Friday, 17 December 2021

సాలగ్రామం

 

సాలగ్రామం



సాలగ్రామం దేవీభాగవతంప్రకారం విష్ణుప్రతీకమైన ఒక శిలావిశేషం. హైందవులు దీనిని తులసి,శంఖం తో సమానంగా పూజిస్తారు. ఈ సాలగ్రామాలు నేపాల్‍దేశపు రాజధాని ఖాట్మండుకు 192 మైళ్ళదూరంలో ప్రవహిస్తున్న గండకీనదిలో లభిస్తాయి. నదినానికొనియున్న సాలగ్రామగిరిపై కూడా యివి దొరుకుతాయి. నదిలో దొరికేవాటిని జలజాలని, గిరిపై దొరికేవాటిని స్థలజాలని అంటారు. వీటి మహాత్మ్యాన్ని క్రీ.పూ  ఆపస్తంబుడు డనే మహనీయుడు తెలియజేసియున్నాడు. సాలగ్రామంచుట్టూ సానుకూల శక్తిప్రకంపనలు (పాజిటివ్ ఎనర్జిటిక్ వేవ్స్) నిత్యం సజీవంగావుంటాయని పెద్దల అభిప్రాయం. అందుకే వీటిని దేవతామూర్తులను నిర్మించటానికి ఉపయోగిస్తారు. హైందవంలోని అద్వైత, ద్వైత, విశిష్టాద్వైతాల శాఖల వారందరూ వారివారి దేవతామూర్తులను సాలగ్రామాలతో చేయించుకోవడానికి ఇష్టపడతారు. ఆలయాలలోనూ, గృహాలలోనూ కూడా సాలగ్రామవిగ్రహం పూజలందుకుంటుంది. మణి, స్వర్ణ, శిలావిగ్రహాలకు ఆవాహనాది షోడశోపచారాలు అవసరమౌతాయి. కానీ సాలగ్రామప్రతిమలకు వాటిఅవసరంవుండదు. అవి సర్వదా దైవశక్తిపూరితాలు. ఈ సాలగ్రామాలవెనుక కొన్ని పురాణగాథలు కూడా ఉన్నాయి.

 చతుర్ముఖబ్రహ్మ తన సృష్టిలో ద్రోళ్ళిన తప్పులనుగూర్చి పరితపించాడట. ఆ పరితాపం దుఃఖంగామారి  ఆయన నయనాలనుండి నాలుగుఅశ్రువులు రాలాయి. ఆ అశ్రుజలాలే గండకీనదిగా మారింది. గండకీనదీ స్నానంవల్ల జనులు పుణ్యాత్ములై బ్రహ్మసృష్టి సవరింపబడుతూ వచ్చిందట. మరోకథలో జలంధరుడనే లోకకంటకుడు అతనిభార్య బృంద పాతివ్రత్యమహిమ వల్ల అజేయుడై మరణంలేనివాడయ్యాడట. అతన్ని అంతమొందించటం శివునివల్లకూడా కాలేదు. విష్ణువు అతని అజేయత్వానికి కారణం అతని భార్యబృంద పాతీవ్రత్యమని గ్రహించి, జలంధరునిరూపంలో వెళ్ళి బృందపాతీవ్రత్యాన్ని భంగపరిచాడు. అదే అదనుగా శివుడు జలంధరుని వధించాడు. విషయంతెలిసి బృంద విష్ణువును శిలగామారమని శపించింది. విష్ణువు గండకీనదిలోని సాలగ్రామంగామారి కలియుగజనులచే పూజలందుకొని మోక్షం ప్రసాదుస్తున్నాడనీ, విష్ణువు బృందశాపం పొందికూడా ఆమె తులసిగా రూపాంతరంచెంది పూజలందుకుంటుందని వరమిచ్చాడట. అందుకే తులసి, సాలగ్రామం పూజార్హతపొందాయి. మరోకథప్రకారం గండకీ అనునది ఒకవేశ్య పేరు. ఆమెదొక చిత్రాతిచిత్రమైన పవిత్రగాథ.

 గండకీ (ప్రియంవద) జన్మతః ఒక అందమైన వేశ్య. తనవృత్తిధర్మాన్ని పవిత్రభావంతో ఆచరిస్తూ కాలంగడిపేది. వృత్తిధర్మం ప్రకారం, ఎవరితో యేదినం ఒప్పందం కుదుర్చుకుంటుందో అతన్నే ఆరోజంతా తనభర్తగా భావించి నిండుహృదయంతో సేవించేది. ధనాశతో దుర్మార్గులను, దూర్తులను దరిచేరనిచ్చేదికాదు. ఈమె కులధర్మాచరణనూ, సద్బుద్ధిని పరీక్షింపనెంచి విష్ణువే ఒకదినం ఆమెవద్దకు విటునిగా విచ్చేశాడు. గండకీ ఆదినం ఆయన్నే భర్తగాభావించి సేవచేయడం ప్రారంభించింది. విష్ణువు తనశరీరంనిండా పుండ్లుకనబరచాడు. అయినా ఆమె అసహ్యించుకోలేదు. స్నానపానాదులు చక్కగాచేయించి రాత్రి కి తనశయ్యపై చేర్చుకొన్నది. కానీ రాత్రంతా జ్వరంగావున్నట్లు కనిపించాడు విష్ణువు. అయినా విడిచివెళ్ళలేదు గండకి. ఉదయనికల్లా ఆ మాయావిటుడు మరణించాడు. గండకీ ధర్మానుసారం ఇతడే యీనాటి నాభర్త అని అందరికీ తెలియజేసి, అతనితో సతీసహగమనానికి పూనుకొంది. ఎంతచెప్పినా, ఎందరు వారించినా వినలేదు. అగ్నిప్రవేశం చేసేసింది. మహావిష్ణువు ప్రసన్నుడై ఆమెను వరంకోరుకోమన్నాడు. గండకీ తన గర్భవాసంలో హరి మాటిమాటికీ జన్మించేవరం కోరుకొన్నది. ఆమే గండకీనదిగా మారింది. అందులో సాలగ్రామాలు పుడుతూనేవున్నాయి. ఆ సాలగ్రామాలు సాక్షాత్తు విష్ణురూపాలు.  సాలగ్రామాలు రకరకాలుగావుంటాయి. వాటిలోకొన్ని సౌమ్యం మరికొన్ని ఉగ్రం. చక్రశుద్ధి, వక్రశుద్ధి, శిలాశుద్ధి, వర్ణశుద్ధి గల సాలగ్రామాలు పూజకు ఉపయోగిస్తారు. వివిధరూపాల్లోను వివిధరంగుల్లోను సాలగ్రామాలు లభిస్తాయి. ఆకార వర్ణాలనుబట్టి వాటిగుణాలను నిర్ణయిస్తారు. తెల్లనివి సర్వపాపహరం. పసుపుపచ్చనివి సంతానభాగ్యదాయకం . నీలం  సర్వసంపదకారకం. ఎరుపు రోగకారకం. వక్రం దారిద్ర్యకరం. నలుపురంగులోవుండి చక్రంకలిగి, చక్రంమధ్య ఉబ్బివుండి ఒకపొడవాటిరేఖ వుంటే అది ఆదినారాయణం. తెల్లగావుండి, రంధ్రంగలిగి, రంధ్రం వైపున రెండుచక్రాలు ఒకదానితోఒకటి కలిసిపోయివుంటే అది వాసుదేవం. గుండ్రని పసుపుపచ్చనిదై రంధ్రంగలిగి, రంధ్రంవైపు మూడురేఖలుండి, పద్మచిహ్నం పైముఖంగా వుంటే అది అనిరుద్ధం. ఇవి బహుదా క్షేమకరములు. కపిలవర్ణంగలిగి పెద్దచక్రం వుంటే నరసింహం అంటారు. దీన్ని బ్రహ్మచర్యదీక్షతో పూజించుకోవాలి. బంగారురంగులో వుండి పొడవుగా మూడుబిందువులో వుంటే అది మత్స్యమూర్తి. ఇది ముక్తిప్రదాయిని, సంపదకారి. నల్లని మెఱుపుతో ఎడమన గదాచక్రాలు, కుడివైపు రేఖ వుంటే అది సుదర్శనమూర్తి. ఇది శత్రుబాధానివారిణి. అనేకరంగులతో అనేకచక్రాలు పద్మాలతో రేఖలతోగూడివుంటే అది అనతమూర్తి. ఇది సకలాభీష్టప్రదాయిని. మూడుముఖాలు ఆరుచక్రాలుగలిగి నేరేడుపండుఆకారంలో వుంటే అది షట్చక్రసీతారామం. ఇది దొరకడం కష్టం. చాలాఅరుదు. ఇది మహామహిమాన్వితం.

