Thursday, 19 August 2021

తెలుగుపద్యం

 తెలుగుపద్యం

 

క: గుడికూలును నుయిపూడును

    వడినీళ్ళను చెరువుతెగును వనమును ఖిలమౌ

    చెడనిది పద్యం బొకటియె

    కుడియెదమల కీర్తిగన్న గువ్వలచెన్నా.

 

పద్యరచనలో స్థాయీభేదాలున్నా పద్యం చిరంతరం. పద్యానికి చావులేదు. "చెడనిది పద్యం బొకటియె" అన్న గువ్వలచెన్నుని మాట అక్షరసత్యం. అందుకు కారణం పద్యం ఛందోబద్దంకావడమే. సాహితీనందనంలో పద్యం వెయ్యివసంతాల పైబడి పూస్తూనేవుంది. తనకాంతిని సుగంధాన్ని విరజిమ్ముతూనేవుంది.

 

పద్యం జనజీవనయానంలో ఎదురీది ఎదురీది అలసిపోయింది. ఇక దాని కాలంచెల్లిపోయిందని వాదిస్తున్న సమయంలోనే  అది మూడుపువ్వులు ఆరుకాయలుగా వృద్ధిపొంది విమర్శకుల నోరుమూయించింది. శతసహస్రద్విసహస్రపంచసహస్రావధావాలతో పద్యం తన విశ్వరూపం చూపింది.

 

పద్యం రెండువిధాలుగా భాసిస్తున్నది. ఒకటి స్మరణదృష్ఠితోరెండు సౌందర్యదృష్ఠితో. ఈరెండింటికి భేదం గమనిద్దాం. వేమనయోగి 

 

ఆ:వె:  కట్టరాళ్ళు తెచ్చి కాలుసేతుల త్రొక్కి

            కాసెయులుల సేత గాసిచేసి

            దైవమనుచు మ్రొక్క తప్పది గాదొకో

            విశ్వదాభిరామ వినుర వేమ.

 

అని తనతాత్త్వక వాదాన్ని నేరుగా ఘాటుగా విమర్శనాదృష్టితో చెప్పివైచినారు. ఇచ్చట  సులభంగా మన స్మరణలో వుండటానికి పద్యం యెన్నుకోబడింది. ఇదే రాతివిగ్రహాలను చెక్కే విషయంలో సౌందర్యాతిశయం కనబరుస్తూ పుట్టపర్తి నారాయణాచార్యులవారు 

 

మ: ఉలిచే రాలకు చ క్కిలింతలిడి ఆయు ష్ప్రాణముల్ బోయు శి

        ల్పుల మాధుర్య కళాప్రపంచము లయంబున్ జెందె పాతాళమున్

        గలసెన్ పూర్వకవిత్వ వాసనలు నుగ్గైపోయె ఆంధ్రావనీ

        తలమంబా యికలేవ ఆంధ్రులకు రక్తంబందు మాహాత్మ్యముల్.

 

అన్నారు. వేమనయోగి రాతిని ఉలితో తూట్లుబొడిస్తేనారాయణాచార్యులవారు ఉలితో శిలకు చక్కిలిగింతలిదినారు. ఒకటి స్మరణాదృష్టి. రెండవది సౌందర్యదృష్టి. ఇక ప్రబంధాలుభారతభాగవతాది ఇతిహాసాలూరామాయణాది కావ్యాలు, యీ రెండులక్షణాలు కలిగివున్నాయి. మరికొందరైతే సులభంగా గుర్తుబెట్టుకోవడానికి వీలుగా వుంటుంది గనుక వైద్యాదిశాస్త్రములను కూడా పద్యములలో వ్రాసుకున్నారు. మచ్చునకొకటి చూడుడు.

 

తే: గంటుశీకాయ గొనివచ్చి గరుకులేని

    రాతిమీదను గంధంబు రయముమీర

    తేసి కంటికి కలికంబు వేసి మరియు

    చల్ల ద్రాపిన పసరికల్ చప్పునణగు.

 

ఇలా సులువుగా స్మృతిపథంలో విద్యనుంచుకొని ఆనాటి వైద్యులు తమ వృత్తిని కొనసాగించారు.

 

సౌందర్య దృష్టితో పద్యనిర్మాణం చేయడం యేమంత సులభంకాదు. అందుకే నన్నయకు ముందుటి రచనలకు ప్రాధాన్యత రాలేదు. పద్యంరాయగల్గటం వేరుపద్యవిద్యను సాధించటంవేరు. విద్యా  వంతుడంటే పనిమంతుడని అర్థం. కల్పనాచతురతశిల్పాభిరామత్వమురమణీయార్థ ప్రతిపాదకశక్తిధారనానుడులుసామెతలుఛలోక్తులతో కూడిన భాషాశక్తి తనవశం చేసుకున్న పనిమంతుడు కనుకనే నన్నయ పద్యవిద్యకు ఆద్యుడైనాడు. ఆయనశైలి నేటికీ అనితరసాధ్యంగానే మిగిలిపోయింది. తర్వాతికవులు వారివారి ప్రత్యేకతను వారు సంతరించుకున్నారు. రసాభ్యుచితబంధంగా అలతి అలతి పదములతో గంభీరభావనలను వెలిబుచ్చగల నైపుణ్యంతిక్కనదైతేసీసపద్య వూగుతూగులతో శ్రీనాథుడుపోతనలు తెలుగుజనాన్ని ఓలలాడించారు. అప్పటినుండి ఇప్పటివరకు వచ్చిన పద్యరచనలను ప్రస్తుతిస్తే యిది ఉద్గ్రంధమే అయిపోతుంది. ఏదియేమైనా

 

క: చెప్పగవలె గప్పురములు

    కుప్పలుగా బోసినట్లు కంకుమ పైపై

    గుప్పిన క్రియ విరిపొట్లము

    విప్పినగతి ఘుమ్మనం గవిత్వము సభలన్

 

అంటారు రఘునాధనాయకులు. ఛందస్ అనునది "ఛద్" ధాతువునుండి నిష్పన్నమగుచున్నది. ఈధాతువునకు ఆహ్లాదం అని అర్థం. ఆహ్లాదము కలిగించు వాక్యసమూహమును తెలుగులో ఛందోబద్ధమైన పద్యమంటున్నాము. అందుకే పద్యమంటే అలావుండాలన్నారు రఘునాధ నాయకులు. ఆయనే మరొకచోట.

 

క: పలుకగవలె నవరసములు

    గులకం బద్యములు చెవులకున్ హృద్యముగా

    కళుకక యటుగాకున్నన్

    బలుకక యుండుటయె మేలు బహుమానముగన్.

 

అంటారు. నిజమేమరి. రీతివృత్తిశైలిపాకమురసముధ్వనిఅలంకారము యివన్నీ ప్రస్పుటించినగానీ అది కావ్యముగాదు. తేలికమాటలతో వ్రాసిన గ్రంథములు యేమైనా వాఙ్మయములు కావచ్చునేమోగానీ సారస్వతంగాదు. అది సాహిత్యమనిపించుకోదు. గణయతిప్రాసలు కూర్చిన మాత్రమున పద్యంకావచ్చుగానీ కవిత్వంకాదు.

 

కవిత్వం నాలుగు విధాలంటారు. అలా అనడంలోనూ విభేదాలున్నాయి. మృదుమధురచిత్తవిస్తరములని కొందరుమృదుమధురరసభావములని మరికొందరుఅలాకాదు ఆశుబంధగర్భచిత్రకవిత్వములని మరికొందరు చెప్పుచున్నారు. ఆశువంటే విల్లునుండి వెలువడిన బాణం. అడిగిన తక్షణం కోరిన భావంలో పద్యం చెప్పేయడం ఆశువు. ఆశువులో కవిత్వాంశం, చెప్పేవాని ప్రతిభపై ఆధారపడి వుంటుంది. బంధకవిత్వంలో ఖడ్గబంధముశేషబంధముచక్రబంధముఛత్రబంధముపద్మబంధము వంటివెన్నో ఉన్నాయి. ఇందులో పద్యం చిత్రంలో ఇమిడించబడుతుంది. దీన్ని మాటలలో వివరించడం కష్టం గనుకవ్యాసం చివరలో చిత్రరూపలో చూపించబడింది గమనించగలరు. గర్భకవిత్వమనగా ఒకపద్యంలో మరొకపద్యం యిమిడింపబడుతుంది. దీన్నే పద్యగోపనమనికూడా ఆంటారు. ఉదాహరణకు

 

.

