Friday, 11 November 2022

ఉంగరం,అంగుళీయకం, Finger Ring

 

ఉంగరం (అంగుళీయకం)


ఉంగరం చేతివ్రేలికి ధరించే ఆభరణం. మణికట్టుపైన ధరించే కంకణం. మోచేతిపైన ధరించే వంకిణి కూడా ఉంగరంవంటి ఆభరణాలే. అన్నిజాతులూ, అన్నిమతాలవారు పురాతనకాలమునుండి ఉంగరాలు ధరిస్తూనే వున్నారు. హనుమంతుడు శ్రీరాముని ఉంగరాన్ని లంకలోని సీతాదేవికి ఆనవాలుగా చూపించాడన్నది మనందరకు తెలిసిన విషయమే. కొందరు ముస్లిములు వారి మతాచారాన్ననుసరించి ఉంగరం ధరించరు. హిందువులు జ్యోతిషశాస్త్రానుసారం రాశులు, నక్షత్రాలననుసరించి ముత్యాలు, వజ్రాలు, పగడాలు, రత్నాలు పొదిగిన ఉంగరాలు ధరిస్తారు. పాశ్చాత్యులు వివాహసందర్భంగా వధూవరులు ఒకరికొకరు ఉంగరం తొడుగుతారు. అందువల్ల ఒకరిస్పందనలు మరొకరికి తాకుతాయని నమ్ముతారు. ఇప్పుడు హిందువుల కుటుంబాలలో కూడా నిశ్చితార్థం రోజు వధూవరులు ఉంగరరాలు ఒకరికొకరు తొడిగే కార్యక్రమం చేస్తున్నారు. పూర్వపు రాజులు తాముధరించేఉంగరాన్నే తమ అధికరముద్రికగా ఉపయోగించేవారు. ఉంగరపువ్రేలికి చెవికి నరాల అనుబంధం వుంది. ఉంగరం ధరించడమువల్ల శరీరంలోని నరాలు ఉత్తేజితమౌతాయి. కుడిచేతికి ముఖ్యంగా రాగిఉంగరం ధరించడంవల్ల కలుషిత ఆహారాన్ని గుర్తించి జాగ్రత్త పడవచ్చు. ఆహారం విషపురితమైతే రాగిఉంగరం నీలిరంగులోకి మారుతుంది. రాగివల్ల యింకా ఎన్నోప్రయోజనాలున్నాయి. కుడి అనామిక (ఉంగరపు వ్రేలు) సూర్యునికి ప్రతీక. రాగికూడా సూర్యునినుండి అంగారకునినుండి అనుకూలశక్తిని గ్రహించి శరీరానికందిస్తుంది. తద్వరా శరీరం వ్యర్థాలను బయటికి పంపించేస్తుంది. రాగి మానసికఒత్తిడిని తగ్గించి ప్రశాంతతనిస్తుంది. తలనొప్పిని నివారిస్తుంది. తాపాన్ని తగ్గిస్తుంది. రక్తప్రసరణను క్రమబద్దీకరిస్తుంది. అందువల్ల కీళ్ళనొప్పులు, ఉదరవ్యాధులు నయమౌతాయి. దగ్గు గొంతువ్యాధులు రావు. చర్మానికి జుట్టుకు మేలుచేస్తుంది. ఒకేవుంగరమైతే కుడి అనామిక (చిటికెనవ్రేలు ప్రక్కవ్రేలు)కు ధరిస్తారు. అనేకమైతే యిక పదివ్రేళ్ళకూ ధరించవచ్చు. బంగారు, వెండి, రాగి మరియూ మిశ్రమలోహాలతోగూడా స్తోమతనుబట్టి చేయించుకుంటారు. ఎడమచేతి ఉంగరం గుండెకు మేలుచేస్తుంది. సామాన్యంగా ఊరకున్నప్పుడు ఉంగరాన్ని పైకిక్రిందికి కదిలిస్తూ వుంటారు. అందువల్ల కలిగే ఒత్తిడివల్ల మేలే కలుగుతుంది. కిడ్నీల నరాల పనితీరు మెరుగౌతుంది. ఉంగరం బొటనవ్రేలికి ధరిస్తే ఆత్మవిశ్వాసం పెంపొంది, ఏపనినైనా సాధించాలనే పట్టుదల గలిగి ధైర్యంతో వ్యవహరిస్తారు. చూపుడువ్రేలికి ధరిస్తే నాయకత్వలక్షణాలు పెంపొంది, శ్రమకోర్చి ఆత్మగౌరవంతో మెలగుతారు. మధ్యవ్రేలికి ధరించడంవల్ల బాధ్యతగలవ్యక్తిగా జీవిస్తారు. అనామికకు (ఉంగరం వ్రేలికి) ధరిస్తే నూతనావిష్కరణలవైపు మొగ్గుచూపుతారు. ప్రేమ అనుబంధాలకు విలువనిస్తారు. చిటికనవ్రేలికి ధరిస్తే వృత్తివిద్యలలో, ప్రసారమాధ్యమవిద్యలలో నిపుణులౌతారు. బుధగ్రహం అనుకూలమై తెలివితేటలతో వ్యవహరిస్తారు.

         దర్భవుంగరం పవిత్రంగా యజ్ఞయాగాదులలో వ్రతాలలో ధరిస్తారు. దీని ఆధారంగా కేరళలోని కన్నూర్‌జిల్లా పయ్యనూర్ పురోహితుల సలహామేరకు దర్భ ఉంగరం ఆకారంలోనే బంగారువుంగరాలు పయ్యనూర్లోని కొన్నికుటుంబాలవారు మూడునుంచి ఏడురోజులు శ్రమించి తయారుచేస్తారు. మూడుగీతలుగల యీ ఉంగరం ఇడ, పింగళ, సుషుమ్ననాడులకు ప్రతీకగా భావిస్తారు. పయ్యనూర్‌ కుమారస్వామి వద్ద పూజలోవుంచి తదనంతరం ధరించడానికిస్తారు. కుడి అనామిక కొలతలతో 30.28,19,14,9,7,4 గ్రాములబరువుతో యీ ఉంగరాలు నిష్ఠతో తయారుజేస్తారు.ఈ ఉంగరం ధరించడంవల్ల కుండలినీశక్తి ఉత్తేజితమౌతుంది. దైవానుగ్రహం కలుగుతుందనీ, దైవం మీవెన్నంటివుండి విజయంచేకూరుస్తాడనీ నమ్ముతారు. ఈ ఉంగరం తయారుచేసేవారు జీవితాంతం పొగత్రాగరు, మధుమాంసాదులు ముట్టరు. ఉంగరాలలో మేరువు (తాబేలు) ఉంగరానికిగూడా చాలామహిమ గలదని నమ్ముతారు. ఈ ఉంగరాల శిరస్సుభాగం మణికట్టువైపు ఉండేట్టు ధరించాలి. అంటే గుప్పిటముడిచి కళ్ళకద్దుకొనుటకు వీలుగా వుండాలి. ఈపవిత్రవుంగరాలను స్ట్రీలు బహిష్టుసమయానికిముందే తీసి దేవునిగూట్లో భద్రంగావుంచాలి. భోజనంచేసేటప్పుడు ఎంగిలి ఉంగరానికంటరాదు. ధూమపానంచేయరాదు. సారాయిత్రాగరాదు. మాంసాహారాలు తినరాదు. ఈనియమాలు పాటించకపోతే అనిష్టమని పురోహితులు జాగ్రత్తలు చెబుతున్నారు.                                    











Monday, 31 October 2022

మొలత్రాడు,Molatradu

 

మొలత్రాడు




 హిందూసాంప్రదాయంలో మొలత్రాడుకట్టుకోవడం ఒకమంచి ఆచారం. "మొలత్రాడు లేదంటే మగాడేకాడు. వడ్డాణం పెట్టంది ఆడదేకాదు" అనే సామెత వుండనేఉంది. పిల్లలకుమాత్రం ఆడమగ అన్నతేడాలేకుండా అందరికి మొలత్రాడుకడతారు. ఆడపిల్లలకు మునుపు సిగ్గుబిళ్ళలు కట్టేవారు. వాటికాధారంగా మొలత్రాదు ఉపయోగపడేది. పెద్దలలో మగవారు తప్పక మొలత్రాడు కడతారు. వారివారి స్తోమతనుబట్టి. బంగారు,వెండి, ప్లాటినం, దారంతో తయారుచేసిన సన్ననిత్రాడును నడుముకు మొలత్రాడుగా కడతారు. దారంతోచెసినవిమాత్రం నల్లని లేక ఎఱ్ఱని మొలత్రాడును ఉపయోగిస్తారు. బాలకృష్ణుని వర్ణిస్తూ..

         ఆ:వె: చేత వెన్నముద్ద  చెంగల్వపూదండ
                    బంగరు మొలతాడు పట్టుదట్టి
                   సందెతాయెతులును సరిమువ్వగజ్జెలు
                  చిన్నికృష్ణ నిన్ను చేరికొలుతు
---------- అన్నారు.

 కలవారు కాబట్టి కృష్ణునకు పసిడిమొలత్రాదు కట్టారు. సర్వసామాన్యంగా సంపన్నులు చలువజేస్తుందిగాబట్టి వెండిమొలత్రాడు కడతారు. మొలత్రాడు మార్చవలసివస్తే ముందుగా క్రొత్తదిగట్టి తర్వాత పాతది తీసేస్తారు. అయితే ధర్మసింధువు ..