సాలగ్రామానికి నిత్యనైవేద్యం తప్పనిసరి. అదికూడా అనుదినం ఒకే రకమైన నైవేద్యనివేదన జరగాలి. అందుకే చాలామంది అతిసులువైనది గనుక జలంనివేదిస్తారు. ప్రయాణాలలోకూడా వెంటతీసుకొనివెళ్ళి క్రమంతప్పకుండా పూజాదికాలు నిర్వర్తించి నైవేద్యం సమర్పిస్తారు. మరీ అంతకూ వీలుగాని పక్షంలో జాగ్రత్తగా పూజాదికాలు జరిగే దేవాలయంలో వుంచి వెళతారు. నైవేద్యం మార్పువల్ల జరిగే అనర్థానికి సంబంధించిన ఒకకథ వుంది. అదికూడవిందాం--  

సరైనవ్యాపారం జరగని ఒక మాంసందుకాణందారుడు నదిలో ఒకనల్లని నున్ననిరాయి దొరికితే, ఆందంగా బాగుందని తీసుకవచ్చి తనగల్లాపెట్టెలో పెట్టుకున్నాడు. అది సాలగ్రామం. దాన్ని మాంసంతాకిన చేతులతో తాకడంవల్ల ఆ సాలగ్రామం తనకు తగిలిన మాంసాన్నే  నైవేద్యంగా స్వీకరించి ఆ మాంసంవ్యాపారిని సంపన్నునిచేసింది. ఇదంతా ఒక పండితుడు జాగ్రత్తగా గమనించి, సాలగ్రామాన్ని దొంగిలించి తనయింట మంచిమంచి నైవేద్యాలు సమర్పించి పూజించాడు. కానీ నైవేద్యం మారడంవల్ల అతనికి దరిద్రంచుట్టుకొని కష్టాలపాలయ్యాడు. ఇది యెంతవరకు నిజమోగానీ కథమాత్రం ప్రచారంలో వుంది.

 శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం సాలగ్రామం ఒకశిలాజం. ఒకవిధమైన జలచరం దీనిని నిర్మిస్తుంది. ఇందులో "అమోనైట్" వుంటుంది. "అలి" అనే చేప శీతాకాలంలో ఒకవిధమైన రసాయనికపదార్తం విడుదలచేస్తుంది. అది ఆ చేప కవచంగా మారుతుంది. ఈ కవచమే

 సాలగ్రామం అని కొందరి అభిప్రాయం. భారతసముద్రజలాల్లో నివసించే టెడైన్ అనే ప్రాణివల్లగూడా సాలగ్రామం తయారౌతుందని కొందరంటారు. శంఖంవలెనే ఒకప్రాణి విడచిన గట్టిపదార్తమేగానీ నిజంగా సాలగ్రామం శిల (రాయి) కాదని చాలామంది అభిప్రాయం. ఇదే నిజంకావచ్చు, గానీ సాలగ్రామంనుండి సానుకూలప్రకంపనలు (Positive energetic waves)   వస్తూవుంటాయని, అవి మన ఆలోచనలను క్రమబద్ధంచేసి ఉత్సాహానిస్తాయని, ఇది తమ అనుభవమని అనేకమంది చెప్పడం గమనార్హం.   

  

 

 

Friday, 3 September 2021

 

 

భార్యాబాధితుడు - ఉద్దాలకుడు


 Who was Uddalaka Aruni? – Part Three | sreenivasarao's blogs

 ప్రపంచంలో పురుషాహంకారం మిక్కుటంగానేవుంది. ఒప్పుకుంటాం. భర్తలచే పీడింపబడే భార్యలు, అత్యాచారాలకు బలౌతున్న స్త్రీలు, అందునా బాలికలగురించి కూడా ఎక్కువగానే వింటున్నాం. ఇది నిజంగా విచారించదగ్గ విషయమే. అట్లని భార్యలచేత బాధింపబడే భర్తలే లేరని మాత్రం అనలేము. ఈ విషయం మన టీవీసీరియళ్ళు చూస్తే బాగా అర్థమైపోతుంది. అప్పట్లో సీనీనటి సూర్యకాంతంగారి నటనను చూచిన వాళ్ళకు ఇక వేరుగా చెప్పవలసిన అవసరమేలేదు. ఈవిషయాన్నే యోగివేమన తనజీవితానుభవాన్ని రంగరించి--

 

//వె// చెప్పులోనిఱాయి చెవిలోనిజోరీగ

                  కంటిలోనినలుసు కాలిముల్లు

                  ఇంటిలోనిపోరు ఇంతింతగాదయా

                 విశ్వదభిరామ వినుర వేమ .               ---   అన్నారు.

 

"ఇంటిలోనిపోరు" అంటే భార్యా కలహమే! అంతేగదామరి! ఈ విషయాన్ని తెలియజేసే ఒకకథ పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి రచించిన "జైమినీభారతం" లో వుంది. ఆయన "శిలామోక్షణఘట్టం" అన్న మకుటంబెట్టి కథవ్రాశారు. పురాణకథ గదా! అందుకే ఒకసారి చూద్దాం-

 

అది వింధ్యాటవీ ప్రాంతం. కౌండిన్యమహర్షి శిష్యులలో ఉద్దలకుడనే ముని వుండేవాడు. అతడు వివాహముజేసుకొని గృహస్థాశ్రమ జీవితం గడపాలనుకున్నాడు. గురువుకూడా దానికనుమతిస్తూ, శిష్యా! గృహస్థుగా తరించినవారెందరో వున్నారు. గృహస్థే అందరికీ ఆధారం. అన్నదాత. సాంసారికజీవనంలోని ఒడిదుడుకులను ప్రశాంతంగా భరిస్తూ, నిజాయితీగా జీవించడం గొప్పతపస్సు. గృహస్థజీవనంలో పతనానికిచేర్చే జారుడుమెట్లు ఎక్కువ, కనుక జాగ్రత్తగా మెలుగు. శుభం. అనిదీవించి పంపాడు. ఉద్దలకుడు ఒకశుభముహూర్తాన చండిక అనే కన్యను పెండ్లాడి సాంసారికజీవనం ప్రారంభించాడు. అంతే! అంతటితో అతని సుఖసంతోషాలు హరించుకపోయాయి. భార్య, యితడేదిచెప్పినా కాదనటం అలవాటుగా మార్చుకొంది. అరి అంటే తిరి అనసాగింది. ఉద్దాలకుని సహనానికి ఒక పరీక్షగా మారిపోయింది. ఇక అతడు భరించలేక గురువునాశ్రయించాడు. ఆయన ఉద్దాలకుని కష్టమంతావిని, శిష్యా! నీ భార్యసహచర్యంలో ఇప్పటికే నీవు చాలా సహనాన్ని అలవరచుకున్నావు. అదినీకు కలిగినమేలు, మరచిపోవద్దు. అయినా నీవు చాలా అలసిపోయవు. ప్రస్తుతం నీకు కొంతస్వాంతశ్శాంతి కలగటానికి ఒక సులువైన మార్గం చెబుతాను విను, నీకేది ఇష్టమో అది నాకవసరంలేదనీ, నీవు చెయ్యాలనుకున్నది చేయననీ, నీ భార్యతో చెప్పు. ఆమె నీకెలగూ విరుద్ధంగా మాట్లాడుతుంది గాబట్టి, నీపనులు నీవనుకున్నట్లు చేసుకోవచ్చు. ఇక నీకేయిబ్బంది వుండదు. ఈదినంనుండే నేనుచెప్పినట్లు చెయ్యి. పదిదినాల తర్వాత నేనే మీయింటికొస్తాను. పరిస్థితులు గమనించి, ఇంకా యేమైనా చేయాల్సివస్తే, అప్పుడాలోచిద్దాం. ఇకనీవు వెళ్ళిరా! అన్నాడు.