చం:  హర! శివ! శంకరా! త్రిపుర హంత! విధిస్తుత! లింగ! ధీర! తత్

          స్మరహర! సంయతా! విపుల! శాస్త! కవీశ్వర విశ్వ! గోత్రజా

         వర! భవ నాశకా! విపది భంగ! వివేకద! విశ్వపాలకా!

         వరద! మృడా! ప్రభో! జప తపః పరిశాంతిత! శార్ఙ్గి! జేత జే!

 

ఈ చంకపమాల యందుగర్భితమై యున్న నాలుగు పద్యములుగమనింపుడు

ఒకటి కందము:

కం: శివ! శంకరా! త్రిపుర హం

        త! విధిస్తుత! లింగ! ధీర!తత్ స్మరహర! సం

        భవ నాశకా! విపది భం

        గ! వివేకద! విశ్వపాలకా! వరద! మృడా!

 

రెండు మధ్యాక్కర

హర! శివ! శంకరా! త్రిపుర హంత! విధిస్తుత! లింగ!

స్మరహర! సంయతా! విపుల! శాస్త! కవీశ్వర విశ్వ!

వర! భవ నాశకా! విపది భంగ! వివేకద! విశ్వ!

వరద! మృడా! ప్రభో! జప తపః పరిశాంతిత! శార్ఙ్గి!

 

 

మూడు తేటగీతి:

త్రిపురహంత! విధిస్తుత! లింగ! ధీర!

విపుల! శాస్త! కవీశ్వర విశ్వ! గోత్ర!

విపది భంగ! వివేకద! విశ్వపాల!

జప తపః పరిశాంతిత! శార్ఙ్గి! జేత!

 

నాలుగు ద్రుతవిలంబిత వృత్తము:

 

త్రిపురహంత! విధిస్తుత! లింగ! ధీ!

విపుల! శాస్త! కవీశ్వర విశ్వ! గో

విపది భంగ! వివేకద! విశ్వపా!

జప తపః పరిశాంతిత! శార్ఙ్గి! జే!

 

ఇక చిత్రకవిత్వమంటే పేరుకు తగ్గట్టే చిత్రవిచిత్రాలుగా వుంటుంది. కొన్ని పద్యాలు మొదటి అక్షరం నుండి చదివినా చివరి అక్షరం నుండి చదివినా ఒకే తీరున వుంటాయి. కొన్ని మొదటినుండి చదివితే ఒక అర్థం చివరినుండి చదివితే మరొక అర్థం వస్తాయి. అంతేకాదు ద్వర్థిత్ర్యర్థికావ్యాలుకూడా తెలుగులో వెలువడ్డాయి. పింగళిసూరన రాఘవపాండవీయము,  హరిదత్తసూరి రాఘవ నైషదీయము, లోమేశ్వరకవి రాఘవ యాదవీయము, ధనుంజయుని రాఘవపాండవీయము, వేంకటాధ్వరి యాదవ రాఘవీయము ద్వర్థికావ్యాలు. చిదంబరకవి రాఘవ యాదవ రాఘవీయము, అనంతాచార్య యాదవ రాఘవ పాండవీయము  త్ర్యర్థికావ్యాలు.

 

క: సుబలతనయ గుణమహిమన్

     ప్రబలి తనకుదార ధర్మపాలనలీలన్

     సొబగొంది వన్నెదేరగా

     విబుధస్తుతు డవ్విభుండు వెలసెన్ ధరణిన్ .

 

ఇది సూరన రాఘవపాండవీయములోని పద్యం. భారతార్థంలో "సుబలతనయ" అంటే సుబలుడు అనే రాజుగారి కుమార్తె యైన గాంధారి. ఆమె గుణమహిమచే ప్రబలి, "తనకు దార" అంటే ధృతరాష్ట్రునకు భార్యగా ధర్మాత్మయై యుండగా అని అర్థం. అదే రామాయణార్థంలోనైతే "సుబలత నయగుణ మహిమన్" మంచిబలమూమంచి గుణములుగలిగి ప్రబలి "తనకుదార ధర్మపాలన లీలన్". ఉదారము మరియు ధర్మముగల తన పరిపాలనా చతురతతో దశరథుడు  అని అర్థం. ఇలా పదాల విరుపువిశ్రామస్ఠానల మార్పులతో భారతరామాయణాలు రెండూ నడిచాయీ కావ్యంలో. ఇది ఒక ఉదాహరణమాత్రమే. ఇలా తమప్రతిభను చాటారు పూర్వకవులుఇప్పుడిట్టి ప్రయోగాలు చేయువారరుదు. అయినా ఇదంతా పహిల్వానుల  సాముగరిడీల విద్య వంటిది. సామాన్యులకిది అర్థముకాదు. రసాస్వాదన చేయలేరు. అట్లుగాక రసాస్వాదన కనుకూలమై మనసునాహ్లాదపరచిమార్పును తీసుకొనిరాగల ప్రతిభ గలిగి కవిత్వ ముండాలంటారు సంకుసాల నృసింహకవి.

 

 

క: సమయజ్ఞుడు సమచిత్తుడు

    సమశబ్దార్థప్రయోగ చతురుడు మరియున్

    క్రమరస పోషణ రచనా

    కమనీయప్రతిభు డిల సుకవి యనబరగున్.

 

 

తే:గీ: యతి విటుడు గాకపోవు టెట్లస్మదీయ

          కావ్య శృగార వర్ణనాకర్ణనమున

         విటుడు యతిగాక పోరాదు వెస మదీయ

         కావ్య వైరాగ్య వర్ణనాకర్ణనమున. 

 

పద్యమనగా పాదములుగలది. ఆపాదములు నియమబద్ధములు. గేయమునకు పల్లవిచరణములున్నవి. కానీ పద్యమునకున్నన్ని నియమములు లేవు. గేయమునకు మాత్రలు సరిపోయిన చాలును. పద్యమునకట్లు కాదుగదా! అక్షరములు సరిపోవలెను. గురులఘువులు ఛందస్సుప్రకారము కుదురవలెను. కనుకనే సంగీతమునకు పద్యము స్వతఃసిద్ధముగా ఒదిగిపోవును. పద్యముకూర్చునపుడే అదృశ్యరూపమున లయకూర్పు జరిగిపోవును. అందుకు తరలమత్తకోకిలలుమానినీ వృత్తములు చక్కటి ఉదాహరణలు. గమనింపుడు. 

 

మత్తకోకిల:   ఓసురారికులేంద్ర నీక్రియ నుగ్రమైన తపంబుమున్

 

తరలము:  క్రతుశతంబుల పూర్ణకుక్షివి గాని నీవిటు క్రేపులన్  

 

మానిని:   చాతకముల్ రథచక్రపుటాకుల సందుల పర్విడు చుండుట చేన్  

 

తెలుగుఛందస్సు సంస్కృతముకంటే విలక్షణమైనది. సంస్కృతఛందస్సు అదవిదారి వంటిది. తెలుగున అట్లుకాదు. ఇది రాచబాట. వేయుట కొంత కష్టమే. ప్రాస తెలుగుపద్యమునకు హొయలుగూర్చిపెట్టును. ప్రాస సంస్కృతమున లేదు. యతి సంస్కృతమున కేవలము విశ్రాంతినిచ్చు స్థలమేగాని  తెలిగులోవలె అక్షరమైత్రిలేదు. అక్ష్రమైత్రి క్రొత్త మెఱుపు కూర్చిపెట్టును.

 

పద్యములలో జాతులు(కందద్విపదతరువోజఅక్కరలు) ఉపజాతులు(తేటగీతఆటవెలదిసీసములు) కాక వృత్తములున్నవని మనమెరుగుదుము. ఇవి ఒక అక్షరముగలిగిన "శ్రీ" వృత్తము నుండి ఇరవైయారు అక్షరముల "మంగళమహాశ్రీ" వరకు వున్నవి. ఇవన్నీ గురులఘువుల స్థాన మార్పులవల్ల ఏర్పడుచున్నవి. గణితశాస్త్రంలో బైనరీ విధానలో సున్న ఒకటి మాత్రమే ఉపయోగించిలెక్కలన్నీ చేయుదురు. ఇదీ అటువంటిదే గురులఘువులు రెండింటితో యేర్పడు గణముల మార్పులవలన యీ వృత్తములు 13,42,17,726  కూర్చబడియున్నవి. వీటన్నిటికి పేర్లు పెట్టుటకూడా కష్టమే. వీటిలో చాలా వృత్తములు వాడుకలోలేవు. వాడిన తప్పుకాబోదు. చాలామంది కవులు ఉత్పలమాలచంపకమాలశార్దూలముమత్తేభముతరలముమత్తకోకిలస్రగ్దరమహాస్రగ్దరమానినిమాలినిపుండరీక వంటి వృత్తములతోనే సరిపుచ్చుకొనిరి. ఇన్ని వృత్తములుండుటవలన చెప్పవలసిన భావములను చెప్పుట కనుకూలములైన వృత్తము లెన్నుకొనుటకు మంచి అవకాశమేర్పడుచున్నది.

