా పరిగణిస్తారు. మారేడుగుజ్జు, పాలు, పంచదారకలిపి వేసవిపానీయంగా తయారుచేసుకుంటారు. దీనివల్ల వేసవితాపం తగ్గడమేగాకుండా ప్రేవులను శుభ్రపరచిశక్తినిస్తుంది. పండినపండు విరేచనకారి. సగంపండినఫలం విరేచనాలను నిలుపుతుంది. పండులోని గుజ్జును ఎండబెట్టి పొదిచేసికుడా వాడుకొనవచ్చును. ఇది మొలలకుకూడా బాగా పనికివచ్చేమందు. ఆకుకషాయం పైత్యగుణాలను నయంచేస్తుంది. కడుపులోని గ్యాసును బయటికి పంపుతుంది. ఆకులచిక్కటి కషాయం లో నువ్వులనూనెపోసి నూనెమిగిలేట్లు కాచుకొని మారేడుతైలం తయారుచేసుకోవచ్చు. ఈనూనె తలకు బాగామర్ధనచేసి తలస్నానంచేస్తే, జలుబు,తుమ్ములు తగ్గిపోతాయి. ఆకుకషాయం సేవించడంవల్ల రక్తం శుద్ధిగావించబడుతుంది. తద్వార చర్మరోగాలు నయమౌతాయి. అంతేగాక శరీరానికి కావలసిన ఖనిజాలు, విటమిన్‌B,C, క్యాల్సియం, భాస్వరం, ఇనుము , కెరోటిన్, కూడా లభించి, ఆరోగ్యం మెఱుగుపడుతుంది. హోమియోవైద్యంలో కూడా మారేడు ఆకులనుండి, పండ్లగుజ్జునుండి రెండురకాల( Aegle Folia, Aegle Marmelos)మందులు తయారౌతున్నాయి. ఇవి మధుమేహం (చెక్కెర వ్యాధి), జిగటవిరేచనాలు, మొలలు వంటి దీర్ఘరోగాలను  నయంచేయడానికి వాడుతున్నారు.


బిల్వాష్టకమ్


త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం

కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః
కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం

కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం

ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం

రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా
తటాకానిచ సంధానమ్ ఏకబిల్వం శివార్పణం

అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం

ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ
భస్మలేపన సర్వాంగమ్ ఏకబిల్వం శివార్పణం

సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః
యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం

దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ
కోటికన్యా మహాదానమ్ ఏకబిల్వం శివార్పణం

బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం
అఘోర పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం

సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే
అనేకవ్రత కోటీనామ్ ఏకబిల్వం శివార్పణం

అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం

బిల్వస్తోత్రమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం
 

 

 

 

Friday, 7 April 2023

ఘంటానాదం,Temple Bells

 