 

గురువుచెప్పిన కిటుకు ఫలించింది. భార్య తనపనులకు అడ్డుపడని రీతిలో దినాలు దడుస్తున్నాయి. ఇక గురువు రేపటిదినమే తనయిల్లు సందర్శిస్తారు. గురువుగారిని ఘనంగా సన్మానించి గౌరవప్రదంగా చూసుకోవాలనుకున్నాడు. భార్యను పిలిచి ప్రియసఖీ చండికా! రేపు మాగురువు మనయింటికొస్తామన్నారు. వారికి ప్రత్యేకంగా గౌరవమర్యాదలేమీ నేను చేయదలచుకోలేదు. వస్తూనే యెదోఒకటి చెప్పి పంపించేస్తాను. నువ్వుకూడా ముబావంగా వుండిపో అన్నాడు. వెంటనే చండిక అదేంమాట రాకరాక మీగురువు అదేపనిగా మనింటికొస్తే గౌరవించకుండావుండాలా? కుదరదు. ఆయన్ను గొప్పగా గౌరవించాల్సిందే, విందుభోజనం పెట్టాల్సిందే నన్నది. నీయిష్టం నేను చెప్పాల్సింది చెప్పానని ఊరకుండిపోయాడు ఉద్దాలకుదు. గురువు రావదమూ సకలమర్యాదలూ సజావుగా సాగిపోవడమూ ఉద్దాలకుడు లోలోపల ఆనందపడిపోవడమూ జరిగిపోయాయి. గురువును ఆశ్రమానికి సాగనంపుతూ మంచి ఉపాయం చెప్పినందుకు ఉద్దాలకుడు దారిలో గురువుగారికి మరీమరీ ధన్యవాదాలు తెలిపాడు.

 

కాలం సజావుగా గడవసాగింది. ఉద్దాలకుడు తన పితరులకు శ్రాద్ధకర్మ జరుపవలసిన తద్దినం తిధి వచ్చింది. సరే! భార్యనుపిలిచి రేపు మాతండ్రి తద్ధినం. ఆ కార్యక్రమాలేవీ నేనుచెయ్యను. బ్రాహ్మణులకు భోజనాలూగీజనాలూ పెట్టదలచుకోలేదు. అంతా దండుగ అన్నాడు. అలా అనడంతగదు. రేపు శ్రాద్ధకర్మ సక్రమంగా జరపాల్సిందే. సద్బ్రాహ్మణులనే పిలవండి. దక్షిణమిగులుతుందని ఎవరినంటేవారిని పిలవకండి. గొప్ప పండితప్రకాండులనే పిలవండి. పిండివంటలుకూడా కాస్తా ఎక్కువేచేద్దాం. వెళ్ళి సంబారాలు సమకూర్చండి. అంటూ తొందరపెట్టింది. ఉద్దాలకుడు సంతోషంతో తలమునకలైపోయాడు. తనమనసులో యేమనుకున్నాడో అదంతా సక్రమంగా జరిపించేశాడు. ఇక పారణచేసి పార్వణాన్ని(పిండాలను) జలధిలో కలపాలి. సంతోషంలోమునిగిపోయివున్న ఉద్దాలకుడు. కాస్తా ఆదమరచి, భార్యతో చండికా! శ్రాద్ధకర్మ నీసహకారంతో చాలా చక్కగా జరిగింది, ఇక పార్వణాన్ని పవిత్రజలాలో నిమజ్జనం చేసివస్తే కార్యక్రమం సంపూర్ణమౌతుంది అన్నాడు. అంతే! అన్నదేతడవుగా చండిక పిండాలను తీసుకొనిపోయి పెంటకుప్పలో పడేసింది. ఇంత చక్కగా జరిగిన శ్రాద్ధకర్మ కడకు పెంటకుప్పపాలైనందుకు ఉద్దాలకుడు అగ్రహోదగ్రుడయ్యాడు. చండికా! నీవెంత కఠినురాలవే. నీవేమాత్రమూ క్షమార్హురాలవుకావు. బండరాయివై పోదువుగాక! అని శపించేశాడు.  తనుచేసిన దుష్కృత్యాలేమిటో అప్పటికిగానీ అర్థముకాలేదు చండికకు. వెంటనే భర్తకాళ్ళపైబడి శాపవిముక్తికై ప్రాధేయపడింది. ఉద్దాలకుడు శాంతించి, ఆనందములో తనభార్య మనస్తత్వాన్ని మరచి వక్రమముగాగాక సక్రమముగా భార్యతో మాట్లాడినందుననే యింత అనర్థము జరిగినదని గ్రహించి, భార్యను క్షమించి, చండికా! నరనారాయణులు భూమిపై అర్జునకృష్ణులుగా అవతరిస్తారు. వారిలో అర్జునుని స్పర్శతో నీకు శాపవిముక్తి గలిగి తిరిగీ నన్ను చేరుకుంటావని శాపవిముక్తి తెలిపి, తపమాచరించటానికి వెళ్ళిపోయాడు.

 

మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు అశ్వమేధయాగం తలపెట్టాడు. అశ్వరక్షకునిగా అర్జునుడు వెళ్ళాడు. ఆసమయంలో ఒకచోట అశ్వం శిలకు అతుక్కపోయింది. సైనికులు ఎంతప్రయత్నించినా ఆరాతి నుండి అశ్వాన్ని విడదీయలేకపోయారు. అర్జునుడు దిగులుజెంది దగ్గరలోనున్న సౌబరిమహర్షి ఆశ్రమంచేరుకొని, మహర్షికి నమస్కరించి, యాగాశ్వం రాతికి అతుక్కున్న విషయం వివరించి, అశ్వంవిడివచ్చే ఉపాయం తెలుపవలసిందిగా ప్రార్థించాడు. అప్పుడా మహర్షి తనదివ్యదృష్టితో సర్వం తెలుసుకొని, అర్జునునకు ఉద్దాలకచండికల వృత్తాంతం వినిపించి, ఆశిల శాపగ్రస్తురాలయిన చండికయని తెలిపి, వెళ్ళి అర్జునా ఆశిలను నీచేతులతో తాకు. శుభం జరుగుతుందన్నాడు. ఆర్జునుని స్పర్శతో శిల అశ్వాన్ని వదిలేసి చండికగా మారిపోయింది. ఉద్దాలకుడుకుడా వెంటనే అక్కడకు వచ్చిచేరాడు. అర్జునుడు వారికి నమస్కరించి ఆశీర్వాదములుపొంది, ఆశ్వంతోపాటు దానిరక్షణకై ముందుకు కదిలాడు. ఉద్దాలకచండికలు తదనంతరం జీవితం సుఖమయంగా గడిపి, పుణ్యకార్యాలాచరించి, తరించారు.          

       

 

Thursday, 19 August 2021

రవిరథసారథి- అనూరుడు

 రవిరథసారథిఅనూరుడు

 

మన పురాణగాథలు చాలా చిత్రాతిచిత్రంగా వుంటాయి. అయితే వాటిలో ఒకనీతిఒక‍ఉపదేశము దాగివుంటాయి. అద్దానిని గ్రహించవలెనేగానియిట్లెందు కున్నదియిది సరికాదని త్రోసిపుచ్చరాదు. పురాణపురుషుడైన అనూరుని కథ కూడా ఇట్టిదే.