 

పద్యం ఛందోబద్ధమై క్రమశిక్షణకు లోబడియున్నది. అందువలన యేకారణము చేతనైనా కొంతభాగము ఖిలమైనాలుప్తమైనప్రాసయతిగణాల ఆధారంగా దాదాపుగా పద్యంలోని లుప్తభాగాన్ని పూరించి పద్యాన్ని పరిరక్షింపవచ్చును. ఈకారణం చేతనే కాబోలు పురాతన గ్రంథాలలో కొన్ని పాఠంతరాలు చోటుచేసుకున్నాయి.

 

పద్యం మన తెలుగుభాషకే ప్రత్యేకమైనది. పురాతనమైనది. పద్యాన్ని పరిరక్షించుకోవడం మనవిధి. పద్యానికి తగిన స్థానాన్నిస్తున్న ఆకాశవాణిదూరదర్శన్మరియు పత్రికల వారికి అభినందనలుధన్యవాదములు. ఇతర ప్రక్రియల ద్వారా కవిత్వం చెప్పడం, ప్రోత్సహించడం అభినందించదగ్గదే. కానీ ఆప్రక్రియలమీది వల్లమాలిన అభిమానంతో పద్యాన్ని నిరసించడం తగనిపని . ఇక చివరిగా

శ్రీ నండూరి రామకృష్ణమాచార్యులవారి పద్యవిశేష పద్యంతో వ్యాసంముగిద్దాం.

 

ఆ:వె: తాళబద్దమైన లాలిత్యగతి గల్గి

          నడకసొంపు గలుగు నాట్యమగును

         శ్రవణ సుభగమైన ఛందోనియతిగల్గి

         పలుకుబడుల కూర్పు పద్యమగును.  

 

           బంధ కవిత్వమునకు రెండు ఉదాహరణలు 


                                                    ఖడ్గ బంధము












    ***

నవనాగరికత

 నవనాగరికత

నాగరికత కందని కడు ఆదిమ కాలంలో

కారడవుల వసియించే  కరకు నరపశువుల కాలంలో

బలవంతునిదే కాలం,  ఎల్లకాలం

బలహీనుల కేమాత్రం కదదికాలం .

 

క్రమానుగత  పరిణామక్రమం 

హరించింది ఆటవిక న్యాయం

సమభావం సౌహార్దం దయా దాక్షిణ్యం

నవమానవ జీవన గమనంలో

వెలిసింది , వెల్లివిరిసింది.

 

కదిలేకాలంతో కదిలింది నాగరికత

కదిలి కదిలి , కడకది పడింది కర్కశ ముదురుపాకంలో

పొడుగుచేతుల  పందేరం   బక్కవాని బిక్కమొగం

పేరుకు సమభావం . పెత్తందార్లకే మరి పీఠం.

 

పోటీకొస్తే పీకలు తప్పించే నీతి

మదగజాల  మధ్యన సారంగానికి సద్యోవిముక్తి

ఎత్తుకు పైయెత్తుల్లో ఎగిసేదేమో

ఏమెరుగనివాని రుధిరం .

ఇది మరుగునపడి మరలివచ్సిన

ఆటవిక న్యాయమా?

లేక పరిణామ ప్రక్రియలో

పరిణత నొందిన నవనాగరికతా ?

 

అవని మానవజాతికిది సవాల్

భువిమేదావులకిది అసిధారావ్రతం

తీర్పునిచ్చుటకూ తిర్చిదిద్దుటకూ

ఇది తుదిసమయం

 

ఫలితంకోసం ఎదురుచూస్తూ కూర్చున్నా

ఆతురుడనై చావని ఆశల ఛాయల్లో  నిల్చున్నా .


    ***


search: 

సంధ్యారాగం

 సంధ్యారాగం

తొలిమలి సంధ్యల కెంజాయ

తమఃప్రభల కలగలుపు

నాచర్మ చక్షువులకు ఒకేవిధంగా  దృగ్గోచరమైన

నా మనసుకు మాత్రం తేడా తెలుస్తునే వుంది

 

జీవిత తొలిసంధ్య పాత జ్ఞాపకాలను

మలిసంధ్య భవిషదుహాలను

గుర్తు చేస్తునే వున్నాయ్

 

ఒకటి జ్ఞానాగ్ని రగలని అమాయకత

మరొకటి, కేవల జ్ఞానాగ్ని గురుతుల నిరుపయోగత

అధికారచ్చాయలంటని పసితన మొకటి

అధికారం చెల్లని పెద్దతన మింకొకటి

ప్రేమానురాగాల తొలకరింపొకటైతే 

కేవల కర్తవ్యతాబద్ద కృత్రిమ పలకరింపింపొకటి

ముద్దుల పెంపకమొకటి

మరి వృద్ధాప్య బాధ్యతా పంపక మింపొకటి

 

ఈ తొలిమలి సంధ్యల మధ్యన

మరెన్నో స్వల్పాస్వల్ప  సంధ్యలు

 

వేసిన నాటకం లోని తీపిగురుతులు

వేసే నాటకం కోసం సీరియస్ రిహార్సల్సు

ఉద్యోగం పొందిన సంధ్య 

ఉద్యోగ విరమణ సంధ్య

లాటరీనంబరు పేపర్లో పడిన సంధ్య

రేసుల్లో సర్వమంగళం పాడిన సంధ్య

ఎన్నికల్లో గెలిచి ఊరేగిన సంధ్య

ఉద్వాసనపొంది ఇంటికొచ్చిన సంధ్య

ఓహో ఎన్నెన్ని తోలిసంధ్యలు

ఎన్నెన్ని మలిసంధ్యలు

 

ఈ తొలిమలి సంధ్యల అనుభవం

జీవితకాలంలో  బహుకీలకం

ఇటు పగటికి అటు రాత్రికి

ఇవేసుమా ఆలంబనం .

 

    *** 


Sunday, 1 August 2021

పూరీ జగన్నాథుడు

 పూరీ జగన్నాథుడు

హైందవులు అతిపవిత్రంగా భావించే చార్‍ధాం పుణ్యక్షేత్రాలుబద్రీనాథ్రామేశ్వరంద్వారకాపూరీ. వీటిలో పూరీజగన్నాథ క్షేత్రానికి ఒక ప్రత్యేకతపవిత్రతఐతిహాసిక నేపథ్యమూ వున్నది. విశేషమైన స్థలపురాణం గల్గినదీ జగన్నాథక్షేత్రం. గౌడీయ వైష్ణవవర్గీయులకిది ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ మతవ్యవస్థాపకుడైన  చైతన్యమహాప్రభువు యిక్కడే నివసించారు.

 

కౌరవమాత గాంధారి శాపం కారణంగా యదువంశం అంతఃకలహాలతో నాశనమయింది. కృష్ణపరమాత్మ అవతారం చాలించాల్సిన సమయమాసన్నమైనది. సముద్రతీరంలో మర్రిచెట్టునీడన కృష్ణుడు శయనించియుండగాఆయన కాలిబొటనవ్రేళ్ళను జింకచెవులుగా పొరబడి జరా అనే వేటగాడు పొదలచాటునుండి బాణంవదిలాడు. అది కృష్ణుని పాదాన్ని గాయపరచింది. దాంతో ఆయన ప్రాణాలను విడిచాడు. అర్జునుడు వెదకి కనుగొని కృష్ణపరమాత్మకు దహనసంస్కారాలు గావించాడు. శ్రీకృష్ణశరీరం దహింపబడిందిగానీ హృదయంమాత్రం అట్లేవుండిపోయింది. తదనంతరం సముద్రంపొంగి ద్వారకను ముంచేసింది. కృష్ణపరమాత్మ హృదయం సముద్రంలోకలిసి నీలపుమణిగా మారి పడమటి తీరమైన ద్వారకనుండి తూరుపుతీరం లోని పూరీగట్టుకు చేరింది. అది హరిభక్తుడైన గిరిజనరాజు విశ్వావసునకు దొరికింది. ఆయన ఆకాంతిమంతమైన నీలపుమణిని సాక్షాత్తూ హరిగా భావించిఆమణికాంతి సోకిన జీవికి భవబంధాలు తెగి సాయుజ్యము లభించునని గ్రహించిఒక రహస్య గుహలో వుంచినీలమాధవుడని పేరిడి పూజించుకొనుచుండెను.