ఘంటానాదం

 ఘంటను గంట అనికూడా అంటారు. హైందవపండితులు పూజకు ఉపక్రమించేముందు ఘంటానాదం చేయాలంటారు. " ఆగమార్థంతు దేవానాం, గమనార్థంతు రాక్షసాం, కుర్వాత్‍ఘంటారావంతు తత్ర దేవతాహ్వానం లాంఛనం." దేవతలు ప్రవేశించేందుకు, రాక్షసులు పారిపోయేందుకూ గుర్తుగా ఘంటానాదం లాంఛనంగా చేయాలని దీనర్థం. ఘంట మ్రోగినప్పుడు, శబ్దతరంగాలు పెద్దపెద్ద వృత్తాకారాలలో వెలువడతాయి. ఇవి శక్తిసంపన్నాలు. పూజకనుకూల పరిస్థితుల నేర్పరుస్తాయి. క్రైస్తవులు నూతన సంవత్సరానికాహ్వానంగా పాతసంవత్సరానికి వీడ్కోలుగా చర్చీల్లో గంటలు వాయిస్తారు. మిగిలిన సమయాలలో, సమయసూచికంగా గంటలు కొడతారు. బౌద్ధ, జైన మతాలలోకూడా ఘంటానాద ప్రసక్తి వున్నది. హిందూదేవాలయాలలో ప్రధానద్వారం వద్ద మహాఘంట వ్రేలాడదీసివుంటుంది. ప్రాతఃకాలంలో పూజారి ఆలయప్రవేశం చేయగానే మూడుసార్లు దీన్ని వాయిస్తాడు. ఇది అందరినీ మేల్కొల్పుతుంది. శివాలయాల్లో గంటపై నంది చెక్కబడి వుంటుంది. వైష్ణవలయాల్లోనైతే హనుమ లేక గరుత్మంతుడు చెక్కబడి వుంటుంది. ఈఘంటానాదం అభిషేకసమయాల్లోను, హారతినిచ్చే సమయాల్లోనూ, యజ్ఞోపవీతం వేసేటఫ్ఫుడూ, ధూపంవేసేటప్పుడూ, ఘంటానాదం చేస్తారు. నైవేద్యసమర్పణ సమయాల్లో మాత్రం ఘంటానాదం చెయ్యరు. అలాచేయడం నరకహేతువని శాస్త్రంచెబుతున్నది. " ఘంటానాదంతథా వాద్యం నృత్యం గీతం తదైవచ నైవేద్యకాలేయః రౌరవాద్ నరకంవ్రజేత్."

 ఘంటనాలుకలో సరస్వతీ, ముఖభాగంలో బ్రహ్మ, కడుపుభాగంలో రుద్రుడు, కొసభాగంలో వాసుకి (శివుని మెడలోని సర్పం) ఉంటారని హిందువులు నమ్ముతారు. గంటపిడి భాగంలో ప్రాణశక్తి వుంటుంది. ఘంటలు తయారుచేయడం కూడా ఒకకళ. శబ్దం మృదువుగాను కర్ణపేయంగానూ, వెలువడటానికి శాస్త్రనిర్దేశానుసారం కొన్ని కొలతలుపాటించి తయారుచేస్తారు. నిర్మాణానికి కంచులోహం వాడుతారు. "కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా" అన్న వేమనమాట ఉండనేవున్నది. ఘంటనుండి వెలువడే శబ్దతరంగాలలో ఓంకారనాదం (ప్రణవం) ఉన్నది. ఇది ఆధ్యాత్మిక సారం. సకలశుభాలకూ సంకేతం. చంచలమైన మనస్సును కుదుటపరచి దైవంపై లగ్నమయ్యేట్లు చేస్తుంది. అసలు శబ్దం రెండురకములు. ఒకటి ధ్వని. ఇది ఉత్పన్నమై వెంటనే నిలిచిపోతుంది. రెండు నాదం. ఇది కొంతసమయం ప్రతిధ్వనిస్తూ కొనసాగుతుంది. "నా" అనగా ప్రాణం. "" అనగా అగ్ని. ప్రాణాగ్నుల కలయికే నాదం. నాదం శబ్దకాలుష్యం చేసేదిగా గాక హృద్యంగా వుండాలి. కనుక గంటవాయించే టప్పుడు సున్నితంగా వాయించాలి. "ఘంటాతు తాడయేద్దీమాన్ అస్త్ర మంత్ర సముచ్ఛరన్" క్రమపద్ధతిలో మెల్లగా వాయిస్తే దైవికపూజ సఫలమౌతుంది. శాస్త్రప్రకారం ఘంటకు అధిష్టానదేవత బ్రహ్మ. కొందరిభావనలో గంటలోని నాళం (నాలుక) ఆదిశేషునకు ప్రతీక. ఉత్పన్నమయ్యే నాదం శబ్దబ్రహ్మంగా పరిగణిస్తారు.