 

"అనూరుడు" అనగా ఊరువులు(తొడలు) లేనివాడని అర్థము. ఇతనికి "అరుణుడు" అన్న మరొకపేరు కుడా వున్నది. శరీరము ఎఱ్ఱని వర్ణములో వుండుటచే ఇతని కాపేరు వచ్చినది. ఇతడు సూర్యుని రథసారథి. ఉదయము తూర్పుదిక్కున తొలుత కన్పించునది యితని కాంతియే. ఉదయము తొలుత కాన్పించు ఎఱ్ఱనికాంతిని అరుణోదయకాంతి అంటున్నాము. ఈతని పుట్టుకకు సంబంధించిన కథ మహాభారతములోని ఆదిపర్వము ద్వితీయాశ్వాసములో నున్నది. కథ పూర్వపరాలను పరిసీలిద్దాం-

 

బ్రహ్మమానసపుత్రుడైన "మరీచి" తనయుడు "కశ్యపప్రజాపతి". కశ్యపునకు అనేకమంది భార్యలు. అందులో పదమువ్వురు దక్షుని పుత్రికలు. వారిలో "దితి"కి దైత్యులు(రాక్షసులు), "అదితి"కి ఆదిత్యులు(దేవతలు), "కద్రువ"కు సర్పములు, "వినత"కు "అనూరుడు", "గరుత్మంతుడు"యిలా జీవజాలమంతా యీయన బిడ్డలే నన్నట్లువిశాలమైన సంసారమీయనది. ఇక ప్రస్తుతాంశానికొద్దాం-

 

దక్షపుత్రికలైన "కద్రువ", "వినత"లు భర్త "కశ్యపప్రజాపతిని" చాలాకాలం భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. వారికి ప్రసన్నుడై కశ్యపుడు వరం కోరుకో మన్నాడు. వారు పుత్రసంతానాన్ని కోరుకున్నారు. వారు, వారికి కలిగే సంతానం ఎలా వుండాలోకూడా భర్తకు వివరించారు.

 

తరలము :

అనలతేజులుదీర్ఘదేహులు నైనయట్టి తనూజులన్‌
వినుతసత్త్వుల గోరెఁ గద్రువ వేవురం గడువేడ్కతో;
వినత గోరె సుపుత్త్రులన్‌ భుజవీర్యవంతులవారికం
టెను బలాధికు లైన వారిగడిందివీరులనిద్దఱన్‌.

                                                           భారతం-అది-2-3.

 

అగ్నివలె తేజస్సుకలిగిపొడవాటిదేహాలు గల బలసంపన్నులైన వేయిమంది పుత్రులు కావలనీవారితో తను సంతోషంగా కాలం గడపగలననీకద్రువ కోరింది. కద్రువ కొడుకులకు మించిన గుణంబలంశౌర్యం గలిగిన యిద్దరు పుత్రులు కావాలని కోరుకున్నది వినత. అందుకంగీకరించి కశ్యపుడు పుత్రకామేష్టియాగం చేసియజ్ఞానంతరం, యజ్ఞాప్రసాదాన్నివినతకద్రువలకిచ్చి, "అభీష్ఠ సిద్దిరస్తు" అని దీవించాడు. అనతికాలంలోనే వినత రెండు అండములనుకద్రువ వేయి అండములను ప్రసవించింది. భర్త ఆజ్ఞానుసారం వారు ఆ అండములను నేతికుండలలో భద్రపరచిబిడ్డలకోసం యెదురు చూడసాగారు. 

 

 కొన్నేండ్లకు తొలుత కద్రువ గ్రుడ్లు పిగిలి వేయిసర్పములు పుట్టుకొచ్చాయి. వాటి తేజోవంతమైన పొడవాటి దేహములను చూచి సంతోషపడిపోయింది కద్రువ. ఆ సర్పాలలో "శేషుడు" శ్రీహరిపానుపయ్యాడు. "వాసుకి" శివకంఠాభరణమై నాగరాజుగా వర్ధిల్లాడు.

       

వినత తన సవతికి కలిగిన సౌభాగ్యానికి ఈర్షజెందింది. ఓపికనశించి ఒక‍అండాన్ని పగులగొట్టింది.

 

క.

తన గర్భాండంబుల రెం

టను బ్రియనందనులు వెలువడమినతిలజ్జా
వనత యయి వినత పుత్త్రా

ర్థిని యొకయండంబు విగతధృతి నవియించెన్‌.- భా ర-ఆది -2-5

క.

దాన నపరార్ధకాయవి

హీనుఁడుపూర్వార్ధతనుసహితు డరుణుడనం
గా నుదయించె సుతుండు

హానీతియుతుండు తల్లి కప్రియ మెసగన్‌.--భా ర-ఆది -2-6

 

అలా మధ్యాంతరంగా పగిలిన అండంనుండి శరీరంలోని పైభాగమే నిర్మాణమై. తొడలుకాళ్ళు ఇంకాయేర్పడక. పచ్చిగ్రుడ్డుగానున్న అరుణవర్ణపు కుమారుడు బయటపడ్డాడు. పుట్టినబిడ్డ వ్యధజెంది, బాధతప్తహృదయంతో తల్లిని శపించాడు.

 

వ.

----- నన్ను సంపూర్ణశరీరుం గానీక యండం బవియించిన యవినీతవు కావున నీవు నీసవతికి దాసివై యేనూఱేం డ్లుండు’ మని శాపం బిచ్చె--

                                                                            -- భార-అది-2-7.

                                                                                          

తదనంతరం శాంతించితల్లిని క్షమాపణవేడి, "తల్లీ నీవు తొందరపడక రెండవ అండమును సంరక్షింపుము. అందుండి నాతమ్ముడుమహాబలశాలిధీమంతుడుశౌర్యవంతుడునైన "గరుత్మంతుడు" ఉద్భవించగలడు. అతనివలన నీ దాస్యత్వము తొలగిపోవునని ఓదార్చిఏకచక్రముసప్తాశ్వములు గల సూర్యనారాయణుని రథమునకు సారథిగా నియమితుడై వెలుగొందుచున్నాడు అనూరుడు. తర్వాత పుట్టిన గరుత్మంతుడు విష్ణువాహనమై చిరకీర్తి నార్జించిన విషయము మనకు తెలిసినదే. 

 

ఈర్షాద్వేషముఓర్పులేని తోదరపాటు మనకు చేటుతెచ్చునని ఈకథ నీతిని బోధించుటేగాకవికలంగులైనంత మాత్రమున మనిషి నిరుపయోగి కాడని ధైర్యము నూరిపొయుచున్నది. –ఓమ్  తత్  సత్.