 

మాల్వారాజ్యాధిపతి ఇంద్రద్యుమ్నుడు పరమభాగవతుడు. ఆయన పూరీప్రాంత గిరికధరములలో హరి విరాజమానుడై యున్నాడని తన హృదయస్పందనల ద్వారా గ్రహించిఒక బ్రాహ్మణయువకుని ఎంపికజేసుకొనిఅతన్ని అన్వేషించడానికి పంపాడు. ఆయువకుడుకొన్ని ఆనవాళ్ళఆధారంగా విశ్వావసుడున్న ప్రాంతంచేరుకొనికార్యం సానుకూలం గావించుకొనుటకు  ఆలోచించి విశ్వావసుని కూతురు లలితను ప్రేమించి విశ్వావసుని మెప్పించి ఆమెను వివాహమాడినాడు. స్వామికొలువైయున్న రహస్యప్రదేశం మామగారికి తెలుసునని ఎఱిగిస్వామిదర్శనం తనకూ చేయించమని విద్యాపతి మాటిమాటికీ వినయంగా వేడుకున్నాడు. కడకు అల్లునికోరికను తిరస్కరించలేక కళ్లకుగంతలుగట్టి స్వామిబిళం వద్దకు తీసుకపోయి దర్శనంచేయించాడు. విద్యాపతి తెలివిగా దారివెంబడి ఆవాలు విడుస్తూ వెళ్ళాడు. అవి కొన్నిరోజులకు మొలకెత్తి దారి స్ఫష్టంగా చూపాయి. విద్యాపతి విషయం ఇంద్రద్యుమ్నమహారాజుకు చేరవేశాడు. రాజు సరాసరి బిళంలోనికి ప్రవేశించి చూచేసరికి అక్కడి నీలమాధవుడు అంతర్ధానమయ్యాడు. రాజు బహుదా చింతించివెనుదిరిగివచ్చి  నిరాహారదీక్షలతో దైవారాధన చేయడమేగాక అశ్వమేధయాగంకూడా చేశాడు. నీలాచలంమీద నరసింహాలయం నిర్మించి పూజించాడు. ఆలయంలో నిద్రించిన ఒకనాటిరాత్రి రాజుకలలో స్వామికనిపించిరేపు సముద్రతీరప్రంతంలో చాంకీనదీమఖద్వారానికి వేపకొయ్యలు కొట్టుకవస్తాయి. వాటితో కృష్ణబలరామసుభద్రవిగ్రహాలు చేయించు. నీవు దర్శించలేకపోయిన నీలమాధావుడనైననేను కృష్ణహృదయస్థనంలో విరాజమానుడనై వుంటాను. మమ్ము సేవించి తరించు. అని ఆనతిచ్చి అంతర్థానమయ్యాడు. కలనిజమయ్యింది. వేపదుంగలు రాజుకు లభించాయి.

 

వేపదుంగలను విగ్రహాలుగా మలిపించే యత్నం చేస్తుండగా దేవశిల్పి విశ్వకర్మ ఒకవృద్ధ వికలాంగుడిరూపంలో వచ్చి విగ్రహాలను ౨౧ దినాలలో నేనునిర్మిస్తాను. దీక్షబూని నేను పనిప్రారంభిస్తాను. దీక్షాకాలంలో అన్నపానీయాలు ముట్టను. గదితలుపులు పొరపాటునకూడా తెరవకండిఅనిచెప్పి మూసిన గదిలో పనికిబూనుకొనెను. ౧౪ దినములు పనిజేయుచున్న శబ్దములు వినిపించినవి గానీ తర్వాత వినిపించలేదు. విషయముతెలిసి రాణిగుండీచాదేవి శిల్పికేమైనదోయేమోనని చింతించిగదితలుపులు తెరిపించినది. లోపల శిల్పిలేడు. విగ్రహాలు పూర్తికాలేదు. విగ్రహాల చేతులుకాళ్ళు నిర్మింపబడలేదు. విశాలమైన నేత్రములతో విగ్రహముల ముఖమడలములు ప్రకాశించుచుండెను. రాజు అసంపూర్ణవిగ్రహాలను చూచి చింతాక్రాంతుడయ్యెను. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమైరాజా! చింతిచకు. ఈరూపాలలోనే భగవానుడు పూజలందుకుంటాడు. నేనే యీరూపాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాననిచెప్పిపాణప్రతిష్ఠచేసి  బ్రహ్మ అంతర్ధానమయ్యాడు. పూరీక్షేత్రం నాటినుండి పురుషోత్తమక్షేత్రంగానుశ్రీక్షేత్రంగాను ప్రసిద్ధికెక్కింది. తొలుత యీ క్షేత్రంలో ఇంద్రద్యుమ్నమహారాజు ఆలయనిర్మాణం మొదలుపెట్టాడు , ఆయన కుమారుడు యయాతికేసరి పూర్తిచేశాడు. ఈ ఐతిహసిక విషయాలు స్కందపురాణంలోనూ 15వ శతబ్దపు ఒడియాకవి సరళదాస రచనల్లోనూ మనకు కనిపిస్తాయి.

 

ఈ క్షేతంలో అనేకములైన వేడుకలు జరుగుతాయి. అందులో రథయాత్ర అత్యంత ముఖ్యమైనది. ఈ వేడుక చూడటానికి దేశంనలుమూలలనుండే గాక విదేశాలనుండికూడా భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. అన్నిదేవాలయాలలో ఊరేగింపుకు ఉత్సవమూర్తులు వేరుగావుంటాయి. కానీ యిక్కడ గర్భగుడిలోని అసలు దారు(చెక్క)మూర్తులనే ఊరేగిస్తారు. రథయాత్రకు రెండునెలలముందు వైశాఖబహుళ విదియనాడు పూరీసంస్థానాధీశుని ఆదేశంమేరకు పనులు ప్రారంభమౌతాయి. ఎన్నుకోబడిన వృక్షాలను పూజించి 1072 ముక్కలుగాచేసుకొని పూరీ తీసుకవస్తారు. ప్రథానపూజారి, 9 మంది ముఖ్యశిల్పులువారిసహాయకులు మొత్తం 125 మంది అక్షయతృతీయనాడు రథనిర్మాణం మొదలుపెడతారు. తెచ్చిన 1072 చెక్కముక్కలను 2188 గాచేస్తారు. అందులోనుండి 832 జగన్నాథరథం, 763 బలరామరథం, 593 సుభద్రారథాలకు ఉపయోగించి ఆషాడశుద్ధపాడ్యమినాటికి నిర్మాణాలు పూర్తిచేస్తారు. జగన్నాథరథంపేరు నందిఘోష. ఇది 45 అడుగుల ఎత్తుతో 16 చక్రాలతో నిర్మితమై ఎఱ్ఱటి చారలున్న పసుపువస్త్రంతో అలంకృతమై వుంటుంది. బలదేవులరథంపేరు తాళద్వజం 44 అడుగుల ఎత్తుండి 14 చక్రాలుగలిగి ఎఱ్ఱటిచారలుగల నీలివస్త్రంతో అలంకరింపబడి వుంటుంది. ఇక సుభద్రరథంపేరు పద్మద్వజం. ఇది 43 అడుగులఎత్తుండి 12 చక్రాలుగలిగి ఎఱ్ఱటిచారలుగల నల్లనివస్త్రంతో అలంకరింపబడి వుంటుంది. ఈ రథాలకు 250 అడుగుల పొడవు 8 అంగుళాల మందంగల తాళ్ళుగట్టిసింహద్వరం ఎదురుగా ఉత్తరముఖంగా రథాలను నిలుపుతారు. ఈ రథాలను ప్రతిసంవత్సరం క్రొత్తగా నిర్మిస్తుంటారు.   