                శ్లో: మౌంజీం యజ్ఞోపవీతంచ  నవదండంచ ధారయేత్

                      అజినం కటిసూత్రంచ నవవస్త్రం  తదైవచ: -- అంటున్నది

  అంటే దర్భత్రాడును, జంధ్యాన్ని, ఊతగావాడే మోదుగకఱ్ఱను, జింకచర్మాన్ని,మొలత్రాడును, వస్త్రాన్ని ఏటా విధిగా క్రొత్తవి ధరించాలి. అని ధర్మసింధువులో ఉన్నది.  మగవారు మొలత్రాడును భార్య చనిపోయినప్పుడు తీసేస్తారు. లేదా మగమనిషి చనిపోయినతర్వాత మొలత్రాడు త్రెంచేసి కాల్పోబూడ్పో చేస్తారు. చనిపోయినవ్యక్తి బంధరహితంగా వెళ్ళిపోవాలని దీనర్థం. హిందూసాంప్రదాయంప్రకారం సచేలస్నానమే చేయాలి. కనీసం గోచిమాత్రమైనా లేకుండా స్నానం చేయరాదు. ఎప్పుడైనా గుడ్డలులేకుండా స్నానం చేయవలసివస్తే మొలత్రాడు వుండటంవల్ల దోషమంటదు. అది సచేలస్నానమే ఔతుంది. మొలత్రాడు ధరించటానికి, బుధ, ఆదివారాలు మంచివి. మంగళ శుక్రవారాలు ధరింపరాదు.

బొడ్డుతాడు (stem cell) చికిత్స అన్నదొకటున్నది. శిషువు జన్మించినపుడు బొడ్డుకోసి తల్లిని బిడ్డను వేరుచేస్తారు. అప్పుడు బొడ్డుతాడు తుంటను లేదా దాని రక్తబిందువును పసరుమందుతో కలిపి వెండితాయత్తులోవుంచి బిడ్డమొలత్రాడుకు కడతారు. అది బయటకుతీసి ఆబిడ్డకు భవిషత్తులో వచ్చు కాలేయవ్యాధులు, క్యాన్సరువ్యాధుల వంటి భయంకరవ్యాధులు నయంచేయటానికి ఉపయోగిస్తారు. ఇప్పుడైతే stem cell Banks ఉన్నాయి. నైట్రస్ఆక్సయిడ్ వాయువు నుపయోగించి అతిసీతల వాతావరణంలో బొడ్డుతాడుతుంటను భద్రపరచి అవసరమైనపుడు యీ stem cells తో వైద్యంచేస్తున్నారు. ఇది చాలా ఖర్చుతోకూడుకున్నపని. మొలతాడు తాయెత్తుతోనే పూర్వీకులు యీపనిని అతిసులువుగా నెరవేర్చేవారు.

 

మొలత్రాడు దేహాన్ని రెండుభాగాలుగా విభజిస్తున్నది. పైభాగం దేవతాస్థానం. క్రిందిది రాక్షసస్థానం. పైభాగం దైవకైంకర్యాలకు, క్రిందిభాగం సంతానోత్పత్తికి, ప్రాపంచికకార్యనిర్వహనకు ఉపయోగపడాలన్నారు పెద్దలు. అందుకే పైభాగాలను బంగారుతో మొలభాగాన్ని (క్రిందిభాగాన్ని) వెండితో అలంకరించుకుంటారు. వెండిమొలత్రాడు అందుకేశ్రేష్టం.

మొలత్రాడు ధరించకపోవడం వల్ల నష్టమున్నదో లేదో తెలియదుగానీ ధరిస్తే మాత్రం చాలాలాభాలే వున్నాయి. కనుక ధరించడం ధరించకపోవడం ఎవరియిష్టం వారిది.

 పాముకరచినా, తేలుకుట్టినా విషం రక్తంద్వార గుండెకు తలకు ఎక్కకుండా, కరచిన లేక కుట్టిచోటికి పైభాగాన కట్టివేయడానికి వెంటనే అందుబాటులోవుండేతాడు మొలత్రాడే. పంచగానీ లుంగీగానీ జారిపోకుండా మొలత్రాడుక్రిందికి దోపుకోవచ్చు. ఇంట్లోవున్నప్పుడు బెల్టుపని మొలతాడు చేస్తుంది. భోజనప్రియులు మితిమీరితినకుండా అదుపుచేస్తుంది. తద్వారా జీర్ణప్రక్రియకు తోడ్పడుతుంది. ఆడవారిలో వడ్డాణం యిందుకు ఉపయోగపడుతుంది. అంతేగాదు బరువుపెరగడాన్ని తెలియజేసి జాగ్రత్తపడమని హెచ్చరిస్తుంది. బానపొట్ట రాకుండ అడ్డుకుంటుంది. నల్లమొలత్రాడు చెడుదృష్టి తగలనీదు. అందుకే పిల్లల మొలత్రాడుకు రంగురంగుపూసలు యెక్కిస్తారు. జాతకరీత్యా గ్రహదోష నివారణకు తాయెత్తులుకట్టడానికి ఆధారంగా కూడా మొలత్రాడు ఉపయోగపడుతుంది. అధికవేడిని గ్రహించి మొలత్రాడు దేహతాపాన్ని శాంతింపజేస్తుంది. అందుకే ఆడపిల్లల మెడిమ పైభాగాన నల్లదారం కడతారు. మొలత్రాడు మగవారిలోనైతే వృషణాలు వేడెక్కకుండాజేసి వీర్యకణాలసంఖ్య తగ్గకుండాచూసి సంతానోత్పత్తిసమస్యలు రాకుడా కాపాడుతుంది. వెన్నెముకకు support గా  వుంటుంది. రక్తప్రసరణను క్రమబద్ధీకరుస్తుంది. ఎముకలకు, కండరాలకు పటుత్వాన్నిస్తుంది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. హెర్నియా వంటివాటిని రానివ్వదు. పురుషాంగాన్ని సమతుల్యంగా వృద్ధిచెందేట్లు చేస్తుంది. నకారాత్మక శక్తి(negative energy)ని అడ్డుకుంటుంది. సకారాత్మకశక్తి (positive energy)ని ఆహ్వానిస్తుంది. మొలత్రాడువల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయంటే ఆశ్చర్యమేస్తుందికధా! వీటిని శాస్త్రజ్ఞులు కూడా ఆమోదిస్తున్నారు. కనుక నమ్మాలి.                                

   

Monday, 17 October 2022

కాటుక కళ్ళు, kaatuka kallu


 

కాటుక కళ్ళు

 
"సర్వేంద్రియానాం నయనంప్రధానం" అన్నారు పెద్దలు. అట్టి నయనము (కన్ను)నకు చక్కటి అందాన్నిచ్చి సంరక్షించేదికాటుక. కులమతాలకతీతంగా అందరూ కాటుక పెట్టుకుంటారు. శారదాదేవికి విన్నవించుకుంటూ "కాటుక కంటినీరు..."అన్న పద్యం లిఖించారు పోతన తన భాగవతంలో . అంటే సరస్వతీదేవి కాటుకధరించిందనేగదా! కనుక హిందువులు అతిపురాతన కాలమునుండి కాటుక ధరిస్తున్నారని అర్థమౌతున్నది. 12 వేలసంవత్సరాలకు పూర్వమునుండి ఈజిప్టు, మెసపుటేమియా ప్రజలు కంటికికాటుక పెట్టుకొనేవారని చరిత్రకారులు తేల్చిచెప్పారు. మంగళద్రవ్యాలలో ఒకటిగా కాటుకను హిందువులు భావిస్తారు. శ్రావణమంగళవారవ్రతగాథలో దీని మహాత్మ్యం గొప్పగాచెప్పబడింది. గౌరీదేవిని యీవ్రతంలో పూజిస్తారు. పూజాద్రవ్యాలలో కాటుక చాలా ముఖ్యమైనది. ఈవ్రతంలో వాయనంగా పొందినకాటుకధరించడంవల్ల ఒక ఇల్లాలు అల్పాయుస్కుడైన భర్తను దీర్ఘాయుస్కునిగా మార్చుకొని నిత్యసుమంగళిగా జీవిస్తుంది. కాటుక దిష్టిదోష  నివారిణి. అందుకే చంటిబిడ్డలకు బుగ్గపైనా అరికాలికి కాటుకచుక్కను దిష్టిచుక్కగ పెడతారు. పెండ్లిలో వధూవరులకు తప్పనిసరిగా చెక్కిలిపై కాటుకచుక్కపెడతారు. కంటికాటుకవల్ల కుజగ్రహదోషం తొలగిపోతుంది. వివాహం ఆలస్యమవ్వడం, వైవాహికసమస్యలవంటి చిక్కులు కూడా తొలగిపోయి శుభములు చేకూరుతాయి.
 
ఒక్కమనిషికి మాత్రమే నల్లటికనిగ్రుడ్డు చుట్టూ తెల్లటిభాగముంటుంది. అందువల్ల కాటుకధరిస్తే కళ్ళు విశాలంగా కనిపిస్తాయి. అంతేగాదు భరతనాట్యం కథాకళి నృత్యాలలో కళ్ళు కలువల్లామెరుస్తూ భావప్రకటనకు అనుకూలమై ప్రదర్శన రక్తిగట్టడానికి యీ కంటికాటుక ఉపకరిస్తుంది.
 