 

                                        ***


Search: Anurudu

శ్రీకృష్ణావతారం

 శ్రీకృష్ణావతారం


 

అవతారాలన్నింటిలో శ్రీకృష్ణావతారం విశిష్టమైనది. తొలుత అవతారమంటే యేమిటో తెలుసుకుందాం. అవతరించుట అంటే దిగివచ్చుట. పరమాత్మ భువికి దిగివచ్చినాడు గనుకనే ఆయనను భగవదవతారం అంటున్నాం. భగవంతుడు ఎందుకు దిగివస్తాడు అన్నది ప్రశ్నభగవద్గీతలో వివరించినట్లు భగవంతుడు మనకోసంఅంటే భుమిపై అరాచకం ప్రబలి సుజనులు పీడింపబడుతున్నప్పుడుసాధువులు ఆత్రుతతో రక్షణకై ఎదురుచూస్తున్నప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. దూర్తులను దండించి సజ్జనులను కాపాడతాడు. అందుకోసం అవతారపురుషునిలో తాను నిర్వహించవలసిన పనికి తగిన శక్తినిక్షిప్తమై వుంటుంది. భగవంతుని అనంతశక్తితో పోలిస్తే యీ అవతారపురుషుని శక్తి అత్యల్పం. కారణం ఆ అవతారానికి అంతమాత్రంశక్తి సరిపోతుంది. ఒక ధనవంతుడు తాను కొనవలసిన వస్తువునుబట్టి జోబులో తగినంత డబ్బు పెట్టుకొని బజారుకెళతాడు. అంతేగాని తనసంపదనంతా వెంటతీసుకొని పోడుగదా! ఇదీ అంతే. అయితే మిగిలిన అవతారాలవలెగాక శ్రీకృష్ణావతారం అనేక కార్యకలాపాలను సుదీర్ఘకాలం నిర్వహించటానికి వచ్చింది. అందుకే మహాశక్తిమంత మైనది. మహత్తరశక్తులుమహిమలు అవసరమయ్యే కృష్ణావతారానికి సమకూరాయి.

 

అది ద్వాపరయుగం. లోకం అల్లకల్లోలంగా మారింది. రాజులు ప్రజలను కన్నబిడ్డలవలె పాలించడంమాని వారిని పీడిస్తూ భోగలాలసులై దూర్తవర్తనులయ్యారు. వారిని అదుపుచేయాలి. ధర్మపరిపాలనను పునరుద్ధరించాలి. అమాయకులువిద్యావిహీనులునైన సామాన్యజనులను ప్రేమద్వార భక్తిమార్గమునకు త్రిప్పి మోక్షము ననుగ్రహించాలి. ఆధ్యాత్మికబోధతో మానవులను విజ్ఞానవంతులను జేయలి. అంతేగాక శాపగ్రస్తులైన హరిద్వారపాలకులు జయవిజయులను మూడవజన్మబంధమునుండి విమిక్తులనుగావించి వైకుంఠవాసులను జేయాలి. ఇలా అనేకకార్యములను నిర్వర్తించుటకే గొప్ప శక్తిసంపన్నతతో కృష్ణావతారం సంభవించింది.

 

మథురాధిపతి శూరసేనునికుమారుడు వసుదేవుడు. అతనికి తనకూతురైన దేవకినిచ్చి ఉగ్రసేనుడు వివాహంజరిపించి అత్తవారింటికి పంపనెంచాడు. ఉగ్రసేనునికుమారుడు కంసుడు తనచెల్లెలు దేవకినీ బావగారైన వసుదేవుని రథంపై ఎక్కించుకొని బయలుదేరాడు. మార్గమధ్యంలో ఆకాశవాణి కంసుని హెచ్చరించింది. "కంసా! నీవు ప్రేమగా నీచెల్లినీ బావనూ రథంపై ఎక్కించుకొని స్వతహాగా రథం తోలుతూపోతూ సంబరపడుతున్నావునిజానికి దేవకిఅష్టమగర్భజనితుడు నీపాలిటి మృత్యువు" అన్నది. వెంటనే కంసుడు ప్రాణభీతితో దేవకిని చంపబోయాడు. వసుదేవుడు బ్రతిమాలి మాకు పుట్టే ప్రతిబిడ్డనూ నీకు అప్పజెప్పుతాను. బిడ్డలను చంపుచెల్లెలిని వదలిపెట్టుమని కంసుని కోరాడు. దేవకికొడుకువల్లకదా నాకు చావుఆమెబిడ్డలను పురిటిలోనే చంపేస్తాను. సరిపోతుంది అనుకున్నాడు. చెల్లీబావలను నిర్భందించి తనాధీనంలో వుంచుకున్నాడు కంసుడు. మొదటిబిడ్డ కలగగానే వసుదేవుడు చెప్పినమాట ప్రకారం కంసునికందించాడు. వసుదేవుని నిజాయితీకిమెచ్చి కంసుడు బిడ్డను ప్రాణాలతో తిరిగి ఇచ్చేసాడు. ఎనిమిదవసంతానం కదా నా శత్రువు. బిడ్డను తీసుకొనిపో అన్నాడు. అలా ఆరుమంది పిల్లలను తొలుత కంసుడు వదిలేశాడు.

 

కంసుడు తను పూర్వజన్మలో "కాలనేమి" అనే రాక్షసుడననివసుదేవుడు అతని బంధువర్గమంతా దేవతలనీతనను నశింపజేయడానికే వారంతా పుట్టారనీఒకరోజు నారదునివల్ల తెలుసుకొనికోపోద్రిక్తుడై దేవకీదేవి ఆరుగురు కుమారులను చంపి దేవకిని వసుదేవుని కారాగారంలో వేసిఅడ్డువచ్చిన తన తండ్రి ఉగ్రసేనుని కూడా కారాగారంపాల్జేశాడు. కారాగారంలో దేవకి సప్తమ గర్భం ధరించింది. ఆబిడ్డను సంకర్షణవిధానంలో శ్రీహరి గోకులంలోవున్న వసుదేవుని మరోభార్యయైన రోహిణి గర్భంలో ప్రవేశ పెట్టాడు. దేవకికి గర్భస్రావం జరిగిందనుకొని కంసుడు మిన్నకుండిపోయాడు.

 

రోహిణీనక్షత్రం శ్రావణబహుళ అష్టమి అర్ధరాత్రి దేవకీదేవి తన అష్టమకుమారుణ్ని కన్నది. పుట్టినవెంటనే తాను అవతారపురుషుడనన్న విషయం తెలిసేటట్లువిష్ణుస్వరూపుడై తల్లిదండ్రులకు దర్శనమిచ్చాడు. కర్తవ్యబోధ గావించాడు. తిరిగి పొత్తిళ్ళలో బిడ్డయై కనిపించాడు. వసుదేవుడు బిడ్డనుదీసుకొని దైవాజ్ఞప్రకారం గోకులానికి బయలుదేరాడు. దైవమాయచే కారాగారద్వారాలు తెరచుకున్నాయి. కారాగార రక్షకులు నిద్రలోనికి జారుకున్నారు. ఉప్పొంగిపారుతున్న యమునానది రెండుగాచీలి వసుదేవునికి దారికల్పించింది. బాలునికి శేషుడు తన పడగను గొడుగుగాపట్టి వర్షంలో నదిని దాటించాడు. నేరుగా వసుదేవుడు గోకులంలోని నందునియింట ప్రవేశించిఆయనభార్య యశోదాదేవిని సమీపించిఆమె ప్రసవించిన ఆడుబిడ్డ స్థానంలో బాలునుంచి బాలికను తీసుకొనివచ్చి దేవకీదేవి ఒడిలో పెట్టాడు. దేవకీదేవి ప్రసవించిన విషయం తెలిసి కంసుడు వచ్చాడు. చెల్లెలు "అన్నా యిది ఆడుబిడ్డ చంపకుము" అని వేడుకున్నా వినలేదు. కత్తిదూసి బాలికను చంపడానికి పైకెగురవేశాడు. అంతే ఆబాలిక మహామాయరూపుదాల్చి అష్టభుజియైదివ్యాయుధధారియై "కంసా! నిన్ను సంహరించగలవాడు గోకులంలో వృద్ధిజెందుచున్నాడు. నీచావు థద్యం" అని హెచ్చరించి అంతర్థానమయింది.