       

పాండాలు అనబడే పూజారులు ఆషాడ శుద్ధపాడ్యమినాడు ఉదయం పూజలుచేసి శుభముహూర్తాన "మానియా" (జగన్నాథా) అంటూ పెద్దగా నినాదాలు చేస్తూ ఆలయంలోని రత్నపీఠంమీదనుండి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయప్రాంగణంలోని ఆనందబజారు అరుణస్థంభం మీదుగా విగ్రహాలను ఊరేగిస్తూ బయటికి తెస్తారు. ఈక్రమంలో ముందుగా  5 అడుగుల 6  అంగుళాల ఎత్తున్న బలభద్రుని విగ్రహం "జై బలదేవా" అన్న నినాదాలతో రథం ఎక్కిస్తారు. తర్వాత ఆస్వామి ధరించిన తలపాగాయితర అలంకరణలు తీసి భక్తులకు పంచుతారు. తర్వాత సుభద్రాదేవిని రథంయెక్కిస్తారు. ఆతర్వాత 5 అడుగులా 7 అంగుళాల ఎత్తున్న జగన్నాథుని "జయహో జగన్నాథా" అన్న నినాదాలతో రథంపైకి చేరుస్తారు. ఈవేడుకను "పహండీ" అంటారు. ఈదశలో కులమతాలకతీతంగా అందరూ జగన్నాథుని తాకవచ్చు. అందుకే సర్వంజగన్నాథం అంటారు. ఈ విగ్రహాలను తీసుకవచ్చి రథం ఎక్కించేవారిని దైత్యులంటారు. వీరు ఇంద్రద్యుమ్నమహారాజు కంటే ముందు నీలమాధవుణ్ని ఆరాధించిన సవరతెగ రాజు విశ్వావసు వారసులు. రథంపై మూర్తులను చేర్చే హక్కుదారులు వీరు. రథారోహణం తర్వాత పూరీసంస్థానాధీశులు వచ్చి మొదట జగన్నాథ రథమెక్కి స్వామికిమ్రొక్కిస్వామిముందర బంగారుచీపురుతో ఊడ్చి గంధంనీళ్ళు చల్లి రథందిగిఅదేమాదిరి మిగిలిన రెండు రథములపై కూడాచేసి ఆతర్వాత రథాలకు ప్రదక్షిణచేసిరథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు. జగన్నాథరథంమీది పాండా సూచనమేరకు కస్తూరికళ్ళాపిజల్లి హారతిచ్చి జైజగన్నాథా అంటూ రథాన్ని భక్తులు లాగుతారు. స్వాములవారి యీ యాత్రను ఘోషయత్ర ఆంటారు. ఇది సుమారు 3 మైళ్ళదూరంలోగల గుండీచా ఆలయంవరకు మందగమనంతో 12 గంటలు సాగుతుంది. ఆరాత్రికి రథాల్లోనే స్వాములవారికి విశ్రాంతినిచ్చి మరునాడు ఆలయంలోనికి ప్రవేశపెడతారు. వారంరోలులు స్వాములవారు గుండీచాదేవిఆలయ ఆతిథ్యం తర్వాత దశమినాడు తిరుగుప్రయణంచేసి గుడిబయట రథాలు నిలుస్తాయి. మరునాడు అనగా ఏకాదశినాడు బంగారు ఆభరణాలతో స్వాములవారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ద్వాదశిరోజున తిరిగి రత్నపీఠిపై స్వాములను నిలుపుతారు. అంటే 10  దినాలు ఆలయంలో స్వాములు ఉండరన్నమాట.

 

ఈఆలయంలోని దారు(చెక్క)దేవతామూర్తులను 812  లేదా 19 సంవత్సరములకొకసారి మారుస్తారు. ఇవి ఆషాడంఅధికఆషాడం వచ్చే సంవత్సరాలన్నమాట. ఇలా మార్చే ఉత్సవాన్ని నవకళేబరోత్సవమంటారు. పాతవిగ్రహాలనుండి క్రొత్తవిగ్రహాలలోనికి పూజారులు బ్రహ్మపదార్తాన్ని ప్రవేశపెడతారు. శ్రీకృష్ణపరమాత్మహృదయం యీసందర్భంలో నూతనవిగ్రహంలో ప్రవేశిస్తుంది. పూజారి కళ్ళకు గంతలుకట్టుకొని చేతులకు వస్త్రంచుట్టుకొని ఊరంతా ఆరాత్రిసమయంలో దీపాలు ఆర్పి చీకటిలో యీ కార్యక్రమం పూర్తిచేస్తారు.

 

 ఇతరమతాలవారు సైతం యీక్షేత్రం తమదిగా భావిస్తారు. గౌరవిస్తారు. ఈఆలయంలో గౌతమబుద్ధుని దంతం పూజలందుకొంటూ ఉండిందనీఅది శ్రీలంకలోని క్యాండీ అనే ప్రదేశంలోగల స్థూపం లోనికి చేర్చబడిందంటారు. ఇది ఒడిషా సోమవంశపురాజుల హయాంలో అనగా 10 వ శతాబ్దంలో జరిగిందంటారు.

 

అమృత్‍సర్ స్వర్ణాలయమునకు యిచ్చినదానికంటే ఎక్కువగా బంగారం మహరాజ్‍రంజిత్‍సింగ్ యీఆలయానికిచ్చారట. కోహినూర్‍వజ్రం కూడా యీఆలయానికివ్వాలని ఆయన చివరి కోరికట. కానీ అది బ్రిటిష్ వారి పరమైంది.

 

జైనులు మోక్షదాయినులైన త్రిరథాలుగా భావించే సమ్యక్‍దర్శన్సమ్యక్‍జ్ఞానానంద్సమ్యక్‍చరిత్ర(శీలం) లకు ప్రతీకలే యిక్కడి మూడురథాలుదేవతావిగ్రహాలని విశ్వసిస్తారు.

 

శైవులు యీక్షేత్రాన్ని భైరవశివవిమలభైరవ(ప్రకృతి) శక్తి స్థానాలుగా భావిస్తారు. ఇలా యీక్షేత్రం అనేకమత సమ్మతం. 

 

ఇక చరిత్రవిషయానికొస్తే గంగరాజవంశీయుల తామ్రశాసనాల ప్రకారం ప్రస్తుతాలయనిర్మాణంకళింగపాలకుడైన అనంతచోడగంగదేవ్ క్రీ.శ 1078 -1148  మధ్య  ప్రారంభించగా ఆయన మనుమడైన అనంగభీమ్‍దేవ్ క్రీ.శ 1174 లో ఒడిశాను పాలిస్తూ నిర్మాణాలను పూర్తిచేశాడు. క్రీ.శ 1558 లో ఒడిషాపై అఫ్ఘన్ సేనాధిపతి కాలాపహాడ్ దాడిచేయకముందు వరకు జగన్నాథుడు భక్తుల పూజలందుకున్నాడు. తర్వాత రామచంద్రదేవ్ "ఖుర్దా" అనబడే స్వతంత్రరాజ్యాన్ని ఒడిషాలో యేర్పరచుకొన్నతర్వాత ఆలయాన్ని పవిత్రంచేసి విగ్రహాలను పునఃప్రతిష్టింపజేసి పూజించారు. కీ.శ. 1997లో పూర్వదేవాలయాల ప్రక్కనే నూతననిర్మాణాలుచేసిఆలయప్రతిష్ఠనుపెంచి ఉత్సవాలను వైభవోపేతంగా శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తూ హైందవధర్మపరిరక్షణ గావిస్తున్నారు.

 

ఈక్షేత్రం ఒడిషారాజధాని భువనేశ్వర్‍కు సుమారు 60 కి.మీ దూరంలో ఉంది. భువనేశ్వర్‍లో బిజూపత్నాయక్ విమానాశ్రయముంది. అక్కడివరకు విమానంలో వెళ్లవచ్చు. కోల్‍కత్తా-చెన్నై రైలుమార్గంలోని ఖుర్దారోడ్ స్టేషన్ నుండి పూరీకి 44  కి.మీ బస్సుమార్గమున్నది.  విశాఖపట్నం నుండి నేరుగా పూరీకి బస్సులో వెళ్ళవచ్చును. అంతేగాకుండా దేశంలోని వివిధప్రాంతాలనుండి రైలు మరియు బస్సు సర్వీసులు పూరీ వరకు మిక్కుటంగానేవున్నాయి.