మహమ్మదీయులు"సుర్మా"అనే కాటుకను ధరిస్తారు. ఈజిప్టు సిరియాదేశాల సరిహద్దులోగల కోహితూర్ (సైనాయి) పర్వతాల్లో లభించే నల్లనిరాయిని మెత్తగాచూర్ణించి రోజ్‌వాటర్‌తోకలిపి కళ్ళకుసుర్మా(కాటుకగా) పెట్టుకుంటారు. రంజాన్‌నెల ఉపవాసదినాల్లో ప్రార్థనకుముందు కాళ్ళూచేతులు,మొగం శుభ్రంచేసుకున్న(వజూ)తర్వాత సుర్మా వేసుకోవడం పరిపాటి. మహమ్మదుప్రవక్త సహితం సుర్మా వేసుకునేవారట. అందుకే యింటికివచ్చిన అతిథులకు ముస్లింలు సుర్మా, సెంటు యిచ్చి గౌరవిస్తారు. రంజాన్‌మాసంలో ఆడమగ అందరూ సుర్మా ధరిస్తారు. ఈసుర్మారాళ్ళు నల్లగావుండటానికికారణం, మూసా ఎ ఇస్లాం (మోషే) ప్రవక్తవారికి సైనాయిపర్వత ప్రాంతంలో దైవీయకాంతి కనిపించింది. ఆవెలుగు అగ్నియై పర్వతాన్ని దహించింది. అక్కడిరాళ్ళు కాలి నల్లగామారిపోయాయి. అవే సుర్మారాళ్ళు. హైదరాబాద్,పాతబస్తీ, చార్మినార్‌ప్రాంతంలో యీరాతిముక్కలను అరేబియానుండి తెప్పించి సుర్మాచేసి విక్రయిస్తున్నారు. సుర్మా చలువచేస్తుంది. క్రైస్తవులు కాటుకవద్దంటారు. బైబిలు ప్రకారం దేవుడిచ్చిన అందంచాలు. కాటుకతో దైవనిర్మితమైన అందం సరిజేసుకోవడం. హెచ్చించుకోవడం అవివేక మని భావిస్తారు. దైవనిర్మితాన్ని యథాతథంగా వుంచుకోవడం ధర్మమని వారనుకుంటారు. ఎవరినమ్మకం, యెవరియిష్టం వారిది. తప్పుపట్ట నవసరంలేదు.  
 
కాటుక కంటినరాలకు బలంచేకూరుస్తుంది. ప్రారంభంలోవున్న కంటివ్యాధులను నయంచేస్తుంది. కళ్ళు చల్లబడతాయి. దుమ్ముధూళి పొగనుండి రక్షణ నిస్తుంది. కళ్ళలోని ఎర్రచారలను తొలగిస్తుంది. తదేకంగా కంప్యూటర్‌చూడ్డంవల్ల కలిగే శ్రమనుతగ్గిస్తుంది. సూర్యునికిరణాలవేడిమివల్ల కలిగే కళ్ళమంటలు తగ్గిస్తుంది. దృష్టిదోషాలను పోగొడుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. కనురెప్పల వెంట్రుకలు పెరిగి కంటికి అందం రక్షణ కాటుక కలుగజేస్తుంది.
 
అనేకరకాల కాటుకలు మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఘాడమైన నలుపుకోసం కొన్నింటిలో సీసం మరియు లెడ్‌సల్ఫయిడ్(గలీనా)వడుతారు. ఇది కంటికి మంచితిదికాదు. అలర్జీ కలుగవచ్చు. రాగి, ఆంటిమొనీ వంటి లోహాలపొడితో చేసిన కాటుకలు ఐలైనర్స్ పేరుతో లభిస్తాయి. ఇవి కంటికి మంచిదే. వీటన్నిటికంటే ఇంట్లో తయారుచేసుకొనే కాటుకలు శ్రేష్ఠం. వీటిలోకూడా నాలుగైదు రకాలున్నాయి. అందులో నేత్రసంజీవని ఒకటి. ఆవుపేడతో తయారుచేసిన పిడకను ఆవునెయ్యి 15చంచాలు, ఆముదం 15చంచాలు కలిపి పిడకను తడిపిపెట్టుకోవాలి. ఇటుకలతో 2,3 అంగుళాల ఎత్తుగల పొయ్యిని తయారుచేసుకోవాలి పిడకను పొయ్యిలోవుంచి అగ్గిపెట్టాలి. పొగప్రక్కకు పోకుండా ఇటుకలపైన రాగిలేక ఇత్తడిపళ్ళెంపెట్టి పళ్ళెరంపై కొన్నిచల్లని నీళ్ళుపోయాలి. పిడకనుండి వచ్చినపొగ పళ్ళెరానికి మసిగా అంటుకుంటుంది. పిడక బాకాకాలి చల్లారినతర్వాత పళ్ళెరంలో నీరుమిగిలివుంటే తుడివేయాలి. పళ్ళెరానికి అంటిన మసితుడిచి ఒకరాగి బరిణలో వేసుకొని అందులో అరగ్రాము పచ్చకర్పూరం, కాస్తా ఆవునెయ్యి కలిపితే నేత్రసంజీవనికాటుక తయారౌతుంది. దీనికికొద్ది మార్పుతో చందనకాటుక తయారుచేసుకోవచ్చు. ఇందులో పిడకకుబదులు ఆముదపుదీపం ఉపయోగించుకోవాలి. పళ్ళెరానికి లోపలివైపున చందనంపేస్టును పట్టించాలి.ఆచందనానికే సెగ పొగబాగతగిలి మసి తయారౌతుంది. మిగిలినదంతా నేత్రసంజీవని వలెనే చేసుకోవాలి. దీపానికి బదులు బాదంపప్పులు ప్రమిదలోపెట్టి అగ్గి అంటించాలి. వాటిపొగతో ఏర్పడిన మసితో కూడా కాటుక తయారుచేసుకోవచ్చు. ఇవికాకుండా బజారులో చార్కోల్(బొగ్గు)క్యాప్సూల్స్ దొరుకుతాయి. వాటిలోని బొగ్గుపొడిని అముదంతో తడిపి కాటుకగా వాడుకోవచ్చు.
 

ఆఖరుగా మరొక్కమాట. కొందరు కాటుక సరిగ్గా అంటడంలేదని ఎక్కువసేపు వుండటంలేదని చీకాకుపడి కాటుకజోలికి పోరు. అలా విసుగుపడాల్సిన పనిలేదు. తొలుత ఐస్క్యూబ్(మంచుగడ్డ)తో కంటిరెప్పలురుద్ది, శుభ్రంచేసుకొని కాటుక పెట్టుకోవాలి. తర్వాత ఇయర్‌బడ్స్ తో కనురెప్పలకు టాల్కంపౌడరు అద్ది పైపైన తుడుచుకుంటే కాటుకబాగుంటుంది. తొందరగా చెదిరిపోదు.                           


 

Thursday, 29 September 2022

ముక్కుపుడక-చెవిపోగులు,mukkupudaka-chevipogulu

 

ముక్కుపుడక-చెవిపోగులు


ముక్కుపుడకను అడ్డకమ్మ,నత్తు, బాసర,బులాకి, ముక్కెర అనికూడాఅంటారు. మతాలకతీతంగా భారతీయ స్త్రీలందరూ అనాదిగా ముక్కెరను ధరిస్తున్నారు. ఇది ఒకఆచారమే గాకుండా ముక్కుకందాన్నిస్తున్నది. దక్షిణభారతీయులు కుడిముక్కుకు ఉత్తరభారతీయులు ఎడమముక్కుకు ఆచారంగా ధరిస్తారు. పైపెదవిపై వ్రేలాడునట్లు రెండుముక్కులకు నడిమిభాగాన కూడా ధరించడం చూస్తున్నాము. ముఖ్యంగా ఆటవికజాతివారు యీపద్ధతినవలంభిస్తున్నట్లు గమనిస్తున్నాము. ఇప్పుడు ముఖ్యంగా రకరకాల రత్నాలు, వజ్రాలుపొడిగిన ముక్కెరలు అందంకోసం మగువలు ధరిస్తున్నారు. టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా ముక్కుపుడక నిరంతరం ధరిస్తున్నట్లు గమనించగలం. పూర్వం ముక్కుపుడకలేని స్త్రీలను దేవుని ప్రసాదంవండటానికి అనుమతించేవారు కాదు. దుష్టశక్తులను ముక్కుపుడక అడ్డగిస్తుందని హిందువుల ప్రగాఢవిశ్వాసం. అందుకే వివాహానికిముందే ఆడపిల్లలకు ముక్కులుకుట్టిస్తారు. సర్వసామాన్యంగా 5,7,11 సంవత్సరాల్లో ఆడపిల్లలకు ముక్కులుకుట్టించడం ఆనవాయితీ.

 

ముక్కు కుడివైపు సూర్యనాడి, ఎడమవైపు చంద్రనాడి వుంటుంది, కాబట్టి కుడివైపు మండలాకారపు (గుండ్రని) పుడకను, ఎడమవైపు అర్ధచంద్రాకారపు పుడకను ధరింపజేస్తారు.లేదా యేవైపైనా ఒంటిరాయిబేసరి ధరింపజేస్తారు. ముక్కెరను హిందువులు తాళితోసమానంగా చూస్తారు. కనుక కాబోయేభర్త పెండ్లిసంబరాల్లో భాగంగా వధువుకు ముక్కెర నిస్తాడు. కొన్నికుటుంబాలలో మేనమామ ముక్కెర నిస్తాడు. మిగిలినవారెవరిచ్చినా ముక్కెరస్వీకరించరు. దేవదాసి మాత్రమే యెవరిచ్చినా ముక్కెర స్వీకరిస్తుంది. తాళివలెనే స్త్రీలు ముక్కుపుడకనుకూడా తమకు వైధవ్యము రాకుండ కాపాడుతుందని ఎల్లప్పుడు ధరిస్తారు. హిందూదేవతలందరికీ ముక్కెర తప్పకుండా వుంటుంది. బాలకృష్ణుని వర్ణనలో కూడా "నాసాగ్రే నవమౌక్తికం" అని వుంది. ప్రళయసమయంలో బెజవాడ కనకదుర్గమ్మ ముక్కెరను కృష్ణాజలాలు తాకుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞాంలో తెలియజేశారు. భామాకలాపంలో సత్యభామ ప్రణయకలహంతో కృష్ణునితో అలుగుతుంది. తర్వాత విరహంభరించ లేక తనచెలికత్తెను కృష్ణునివద్దకు రాయబారం పంపాలనుకుంటుంది. ఆచెలికత్తెను మంచిచేసుకోవడానికి సత్యభామ యేవేవో కానుకలివ్వజూపుతుంది. కానీ చెలికత్తె అవేమీవద్దని సత్యభామధరించిన ముక్కెర కావాలంటుంది. ఇలా పురాణకాలమునుండి ముక్కెర ప్రస్తావన వుండనేవుంది.