 గంటలు మూడురకాలు. 1. చేగంట. పూజాసమయంలో వాయించే చిన్నగంట.  దీన్ని ఎడమచేత్తో, వాయిస్తూ, కుడిచేత్తో నీరాజనాది ఉపచారాలు చేస్తారు. 2. జేగంట. ఇది గుండ్రముగావున్న కంచుపలక. దీన్ని చెక్కగూటముతో వాయిస్తారు. ఆలయంంలో బలిహరణ సమయాల్లోనూ, ఊరేగింపుల్లోనూ వాయిస్తారు. 3. వ్రేలాడు గంట. ఇది దేవాలయాల్లో వ్రేలాడదీయు పెద్దగంట. ఆలయప్రవేశం చేయగానే దీన్ని వాయిస్తారు. దీన్ని మృదువుగా ఒకవైపు మాత్రమే తగిలేట్లు వాయిస్తారు. దేవాలయం విడిచిలెళ్ళేప్పుడు దీన్ని వాయించరు. గంట శాస్త్రానుసారం మూడుసార్లు వాయించాలి. "ఏకతాడే మరణం చైవ. ద్వితాడే వ్యాధిపీడనం. త్రితాడే సుఖమాప్నోతి. తత్ఘంటానాద లక్షణం". గంట ఒకసారికొడితే మరణాన్ని, రెండుసార్లు కొడితేరోగన్ని, మూదుసార్లు కొడితే సుఖసంతోషాలను కలిగిస్తుందని దీనర్థం.

 ఘంటానాదాన్ని వినడానికి కూడా ప్రత్యేక వార నక్షత్ర సమయాలను జ్యోతిష్కులు నిర్ధారించారు.

1.ఆదివారం అశ్వని,మూల నక్షత్రాలున్న రాహుకాలం సా: 4-30 నుండి 6-౦౦ వరకు.

2.సోమవారం ఆరుద్ర,స్వాతి,శతభిష నక్షత్రాలున్న రాహుకాలం ఉ: 2-30 నుండి 9-00 వరకు.

3.గురువారం ఫుష్యమి నక్షత్ర మున్న రాహుకాలం మ: 1-30 నుండి 3-00 వరకు.

4.శుక్రవారం హస్తా నక్షత్ర మున్న రాహుకాలం ఉ: 10-30 నుండి12-00 వరకు.

5.శనివారం రేవతి నక్షత్రమున్న రాహుకాలం ఉ: 9-00 నుండి 10-30 వరకు.

 ఈసమయాలలో శుక్లపక్షమైతే ఘంటానాదం భక్తునకు ఎడమవైపు నుండి వినబడాలి. అదే బహుళపక్షమైతే, కుడివైపునుండివినబడాలి. పూర్ణిమ దినాలలో ఏవైపునుండైనా పరవాలేదు. అమావాస్యనాడు వదిలేయండి. ఒకవేళ అమావాస్యనాడు గుడిలోనైతే గంటమ్రోగించేముందు పితృదేవతలను స్మరించి తర్వాత గంటలు మ్రోగించాలి. ఇలా చేయడం అత్యంత శుభదయకం.        

Thursday, 6 April 2023

తీర్థం,Tirtham

 