 

కంసుడు భయంతో తనను చంపేవాడు పసిబాలుడుగా గోకులంలో వున్నాడని అక్కడి పిల్లలను చంపించి శిశుహంతకుడయ్యాడు. కానీ బాలుని గుర్తించలేక పోయాడు. గోకులంలో యశోదానందులకు పుత్రోదయమైనదని వారు పండుగజేసుకున్నారు. బాలునికి కృష్ణుడని నామకరణంజేశారు. అల్లారుముద్దుగా పెరుగుతున్నాడు కృష్ణుడు. కంసుడు కృష్ణుని చంపటానికి పంపిన పూతననుశకటాసుర తృణావర్తులను రక్కసులను బాలుడయ్యూ వధించాడు. యశోదాదేవికి తననోటిలో సమస్తలోకాలనూ చూపించాడు. మద్దిచెట్లరూపంలోనున్న కుబేరకుమారులకు శాపవిముక్తి కలిగించాడు. వత్సాసురబకాసురఅఘాసురప్రలంబాసురులను రాక్షసులను వధించాడు. కాళీయుని మదమణచాడు. దావాగ్నినిమ్రింగి గోపకులగాచాడు. గోవర్ధనపర్వతమెత్తి ఇంద్రుని గర్వమణచి గో గోపకుల రక్షించాడు. కడకు కంసుని ధనుర్యాగసందర్శన నెపమున అక్రూరునివెంటవెళ్లిమార్గమధ్యమున అక్రూరునకు తనవిభూతులనుజూపిజ్ఞానసంపన్నునిజేసినాడుకంసుని పట్టణమున ధనువువిరచికువలయాపీడనమను గజమునుచాణూరుడను మల్లయుద్ధయోధునికడకు కంసుని వధించి కృష్ణుడు భూభారం కొంత తగ్గించాడు.

 

సుదీర్ఘమైన జీవితకాలంలో శ్రీకృష్ణుడు రాక్షసాంశతోపుట్టిన శిషుపాలదంతవక్రులు హరిద్వారపాలకులైన జయవిజయులుగా గుర్తించి వారిని శాపవిముక్తులను గావించుటకై సంహరించి సాలోక్యమనుగ్రహించినాడు. అమాయకులైన గోపగోపీజనమునకు తనపై ప్రేమగలుగజేసి వారికి ముక్తినొసగినాడు. గురుపుత్రుని బ్రతికించి గురువు ఋణముదీర్చినాడు. మిత్రుడైనకుచేలుని దీనావస్థను బాపినాడు. దుష్టులైన రాజలోక సంహరంకోసం మహాభారతయుద్ధన్ని కూర్చడమేగాకుండ అర్జునునికి మోహవిముక్తిగలిగించు నెపంతో గీతనుబోధించి లోకమున ఆధ్యాత్మికవిద్యను ప్రబలజేసినాడు.

 

కృష్ణుడు అంటే నల్లనివాడు అని అర్థం. నలుపు లోతుకు సంకేతం. కృష్ణుని భగవద్గీత లోతైన ఆధ్యాత్మికప్రబోధం. అట్లే కర్షయతి కృష్ణ అన్నది సంస్కృతార్థం. అనగా ఆకర్షించువాడు కృష్ణుడు. తానే జనులను ఆకర్షించి తనలో లీనంజేసుకొని సాయుజ్యం ప్రసాదించిన మహావతారం కృష్ణావతారం. విద్యాగంధంలేని గోపగోపీజనాన్ని ప్రేమమాధ్యమంగా తనవైపున కాకర్షించి అతిసులభంగా   తరింపజేసిన   అవతారం కృష్ణావతారం. ఇనుప కచ్చడాలుగట్టి కానలలో ఘోరతపస్సు జేయుటకంటే ప్రేమనుబధంతో మోక్షం సుసాధ్యమని నిరూపించిజనసామాన్యానికి మోక్షం సానుకూలంజేసిన కృష్ణావతారం సదా స్మరణీయం.

 

         ఈసంవత్సరం ఆగష్ఠు ముప్పైన కృష్ణాష్టమి వస్తున్నది. ఆనాడు ఉట్టిగొట్టే సంబరాలు జరుపుకుందాం. బాలకృష్ణుని పాదముద్రలు ముగ్గులుగా ముంగిట్లో వేసుకుందాం. భక్తిశ్రద్దలతో ఉపవాసదీక్షలతో పండుగజరుపుకుందాంతరిద్దాం.

  

                                                 కృష్ణాయ వాసుదేవాయ

                                                  దేవకీనందనాయచ

                                                  నందగోపకుమారాయ

                                                  గోవిందాయ నమోనమః    


                                                                ***



Search:  శ్రీకృష్ణావతారం, Sri Krishna, srikrishnavataram

తెలుగుపద్యం

 తెలుగుపద్యం

 

క: గుడికూలును నుయిపూడును

    వడినీళ్ళను చెరువుతెగును వనమును ఖిలమౌ

    చెడనిది పద్యం బొకటియె

    కుడియెదమల కీర్తిగన్న గువ్వలచెన్నా.

 

పద్యరచనలో స్థాయీభేదాలున్నా పద్యం చిరంతరం. పద్యానికి చావులేదు. "చెడనిది పద్యం బొకటియె" అన్న గువ్వలచెన్నుని మాట అక్షరసత్యం. అందుకు కారణం పద్యం ఛందోబద్దంకావడమే. సాహితీనందనంలో పద్యం వెయ్యివసంతాల పైబడి పూస్తూనేవుంది. తనకాంతిని సుగంధాన్ని విరజిమ్ముతూనేవుంది.

 

పద్యం జనజీవనయానంలో ఎదురీది ఎదురీది అలసిపోయింది. ఇక దాని కాలంచెల్లిపోయిందని వాదిస్తున్న సమయంలోనే  అది మూడుపువ్వులు ఆరుకాయలుగా వృద్ధిపొంది విమర్శకుల నోరుమూయించింది. శతసహస్రద్విసహస్రపంచసహస్రావధావాలతో పద్యం తన విశ్వరూపం చూపింది.

 

పద్యం రెండువిధాలుగా భాసిస్తున్నది. ఒకటి స్మరణదృష్ఠితోరెండు సౌందర్యదృష్ఠితో. ఈరెండింటికి భేదం గమనిద్దాం. వేమనయోగి 

 

ఆ:వె:  కట్టరాళ్ళు తెచ్చి కాలుసేతుల త్రొక్కి

            కాసెయులుల సేత గాసిచేసి

            దైవమనుచు మ్రొక్క తప్పది గాదొకో

            విశ్వదాభిరామ వినుర వేమ.

 

అని తనతాత్త్వక వాదాన్ని నేరుగా ఘాటుగా విమర్శనాదృష్టితో చెప్పివైచినారు. ఇచ్చట  సులభంగా మన స్మరణలో వుండటానికి పద్యం యెన్నుకోబడింది. ఇదే రాతివిగ్రహాలను చెక్కే విషయంలో సౌందర్యాతిశయం కనబరుస్తూ పుట్టపర్తి నారాయణాచార్యులవారు 

 

మ: ఉలిచే రాలకు చ క్కిలింతలిడి ఆయు ష్ప్రాణముల్ బోయు శి

        ల్పుల మాధుర్య కళాప్రపంచము లయంబున్ జెందె పాతాళమున్

        గలసెన్ పూర్వకవిత్వ వాసనలు నుగ్గైపోయె ఆంధ్రావనీ

        తలమంబా యికలేవ ఆంధ్రులకు రక్తంబందు మాహాత్మ్యముల్.

 

అన్నారు. వేమనయోగి రాతిని ఉలితో తూట్లుబొడిస్తేనారాయణాచార్యులవారు ఉలితో శిలకు చక్కిలిగింతలిదినారు. ఒకటి స్మరణాదృష్టి. రెండవది సౌందర్యదృష్టి. ఇక ప్రబంధాలుభారతభాగవతాది ఇతిహాసాలూరామాయణాది కావ్యాలు, యీ రెండులక్షణాలు కలిగివున్నాయి. మరికొందరైతే సులభంగా గుర్తుబెట్టుకోవడానికి వీలుగా వుంటుంది గనుక వైద్యాదిశాస్త్రములను కూడా పద్యములలో వ్రాసుకున్నారు. మచ్చునకొకటి చూడుడు.