 

ఆరోగ్యపరంగకూడా ముక్కులుకుట్టించడం, ముక్కెరధరించడంవల్ల మేలుజరుగుతుందని నమ్ముతారు. ముక్కులుకుట్టడం "ఆకుపంచర్" వైద్యవిధానంతో సమానమంటారు. దీనివల్ల ప్రాణశక్తికి సంకేతమైన ఇడ,పింగళ నాడులు ఉత్తేజితమై శక్తివంతంగాపనిచేసి మెదడులోని నాడీవ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. వెండి,బంగారు,రాగితో ముక్కెరరలుచేస్తారు గనుక ఆలోహాలు పీల్చేగాలిని శుభ్రపరచి, రోగాలను నిరోధిస్తాయి. అంతేగాకుండా ముక్కులు కుట్టించడంద్వారా గర్భకోశదోషాలు తొలగిపోయి సంతానప్రాప్తికి దోహదంలభిస్తుంది. సుఖప్రసవంజరుగుతుంది. కన్ను,చెవివ్యాధులు రావు. శ్వాశకోశవ్యాధులు కూడా రావని ఆకుపంచర్ వైద్యవిధానం చెబుతున్నది. ఈవైద్యవిధానం భారతదేశమునుండే చైనాకు వెళ్ళిందని అనేకులు నమ్ముతున్నారు.  

 

ఇక చెవిపోగుల గురించికూడా తెలుసుకుందాం. చెవులు కుట్టించడంకూడా హిందువుల పురాతన ఆచారమే. కర్ణుడు సహజ కవచకుండలాలతో పుట్టాడు. కురుక్షేత్రంలో కృష్ణుడు భీష్ముని చంపుతానని రథం నుండి దుమికి ఆయనపైకి వెళ్ళే సమయంలో కృష్ణుని కుండలములకాంతి గగనభాగంక్రమ్మినదట. ఇలా అనేకచోట్ల మన పురాణాలలో చెవికమ్మల (కుండలాల) ప్రస్తావన వుంది.  ఆడపిల్లకైతే ఒకసంవత్సరం వయసురాగానే చెవులుకుట్టిస్తారు. ఇప్పుడు చెవితమ్మకు రెండుమూడుచోట్లకూడా కుట్టించి ఆభరణాలు ధరింపజేస్తున్నారు. అమ్మాయిలకు ముందు ఎడమచెవి, అబ్బాయిలకు ముందు కుడిచెవి కుట్టిస్తారు. మేనమామ ఒడిలో తూర్పువైపుగాముఖంబెట్టించి కూర్చోబెట్టి ఉదయాన్నే కుట్టిస్తారు. మొదటిసారి తలనీలాలు దైవక్షేత్రములో తీయించే సమయంలోనే బిడ్డలకు చెవులుకుట్టించే ఆచారం చాలాకుటుంబాల్లో వుంది. తొలుత ఆడమగ పిల్లలందరికి చెవులు కుట్టించేవారు. తర్వాత ఆడపిల్లలకే కుట్టిస్తూవచ్చారు. ఇప్పుడు మగవారుసైతం అందంగావుంటాయని చెవిరింగులు, కమ్మలు ధరిస్తున్నారు. అయితే కొందరు చెవులుకుట్టించుకోకుండ అణచిపట్టుకోనుండేవిధంగా కమ్మలు ధరిస్తున్నారు. అవికూడా ఒకచెవికే ధరిస్తున్నారు. అలాకాకుందా కుట్టించుకోవడమే మంచిదని ఆకుపంచర్ వైద్యవిధానం చెబుతున్నది.

 

చెవికి కళ్ళు, ముక్కు, పళ్ళు వంటి అవయవాలు నాడులద్వారా అనుసంధింపబడి వున్నాయి. చెవులు కుట్టించడంద్వార ఆకుపంచర్ రీతిలో నాడులు ఉత్తేజితమై కంటిచూపు మెరుగౌతుంది. చెవి, పంటిసంబంధమైన వ్యాధులురావు. స్త్రీలలో ఋతు సంబంధ మైన హెచ్చుతగ్గులు కలుగవు. ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుందని శుశ్రుతసంహితలో చెప్పబడింది. నాడీమండలవ్యవస్థ ఉత్తేజితమవడంవల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆందోళన, మానసిక రుగ్మతలు దూరమై ప్రశాంతత కలుగుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఊబకాయంరాదు. మగపిల్లలకు బుడ్డ (హైడ్రోసీల్) హెర్నియా వంటి వ్యాధులురావు. పక్షవాతం రాదు. రక్తపోటు, ఆయాసం అధికమవ్వడం జరుగదు. రంగురంగులలో ఆకర్షనియ్యంగావున్నాయని ప్లాస్టిక్ లేదా తగ్గులోహాలతోచేసిన చెవిరింగులు ధరించడం మంచిదిగాదు. బంగారం, వెండి, రాగితోచేసిన వాటినే వాడుకోవాలి. నొప్పితక్కువగా వుండటం కోసం ముక్కుచెవులు కుట్టడానికి పియర్సింగ్ గన్లను వాడుతున్నారు. అయితే ముక్కు చెవులు కుట్టడంలో ఇంఫెక్షన్ కలుగవచ్చు. ఇంకా చిన్నచిన్నబుడిపెలు (సిస్ట్ గ్రాన్యులోమా) యేర్పడవచ్చు. అటువంటప్పుడు తెలిసినవైద్యుని సంప్రతించడం మంచిది.             

 

Friday, 5 August 2022

గోరింట,Gorinta,మెహంది,హెన్న

 

గోరింట


గోర్లకు రంగునంటించేదిగనుక దీనికి  గోరింట అనేపేరు వచ్చిందంటారు. ఇది గౌరియింటిలోనిది గనుక గోరింట అనేపేరువచ్చిందని హిందువుల నమ్మకం. సంస్కృతంలో గోరింటను “మెహెందిక” అంటారు. హెన్నా అనికూడా గోరింటకు మరోపేరు. పసుపు సూర్యుని వెలుగులోని వెలుపలిభాగానికీ, గోరింట లోపలిభాగానికి ప్రతీక. గోరింటప్రసక్తి వేదాలలోను ధార్మికగ్రంథాలలోనూ వుంది.అన్నిమతాలమహిళలూ యిష్టంగా ధరిస్తారీగోరింటను. పెళ్ళిళ్ళలో, పండుగలలోనేగాకుండా సంతోషంగా ఉన్నప్పుడల్లా గోరింటను ధరిస్తారు. ఆషాడమాసంలోనైతే దీన్నిధరించితీరాలంటారు. ఎందుకంటే ఆషాడంలో వర్షాలెక్కువ. మహిళలు నీళ్ళలో కాళ్ళుచేతులు తడవకుండా పనులుచేసుకోలేరు. దానికితోడు వర్షం. అందువల్ల సూక్ష్మక్రిములవృద్ధి యెక్కువగా వుంటుంది. జబ్బుచేసే ప్రమాదం పొంచివుంటుంది. ఈగోరింటకును పెట్టుకోవడంవల్ల ఎర్రగాపండి అందానికందం, సూక్ష్మక్రిములనుండి రక్షణా లభిస్తుంది. చేతుల్లో గోరింటాకు బాగాఎర్రగా పండితే కన్యలకు మంచిభర్తలు లభిస్తారనేనమ్మకం వుండనేవుంది. మందారంలాపండితే మంచిమొగుడొస్తాడు. సిందూరంలాపండితే  కలిగిన (ధనవంతుడైన) మొగుడొస్తాడని స్త్రీలుపాడుకోవడం కద్దు.

ఈగోరింట వెనుక ఒకపురాణగాథకూడా వుంది. పార్వతీదేవి చెలులతోగూడి వనవిహారంచేస్తున్న సమయంలో రజస్వల అయ్యింది. ఆరక్తం ఒకబొట్టు నేలపైబడింది. అది వెంటనే ఒకమొక్కై మొలిచింది. అది గమనించిన ఆమెచెలులు వెళ్ళి పార్వతీదేవి తల్లిదండ్రులకు ఆవింతను తెలియజేశారు. వారు (పర్వతరాజదంపతులు) వచ్చి చూచేటప్పటికి మొక్కచెట్టయింది. గౌరీదేవి ఆచెట్టు ఆకునుగిల్లి చేతితోనలిపింది. వెంటనే చేయిఎర్రగా మారింది. చేయియెర్రగాకందిందేమిటని తల్లి గాబరాపడి పరిశీలించి చూడగా ఏమీకాలేదు. ఎర్రగామారి చేతికందాన్నిచ్చింది.