 

పూరీకి వెళ్ళే భక్తులు జగన్నథక్షేత్రమహిమలు ముఖ్యంగా గమనిస్తారు. ఈమహిమలు యిప్పటికీ శాస్త్రజ్ఞానానికతీతమైనవిగనే భాసిల్లుతున్నాయి. అవి—

1.      ఊరేగింపు గుండీచా ఆలయానికి రాగానే రథాలు వాటంతట అవే ఆగిపోతాయి. తిరుగు ప్రయాణంలో కుడా  స్వ్వామిఆలయం దగ్గరకు రాగానే రథాలు ఆగిపోతాయు.  ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు.

2.     ఆలయ ప్రధాన ద్వార గోపురం నీడ యే సమయంలోనూ యేవైపు   కనిపించదు

3.     ఆలయ గోపురం పైన ఉండే జండా గాలి వాటాన్ని బట్టి కాకుండా వ్యతిరేక    దిశలో ఎగురుతూవుంటుంది.

4.      గోపురం పైనున్న సుదర్శన చక్రం ఎటువైపు నుండి చూసినా అది మనవైపు   చూస్తున్నట్లే ఉంటుంది.

5.     ఆలయం పై యే పక్షులు ఎగరవు.

6.      ఆలయ సింహద్వారంలో అడుగు పెట్టగానే అప్పటివరకూ వినిపించిన సముద్ర హోరు వినిపించదు.  సింహద్వారం దాటిన తర్వాత తిరిగి వినిపిస్తుంది.

7.     . పూరి జగన్నాధ స్వామి కి 50 రకాలకుపైగా ప్రసాదాలు నైవేద్యం పెడతారు. వీటిని మట్టి కుండల్లో నే వండుతారు. ఆ నైవేద్యాలు స్వామికి నివేదించక ముందు ఎటువంటి రుచి,సువాసన వుండవు. స్వామికి నివేదించిన తర్వాత  ప్రసాదాలు ఘుమఘుమలాడే సువాసనలు వెదజల్లుతూ ఎంతో రుచిగా వుంటాయి.

 

కపిల మహర్షి

  

కపిల మహర్షి

 

ఆ:వె:  అతిరహస్యమైన హరిజన్మ కథనంబు

            మనుజు డెవ్వడేని మాపురేపు

            జాల భక్తితోడ జదివిన సంసార

            దుఃఖరాశి బాసి తొలగిపోవు.

 

అని భాగవతం చెబుతున్నది. శ్రీమహావిష్ణువు యేకవింశత్యవతారములు (21) ప్రముఖముగా ధరించి లోకములందలి భక్తుల రక్షించినాడు. ఆదేవదేవుని అవతారములలో కపిలాచార్యుల అవతారము ఐదవది. ఈ అవరారము ముఖ్యముగా తత్త్వోపదేశమునకు అధికప్రాధాన్యత నిచ్చుచున్నది.

 

మహావిష్ణువు నాభికమలము నుండి బ్రహ్మ ఉద్భవించినాడు. బ్రహ్మమానసపుత్రుడు కర్దమప్రజాపతి. ఆ కర్దమప్రజాపతి పుత్రుడు కపిలుడు.

 

సరస్వతీనదీతీరంలో కర్దముడుచేసిన తపస్సుకు మెచ్చి హరి ప్రత్యక్షమైస్వాయంభువమనువు నీకు తన పుత్రికనిచ్చి వివాహం జరిపిస్తాడు. ఆ సాధ్వికడుపున నేను నీకుమారునిగా జన్మిస్తానని చెప్పి అంతర్ధానమైనాడు.

 

హరి ఆశీర్వాదంప్రాకారం కర్దముడు దేవహూతిని చివాహమై తొలుత కళఅనసూయశ్రద్ధహవిర్భువుగతిక్రియఖ్యాతిఅరుంధతిశాంతి యను తొంమ్మండ్రుగురు కుమార్తెలను గనెను. తదనంతరం కర్దముడు సన్యసించదలచెను. కానీ దేవహూతి, బిడ్డలకు కల్యాణములు జరిపితనకొక పుత్రుని ప్రసాదించితదనంతరము సన్యసించుడని ప్రార్థించెను. కర్దముడు తొల్లి హరి పలికిన వచనములు గుర్థుకుతెచ్చుకొనిసాక్షాత్తు శ్రీహరియే దేవహూతిగర్భమున జన్మించనుండుట తెలిసిభార్యకు వాస్తవము నెఱిగించివ్రతదీక్షలో నుండుమని నిర్దేశించినాడు. ఆ సాధ్వీమణి పరమానందభరిత యయ్యెను.

 

దేవహూతి పుత్రునిగన్నది. కర్దముడు తన ఆడుబిడ్డలకు వరుసగా మరీచిఅత్రిఅంగీరసపులస్యపులహువుక్రతువుభృగువసిష్ట అద్థ్వర్య మహర్షులకిచ్చి వివాహము జరిపించితపస్సుకై వెళ్ళిపోయెను. బంగారువన్నె జటాజూటముచే వెలుగొందుచున్న కర్దమపుత్రుడు కపిలుడని పిలువబడెను.

 

కపిలుడు మహాజ్ఞానియై తనతల్లి దేవహూతికి తత్త్వబోధ గావించినాడు. పరమాత్మఆత్మప్రకృతితత్త్వాలను విశదీకరించినాడు. ఏకాగ్రచిత్తంతో భక్తిపూర్వక హరిధ్యానమే మోక్షమునకు సరియగుమార్గమని నిర్దేశించినాడు. వాసుదేవసంకర్షణప్రద్యుమ్నఅనిరుద్ధవ్యూహములను వివరించినాడు. పిండోత్పత్తి క్రమమును తెలియజేసి తల్లికి మోహవిముక్తి గావించి మోక్ష మనుగ్రహించినాడు. దేవహూతి మోక్షముపొందిన క్షేత్రమే "సిద్ధిపథము" గా పిలువబడుచున్నది.

 

ప్రపంచములోనే మొదటి మనస్తత్త్వవేత్తగా కపిలమహర్షి గుర్తింపబడినాడు. పరిణామవాదాన్ని ద్రువీకరించినాడు. సాంఖ్యదర్శనం లోకానికందించినాడు. ఇంద్రియాలు విషయగ్రహణమొనర్చిమనస్సునకందిస్తాయి. మనస్సు బుద్ధికి నివేదిస్తుంది. బుద్ధి విచక్షణతో కర్తవ్యాన్ని నిర్ణయిస్తుంది. వీటన్నిటికతీతంగా ఆత్మ ఉంటుంది. అదికేవలం సాక్షీభూతంగా ఉంటుంది. అందుకే అది కల్మష రహితం. అని కపిలమహర్షి బోధించినాడు. 

 

తను బోధగురువగుటేగాక శిష్యగణాన్నీ వృద్ధిజేసినాడు. న్యూమరశ్మి యను మునితో వాదించి వేదములు ప్రమాణములని నిరూపించినాడు. వేదశ్మి యను యతిచే వేదములు ప్రామాణికములని అంగీకరింపజేసి, శబ్దబ్రహ్మ మూలమున పరబ్రహ్మను దర్శించ వచ్చునని నిరూపించినాడు.  ఆసురి యను శిష్యుడు తత్త్వగ్రామ నిర్ణయంబుగల సాంఖ్యమును వ్యాపింపజేయుచూ కపిలసాంఖ్య దర్శనాచార్యుడుగా పేరొందినాడు. ఆసురి శిషుడైన పంచశిఖుడు విదేహ రాజగు జనకుని నిరుత్తరుని గావించిఅతనికి గురువైనాడు. జనకుడు మహాజ్ఞానియై మునికుమారులకు సైతము శిక్షకుడైనాడు. అలా కపిలాచార్య సిద్ధాంతములు శిష్యప్రశిష్య పరంపరగా లోకవ్యాప్తమైనవి.