 

తే: గంటుశీకాయ గొనివచ్చి గరుకులేని

    రాతిమీదను గంధంబు రయముమీర

    తేసి కంటికి కలికంబు వేసి మరియు

    చల్ల ద్రాపిన పసరికల్ చప్పునణగు.

 

ఇలా సులువుగా స్మృతిపథంలో విద్యనుంచుకొని ఆనాటి వైద్యులు తమ వృత్తిని కొనసాగించారు.

 

సౌందర్య దృష్టితో పద్యనిర్మాణం చేయడం యేమంత సులభంకాదు. అందుకే నన్నయకు ముందుటి రచనలకు ప్రాధాన్యత రాలేదు. పద్యంరాయగల్గటం వేరుపద్యవిద్యను సాధించటంవేరు. విద్యా  వంతుడంటే పనిమంతుడని అర్థం. కల్పనాచతురతశిల్పాభిరామత్వమురమణీయార్థ ప్రతిపాదకశక్తిధారనానుడులుసామెతలుఛలోక్తులతో కూడిన భాషాశక్తి తనవశం చేసుకున్న పనిమంతుడు కనుకనే నన్నయ పద్యవిద్యకు ఆద్యుడైనాడు. ఆయనశైలి నేటికీ అనితరసాధ్యంగానే మిగిలిపోయింది. తర్వాతికవులు వారివారి ప్రత్యేకతను వారు సంతరించుకున్నారు. రసాభ్యుచితబంధంగా అలతి అలతి పదములతో గంభీరభావనలను వెలిబుచ్చగల నైపుణ్యంతిక్కనదైతేసీసపద్య వూగుతూగులతో శ్రీనాథుడుపోతనలు తెలుగుజనాన్ని ఓలలాడించారు. అప్పటినుండి ఇప్పటివరకు వచ్చిన పద్యరచనలను ప్రస్తుతిస్తే యిది ఉద్గ్రంధమే అయిపోతుంది. ఏదియేమైనా

 

క: చెప్పగవలె గప్పురములు

    కుప్పలుగా బోసినట్లు కంకుమ పైపై

    గుప్పిన క్రియ విరిపొట్లము

    విప్పినగతి ఘుమ్మనం గవిత్వము సభలన్

 

అంటారు రఘునాధనాయకులు. ఛందస్ అనునది "ఛద్" ధాతువునుండి నిష్పన్నమగుచున్నది. ఈధాతువునకు ఆహ్లాదం అని అర్థం. ఆహ్లాదము కలిగించు వాక్యసమూహమును తెలుగులో ఛందోబద్ధమైన పద్యమంటున్నాము. అందుకే పద్యమంటే అలావుండాలన్నారు రఘునాధ నాయకులు. ఆయనే మరొకచోట.

 

క: పలుకగవలె నవరసములు

    గులకం బద్యములు చెవులకున్ హృద్యముగా

    కళుకక యటుగాకున్నన్

    బలుకక యుండుటయె మేలు బహుమానముగన్.

 

అంటారు. నిజమేమరి. రీతివృత్తిశైలిపాకమురసముధ్వనిఅలంకారము యివన్నీ ప్రస్పుటించినగానీ అది కావ్యముగాదు. తేలికమాటలతో వ్రాసిన గ్రంథములు యేమైనా వాఙ్మయములు కావచ్చునేమోగానీ సారస్వతంగాదు. అది సాహిత్యమనిపించుకోదు. గణయతిప్రాసలు కూర్చిన మాత్రమున పద్యంకావచ్చుగానీ కవిత్వంకాదు.

 

కవిత్వం నాలుగు విధాలంటారు. అలా అనడంలోనూ విభేదాలున్నాయి. మృదుమధురచిత్తవిస్తరములని కొందరుమృదుమధురరసభావములని మరికొందరుఅలాకాదు ఆశుబంధగర్భచిత్రకవిత్వములని మరికొందరు చెప్పుచున్నారు. ఆశువంటే విల్లునుండి వెలువడిన బాణం. అడిగిన తక్షణం కోరిన భావంలో పద్యం చెప్పేయడం ఆశువు. ఆశువులో కవిత్వాంశం, చెప్పేవాని ప్రతిభపై ఆధారపడి వుంటుంది. బంధకవిత్వంలో ఖడ్గబంధముశేషబంధముచక్రబంధముఛత్రబంధముపద్మబంధము వంటివెన్నో ఉన్నాయి. ఇందులో పద్యం చిత్రంలో ఇమిడించబడుతుంది. దీన్ని మాటలలో వివరించడం కష్టం గనుకవ్యాసం చివరలో చిత్రరూపలో చూపించబడింది గమనించగలరు. గర్భకవిత్వమనగా ఒకపద్యంలో మరొకపద్యం యిమిడింపబడుతుంది. దీన్నే పద్యగోపనమనికూడా ఆంటారు. ఉదాహరణకు

 

.

చం:  హర! శివ! శంకరా! త్రిపుర హంత! విధిస్తుత! లింగ! ధీర! తత్

          స్మరహర! సంయతా! విపుల! శాస్త! కవీశ్వర విశ్వ! గోత్రజా

         వర! భవ నాశకా! విపది భంగ! వివేకద! విశ్వపాలకా!

         వరద! మృడా! ప్రభో! జప తపః పరిశాంతిత! శార్ఙ్గి! జేత జే!

 

ఈ చంకపమాల యందుగర్భితమై యున్న నాలుగు పద్యములుగమనింపుడు

ఒకటి కందము:

కం: శివ! శంకరా! త్రిపుర హం

        త! విధిస్తుత! లింగ! ధీర!తత్ స్మరహర! సం

        భవ నాశకా! విపది భం

        గ! వివేకద! విశ్వపాలకా! వరద! మృడా!

 

రెండు మధ్యాక్కర

హర! శివ! శంకరా! త్రిపుర హంత! విధిస్తుత! లింగ!

స్మరహర! సంయతా! విపుల! శాస్త! కవీశ్వర విశ్వ!

వర! భవ నాశకా! విపది భంగ! వివేకద! విశ్వ!

వరద! మృడా! ప్రభో! జప తపః పరిశాంతిత! శార్ఙ్గి!

 

 

మూడు తేటగీతి:

త్రిపురహంత! విధిస్తుత! లింగ! ధీర!

విపుల! శాస్త! కవీశ్వర విశ్వ! గోత్ర!

విపది భంగ! వివేకద! విశ్వపాల!

జప తపః పరిశాంతిత! శార్ఙ్గి! జేత!

 

నాలుగు ద్రుతవిలంబిత వృత్తము:

 

త్రిపురహంత! విధిస్తుత! లింగ! ధీ!

విపుల! శాస్త! కవీశ్వర విశ్వ! గో

విపది భంగ! వివేకద! విశ్వపా!

జప తపః పరిశాంతిత! శార్ఙ్గి! జే!

 

ఇక చిత్రకవిత్వమంటే పేరుకు తగ్గట్టే చిత్రవిచిత్రాలుగా వుంటుంది. కొన్ని పద్యాలు మొదటి అక్షరం నుండి చదివినా చివరి అక్షరం నుండి చదివినా ఒకే తీరున వుంటాయి. కొన్ని మొదటినుండి చదివితే ఒక అర్థం చివరినుండి చదివితే మరొక అర్థం వస్తాయి. అంతేకాదు ద్వర్థిత్ర్యర్థికావ్యాలుకూడా తెలుగులో వెలువడ్డాయి. పింగళిసూరన రాఘవపాండవీయము,  హరిదత్తసూరి రాఘవ నైషదీయము, లోమేశ్వరకవి రాఘవ యాదవీయము, ధనుంజయుని రాఘవపాండవీయము, వేంకటాధ్వరి యాదవ రాఘవీయము ద్వర్థికావ్యాలు. చిదంబరకవి రాఘవ యాదవ రాఘవీయము, అనంతాచార్య యాదవ రాఘవ పాండవీయము  త్ర్యర్థికావ్యాలు.