హిమవంతుడు (తండ్రి) ఆచెట్టును గౌరవభావంతోచూసి, ఇకపై స్త్రీలసౌభాగ్యచిహ్నంగా వర్ధిల్లమని వరమిచ్చాడు. అప్పటినుండి గోరింట మహిళలకానందదాయినియై విలసిల్లుచున్నది. అయితే చరిత్రకారులు 5 వేలసంవత్సరాల క్రితమే దీన్ని ఈజిప్షియనులు  వాడేవారని, అందుకే వారి పిరమిడ్లలోని మమ్మీల (శవాల) కు గోర్లు వెంట్రుకలు ఎర్రగా వున్నాయని తేల్చారు. క్రీ.పూ.700  సంవత్సరాలనుండి భారతదేశంలో గోరింట వాడుకలోవుందనికూడా చెప్పారు. మరికొందరు మొగల్‌చక్రవర్తుల ద్వారా 12వ శతాబ్దంలో మనదేశానికి వచ్చిందంటున్నారు. అప్పటికే అరబ్బులు గోరింటను అదృష్ట చిహ్నముగా చూసేవారట. గుర్రాలజూలు అందాలకుగూడా గోరింటను వాడేవారట.

ఒకకప్పునీళ్ళలో 4 టేబుల్‌స్పూన్ల గోరింటాకుపొడి కలిపి 8 గంటలు నానబెట్టాలి (రాత్రంతావుంచితే యింకామంచిది). తరువాత బ్లాక్‌టీ డికాషన్ లేదా కాఫీడికాషన్ పోసి కలుపుకోవాలి. తర్వాత ఒకచంచా నిమ్మరసం, ఒకటేబుల్‌స్పూన్ ఉసరికపొడివేసి బాగాకలిపి పేస్టులా తయారుచేసుకోవాలి. ఈపేస్టును గోర్లకు పట్టించవచ్చు. అరచేతులకు పాదాలకు వాళ్ళవాళ్ళ అభిరుచికితగ్గట్లు చిత్రాలరూపంలో గోరింటపేస్టు పట్టించుకోవచ్చును. గోరింటాకుపెట్టుకోవడంకూడా ఒకకళే. ముందు చేతులు శుభ్రంచేసుకొని తడిలేకుండా తుడుచుకొని గోరింతపేస్టు డీజైన్లను వేసుకోవాలి. 7,8 గంటలు అలాగేవుంచుకోవాలి. తర్వాత నీళ్ళతో కడగకుండా అరచేతులు రుద్దుకోవంద్వారా గోరింటను తొలగించుకోవాలి. ముందుగా చెక్కెర నీళ్ళలోకలిపి లేతపాకంగా వేడిచేసుకోవాలి. చల్లారినతర్వాత ఒకచంచా నిమ్మరసంకలపాలి. ఈ సిరఫ్‌ను గోరింట తొలగించుకున్న తర్వాత   చేతులకు పట్టించాలి. తర్వాత ఇంగువకానీ లవంగాలుకానీ పెనంపై వేయిస్తే వచ్చేపొగ చేతులకు పట్టాలి. ఈపొగకుబదులు ఆవనూనెగానీ వ్యాసిలిన్‌గానీ లేక నీలగిరితైలం (యూకలిప్టస్ఆయిల్)గానీ పట్టించవచ్చు. ఇలాచేస్తే బాగా పండుతుంది. ఎక్కువనాళ్ళుంటుందికూడా. అయితే వీటిని ఎక్కువగా వాడరాదు. వాడితే ఎరుపుకుబదులు ముదురుగోదుమరంగుకు మారుతుంది. తలకుపట్టించుకోవాలంటే చేతులకు గ్లోవ్స్ వేసుకొని గోరింటపేస్టు పట్టించుకొని మూడుగంటలతరువాత కడిగేయాలి. అలాగేవుంచుకుంటే తలచర్మం వెంట్రుకలు పొడిబారిపోతాయి.

గోరింటాకులో కూమరిన్, గ్లాంథోన్,గ్లైకోసైడ్లాంటి సేంద్రియరసాయనిక మిశ్రమాలతో పాటు అరచేతికి ఎరుపునిచ్చే"లాసన్" కూడావుంటుంది. అరచేతిపై మృతకణాలుంటాయి. వీటిగుండా లాసన్ చొచ్చుకపోతుంది. మృతకణాలక్రింద నశించడానికి సిద్దంగావున్న కణాలూవుంటాయి. వీటీగుండాకూడా లాసన్ చొచ్చుకొనివెళ్ళి అరచేతులకు ఎర్రదనాన్నిస్తుంది. ఈమృతకణాలు స్నానంచేసినప్పుడల్లా క్రమేణారాలిపోటూవుంటాయి. కనుక ఎర్రదనంకూడా క్రమేణాతగ్గిపోతుంది. కోన్లద్వారా గోరింటాకు పెట్టుకొనే విధానం వచ్చినతర్వాత గోరింట వాడకం విపరీతంగా పెరిగిపోయింది. 1990 తర్వాత పాశ్చాత్యదేశాలలో యిదొక ఫ్యాషనైపోయింది. రకరకాల డీజైన్లు అందుబాటులోనికి వచ్చేశాయి. అయినా సాంప్రదాయపద్దతుల్లో తయారుచేసుకొన్న గోరింటపేస్టే ఉత్తమం. వీలుగానిపక్షంలో మంచినమ్మకమైన కంపెనీలవి, వాటిలోనూ మరీపాతవిగాకుండా చూసుకొని కోన్లు కొనాలి. ఎర్రదనంకోసం యిప్పుడు కొన్నిహానికర రసాయనాలుకలిపి గోగింటపేస్టులు, పౌడర్లు బజారులోనికి వస్తున్నాయి. జాగ్రత్తగా పరిశీలించి కొనడం మంచిది.

వైద్యశాస్త్రరీత్యాకూడా గోరింటకు చాలాప్రయోజాలున్నాయి. గోరింటకు చలువచేసే గుణమున్నది. అందువల్ల నరాలు స్వాంతనజెంది కీళ్ళనొప్పులు తగ్గుతాయి. ఉడుకుగడ్డలు నయమౌతాయి. కాళ్ళపగుళ్ళు రాకుండా చూస్తుంది. గోరింట చర్మసమస్యలను నివారుస్తుంది. దెబ్బలుతగలి గాయాలైనా, కాలిగాయాలైన తొందరగా మానుపుతుంది. స్పోటకంవంటి అంటుజబ్బుల్లో అరికాళ్ళకు గోరింటపెడితే ఉపశమనంకలుగుతుంది. బెణుకులు , పిప్పిగోళ్ళు, గోరుచుట్టును నయంచేస్తుంది. కాళ్ళుచేతుల దురదలను పోగొడుతుంది. చెట్టుబెరడు కామెర్లను బాగుచేస్తుంది. గోరింటపూలు తలక్రింద వేసుకొని పడుకుంటే నిద్రబాగాపడుతుంది.  గోరింటతలకు పట్టించు కోవడంవల్ల వెంట్రుకలకు దృఢత్వకలిగి తొందరగారాలిపోవు. చుండ్రునశిస్తుంది. గోరింటాకురుబ్బి నువ్వుల నూనెలో వేసి కాచుకొని గోరింటతైలం తయారుచేసుకోవచ్చు. ఇది తలనూనెగా వడుకోవడంవల్ల వేడితగ్గి జ్ఞాపకశక్తికూడా పెరుగుతుంది. స్త్రీలు ఎక్కువగా గోరింట వాడుతారుగనుక, వారి అరచేతి రక్తనాళాలు, నాడులు అధిక ఉష్ణానికి గురికాకుండా చూసి గర్భాశయదోషాలను తొలగిస్తుంది. వారి హార్మోన్ల పనితీరు క్రమబద్దీకరించ బడుతుంది. తద్వారా అండాశయాలపనితీరు మెరుగై సంతానోత్పత్తికి దోహదమౌతుంది. గోరింట కుష్టునివారిణి యని ఆయుర్వేదం చెబుతున్నది. గోరింట అలంకరణగుణం కారణంగా ఉపయోగం ఎక్కువై కోన్లతయారీకి, పొడిప్యాకెట్లతయారీకి గిరాకిపెరిగి, కడకు రైతులుదీన్ని వాణిజ్యపంటగా పండించి లాభాలార్జించేదిశగా పురోగమించడం ఆశించగ్గపరిణామం.   

 


 

                        

Sunday, 17 July 2022

పసుపు కుంకుమలు-గాజులు మెట్టెలు

 