 

ఒకనాడు జైగీషవ్యుడను మునిని వెంటబెట్టుకొని కపిలాచార్యుడు అశ్వశిరుని యజ్ఞశాల ప్రవేశించినాడు. అశ్వశిరమహారాజు వారిని తగురీతిని గౌరవించి విష్ణువును సేవించి ప్రసన్నుని గావించుకొను విధిని తెలుపుమని వేడినాడు. అప్పుడు కపిలాచార్యుడు నేనే విష్ణువును నన్నే సేవింపమని ఆదేశించినాడు. రాజు నమ్మలేదు. విష్ణువు శంకచక్రధారిగరుడవాహనుడుగదా! అన్నాడు. వెంటనే కపిలుడు శంకచక్రధారియై జైగీషవ్యుని గరుడునిగామార్చి అతనిపై అధిరోహించినాడు. ఐనా రాజు సందేహము వీడలేదు. విష్ణుదేవునకు బొడ్డున కమలము అందు బ్రహ్మ వుండవలె కదా! అన్నాడు. వెంటనే కపిలమహర్షి బొడ్డున కమలము మొలిచినది. దానిపై జైగీషవ్యుడు బ్రహ్మగా వెలుగొందినాడు. అయిననూ అశ్వశిరుడు అంగీకరించకపోవుటచేఅతని యజ్ఞము నిరుపయోగమై దుష్టమృగములకాలవాలమైరాజు పతనమాయెను.  ఆపిమ్మట రాజుకు జ్ఞానోదయమై చేసిన తప్పుకు  క్షమాపణజెప్పి పరితపించెను. అంతట కపిలమహర్షి కరుణించి అతనికి తత్త్వబోధగావించెను. సర్వపదార్తములందు హరిగలడని యెఱుగుము. స్వధర్మమును చక్కగాపాటింపుము. దైవము సంతసించి నిన్ననుగ్రహించునని తత్త్వరహస్యమెరిగించి అతనినుద్ధరించెను.

 

సగరచక్రవర్తి యొక్క పెంపునకోర్వలేక ఇంద్రుడు సగరచక్రవర్తియాగాశ్వమును దొంగలించి పాతాళమున కపిలమహర్షి తపస్సుజేసుకొను ప్రదేశమున గట్టివైచివెళ్ళెను. సగరపుత్రులు వెదికివెదికి కడకు పాతాళమునకు వచ్చిఅశ్వము కపిలునిచెంతగాంచికపిలుడే దోషియనిఆయనను బాధింపబూనిరి. అంత కపిలాచార్యుడు కన్నులుదెరచి చూడగనే వారు భస్మమైపోయిరి. ఆతర్వాత వారివంశజుడైన భగీరథుని ప్రయత్నమున గంగను వారి చితాభస్మముపై పారించినగాని వారికి ముక్తికలగలేదు.

 

కపిలమహర్షి శాంతుడుఆనందమూర్తి గనుక ఆయన సగరపుత్రులపై అలిగి భస్మముచేయలేదనియు, " పరాత్మభూతుడఖిల బోధకుడతనికి నరసిజూడ సఖులమిత్రులు నెవ్వరుసగరసుతులు దాము తమచేయు నేరిమి దనువులందు ననలకీలలుపుట్టి నీఱైరిగాక!" అని భాగవతం తెలుపుతున్నది. సగరపుత్రుల యందలి దుర్గుణమువల్లనేవారి కర్మానుసారులై శరీరమున మంటలుపుట్టి చచ్చిరని దాని భావము.

 

పుండరీకుడనురాజు వేటయందు అనురక్తి కలవాడైయుండెను. ఒకనాడు అతడు వేటాడిన జింక కపిలముని ఆశ్రమమున కరుదెంచి గిలగిలతన్నుకొనుచు బాధతో మరణించెను. కపిలముని దానినిచూచి చలించిపోయిపుండరీకుని మందలించెను. అతడు బుద్ధితెచ్చుకొని తన రాజసగుణములను వీడి సాత్వికుడై సన్యసించదలచెను. కపిలమహర్షి అతనికి జ్ఞానబోధచేసికర్తవ్యమెఱుకపరచిసజ్జనుడైన రాజుగామంచిపరిపాలకునిగా  మార్చివైచెను.

   

రావణుడు మునులను బాధించు క్రమములో కపిలమహర్షినీ బాధించ యత్నించెను. కానీ కపిలమహర్షియే రావణుని శిక్షించితన ఉగ్రరూపమును చూపెను. మహర్షికన్నులనుండి అగ్నిజ్వాలలు కురియుచుండహస్తములలో ఆయుధములుఉరమున లక్ష్మిశల్యముల మరుద్గణములు ఉదరమున సముద్రములునయనముల సూర్యచంద్రులను చూచి రావణుడు నిర్ఘాంతపోయెను. రావణుని సైన్యము వెనుకకు తగ్గెను. మహర్షి ఒకగుహ లోనికి వెళ్ళగా రావణుడు వెంబడించి అక్కడ లక్ష్మీసమేతుడై దేవతలచే సేవలు గొనుచున్న శ్రీహరిని దర్శించెను. శ్రీహరి దయామయుడై యీ రావణుడు సనక సనందాదుల శాపమున రాక్షసుడైపుట్టిన తన వైకుంఠమందిర ద్వారపాలకుడని గుర్తించి దండించక రావణుని వదలివైచి, గుహతోసహా అంతర్థానమయ్యెను.

 

కపిలమహాముని సాక్షాత్తు శ్రీహరియవతారమైన బోధగురుడు. మహాత్ముడు. ఆయనస్మరణవల్ల మనకు జ్ఞానోదయమై మోక్షార్హత సిద్ధించు గాక! 

                                     //ఒమ్ తత్ సత్//  

తేనెటీగ

తేనెటీగ (కథ)




మర్రిచెట్టునీడన మరేచెట్టూ ఎదగదంటారు. మా రోశిరెడ్డిగారు మర్రిచెట్తుకేం తక్కువగాదు. మాగడ్డమీద ఎవరికేం తగాదావచ్చినా ఆయనేతీర్చి గట్టెక్కిస్తారు. జనాలను మున్ముందుకుకు సాగనిస్తారుమరి. రోశిరెడ్డుగారు అందెవేసిన రాజకీయ నాయకుడు. ఆయన ఏపార్టీలోవున్నా మాగడ్డకాయనే ఏలిక. ఎగస్పార్టీలో ఏనాయకుడున్నా ఏంలాభంలేదు. ఇక్కడ మా రోశిరెడ్డిగారి మాటంటే మాటఅంతే. ఇదంతా ఎందుకు జెబుతున్నాననిగదా మీఆలోచన. రోంత సేపాగండి ఆంతా మీకే అర్థమై పోతుంది. అడుగో రాజాశెట్టిఅనుకుంటూండగానే వచ్చేస్తాండాడు. నూరేండ్లయ్యా రాజా నీకు రారా! పోయినపనేమైంది. నువ్వుజెప్పడంపనిగాకుండాపోవడమూనా! అయిపోయినట్టేలే! ఐనా నీ ఋణముంచుకోనులే! ముందు పనిగానీ. పదమస్తాన్‍కొట్లో ఒన్‍బైటూ దమంచాయ్ దాగుతా మాట్లాదుకుదాంఅంటూ రాజాశెట్టిఆయనవెంటనేనూ టీకొట్టువైపు కదిలాం.  

 

ఇంతకూ రాజాశెట్టి పనేందనిగదా మీ తపన! ఏమీ లేదుబజారులో ఆయనింటిముందు ఒకరూముందిగదా! అది గోవిందయ్యకు బాడిగకిచ్చినాడు గదా! పదేండ్లయింది. గోవిందయ్య మందులంగడి ఖాళీజెయ్యమంటే ఖాళీ చెయ్యడంల్యా. పదో పరకో బాడిగపెంచుతాడుగాని ఖాళీమాత్రం చెయ్యడంల్యా. ఏంజెయ్యాలబ్బా! అని రాజాశెట్టి దిగులుబడతావుంటే నేనే ఉపాయంజెప్పినా. ఉపాయమంటే యేమిల్యాసక్కంగా బసెక్కి రంగాపురంబోఆడ రోశిరెడ్డిగారింటికిబోయి ఆయనకో దణ్ణంబెట్టు. అయ్యా మీకిచ్చుకునేదిచ్చుకుంటాఆ గోయిందుగానితో నారూము ఖాళీ జేపించి యిపించయ్యాఅని అడుక్కోమన్నానంతే.