తీర్థం

తీర్థమనగా భగవంతుని అభిషేకించినజలం లేదా గంగ, కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర వంటి పుణ్యనదుల నావాహనజేసిన, కలశంలోని పవిత్రజలం. ఒక పవిత్రజలాశయం లేదా నదినాశయించియున్న దేవస్థానన్ని కూడా తీత్థమనే అంటారు. దేవాలయాల్లోగాని గృహాల్లోగానీ పూజానంతరం తీర్థంపుచ్చుకుంటూ వుండడం హిందువుల ఆచారం. కొన్నిచోట్ల చర్చీలలోకూడా క్రీస్తు పాపులకోసం కార్చిన రక్తమనిచెప్పి ద్రవాహారాన్ని యివ్వడం జరుగుచున్నది. ఒక రాజకీయ నాయకుడు ఉన్నపార్టీవదలి మరోపార్టీ లోచేరితే అతడు ఆపార్టీ తీర్థం పుచ్చుకున్నాడంటారు. ఇలా హేళన చేయడానికి కూడా యీ తీర్థమనే పదం వాడబడుతున్నది. హిందువులకు మాత్రం ఇది పూజానంతరం నిర్లక్ష్యము చేయరాని ప్రక్రియ, పూజారి "అకాలమృత్యు హరణం. సర్వవ్యాధినివారణం. సమస్తపాపక్షయకరం. శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం" అని ఉచ్చరిస్తూ రాగిపాత్రలోని తీర్థాన్ని తొలుత అర్చకస్వాములు, తరువాత సర్వసంగపరిత్యాగులు (సన్యసించినవారు), తర్వాత అధ్యాపకులు, యజమానులైన ధర్మకర్తలు ఆతర్వాత మిగిలిన భక్తులందరు వరుసగా స్వీకరిస్తారు.  పరమేశ్వర”  బదులుగా  ఆసమయంలో పూజించిన దైవనామాన్ని ఉచ్చరించవచ్చును. సర్వసామాన్యంగా తులసీదళాలు, పచ్చకర్పూరం, కుంకుమపువ్వు, శ్రీగంధం కలిపిన మంచినీటితో శుద్ధోదకాభిషేకం చేసినతర్వత అదేజలాన్ని తీర్థంగాసేవించడం జరుగుతుంది. ఒలికిపోకుండ క్రిందపదకుండా వుండేందుకు పురుషులైతే, ఉత్తరీయాన్నీ (కండువాను), స్త్రీలైతే చీరకొంగు లేక చున్నీపైటకొసను నల్గుమడతలు మడిచి ఎడమ అరచేతిపై వేసుకొని, పైన కుడి అరచేతినుంచి, గోకర్ణ ముద్రలోనికి మడిచి, అంటే కుడిమధ్యవ్రేలు చూపుడువ్రేలు మధ్యకు బొటనవ్రేలు పోనిస్తే తీర్థం తీసుకోవడానికి అనువుగా గుంత యేర్పడుతుంది. అందులో తీర్థము వేయించుకొని కళ్ళకద్దుకొని భక్తిపూర్వకంగా స్వీకరించాలి. పూజారి ముడుసార్లు ఉద్దరనితో తీర్థంవేసిన తర్వాత, సేవించాలి. లేదా వేరువేరుగా మూడుసార్లు తీర్థంసేవించాలి. మొదటితీర్థం మానసిక, శారీరక శుద్ధిని, రెండవది సద్బుద్ధిని, న్యాయవర్తనను, కలిగిస్తుంది. మూడవది పరమపదాన్ని చేరుస్తుంది. తీర్థం స్వీకరిచేటప్పుడు, జుర్రుకొన్నశబ్దం రాకుండ, వీలైతే కుదురుగా కూర్చొని భక్తిశ్రద్ధలతో తీసుకోవాలి.  

 తీర్థాలు నాలుగురకాలుగా, ఆయాదేవస్థానాల ఆచారాన్ని బట్టి వుంటున్నాయి. 1.జలతీర్థం - ఇది అంతటా సర్వసామాన్యంగా యిస్తూవుంటారు. ఈ తీర్థసేవనంవల్ల పవిత్రత జేకూరుతుంది. అకాలమాణాలను (60సంవత్సరములు దాటకుండా చనిపోవడాన్ని) నివారిస్తుంది.  ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, పాపాలను పరిహరిస్తుంది. 2. కషాయతీర్థం- ఇది తీర్థంగా స్వీకరించే ఓషదుల కషాయం. కొల్హపురి లక్ష్మిదేవి గుడిలోనూ, కొల్లూరు మూకాంబికా దేవాలయంలోనూ, హిమాచలప్రదేశ్ జ్వాలామాలిని ఆలయంలోనూ, అస్సోం లోని శ్రీకామాఖ్యదేవాలయంలోనూ, యీతీర్థం రాత్రి పూజానంతరం యిస్తారు. ఇది సమస్తరోగనివారిణి. కనిపించని రోగాలనుసైతం బాగుచేస్తుంది. 3. పంచామృతతీర్థం- ఇది పాలూ, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలిపినతీర్థం. కొన్నిఆలయాలలో పాలూ పెరుగుకు బదులుగా కొబ్బరి, అరటిగుజ్జు వినియోగిస్తారు. ఈతీర్థం నరసిహస్వామి ఆలయాలలో ఎక్కువగా యిస్తారు. ఈతీర్థం పయత్న విజయకారిణి, కడకు బ్రహ్మలోకప్రాప్తి కలుగజేస్తుంది. 4. పానకతీర్థం- ఈతీర్థం శ్రీమంగళగిరి నరసింహస్వామివద్ద, అహోబిళ నరసింహస్వామివద్ద ఇస్తారు. ఈతీర్థం చైతన్యదాయిని. ఉత్సాహాన్నిస్తుంది. శరీరవేడిని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఎముకలకు దృఢత్వాన్ని కలుగజేస్తుంది. నోరెండిపోవడాన్ని తగ్గిస్తుంది. జీర్ణశక్తినిపెంచి, ఆకలిని కలుగజేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. శత్రుపీడలనుండి విముక్తి కలుగజేస్తుంది. ఇవిగాక బిళ్వతీర్థం కూడావుంది. వైష్ణవాలయాల్లో తులసితీర్థ మెంతముఖ్యమో, శివాలయాల్లో బిళ్వతీర్థమంత ముఖ్యం