పసుపుకుంకుమలు-గాజులు మెట్టెలు


పసుపుకుంకుమలలేని శుభకార్యాలు హిందువులకసలేవుండవు. ముత్తైదువకు(సుమంగళికి)గుర్తు  యీపసుపుకుంకుమలు. ఆహ్వానం పలకాలంటే బొట్టుపెట్టి పిలవడఅనేది ఒకసామెతగా నిలచి పోయింది. మహిళలలకు కుంకుమబొట్టుపెట్టి శుభకార్యాలకు పిలవడం సత్సాంప్రదాయం. పెళ్ళిపత్రికలమూలలకు పసుపుకుంకుమలురాసి భగవంతునికి సమర్పించినతర్వాతే వాటిని పిలువవలసినవారికిస్తారు. అలా పిలవడంవల్ల ఆపిలుపు సాక్షాత్తు లక్ష్మీదేవిపిలిచినట్లుగా భావిస్తారు. సామాన్యంగా వ్రతాలకు పిలిచిన ముత్తైదువులకు (పేరంటాళ్ళకు) తొలుత కుంకుమబొట్టుపెట్టి కాళ్ళకు పసుపురాస్తారు. ఇంట్లో స్త్రీలుకూడా తొలుత కుంకుమబొట్టు పెట్టుకొని తర్వాతే కాళ్ళకు పసుపు రాసుకుంటారు. పండుగనాటి పూజల్లో మగవారుసైతం కుంకుమబొట్టు పెట్టుకుంటారు. పెండ్లిండ్లలో వధువుకు పసుపురాసి మంగళస్నానం చేయిస్తారు. చాలాకుటుంబాలు పసుపునీళలోతడిపి ఆరేసిన నూతన ధవళవస్త్రాలే వధూవరులు ధరించి పెళ్ళిపీటలమీద కూర్చుంటారు. మిగిలిన క్రొత్తబట్టలకు సైతం కొసలలో పసుపురాసి వాడుకుంటారు. అత్తవారింటికి బిడ్డనుసాగనంపేటప్పుడు చీరసారెలు పెడతారు. వాటితోపాటే పసుపుకుంకుమలు యివ్వడం తప్పనిసరి,  పూజల్లో తొలిపూజ పసుపుగణపతికిచేసి తర్వాత ఇష్టదైవాన్ని పూజిస్తారు. పసుపునీళ్ళుచల్లితే యేవస్తువైనా అపవిత్రతనువదలి పవిత్రతను సంతరించుకుంటుందన్నది పెద్దలమాట. పెళ్ళిసంబరాల ప్రారంభంలో రోలురోకలికి పసుపుకుంకుమలతో పూజచేసి, మిగతా కార్యాలకు కావలసిన పసిపుకోసం పసుపుకొమ్ములు దంచుతారు. కొందరు పెళ్ళివేడుకలకు నాందిగా ఒకకొయ్యకు పసుపుకుంకుమలురాసి, పూజచేసి ఆకొయ్యను  నాటుకుంటారు. తొలుత పసుపుతాడు కమర్చిన తాళినే వరుడు వధువుకు కడతాడు. తర్వాతే బంగారుగొలుసుకో నల్లపూసలహారానికో మార్చు కుంటారు. అంతెందుకూ, ఏకారణంగా నైనా బంగారుతాళి సమయానికి లభ్యంకాకపోతే, పసుపుకొమ్ము తాళిబొట్టుకుమారుగా ఉపయోగించుకుంటారు. అంటే పసుపుకొమ్ము బంగారుతో సమానమన్నమాట. పెండ్లిలో తల్లిదండ్రులు కుమార్తెకు కానుకగా యిచ్చే భూమి, నగలు, పైకం మొదలైనవి పసుపుకుంకుమలకిచ్చినవిగా చెప్పుకుంటారు. 

హైందవుల ఇళ్ళలో సింహద్వారానికి తప్పక గడపవుంటుంది. (లోపలిగదులకు ఇప్పుడు గడపలుపెట్టడం మానేశారు) సింహద్వారపుగడప భూమ్యాకాశాలకు మధ్యరేఖగా భావించి పసుపురాసి,  కుంకుమబొట్లు పెడతారు. "గడపలేనిగృహం కడుపులేనిదేహం” అన్నసామెత వుండనేవున్నది.రోజూ చేయకపోయినా  పండుగపూట గడపపూజ హిందువులు తప్పకచేస్తారు.  ఇంటిముందుచల్లే కళ్ళాపిలోగూడా గోమయంతోపాటు పసుపూ కలుపుతారు.

గడపను స్మార్తులు గౌరీదేవిగానూ, వైష్ణవులు లక్ష్మీదేవిగానూ భావిస్తారు. గడపను పసుపూకుంకుమలతో పూజించడంవల్ల, కన్యలకు త్వరగా వివాహమై మంచి మంచిభర్త లభిస్తాడని నమ్ముతారు.  ఇల్లాలు గడపకు పసుపుకుంకుమలతో పూజచేస్తే, పిల్లలు బుద్ధిమంతులై చెప్పినమాటవింటారని, కూతుళ్ళలాంటికోడళ్ళు , కొడుకుల్లాంటి అల్లుళ్ళు వస్తారని నమ్ముతారు. పసుపు గురువుకు ప్రతీక, కుంకుమ శుక్రునికి ప్రతీక.

గడపను పసుపుకుంకుమలతో పూజిస్తారుగనుక గురుశుక్రులు ప్రసన్నులై శుభాలు సమకూరుస్తారు. ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా అడ్డుకుంటారు. గడప యీవిధంగా పూజార్హత కలిగియున్నందున గడపను కాలితోతొక్కకుండా దాటుకుంటారు.

 సుషుమ్ననాడి శరీరంలోని నాడులన్నింటినీ కలుపుకుంటూ, నొసటిని కేంద్రంగాచేసుకొని సంకేతాలను మెదడుకుచేరవేస్తూ, నిరంతరం చైతన్యవంతంగావుంటుంది. ఈసుషుమ్ననాడీకేంద్రమైన లలాటంపై కుకుమబొట్టు పెట్టుకోవడంద్వారా ఇతరులదృష్టి (దిష్టి) దోషాలని  కుంకుంబొట్టు అడ్డుకుంటుంది. అంతేగాకుండా సూర్యతాపంనుండికూడా యీబొట్టు రక్షిస్తుంది. లలాటంలో  పీనియల్ గ్రంథివుంటుంది. ఇది ఆరోగ్యకారకమైన హార్మోన్లనుత్పత్తి చేస్తుంది. దానిపై ఒత్తిడిని యీ లలాటకుంకుమబొట్టు తగ్గిస్తుంది. షట్చక్రాలలో ఆజ్ఞాచక్రం కనుబొమలమధ్య (భ్రూమధ్యము) న వుంటుంది. ఈచక్రంపై అధికారం సాధిస్తే, సాధకునికి అద్భుతశక్తులు లభిస్తాయి. ఈప్రాంతంలో కుంకుమబొట్టుపెట్టుకుంటే ఆజ్ఞాచక్రం ఉత్ప్రేరితమై సాధకునికి సహకరిస్తుంది. నుదుటిబొట్టు ప్రస్తావన పద్మ, ఆగ్నేయపురాణాలలోనూ, పరమేశ్వర సంహిత లోనూ వున్నది.

 పసుపుకుంకుమలు చేజారి క్రిందపడితే అశుభంగా పరిగణించవలసినపనిలేదు. అది భూదేవికి పసుపు కుంకుమ సమర్పించినట్లు భావించాలి. అలా క్రిందపడిన పసుపు కుంకుమలు తిరిగి వాడుకోకుండా చెట్లపై చల్లేయాలి. దేవాలయమెట్లకు పసుపురాసి కుంకుమబొట్లుపెట్టి మ్రొక్కితే , అదికూడా భూదేవిపూజగానే పరిగణిస్తారు.

 ఇవన్నీ హైందవుల మతవిశ్వాసాలైతే పసుపు క్రిమినాశినిగా వైద్యులు గుర్తించారు. పసుపునీళ్ళు కళ్ళాపిచల్లడం గడపకు పసుపురాయడంవల్ల క్రిములు, పురుగులు యింట్లోకి ప్రవేసించలేవు. దెబ్బలుతగిలినప్పుడు పసుపుపెట్టడానికి కారణం కూడా పసుపుకున్న క్రిమినాశకగుణమే. ఈకారణంగానే స్త్రీలు ముఖానికి వేసుకునే ముఖపట్టీ (ఫేస్ ప్యాక్)లలో పసుపువాడతారు. పసుపుతో నారింజపండు   తొక్కలపొడిగానీ, మంచిగంధంపొడిగానీ, పెసరపిండితోగానీ, వెన్నతోగానీ కలిపి, ముఖపట్టీ (ఫేస్ ప్యాక్) వేసుకుంటారు. ఇందువల్ల ముఖనికికాంతి వస్తుంది.  ఇక ఆయుర్వేదవైద్యంలో పసుపు ఉపయోగం చాలాయెక్కువే. మూగదెబ్బలుతగిలి విపరీతమైననొప్పి వాపువుంటే, పసుపు ఉడకబెట్టి గోరువెచ్చగా వుండగానే పైనపట్టిస్తే, తొందరగా నయమౌతుంది. పసుపు త్రిఫలచూర్ణం కలిపి సేవిస్తే రక్తహీనత నయమౌతుంది. నూతనవధువుకు గర్భాదానసమయంలో కలిగే రక్తస్రావానికి పసుపుకషాయం మంచిమందు. అడ్డసరంఆకులు పసుపు కలిపినూరి సేవిస్తే దగ్గు నయమౌతుంది. ఇవి మచ్చునకొకటిరెండు మాత్రమే. ఆయుర్వేద పసుపు యోగాలు వ్రాయాలంటే, అది మరో ఉద్గ్రంథమే ఔతుంది.

 ఆఖరుగామరోమాట. భర్తచనిపోతే భార్యతన ఐదోతనం (పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు పువ్వులు) కోల్పోవాలనడం సరికాదు. ఇది యేశాస్త్రంలోనూ చెప్పబడలేదు. కనుక పసుపుకుంకుమలు ఉంచుకోవడమా  తీసివేయడమా అన్నది ఆస్త్రీకే వదిలివేయాలిగానీ బలవంతంచేయరాదు. పంచకన్యలు లేక పంచమహాపతీవ్రతల గురించి చెప్పిన యీశ్లోకం చూడండండి

 

శ్లో: అహల్యా ద్రౌపది కుంతీ

       తారామండోదరీ తథా

        పంచకన్యా స్మరే నిత్యం

     మహాపాతక నాశినః


 అన్నారు. ఇందులో కుంతి, మండోదరి, తార వీళ్ళంతా భర్తనుపోగొట్టుకున్నవారే. అయినా పూజనీయులు. వీరి స్మరణవల్ల పాపాలన్నీ హరించుకపోపోతాయన్నారు. కనుక స్త్రీని యెప్పుడూ అపవిత్రగానూ, ఆమె దర్శనం అపశకునంగానూ భావించడం ముమ్మాటికీ తప్పే.  