 

అనుకున్నట్టే రెండోరోజు రోశిరెడ్డి కారేసుకోనొచ్చి గోయిందంగట్లో గూకోనిఏంది గోయిందో! మన రాజాశెట్టి రూము రిపేర్లు జేసుకోని కొడుక్కేదో యాపారం బెట్టించాలనుకుంటేనువ్వు ఖాళీజేయనంటున్నావంట. ఇంతకూ ఏంది కతవెటకారంగా అడిగాడు రోశిరెడ్డి. అయ్యా! అదేంలేదు. చిన్నచిన్న రిపేర్లు నేనే జేసుకోని అంగడి నడుపుకుంటున్నా. అడిగినప్పుడల్లా యింతోఅంతో బాడుగ పెంచుతున్నా. శెట్టిగారి పిల్లోడు చానా చిన్నోడు. ఇప్పుడప్పుడే వ్యాపారం జేసుకోలేడు. వేరేచోటికి అంగడి మారిస్తే యీమాదిరి జరగదేమోనని భయపడుతున్నానయ్యాఅన్నాడు గోవిందు. అట్టాగాదుగానినువ్వు ఖాళీజేసెయ్. కావాలంటే ఓనెల గడువుదీసుకో. నేనే శెట్టిగారిల్లూ అంగడి కొనాలనుకుంటున్నానువ్వేం మాట్లాడకుండా ఖాళీజేసెయ్ అని అదేపోత. గోవిందేదో చెప్పాలనుకున్నాడు గానీ వినేవారెవరూ లేరక్కడ.

 

ఏంజేయాలబ్బా! ఎగస్పార్టీ సుబ్బరామయ్య మనకులస్తుడేగదా! ఆయనదగ్గరకెళ్ళి జెప్పుకుందామని ఆరోజు రాత్రికే ఆయనదగ్గరికెళ్ళాడు గోవిందు. నేనూ మీకులస్తున్నేనాపేరు గోవిందు. బజారులో గోవిందం మెడికల్‍స్టోర్స్ నాదే. పరిచయంజేసుకున్నాడు గోవిందు. కులం అనగూడదయ్యా సామాజికవర్గం అనాలి. సరే మనమిద్దరం ఒక సామాజికవర్గమే! అయితేఅనిగోవిందువైపు దిరిగి యికజెప్పుకో నీఅగచాట్లు అన్నట్లు జూశాడు సుబ్బరామయ్య. తన కష్టమంతా జెప్పుకున్నాడు గోవిందు. నువ్వేం ఖాళీజెయ్యద్దు. నేజూసుకుంటా. అంతా ఆరోశిగాడు జెప్పినట్లేనా! ఇది నాయేరియా యీడ వాడేందిజెప్పేది. ఇంగనూబో! అని పంపించేశాడు సుబ్బరామయ్య. నెలరోజుల గడువు రోజురోజుకు ఐసుగడ్డ కరికిపోయినట్లు తరిగిపోతుండాదిగానీ సుబ్బరామయ్య నుండి ఉలుకూలేదు పలుకూలేదు. మీదమీద రెండుసార్లు బోయి జ్ఞాపకంజేసినాడు గోవిందు. అయినా ఆయనగారు కదిలిన పాపానబోలేదు. రోశిరెడ్డితో మాట్లాడిందసలేలేదు. ఇంతలో రోశిరెడ్డి మరొకసారి తన మనుషులను పంపి  గట్టిగా హెచ్చరిక జేసినాడు. చెప్పినమాట వినకుంటే నీమందులూ సామాన్లూ రోడ్డుమీదుంటాయ్ జాగ్రత్తా! అని బెదిరించి పోయినారు రోశిరెడ్డిమనుషులు. సుబ్బరామయ్య మాటలమనిషేగాని చేతలమనిషి గాదనిరోశిరెడ్డి కెదురునిలిచి నాతరపున మాట్లాడలేడని అర్థమైపోయింది గోవిందుకు. చేసేదేమీలేక రూము ఖాళీచేసి మందులు తెలిసిన అంంగళ్ళకు తగ్గించిన ధరలకమ్ముకొనిఇంటికాడ దిగులుగా కూర్చున్నాడు. 

 

ఇప్పుడు నేన్జేయ్యాల్సిన పనిజెయ్యాలిగదా! ఎంతోకొంత కమీషన్ యీవైపునుండీ రాబట్టుకోవాలిగదా! బలవంతమేమీ లేదబ్బా! ఎదో! వాళ్ళిచ్చినంత నేను దీసుకున్నంత అంతే!. మంచోడన్న పేరుమాత్రం చెడిపోగూడదు. అదే మనకు ముఖ్యం. అడుగో! గోవిందు అరుగుమీద కూకోనుండాడుఆదారిన పొయినట్లుపొయ్ పలకరిద్దాం. ఏంగోయిందూ షాపుకు బోలాఅందరికీ జెప్పుకున్నట్లే గోయిందు తనగోడు నాకూ వినిపించాడు. తెలిసినా తెలియనట్లే అంతావిన్నా. పాపం యిల్లుగడవడమెట్లాఅన్న దిగులుపట్టుకుంది గోవిందుకు. గోయిందూ నేనొకమాటజెప్తా వింటావాఅన్నా. తలూపాడుగోవిందు. ఏమీల్యా! రేప్పొద్దునే రోంతమాసిన గుడ్డలుగట్టుకొని పెండ్లాంపిల్లల్నిదీసుకొని సక్కంగా బసెక్కి రంగాపురంబో. రోశిరెడ్డి యింటికాడ్నే వుంటాడు. రోశిరెడ్డామొగంవేలాడేశాడు గోవిందు. ముందు నేజెప్పేది యినయ్యా గోయిందూ. నువ్వేం ఆలోచించమాకునేన్‍జెప్పినట్లుజెయ్. సరేనంటూ యిష్టంలేకున్నా వినసాగాడు గోవిందు. ఆడికిబోతానే అందరూ చేతులెత్తి రోశిరెడ్డికిదండంబెట్టండి. "ఏం" అంటాడు రోశిరెడ్డి. "అయ్యా! మీరుజెప్పినట్లే రాజాశెట్టిగారి రూము ఖాళీజేసేసినా. ఏరేపని జేతగాక యింటికాడనే వూరకుండా. ఇల్లుగడవడం కష్టంగావుంది. ఇంగ పస్తులుండాల్సిదే. మీరేనాకు దారిసూపాల" అని యెడుపుమొగంపెట్టి నేలపై గూర్చోండి. ఈపనిజేసి గోయిందూ! సూడు అవతలేం జరుగుతుందోఅనిజెప్పి నేనొచ్చేసినా.

 

గోవిందుకు వేరేదారేముందిచెప్పింది చెప్పినట్లే జేసినాడు. నేనంతా గమనిస్తూనేవున్నా. నాలుగురోజులతర్వాత గోవిందు యింటికి బోయినా. హుషరుగా వుండాడు గోవిందు. కూర్చో! కూర్చో!మంటూ అడక్కుండానే చెప్పడం మొదలుబెట్టాడు . రోసిరెడ్డి చానామంచోడన్నా. మాకు అన్నంకూడా బెట్టిపంపించినాడు. నాకు సరిపోయేచోట ఎక్కడ ఖాళీరూమున్నా చూసుకోమన్నాడు. నేనొచ్చియిపిస్తా. లోన్‍కూడా యిపిస్తా భయపడొద్దుపో! అన్నాడన్నా. నిన్ననే రూంజూసొచ్చినా. అక్కడ రెడీమేడ్‍గుడ్డలంగడి బాగాజరుగుతుంది. లోన్‍దీసుకుంటాఇంగ బతుక్కుంటానన్నా. నీఋణం వుంచుకోనన్నా. రోంత నిల్దొక్కుకోనీ. గోవిందు గబగబా జెబుతూనేవున్నాడు. ఇంతలో గోవిందుభార్య మాకు కాఫీదెచ్చివటంతో చాలించాడు. సరే! నాక్కావలసిందీ అదేకదా! అనుకుంటూ కాఫీతాగి మంచిది గోవిందూ! అని వీపుతట్టి బయటకొచ్చేసినా.

 

ఇంతకూ రోసిరెడ్డీ నేనూ చేసేదేమిటిఒకరికి సాయంచేసి మరొకరిని రోడ్దున పడేయటం. మళ్ళీ వాణ్నీ గట్టెక్కించిరెండువైపులా కమీషన్‍గుంజేయటం. అదీ నొప్పిలేకుండా  తేనెటీగ పువ్వునుండి తేనె లక్కున్నట్లే సుమా!. మళ్ళీ వచ్చేఎన్నికల్లో రాజాసెట్టివర్గం ఓట్లూ మావే. గోవిందువర్గం ఓట్లూ మావే. ఇదే మాసీమ రాజకీయనాయకుల చతురత. ఈ విషయం ప్రజలకు తెలియదనాతెలుసు. అయినా వాళ్లేమిచేయగలరు పాపం. ఇదంతే!          

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...