 

క: సుబలతనయ గుణమహిమన్

     ప్రబలి తనకుదార ధర్మపాలనలీలన్

     సొబగొంది వన్నెదేరగా

     విబుధస్తుతు డవ్విభుండు వెలసెన్ ధరణిన్ .

 

ఇది సూరన రాఘవపాండవీయములోని పద్యం. భారతార్థంలో "సుబలతనయ" అంటే సుబలుడు అనే రాజుగారి కుమార్తె యైన గాంధారి. ఆమె గుణమహిమచే ప్రబలి, "తనకు దార" అంటే ధృతరాష్ట్రునకు భార్యగా ధర్మాత్మయై యుండగా అని అర్థం. అదే రామాయణార్థంలోనైతే "సుబలత నయగుణ మహిమన్" మంచిబలమూమంచి గుణములుగలిగి ప్రబలి "తనకుదార ధర్మపాలన లీలన్". ఉదారము మరియు ధర్మముగల తన పరిపాలనా చతురతతో దశరథుడు  అని అర్థం. ఇలా పదాల విరుపువిశ్రామస్ఠానల మార్పులతో భారతరామాయణాలు రెండూ నడిచాయీ కావ్యంలో. ఇది ఒక ఉదాహరణమాత్రమే. ఇలా తమప్రతిభను చాటారు పూర్వకవులుఇప్పుడిట్టి ప్రయోగాలు చేయువారరుదు. అయినా ఇదంతా పహిల్వానుల  సాముగరిడీల విద్య వంటిది. సామాన్యులకిది అర్థముకాదు. రసాస్వాదన చేయలేరు. అట్లుగాక రసాస్వాదన కనుకూలమై మనసునాహ్లాదపరచిమార్పును తీసుకొనిరాగల ప్రతిభ గలిగి కవిత్వ ముండాలంటారు సంకుసాల నృసింహకవి.

 

 

క: సమయజ్ఞుడు సమచిత్తుడు

    సమశబ్దార్థప్రయోగ చతురుడు మరియున్

    క్రమరస పోషణ రచనా

    కమనీయప్రతిభు డిల సుకవి యనబరగున్.

 

 

తే:గీ: యతి విటుడు గాకపోవు టెట్లస్మదీయ

          కావ్య శృగార వర్ణనాకర్ణనమున

         విటుడు యతిగాక పోరాదు వెస మదీయ

         కావ్య వైరాగ్య వర్ణనాకర్ణనమున. 

 

పద్యమనగా పాదములుగలది. ఆపాదములు నియమబద్ధములు. గేయమునకు పల్లవిచరణములున్నవి. కానీ పద్యమునకున్నన్ని నియమములు లేవు. గేయమునకు మాత్రలు సరిపోయిన చాలును. పద్యమునకట్లు కాదుగదా! అక్షరములు సరిపోవలెను. గురులఘువులు ఛందస్సుప్రకారము కుదురవలెను. కనుకనే సంగీతమునకు పద్యము స్వతఃసిద్ధముగా ఒదిగిపోవును. పద్యముకూర్చునపుడే అదృశ్యరూపమున లయకూర్పు జరిగిపోవును. అందుకు తరలమత్తకోకిలలుమానినీ వృత్తములు చక్కటి ఉదాహరణలు. గమనింపుడు. 

 

మత్తకోకిల:   ఓసురారికులేంద్ర నీక్రియ నుగ్రమైన తపంబుమున్

 

తరలము:  క్రతుశతంబుల పూర్ణకుక్షివి గాని నీవిటు క్రేపులన్  

 

మానిని:   చాతకముల్ రథచక్రపుటాకుల సందుల పర్విడు చుండుట చేన్  

 

తెలుగుఛందస్సు సంస్కృతముకంటే విలక్షణమైనది. సంస్కృతఛందస్సు అదవిదారి వంటిది. తెలుగున అట్లుకాదు. ఇది రాచబాట. వేయుట కొంత కష్టమే. ప్రాస తెలుగుపద్యమునకు హొయలుగూర్చిపెట్టును. ప్రాస సంస్కృతమున లేదు. యతి సంస్కృతమున కేవలము విశ్రాంతినిచ్చు స్థలమేగాని  తెలిగులోవలె అక్షరమైత్రిలేదు. అక్ష్రమైత్రి క్రొత్త మెఱుపు కూర్చిపెట్టును.

 

పద్యములలో జాతులు(కందద్విపదతరువోజఅక్కరలు) ఉపజాతులు(తేటగీతఆటవెలదిసీసములు) కాక వృత్తములున్నవని మనమెరుగుదుము. ఇవి ఒక అక్షరముగలిగిన "శ్రీ" వృత్తము నుండి ఇరవైయారు అక్షరముల "మంగళమహాశ్రీ" వరకు వున్నవి. ఇవన్నీ గురులఘువుల స్థాన మార్పులవల్ల ఏర్పడుచున్నవి. గణితశాస్త్రంలో బైనరీ విధానలో సున్న ఒకటి మాత్రమే ఉపయోగించిలెక్కలన్నీ చేయుదురు. ఇదీ అటువంటిదే గురులఘువులు రెండింటితో యేర్పడు గణముల మార్పులవలన యీ వృత్తములు 13,42,17,726  కూర్చబడియున్నవి. వీటన్నిటికి పేర్లు పెట్టుటకూడా కష్టమే. వీటిలో చాలా వృత్తములు వాడుకలోలేవు. వాడిన తప్పుకాబోదు. చాలామంది కవులు ఉత్పలమాలచంపకమాలశార్దూలముమత్తేభముతరలముమత్తకోకిలస్రగ్దరమహాస్రగ్దరమానినిమాలినిపుండరీక వంటి వృత్తములతోనే సరిపుచ్చుకొనిరి. ఇన్ని వృత్తములుండుటవలన చెప్పవలసిన భావములను చెప్పుట కనుకూలములైన వృత్తము లెన్నుకొనుటకు మంచి అవకాశమేర్పడుచున్నది.

 

పద్యం ఛందోబద్ధమై క్రమశిక్షణకు లోబడియున్నది. అందువలన యేకారణము చేతనైనా కొంతభాగము ఖిలమైనాలుప్తమైనప్రాసయతిగణాల ఆధారంగా దాదాపుగా పద్యంలోని లుప్తభాగాన్ని పూరించి పద్యాన్ని పరిరక్షింపవచ్చును. ఈకారణం చేతనే కాబోలు పురాతన గ్రంథాలలో కొన్ని పాఠంతరాలు చోటుచేసుకున్నాయి.

 

పద్యం మన తెలుగుభాషకే ప్రత్యేకమైనది. పురాతనమైనది. పద్యాన్ని పరిరక్షించుకోవడం మనవిధి. పద్యానికి తగిన స్థానాన్నిస్తున్న ఆకాశవాణిదూరదర్శన్మరియు పత్రికల వారికి అభినందనలుధన్యవాదములు. ఇతర ప్రక్రియల ద్వారా కవిత్వం చెప్పడం, ప్రోత్సహించడం అభినందించదగ్గదే. కానీ ఆప్రక్రియలమీది వల్లమాలిన అభిమానంతో పద్యాన్ని నిరసించడం తగనిపని . ఇక చివరిగా

శ్రీ నండూరి రామకృష్ణమాచార్యులవారి పద్యవిశేష పద్యంతో వ్యాసంముగిద్దాం.

 

ఆ:వె: తాళబద్దమైన లాలిత్యగతి గల్గి

          నడకసొంపు గలుగు నాట్యమగును

         శ్రవణ సుభగమైన ఛందోనియతిగల్గి

         పలుకుబడుల కూర్పు పద్యమగును.  

 

           బంధ కవిత్వమునకు రెండు ఉదాహరణలు 


                                                    ఖడ్గ బంధము












    ***

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...