 ఇక మెట్టెలు గాజులను గురించి కూడా తెలుసుకుందాం. పెళ్ళయిన మహిళకు తప్పనిసరిగా తాళి, పసుపుకుంకుమలతోపాటుగా మెట్టెలు, మట్టిగాజులు ధరింపజేసి అత్తింటివారు మాఇంటిమహలక్ష్మి అని ముచ్చటపడి పిలుచుకుంటారు. కాలిబొటనవ్రేలి ప్రక్కవ్రేలికి వెండితోచేసిన మెట్టెలు ధరింపజేస్తారు. పెళ్ళిలో ఒక ముఖ్యఘట్టంగా వధువుకు మెట్టెలు పెడతారు. వాళ్ళవాళ్ళ ఆచారం ప్రకారం కొందరిండ్లలో పుట్టింటివారు, ఇంకొందరియిళ్ళలో మేనమామ, మరికొందరి యిళ్ళలో వరుడే ధరింపజేస్తాడు. ఎవరు ధరింపజేసినా మెట్టెలవల్ల మేలేజరుగుతుందన్న విషయం గమనింపదగ్గది. పెండ్లిలో వరునికిగూడా మెట్టెలువేస్తారు, గానీ ఆతరువాత వాటిని తీసివేస్తున్నారు. మెట్టెలు వెండితో తయారుజేస్తారు గనుక, సకారాత్మక (పాజిటివ్) ఎనర్జీని అవి భూమినుండి గ్రహించి శరీరానికందిస్తాయి. మెట్టెలువేసిన వ్రేలు భాగంలో నరాల చివరలుంటాయిగనుక, అక్కడ ఒత్తిడిగలుగుతుంది. అందునా వ్రేలు నడిమిభాగం కూడా మెట్టెలవల్ల భూమికి అనుసంధింపబడి వుంటుందిగనుక, వ్రేలుమొత్తనికి ఒత్తిడి (ప్రెజర్) కలిగి, ఆక్యుప్రెజర్ వైద్యవిధానం ప్రకారం,  మెట్టెలవ్రేలినరం గర్భాశయానికి, గుండెకు సంబంధింపబడివుండటం వల్ల రక్తప్రసరణ చక్కగా జరిగేట్లుచేస్తుంది. అందువల్ల ఋతుక్రమం క్రమబద్దీకరింపబడుతుంది. గర్భాశయాన్ని దృఢంగావుండేట్ల్లు చేస్తుంది. సుఖప్రసవానికి, సంతానాభివృద్దికి తోడ్పడుతుంది. గర్భంధరించిన తర్వాత వచ్చే సమస్యలను నివారిస్తుంది. స్త్రీలకు వుండే అధిక కామవాంచ్ఛలను అదుపుజేస్తుంది. వెండివల్ల చర్మవ్యాధులు కూడా అరికట్టబడతాయి.  

 ఇకగాజుల విషయానికొస్తే, గాజుల రాపిడివల్ల చర్మానికి కొంత విద్యుత్ఛక్తి అంది రక్తపోటు క్రమబద్దీకరింపబడుతుంది. మణికట్టుపై గాజుల సున్నితమైన రాపిడివల్ల అక్కడి నరములు ఉత్తేజితమై ఉత్సాహాన్ని కలుగజేస్తాయి. మట్టిగాజులు వేసుకోవడంవల్ల ఋతుసమయంలో స్త్రీశరీరంలో యేర్పడె నకారాత్మక శక్తి (నెగెటివ్ ఎనర్జి) ప్రక్కవారికి ప్రాకకుండావుంటుంది. గాజులుధరించడంవల్ల స్త్రీలలోని అధికవేడిని తగ్గిస్తుంది. స్త్రీలు గర్భముధరిచివుండగా  సీమంతంచేస్తారు. ఆ సందర్భంగా మట్టిగాజులు ప్రత్యేకంగా వేస్తారు. అందువల్ల గర్భము సురక్షితమౌతుంది. సీమంతంలో  ఒకచేతికి ఇరవైఒకటి మరోచేతికి ఇరవైరెండు గాజులు వేస్తారు. మిగతాసమయాలలో చేతులకు సరిసంఖ్యలో గాజులు వేసుకోవాలంటారు. చేతికున్న గాజులు ఆస్త్రీ సంతానవృద్దిని సూచిస్తాయంటారు. ఇవన్నీ వారివారి మతాచారవిశ్వాసాలుగా మనం భావించవచ్చు. ఏదియేమైనా చేతికివేసుకున్నగాజులు స్త్రీకి అందాన్నిస్తాయి. మెట్టెలసవ్వడి, గాజులరవళి హృద్యంగా వుంటాయన్నది నిర్వివాదాంశం.                                         

       

 

 

Friday, 24 June 2022

తాంబూలం,Taambulam.

 

తాంబూలం

 


హిందూకుటుంబాలలో తాంబూలంలేకుండా యేశుభకార్యమూ జరుగదు. వ్రతాలకుగానీ, పూజలకుగానీ, పెండ్లికిగానీ మరేయితరశుభకార్యాలకేగానీ తాంబూలమిచ్చిపిలవడం ఒకసదాచారం. పూజలో భగవంతునికీ తాంబూలంసమర్పించడం తప్పనిసరి. పెద్దలకు తాంబూలమిచ్చి ఆశీర్వాదంతీసుకోవాలి. ఆఖరుకు సాగనంపేటప్పుడుకూడా తాంబూలమిచ్చి పంపాలి. ఒకశుభకార్యం పురమాయించేటప్పుడూ తాంబూలమిచ్చి పనిఅప్పజెప్పాలి. ఒకకావ్యం అంకితం తీసుకోవాలంటే కవికి తాంబూలమిచ్చి కానుకలివ్వాలి. ఒకపెళ్ళిసంబంధం కుదిరితే నిశ్చితార్థం చేస్తారు. అందులో నిశ్చయతాంబూలమియ్యడమే అతిముఖ్యం. రెండువైపులవారూ తాంబూలాలుమార్చుకుంటేనే సంబంధం కుదిరినట్లు. తాంబూలంతోపాటు, పుష్పాలు, పండ్లు, క్రొత్తబట్టలుకూడా యిస్తారు. కానీ ఏమున్నాలేకున్నా, తంబూలాలుమాత్రం తప్పనిసరి. గురజాడాప్పారావుగారి కన్యాశుల్కం నాటకములో అగ్నిహోత్రావధానులు ఒకముసలానకు తకూతురునిచ్చిపెండ్లిచేయడానికి నిశ్చితార్థంచేసుకొని వస్తాడు. భార్యా బావమరదులు మేమొప్పుకోమంటారు. అప్పుడు అగ్నిహోత్రావధానులు "తాంబూలాలిచ్చేశాను తన్నుకచావండి" అంటాడు. అంటే తాంబూలమిచ్చి మాటచెబితే యికదానికి తిరుగేలేదన్నమాట. ఇక పెండ్లిలో తాంబూలప్రశస్తి వేరుగాచెప్పవలసిన పనిలేదు. వధూవరులకలయిక ఆకూవక్కావలె విడదీయరానిదై వుండాలన్నది ఆర్యవాక్యం.

తాంబూలం భగవంతునకు పూజలోసమర్పిచడం, శతపత్ర(శతదళకమల)ములతో పూజించడంతో సమానమేగాక, సర్వదోషహరమని భావిస్తారు. కొన్ని పూజల్లో కలశస్థాపనచేస్తారు. పాత్ర(చెంబు) లో మంచినీరుపోసి, తమలపాకుతొడిమలు నీటినితాకునట్లు చుట్టూవుంచి పైన కొబ్బరికాయవుంచుతారు. ఆకులతొడిమలకు నీళ్ళుతగులుతుంటేచాలు ఆకులువాడిపోకుండా పచ్చగా కళకళలాడుతూవుంటాయి. ఇట్టి కలశంలోనికి ఇష్టదేవతనావాహనచేసి పూజిస్తారు. ఈవిధంగా తమలపాకులు, తాంబూలం శుభకార్యాలన్నింటిలో అగ్రస్థానం వహిస్తున్నాయి. అంతెందుకూ ఒకవ్యక్తిని మహోన్నతునిగా నిర్ణయించినందుకు గుర్తుగా అతనికి అగ్ర(తొలి)తాంబూలం ఇచ్చి గౌరవించాలి. రాజసూయయాగ చరమాంకంలో శ్రీకృష్ణుడు మహోత్తముడని గుర్తించి అగ్రతంబూలమిచ్చి గౌరవించించాడు ధర్మరాజు.   

 తాంబూలానికి సంబంధించిన పురాణగాథలూవున్నాయి. ఆంజనేయుడు లంకలో సీతాదేవిని దర్శించి, శ్రీరాముని అంగుళీయమిచ్చి తన్నుతాను రామదూతగా నిరూపించుకొనినపుడు, సీతసంతోషించి, తనసంతోషానికి చిహ్నంగా ఏమైనా యివ్వాలనుకున్నది. తనవద్ద యేమీలేకపోవడంతో దగ్గరలోవున్న తమలపాకుతీగనుండి రెండుతమలపాకులు త్రెంచియిచ్చింది. హనుమంతునికి అప్పటినుండి తమలపాకులంటే ఎంతోయిష్టం. అందుకే ఆయనకిష్టమైన తమలపాకులతో ఆకుపూజచేస్తారు. అర్జునుడు యుద్ధంలో విజయంకోసం యజ్ఞంచేయతలపెట్టాడు.  అందుకోసం ఋషులు తొలుత తమలపాకులు అందివ్వమన్నారు. సమయానికి అక్కడ తమలపాకులులేవు. దరిదాపుల్లోదొరకలేదు. వెంటనే అర్జునుడు నాగలోకంవెళ్ళి, అక్కడి నాగరాణినడిగి తమలపాకులు తెచ్చియిచ్చాడట. అందుకే తమలపాకుతీగను నాగవల్లి అంటున్నారు. మరికొందరి అభిప్రాయంప్రకారం తమలపాకుతీగ స్వర్గం(నాకం)నుండి భువికి వచ్చిందట, అందువల్లదానిని నాకవల్లి అని పిలిచారట. అదే కాలక్రమంలో నాగవల్లి అయిందట.