 తీర్థం రాగిపాత్రలో వుంటుందిగనుక శరీరంలోని అధికవేడిని తగ్గిస్తుంది. అంతేగాక రాగిపాత్రలోని తీర్థసేవనంవల్ల ఆహారంలోని యితర లవణాలను శరీరం సులభంగా గ్రహిస్తుంది. అలాగే తీర్థంలోని పచ్చకర్పూరం మానసికోల్లాసాన్ని కలుగజేస్తుంది. తులసీదళాలు కఫహారిగా పనిజేస్తాయి. మరణశయ్యపై ఉన్నవారికి గళంలో కఫమడ్డపడి బాధిస్తుంది. తులసితీర్థంపోయడంవల్ల కఫం తొలగిపోయి బాధలేని మరణం ప్రాప్తిస్తుంది. తీర్థం స్వీకరించిన తర్వాత చేతులు కడుక్కోవాలి, లేదా వస్త్రంతో తుడుచుకోవాలి. అంతేగాని తలకు రాసుకోరాదు. తల బ్రహ్మస్థానం. దాన్ని ఎంగిలి చేయబడ్డ తీర్థంతో అపవిత్రంచేయరాదు. అంతేగాక శఠకోపం తలపైపెడతారు. శఠకోపమంటే దేవునిపాదాలు. కనుక పవిత్రమైన దేవునిపాదాలను మనం ఎంగిలితో మైలపరచరాదు. అంతేగాక తీర్థంలో తేనె, పంచదార ఉంటాయిగనుక అవి తలకురాయడం తగదని వైద్యులసలహా. అయినా కొందరు తీర్థసేవనం తరువాత తలకురాస్తే బ్రహ్మహత్యాదోషం తొలగుతుందని నమ్ముతారు. గంగాజల(కాశీ)తీర్థం తలకుతగిలితే దోషం లేదని కూడా అంటారు. ఈవిషయంలో ఎవరి విశ్వాసం వారిదని వదిలేద్దాం. "శంఖంలోపోస్తేనేతీర్థం" అన్నసామెత ఒకటున్నది. దీన్ననుసరించి తులసి తీర్థాన్ని  ఉద్దరణితోగాకుండా శంఖంలో పోసి, దానిద్వారా భక్తుల కివ్వడం కూడా జరుగుతుంది .  ఇక ఆలయాల్లోగానీ ఇంట్లోగాని తీర్థం మిగిలిపోతే తులసికోటలోని తులసిచెట్టుకు పోయాలి. లేదా ప్రవహించే నదిలో కలిపేయాలి. తీర్థానికి సంబంధించిన అనేక విషయాలను "తీర్థగోష్టి" గ్రంధంలో వ్రాయబడి ఉన్నాయి.                      

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...