 అన్ని శుభకార్యాలలో, పూజలలో తాంబూలమంటే, ఆకూవక్కా అనే అర్థం. స్త్రీలు బొట్టుపెట్టి తాబూలమిచ్చేతప్పుడు, ఆకులచివర్లు యిచ్చేవారికి వ్యతిరేకదిశలో వుండాలంటారు. ఆకులు మూడులేక ఐదు, వక్కలురెండు, పండ్లురెండు చేర్చియివ్వడం శ్రేయోదాయకం. మంగళకరద్రవ్యాలు ఎనిమిది. వాటిని అష్టమంగళాలంటారు. వాటిలో తాంబూలంకూడా ఒకటి. అష్టమంగళాలుయేవంటే, అవి పుష్పాలు, ఫలాలు, అక్షింతలు, అద్దం, వస్త్రం, తాంబూలం, దీపం, కుంకుమ. భగవదారాధనకు షోడషోపచారాలున్నాయి. అందులోనూ తాంబూలమున్నది. షోడషోపచారాలు యేవంటే, అవి ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, ఆత్మప్రదక్షణం. కొందరు ఆత్మప్రదక్షణానికి బదులు ధ్యానాన్ని చేర్చుకున్నారు.

 మనుషుల ఈతిబాధలు తొలగడానికి వారి రాశినిబట్టి తంబూలాన్ని ఒకప్రత్యేకవారం ఒకప్రత్యేక దైవానికి ప్రత్యేకఫలాలుచేర్చి పూజిస్తే మంచి ఫలితముంటుందని జ్యోతిష్కులుతెలియజేస్తున్నారు. అవి యీవిధంగా వున్నాయి.

 1. మేషరాశివారు తాంబూలంలో మామిడిపండ్లుంచి మంగళవారం కుమారస్వామిని పూజించాలి

2. వృషభరాశివారు తాంబూలంలో మిరియాలులుంచి మంగళవారం రాహువుపూజ చేయాలి.

3. మిథునరాశివారు తాంబూలంలో అరటిపండ్లుంచి బుధవారం ఇష్టదైవాన్ని పూజించాలి.

4. కర్కాటకరాశివారు తాంబూలంలో దానిమ్మపండ్లుంచి శుక్రవారం కాళీమాతను పూజించాలి.

5. సింహరాశివారు తాంబూలంలో అరటిపండ్లుంచి గురువారంనాడు ఇష్టదైవాన్ని పూజించాలి.

6. కన్యారాశివారు తాంబూలంలో మిరియాలుంచి గురువారం ఇష్టదైవాన్ని పూజించాలి.

7. తులరాశివారు తాంబూలంలో లవంగాలుంచి శుక్రవారం ఇష్టదైవాన్ని పూజించాలి.

8. వృశ్చికరాశివారు తాంబూలంలో ఖర్జూరపుపండ్లుంచి మంగళవారం ఇష్టదైవాన్ని పూజించాలి.

9. ధనుర్రాశివారు తాబూలంలో కలకండనుంచి గురువారం ఇష్టదైవాన్ని పూజించాలి.

10. మకరరాశివారు తాంబూలలో బెల్లముంచి శనివారం కాళీమాతను పూజించాలి.

11. కుంభరాశివారు తాంబూలంలో నెయ్యివేసి శనివారం కాళీమాతను పూజించాలి.

12. మీనరాశివారు తంబూలంలో పంచదారనుంచి ఆదివారం ఇష్టదైవాన్ని పూజించాలి.

ఇదీ పూజకు, శుభకార్యాలకు సంబంధించిన తాంబూలవిషయం.

 ఇక తాంబూలసేవన విషయానికొస్తే, మనభారతదేశంలో తాంబూలసేవనమొక భోగం, ఒకవిలాసం, ఒకదర్పం, ఒకగొప్పస్థాయికి చిహ్నం. రాజులు తమదర్పం కనబడటానికి ఆకులు వక్కలు సున్నం తోబాటు సుగంధద్రవ్యాలుంచిన వెండిపెట్టెను పట్టుకొనుండే విలాసిని నియమించుకునేవారు. ఆవిలాసినిని తాబూలకరండవాహిని అనేవారు. తాంబూలచర్వణమేగాదు ఆతర్వాత వూసేయాడానికీ  ఒకవిలువైన పాత్రను వాడేవారు. ఆతాంబూలసేవనంలో కూడా ఉదయంవక్కలు, మధ్యహాన్నం సున్నం , రాతిలో తమలపాకులు యెక్కువ వేసుకోవాలని శాస్త్రనిర్ణయం.

  శ్లో: ప్రాతః కాలే ఫలాధిక్యం

        చూర్ణాధిక్యంతు మధ్యమం

        వర్ణాధిక్యం భవే ద్రా త్రౌ

        తాంబూలమితి లక్షణం---బావప్రకాశిక.

 ఇంకా తాంబూల ప్రాశస్త్యాన్ని సుమతీశతకకారుడు యిలాగొనియాడారు.

 క: తమలము వేయని నోరును

     విమతులతో జెలిమిజేసి వెతఁబడు తెలివిన్

    గమలములు లేని కొలకును

    హిమధాముడులేని రాత్రి హీనము సుమతీ.

 కవితాపితామహుడు అల్లసానిపెద్దన కవితలల్లాలంటే తాబూలం వుండాల్సిదే నంటున్నారు

 ఉ: నిరుపహతి స్థలంబు, రమణీ ప్రియ దూతిక తెచ్చి యిచ్చు క

     ప్పుర విడె, మాత్మ కింపయిన భోజన, మూయల మంచ, మొప్పు త

    ప్పరయు రసజ్ఞు, లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్,

    దొరకిన కాక, యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే .  

 రాజులుపోయినా తాంబూలవిలాససేవనం మాత్రం, యేమాత్రం తగ్గలేదు. అది సామాన్యునికీ నేడు అందుబాటులోనే వుంది. తాంబూలంలో ఆకువక్క, సున్నంతోబాటూ, కాచు (దీన్ని

తుమ్మజాతి చెట్టు బెరడునుండి తయారు చేస్తారు) ఏలకలు లవంగాలు, జాజికాయ, జాపత్రి, మెంథాల్, కొబ్బరితురుము గుల్కంద్ వంటి వస్తువులు ఎవరియిష్టానుసారం వాళ్ళు వేయించుకొని సేవిస్తారు. పెండ్లితర్వాత  కొత్తపెండ్లాము భర్తకు ముద్దుముద్దుగా చిలుకలుచుట్టి భర్తనోటికందిస్తుంది. చిలుకలంటే యిక్కడ చేతివేళ్ళకు చుట్టుకున్న తమలపాకులన్నమాట. ఇక వేశ్యాగృహాలలో యీ  చిలుకల వినియోగం ప్రత్యేకంగా  చెప్పవలసిన పనిలేదు. తాబూలానికివాడే తమలపాకులుకూడా చాలారకాలే వున్నాయి. తెల్లాకు, కారపాకు(బనారసి), కలకత్తాపత్తా, కుభకోణంఆకు, వెల్లారి, కలిజేడు వంటివెన్నోవున్నాయి. తాంబూలాన్ని విడెమని, బీడాయని, కిల్లీయనికూడాపిలుస్తారు. వీటిని ప్రత్యేకంగా తయారుచేయగల నేర్పరులున్నారు. వారు తంబూలాన్ని ఒక వ్యాపారవస్తువుగా చేసుకొని అమ్ముకొనుచున్నారు. పట్టణాలలో భోజనహోటళ్ళదగ్గర భోజనానంతరం వేసుకోవడానికి వీలుగా అమ్ముతుంటారు. వీటిలో జర్దాలు, పొగాకువంటివి కలిపిచేసే బీడాలు కూడా దొరుకుతాయి. వీటికి అలవాటుపడి ఆరోగ్యం చెడగొట్టుకుంటున్న వాళ్ళూ వున్నారు.

 సాధారణంగా తమలపాకువెనుక కనబడే ఈనెలూ, తొడిమలు తొలగించి తాంబూలంలోవాడుకుంటారు. ఈనెలు తొడిమలు ఆరోగ్యానికి మంచివికావని నమ్ముతారు. ఆయుర్వేదంలో తమలపాకులకు చాలా ప్రాముఖ్యమున్నది. శ్వాసకాసవ్యాధులలో తమలపాకు చాలాబాగాపనిచేస్తుంది. జీర్ణప్రక్రియకు తోడ్పడుతుంది. గొంతునొప్పిని నయంచేస్తుంది. తాంబూలంలోని తమలపాకుసున్నం వలన ఎముకలు బలపడతాయి. ఇంకా ఎన్నోవ్యాధులకు తమలపాకుకలిపిచేసిన మందులు ఆయుర్వేదంలో వున్నాయి. నెయ్యి చాలాకాలం నిలువవుండటానికి తమలపాకులువేసి నెయ్యిని కాచుకుంటారు. నూనెలుకూడా తొందరగా చెడెపోకుండా వుండటానికి తమలపాకులు వేసివుంచుతారు. తాంబూలం అప్పుడప్పుడు వేసుకోవడం మంచిదేగానీ, అదిలేనిదే వుండలేనంతగా అలవాటుచేసుకోవడం ఆరోగ్యానికి మంచిదికాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏదియేమైనా తాంబూలం మనజీవనశైలిలో మిళితమైయున్నదనుట నిర్వివాదాంశం.                 

 

 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...